ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, డిసెంబర్ 2013, సోమవారం

రాజధాని నగరానికి ఎంత భూమి కావాలి?


రాజధాని నగరానికి ఎంత భూమి కావాలి?
నూర్ బాషా రహంతుల్లా 9948878833

(ఈనాడు 6.3.2015)
సీమాంధ్ర రాజధానికి లక్ష ఎకరాలు కావాలంటున్నారు.నిజంగా అంత భూమి అవసరమా?ఇప్పుడు హైదరాబాద్‌లో 400 ఎకరాల విస్తీర్ణంలోనే  45 శాఖలు నిర్వహిస్తున్నారు.మిగిలిన 99,600 ఎకరాలు ఎవరి కోసం అంటే ఆ నగరం చుట్టూతానే  ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమలు పెట్టుకోటానికీ,రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించుకోటానికీ అన్నమాట. దేశంలో ఏ రాజధాని నగర విస్తీర్ణమూ 22వేల ఎకరాలు మించలేదు
ఛత్తీస్‌గఢ్ రాజధాని నయారాయ్‌పూర్ 22వేల ఎకరాల్లో,జార్ఖండ్ రాజధాని రాంచీ 15వేల ఎకరాల్లో,గుజరాత్ రాజధాని  గాంధీనగర్ సిటీ 43వేల ఎకరాల్లో నిర్మించారు.కొత్త రాజధాని కోసం లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఒకేచోట ఎక్కడా దొరకదు.ప్రైవేటు భూమి సేకరించక తప్పదు. ఒకేచోట భారీ ఎత్తున భూసేకరణకు పాల్పడితే రైతుల వ్యవసాయ భూములు మాయమైపోవచ్చు అని రైతులూ భయపడుతున్నారు.
నికరంగా ఎంత భూమి కావాలి?
అసలు రాజధాని నగరానికి నికరంగా ఎంత భూమి కావాలి? నికరంగా అంటే పరిపాలనా భవనాల కోసం మాత్రమే అన్నమాట.ఇప్పుడు హైదరాబాద్‌లో ఏయే శాఖలు ,ఎన్ని పరిపాలనా కేంద్రాలు ఉన్నాయో  సీమాంధ్ర రాజధాని నగరంలో కూడా అవే భవనాలు నెలకొల్పాల్సి ఉంటుంది. 23 జిల్లాలకు 400 ఎకరాల్లోనే హైదరాబాద్‌లో రాజధాని కార్యకలాపాలు కొనసాగినప్పుడు లక్ష ఎకరాలు అడగటం అనవసరం.ప్రభుత్వం కూడా తన కార్యాలయాలకు అవసరమైనంత భూమినే సేకరించుకోవాలిగానీ అవసరాన్ని మించి భూసేకరణ జరుపకూడదు.ప్రైవేటు వ్యక్తులు తమకు అవసరమైన భూమిని తామే కొనుక్కోవాలి.ప్రైవేటు  సెజ్ లకోసం ప్రభుత్వం సేకరించిన వేలాది ఎకరాల భూమి కొన్నిచోట్ల నిరుపయోగమయ్యింది .రాజధానిని అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని,తక్కువ స్థలాలలోనే ఎక్కువ సౌకర్యవంతంగా నిర్మించుకోవచ్చు. కొత్త రాజధాని కోసం ఏకంగా లక్ష ఎకరాల స్థలం కావాలని కొందరు నాయకులు కేంద్ర మంత్రుల బృందానికి నివేదించినట్లు వార్తలొచ్చాయి.లక్ష ఎకరాలు ఎందుకు కావాలో వివరాలు కూడా చెబితే బాగుండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాజధాని కార్యాలయాలన్నీ కలిపినా విస్తీర్ణం  400 ఎకరాల లోపే ఉంది. మరి లక్ష ఎకరాలను రాజధాని స్థలంగా ఎందుకు కోరుతున్నారు? సీమాంధ్ర కొత్త రాజధాని కోసం లక్ష ఎకరాల భూమి కావాలన్న కోరిక అనుమానాన్ని కలిగిస్తున్నది. హైదరాబాద్‌లో ఇప్పటిదాకా కొనసాగిన రాజధాని కార్యాలయ భవనాలను  అవసరం మేరకు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ పోయారు. వాటన్నిటి  విస్తీర్ణం కలిపినా 400 ఎకరాల లోపే ఉన్నది. 45 ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలతోపాటు సిబ్బంది క్వార్టర్లు, ఇతరత్రా అవసరాలు అన్నీ ఈ 400 ఎకరాల విస్తీర్ణంలోనే తీరుతున్నాయి. కొత్త రాజధాని కాబట్టి వెయ్యి ఎకరాల భూమి అడగొచ్చు. కానీ లక్ష ఎకరాలు ఎందుకు?
కొత్త రాజధానిని నిర్మించుకునేంత వరకూ తాత్కాలికంగా పదేళ్ళపాటు సీమాంధ్ర రాజధాని హైదరాబాద్‌ లోనే ఉంటుంది కాబట్టి ముందు 500 ఎకరాల స్థలంలో శాఖలవారీ ప్లానులు వేసుకొని నిర్మాణాలు మొదలుపెట్టాలి. కొత్త రాజధానికి లక్ష ఎకరాల స్థలం అక్కరలేదు కానీ , ఐదు లక్షల కోట్ల నిర్మాణ వ్యయం కేంద్రాన్ని కోరవచ్చు.ఎందుకంటే ఆ మొత్తాన్నీ మళ్ళీ ఒకే నగరంలో కుప్పబోసి పాత అవస్థలను మళ్ళీ ప్రజల నెత్తి మీదకు తెచ్చేకంటే 13 జిల్లాలకు ఆడబ్బు సమంగా పంచవచ్చు. పరిశ్రమలు,ప్రాంతీయ జోనల్ కార్యాలయాలు, అసెంబ్లీ , హై కోర్టు,సచివాలయం,డైరెక్టరేట్లు,కమీషనర్ ఆఫీసులు, అన్నీ ఒకచోట ఉండకుండా తలా ఒక ప్రాంతంలో పెడితే మళ్ళీ ఇలా విభజనోద్యమాలు తలెత్తవు.అన్నీ ప్రాంతాలు సమతూకంలో అభివృద్ధికి నోచుకునేలా ప్రణాళిక వేసుకోవాలి.

ఇతర రాష్ట్రాల రాజధానులకు ఎంత భూమి వాడారు ?
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల రాజధానులు ఏవీ 22వేల ఎకరాలను మించి అడగలేదు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయారాయ్‌పూర్ 22వేల ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నిర్మాణానికి ఎక్కువగా ప్రభుత్వ భూములనే వినియోగించారు. 4వేల ఎకరాలను మాత్రం ప్రజలనుంచి సేకరించారు. అదీ మార్కెట్ ధరకు నాలుగు రెట్లు అధికంగా చెల్లించి! నాలుగు గ్రామాల ప్రజలను మాత్రమే అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. మరి లక్ష ఎకరాలు సేకరించాలంటే ఎన్నో గ్రామాల రైతులు తమ భూములు కోల్పోవాల్సి ఉంటుంది. ప్రజలు భారీ ఎత్తున నిర్వాసితులు కావాల్సివస్తే అది మరో ఉద్యమానికి దారితీస్తుంది.గుజరాత్‌ రాజధాని మొత్తం గాంధీనగర్ సిటీని 427 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీ కూడా 15వేల ఎకరాల్లోపే ఉంది. సీమాంధ్ర కొత్త రాజధాని హైదరాబాద్‌ తో సమానంగా  విస్తీర్ణం కలిగి ఉంటే చాలు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏయే శాఖలు ఉన్నాయో? ఎన్ని పరిపాలనా కేంద్రాలు ఉన్నాయో దాదాపు అవే సీమాంధ్రలోనూ పెట్టాలి. హైదరాబాదు లో ఇప్పుడు 400 ఎకరాల్లో రాజధాని కార్యకలాపాలు కొనసాగిస్తునప్పుడు లక్ష ఎకరాల కోసం పేచీ పెట్టడంలో అర్ధం లేదు.  
సచివాలయం 23 ఎకరాలే
సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు 57ఏళ్లుగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఎంత  విస్తీర్ణములో ఉన్నాయో పరిశీలిద్దాం. 1965 లో మన రాష్ట్ర రాజధానిలో  ప్రభుత్వ భవనాల విస్తీర్ణం కేవలం 22.80 లక్షల చదరపు అడుగులు మాత్రమే ఉంది. ఇప్పుడు మాత్రం 250 ఎకరాల విస్తీర్ణంలో అన్ని పరిపాలనా భవనాలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అధికారుల నివాసాల కోసం నిర్మించిన క్వార్టర్లూ ఉన్నాయి. రాష్ట్ర గవర్నర్ నివసించే రాజ్‌భవన్ మొత్తం 22 ఎకరాలలో నిజాం కాలంలో కట్టారు. రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో నిర్మితమైన భవనం ఇదే . బంజారాహిల్స్‌లో 30మంది మంత్రుల నివాస సముదాయం 22 ఎకరాలు. బేగంపేటలో ముఖ్యమంత్రి నివాసం , క్యాంపు కార్యాలయం విస్తీర్ణం ఎకరాలు . సచివాలయం 22.80 ఎకరాల్లో ఉంది. ఇందులో భవనాలున్నది పది వేల చదరపు అడుగులు మాత్రమే.                   
           హైదరాబాద్‌లో కొన్ని ముఖ్యమైన ప్రభుత్వభవనాలు         (విస్తీర్ణం ఎకరాలలో)

రాజ్‌భవన్
22
బంజారాహిల్స్ మంత్రుల క్వార్టర్లు
22
సీఎం క్యాంపు కార్యాలయం
2
సచివాలయం
22.80
బూర్గుల రామకృష్ణారావు భవన్
8
హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లు
7.10
ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లు
11
అసెంబ్లీ (టౌన్ హాల్  1913)
6
హైకోర్టు
2.9
ఆర్ అండ్‌బి కార్యాలయం
2.35
గగన్‌విహార్, చంద్రవిహార్
30
సర్వే భవన్
2
సీసీఎల్‌ఏ
4
సంక్షేమ భవన్ మాసబ్‌ట్యాంక్
10
ట్రాన్స్‌పోర్ట్ భవన్
18
ఆబ్కారీ భవన్
1.28
ల్యాండ్ సర్వే కమిషనరేట్
2.16
డీజీపి కార్యాలయం
5
వ్యవసాయ కమిషనరేట్
1.20
మలక్‌పేటలోని వ్యవసాయ విస్తరణ కేంద్రం
4
జలసౌధ
4
మెడికల్ డైరెక్టరేట్ (కోఠి):
15
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్
10.15
బస్‌భవన్
3.20
దేవాదాయ శాఖ కమిషనరేట్
2.24
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
3.20
రాజీవ్ విద్యామిషన్
1.20
ఇంటర్మీడియట్ బోర్డు, కళాశాల విద్య
1
మొత్తం
223.78

ఇలా చూసుకుంటూ పోతే కొత్త రాజధాని ఏర్పాటుకు పరిపాలనా భవనాలన్నిటికీ ,మౌలిక సదుపాయాలతో కలిపి పది వేల ఎకరాలే ఎక్కువ. కానీ రాజధాని కార్యాలయాలతోపాటు జనావాసాలకూ , ప్రైవేట్ రియల్ ఎస్టేట్లూ,పారిశ్రామికవేత్తలూ , కార్పొరేట్ సంస్థలకూ కూడా భూమి ప్రభుత్వమే ఇవ్వాలంటే లక్ష ఎకరాలు కూడా సరిపోకపోవచ్చు. జీహెచ్‌ఎంసీతోపాటు.. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న కార్యాలయ భవనాలన్నీ కలిపినా వాటి విస్తీర్ణం  400 ఎకరాలు మించదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 630 చదరపు కిలోమీటర్ల పరిధిలో జనాభా సుమారు 75లక్షలు. 217 చ.కి.మీ. పరిధిలో ఉన్న హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో జనాభా 40 లక్షలు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 7020 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హెచ్‌ఎండీఏ పరిధిలో జనాభా సుమారు కోటి. ఏడువేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరానికే కేవలం 400 ఎకరాలలో అన్ని కార్యాలయాలూ నిర్మించారు కాబట్టి  కొత్తరాజధానికి లక్ష ఎకరాలు అక్కరలేదు.

  రైతుల గగ్గోలు   
సీమాంధ్ర లో రాజధాని నగరం ఏర్పాటు చేస్తారనే వార్త సంతోషంగానే ఉందిగానీ  రాజధాని కోసం లక్ష ఎకరాలు సేకరిస్తారనే వార్త మాత్రం సీమాంధ్ర రైతుల్లో తీవ్రంగా కలత రేపింది. ఎందుకంటే కొత్త రాజధాని కోసం అంతమొత్తం ప్రభుత్వభూమి ఒకేచోట ఎక్కడా దొరకదు. రైతుల  భూమిని సేకరించడం తప్పదు. దీంతో కొంతమంది తమ వ్యవసాయ భూములకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ విలువకు నాలుగు రెట్ల దాకా పరిహారం వస్తుందనీ , భూమికి భూమి, ఇళ్ల మంజూరు, ఉపాధి, జీవితాంతం వడ్డీ లాంటి ప్రతిఫలాలూ దక్కుతాయనీ ఉబ్బితబ్బిబ్బవుతుంటే ,కొందరు మాత్రం బంగారం లాంటి తమ వ్యవసాయ భూమిని  ప్రభుత్వం ఎక్కడ గుటుక్కుమనిపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో సెజ్‌లు,జలయజ్నం, ఔటర్ రింగురోడ్ల కోసం  సేకరించిన భూములకు నామమాత్రపు ధర చాలా ఆలస్యంగా చెల్లించారని తలుచుకొని కలవరపడుతున్నారు.

పారిశ్రామికవేత్తల గోల
తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని  పట్టుబట్టిన  పారిశ్రామికవేత్తలు కూడా రాజధానికి లక్ష ఎకరాలు సేకరిస్తే తమ ఆస్తులూ అందులో కలిసిపోతాయని భయపడుతున్నారు. కొత్త రాజధాని చుట్టూ సెజ్‌లు పెట్టకపోతేనే బాగుంటుందని అంటున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు మొత్తం సీమాంధ్ర జిల్లాలకు సమానంగా పంపిణీ అయితేనే సమానాభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అభిప్రాయపడుతోంది. లేనిపక్షంలో అభివృద్ధి ఒకేనగరంలో పరిమితమై మళ్ళీ మెగాసిటీ బాధలు పునరావృతమౌతాయని ఫలితంగా అసంఖ్యాక రైతులు చిన్న పరిశ్రమలవాళ్ళూ అభివృద్ధికి నోచుకోక బాధితులుగా మారుతారని వాదిస్తున్నారు. పైగా లక్ష ఎకరాల సేకరణతో కొత్త  ఇబ్బందులొస్తాయని ,ఏళ్ళ తరబడి తగాదాలు, కోర్టు వ్యవహారాలు నడుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే  ఉద్యమాలతో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు కొత్త రాజధానికి లక్ష ఎకరాలంటే ఉన్న వ్యాపారం నాశనమవుతుందని ఆయా ప్రాంతాల రియల్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పైగా ఎక్కడెక్కడ ఎంతెంత ప్రభుత్వ భూమి,అటవీ భూమి ఉందో ఆరా తీసి, రాజధానిని అక్కడ పెట్టుకొమ్మని సలహాలు కూడా ఇస్తున్నారు.
 సామాజిక శాస్త్రవేత్తల సూచనలు
రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పుడన్నా శాస్త్రీయంగా ఆలోచన చెయ్యాలి. రాజకీయాలకతీతమైన ఆచరణాత్మకమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి. భూమి అనేది మనిషిసృష్టించలేనిఒకఅమూల్యసంపద.ఉండటానికి ఇంటి స్థలము,పొలమూలేని పేదలూ నిరాశ్రయులూలక్షల సంఖ్యలోఉన్న 
దేశంలోభూమినిపొదుపుగావాడటం,భూమి ఎంతోకొంత అందరికీ ఉండేలా చేయటం, చిన్నరైతుల దగ్గర ఉన్న కొద్దిపాటిభూమిని 
లాక్కోకపోవటం  శ్రేయోరాజ్య లక్షణం.అందువలన ప్రభుత్వ కార్యాలయాలకూ క్వార్టర్లకూ ఎక్కువగా ప్రభుత్వ భూమినే ఉపయోగించాలి.ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతేనే ప్రైవేటు స్థలాల్ని కొనాలి. భారీ వ్యయంతో కొనుగోలు చేయడం ఇష్టం లేకపోతే అటవీ భూములు దొరికినా ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు మరోచోట భూములిచ్చి అటవీ భూముల్ని అయినాసరే తీసుకోవాలి. నికరంగా అవసరమైనంత భూమిని మాత్రమే లెక్కగట్టి భూసేకరణకు పూనుకోవాలి,ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేసి ముఖ్య కేంద్రాలను అన్ని ప్రాంతాలకూ వికేంద్రీ కరించాలి అని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మెగాసిటీలు వద్దు బాబో
రాజధానులుగా ఉన్న ప్రాంతాలు మెట్రో నగరాలే కావాల్సిన అవసరంలేదు. పాలనాపరమైన కార్యకలాపాల నిర్వహణకు పరిమితమైతే చాలు. దేశంలోని కొన్ని రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్రాల్లోని ఇతర నగరాలకంటే చాలా చిన్నగానే ఉన్నా యి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కంటే కాన్పూర్, అలహాబాద్, వారణాసి నగరాలే పెద్దవి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కంటే ఇండోర్, ఒడిశా రాజధాని భువనేశ్వర్ కంటే కటక్ పెద్దది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ జనాభా 1.90లక్షలు కాగా అహ్మదాబాద్ జనాభా 39 లక్షలు. సూరత్ జనాభా 33 లక్షలు. అసోం రాజధాని డిస్పూర్ జనాభా లక్షలోపే. గౌహతి 15 లక్షల జనాభా ఉన్న పెద్ద నగరం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ కంటే హరిద్వార్, జార్ఖండ్ రాజధాని రాంచీ కంటే బొకారో, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ కంటే బిలాస్‌పూర్ పెద్దనగరాలు. దేశ రాజధాని ఢిల్లీ కంటే ముంబై, కోల్‌కతాలు పెద్ద నగరాలు. ఇప్పటికే పాతబస్తీలతో ఇరుకైపోయిన పాతనగరాలలోనే రాజధాని ఉండనక్కరలేదు.కొత్త పట్టణాలు కట్టవచ్చు. నయా రాయ్‌పూర్, గాంధీనగర్, భువనేశ్వర్ నగరాలను కొత్తగానే కట్టుకున్నారు.ఆంధ్రా కాంట్రాక్టర్లు అసోం ఆఫ్ఘనిస్థాన్ లాంటి దూరప్రాంతాలకుకూడావెళ్ళినిర్మాణాలుచేస్తున్నారు.నిధులు సక్రమంగా ఇస్తే వాళ్ళుఅయిదేళ్ళలో రాజధాని నగరాన్ని నిర్మించగలరు. ఏ వసతి ఏ నగరానికి ఎంత వరకు అవసరమో హేతుబద్ధంగా నిర్ణయించుకోవాలి. అయితే వసతులూ పరిశ్రమలూ కూడా ఒకే నగరంలో ఏళ్ళతరబడి కుప్పబోయదలుచుకుంటే అది హైదరాబాదు లాగా, వలస జనవిస్పోటనంతో మహానగరం పేలిపోతుంది. 
మధ్యలో ఉంచండి
ప్రజల ప్రయాణం సుఖంగా ఉండేలా రాష్ట్రానికి రాజధాని భౌగోళికంగా ఆ ప్రాంతానికి మధ్యప్రాంతంలో ఉంటే మంచిది. కానీ అలా లేని రాష్ట్రాలూ కొన్ని ఉన్నాయి కదా అని ఒక మూలన రాజధానిని పెడితే చరిత్ర మళ్ళీ పునరావృతం కావచ్చు. ఎందుకంటే కర్నూలు ఒక మూలన ఉండటం వలన ఉత్తరాంధ్ర ప్రజలు హైదరాబాదు కొంత మేలనుకున్నారు.ప్రజలు దూరప్రయాణాన్ని నిరసిస్తూ ఉంటారు.దూరప్రాంతానికి బదిలీ అయిన ఉద్యోగులు కూడా ప్రయాణాన్నే శిక్షలా భావిస్తారు.ప్రజలు కూడా అంతే.ఎక్కడిదాకో ఎందుకు ,జిల్లా కేంద్రాలు జిల్లాల అంచుల్లో ఉన్నచోట ప్రజలు జిల్లా కేంద్రాలకు ప్రయాణమంటే భయపడుతుంటారు. ప్రజల సౌకర్యంకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన దూరంలో ఉండే చోట రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తే మళ్ళీ విభజనవాదాలు తలెత్తవు. ఆన్ని ప్రాంతాల ప్రజలు తృప్తి పడతారు. ఒకే నగరానికి వలసలు తగ్గుతాయి.తిరగలేక చస్తున్నాం.రాజధానిని రాష్ట్రం మధ్యలో ఉంచండి నాయనా అని వయోవృద్ధులు,మారుమూల ప్రాంతాల ప్రజలూ  మొక్కుతున్నారు
అన్నీఒకే నగరంలో వద్దు
పూర్వం పెద్దనగరాలకే ప్రాధాన్యత ఇచ్చి "కలిగినవాడికే ఇంకా దోచిపెట్టినట్లు" రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసేవారు.గత అరవై ఏళ్ళలో హైదరాబాదు తెలుగు ప్రజలకు " ప్రాంతీయ రాజధానులు కూడా కావాలి"అనే ఒక చేదు పాఠం నేర్పింది.జిల్లా కేంద్రాలు ఏర్పడిన తరువాత మౌలిక వసతులు వాటిచుట్టూ వాటంతటవే అభివృద్ధి చెందినట్లు ప్రాంతీయ కేంద్రాలుకూడాఎదుగుతాయి.ఉత్తరాంధ్ర,రాయలసీమ,కోస్తా ప్రాంతాలలోని నాలుగు జోనులకు నాలుగు కేంద్రాలను ఏర్పాటుచేసి రాజధాని నగరానికి అనవసర ప్రయాణాలను తగ్గించాలి. రాష్ట్రంలోని ఆన్ని ప్రాంతాలవారికీ ఏదో ఒక పౌర ప్రాధాన్యం దక్కేలా ప్లాన్ చెయ్యాలి. రాష్ట్ర విభజన తర్వాత హడావిడిగా ఏదో ఒక నగరాన్ని మాత్రమే రాజధానిగా ప్రకటించి అభివృద్ధి అంతా అక్కడే జరిగేలా చూస్తే కొన్నేళ్ళకు హైదరాబాద్ అనుభవమే ఎదురౌతుంది. మళ్లీ విభజన వాదాలొస్తాయి. 
 http://www.suryaa.com/opinion/edit-page/article-164924 
సూర్య 31.12.2013
గీటురాయి 3.1.2014

https://www.facebook.com/photo.php?fbid=717479864950673&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater


(సాక్షి 7.10.2014)

19, డిసెంబర్ 2013, గురువారం

మరీవెనుకబడిన కులాలకు మోక్షమెప్పుడు?



మరీవెనుకబడిన కులాలకు మోక్షమెప్పుడు?
నూర్ బాషా రహంతుల్లా 9948878833

ఎన్నికలు దగ్గరపడేకొద్దీ  రాజకీయ పార్టీల దృష్టి  వెనకబడిన తరగతులపై పడుతున్నది. భారతీయ జనతాపార్టీ వెనుకబడిన కులస్తుడైన  నరేంద్రమోడీ పేరును ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఖరారు చేయటమే గాక  చట్టసభలలో బీసీల  రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని డిమాండ్ చేసింది.జాట్‌ కులస్తులను కేంద్ర బీసీల జాబితాలో చేర్చటానికి కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించింది.అన్నివిధాలా అభివృద్ధి చెందిన జాట్లను బీసీలలో కలపొద్దని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వేడుకున్నారు. మనరాష్ట్రంలో కాపుల పరిస్థితీ ఇలాగే ఉంది.మన రాష్ట్రంలో కాపులు కూడా తమకులాన్ని బీసీలలో చేర్చాలని పోరాడుతున్నారు.వీటన్నిటి మూలంగా బీసీల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది.రిజర్వేషన్ల కోటాను పెంచకుండా జాబితాలో కొత్త కులాలను చేర్చుకుంటూ పోవటం పట్ల  బీసీలు కంటగింపుగా ఉన్నారు.కొత్తగా బలమైన కులాల చేరికవలన ఇప్పటికీ ఎదిగిరాలేక  బలహీనంగా ఉండిపోయిన చిన్నకులాలు ఇక ఎదిగిరావటం కల్ల అంటున్నారు.2021 జనాభా లెక్కల్లో బీసీల కులాల వారీ జనాభా గణాంక వివరాలు సేకరించక తప్పదని అన్నీ పార్టీలు వత్తిడి తెస్తాయి. రాజ్యాంగం ప్రసాదించిన స్థానిక సంస్థల రిజర్వేషన్‌లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండాలనీ , చట్టసభల్లో బీసీ రిజర్వేషన్‌లతో పాటు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చెయ్యాలనీ , జాతీయ బీసీ మిషన్‌కు కూడా చట్టబద్దత కల్పించాలనీ  అన్నీ పార్టీలు కోరుతున్నాయి.హైదరాబాదులో 15.12.2013 న జరిగిన బీసీసింహగర్జన సభలో మొత్తం 13 తీర్మానాలను ఆమోదించారు. 
13  తీర్మానాలు
1.
 పార్లమెంటు, అసెంబ్లీల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఈమేరకు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలి.
2. బీసీలకు 150 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను కేటాయిస్తూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేయాలి.
3. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలి.
4.  బీసీ ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లను అమలు చేయాలి.
5. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి.
6. గ్రామాల్లోని బీసీ సర్పంచుల వేతనాలను రూ.20 వేలకు పెంచాలి.
7. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి.
8. రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌కు రూ.2,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలి.
9. ప్రస్తుతమున్న ఫీజు రీ-యింబర్స్‌మెంట్ స్కీమును ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలి.
10. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలను మినహాయించాలి. బీసీ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి, అమలులోకి తేవాలి.
11. రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్‌ను బీసీ రీసెర్చ్ స్కాలర్లకు కూడా వర్తింపజేయాలి.
12. రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యోగాలు మూడు లక్షలు, కేంద్రంలోని 14 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
13. బీసీ ఫెడరేషన్లకు వెంటనే కార్యనిర్వాహక మండళ్లను ఏర్పాటు చేసి, ఒక్కో ఫెడరేషన్‌కు రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలి.
బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆవేదన :
రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో బీసీ ఎమ్మెల్యే ఒక్కరూ లేరు. బీసీలుగా పుట్టడమే పాపమా?జనాభాలో 56 శాతం ఉన్నాం. పన్నులు కట్టేది మేమైనా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో మాకు న్యాయబద్ధమైన వాటా ఉండదు. కష్టపడి పనిచేసి సంపదను సృష్టించినా అందులో భాగం లేదు. కులవృత్తులు నాశనమైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్త్లెనా లేదు. జనాభా నిష్పత్తిలో చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీ ఉప ప్రణాళికను ప్రవేశపెట్టాలి. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. అగ్రకుల ఆధిపత్యానికి, దొరల పెత్తనానికి నూకలు చెల్లబోతున్నాయి. ఇక రాబోయేది బీసీల రాజ్యమే. ఓట్లు...సీట్లు మావే.... అసెంబ్లీలో, పార్లమెంటులో మా వాటా పొందుతాం. కచ్చితంగా రాజ్యాధికారం సాధించి తీరుతాం..ఏయే పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చేది తక్షణమే ప్రకటించాలి. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖే ఇప్పటి వరకు లేదు. బడ్జెట్‌ కేటాయింపులు కూడా అతి తక్కువగా ఉన్నాయి. జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలు లేని వర్గాలకు విధిగా రిజర్వేషన్లు కల్పించాలని నాచియప్పన్‌ కమిటీ 2005లో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా అది అమలే కాలేదు. బీసీల్లో కొన్ని కులాల వారికే న్యాయం జరుగుతోందని చాలా కులాలలో అసంతృప్తి ఉంది. ఇది వాస్తవమే. అన్ని కులాలకు సమాన న్యాయం కోసం బీసీ కులాలలో మరింత వర్గీకరణ జరపాలని కోరుతున్నాం. ఉదాహరణకు బీసీ ఏ గ్రూపులో ఏ1, ఏ2, బీ గ్రూపులో బీ1, బీ2 ఇలా ఏర్పాటు చేయడం సబబు. పార్లమెంటులో గానీ, శాసనసభలో గానీ చాలా  కులాలకు ఇంకా ప్రాతినిధ్యం దక్క లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. బీసీలకు ఉప ప్రణాళిక డిమాండ్‌ ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా నిధుల కేటాయింపు జరుగుతోంది. వారి కంటే అధికంగా బీసీలు ఉన్నారు. ఆర్థిక అసమానతలు, వివక్షలను ఎదుర్కొంటోంది వాళ్లే. వారికి తప్పనిసరిగా జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు జరగాలి. పార్టీల ధోరణి మారకపోతే బీఎస్పీ తరహాలో కొత్త పార్టీ రావడం ఖాయం.
 అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి
బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని,,బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని , బీసీమహిళలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని , కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. త్వరలో కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌: వస్తోంది అని పిసిసి మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ ప్రకటించారు. ,బీసీ ప్రధాని కావడం ఖాయం అని బిజెపి నాయకుడు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. బీసీలు చట్టసభల్లో పాగా వేయాలి అని టీఆర్ ఎస్: నాయకుడు ఈటెల సలహా ఇచ్చారు.బీసీలకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వటం సరిపోదు . అందరం కలిసి ఇస్తామన్న 100 అసెంబ్లీ పార్లమెంటు సీట్లు నియోజకవర్గాలు కేటాయించాలో ఉమ్మడిగా నిర్ణయిద్దామా అని వైఎస్సార్ పార్టీ మిగతా పార్టీలకు సవాలు విసిరింది.
వెనుకబడిన కులాల అసంతృప్తి ఏమిటి?
ఇంతమంది నాయకులు బర్వాసా ఇస్తున్నాకూడా వెనుకబడిపోయిన కులాలకు మోక్షం లేదనే భావనే బీసీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు.వారికి ఈ వ్యవస్థలో ఎక్కివస్తామన్న నమ్మకం కలగటం లేదు.వారు చెబుతున్న కారణాలు ఇవి:
భారత రాజ్యాంగం పీఠికలోనే సామాజిక న్యాయాన్ని ప్రధమ లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ 50 శాతానికిపైగా వున్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం భూమి పంపిణీలోగానీ, బడ్జెట్ కేటాయింపుల్లోగానీ, బ్యాంకులు, ఫైనాన్స్ కార్పొరేషన్లు అందించే రుణాల్లోగానీ, రాజ్యాంగ వ్యవస్థల్లోని కీలక పదవుల్లోగానీ, న్యాయంగా రావలసిన వాటాలు బీసీలకు రావడం లేదు. నిరంతర శ్రామికులై తమ శ్రమతో జాతి సంపదని సృష్టిస్తోన్న బీసీలు ,ముస్లిం మైనారిటీ ప్రజలు రానురాను ఎస్సీ ఎస్టీ లకంటే కటిక దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. ఏ పార్టీ కూడా పెద్దగా ఒరగబెట్టింది ఏమీలేదు. మేమే ఒక  రాజకీయ పార్టీ స్థాపించుకోవాలీ. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కలిసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ అరణ్యరోదనగానే మిగిల్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోటా బిల్లును 15 సంవత్సరాలుగా అటక మీదే ఉంచాయి. బీసీలకు చట్టసభల్లో మూడోవంతు స్థానాలు రిజర్వు చేయాలని రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసినా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టలేదు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు.శాసనసభలో తీర్మానాలు చేసిన పార్టీలు కూడా శాసనసభల్లో 100 స్థానాలు బీసీలకు కేటాయించడం లేదు. బీసీలకు టిక్కెట్లు ఇచ్చినా, వారిని గెలిపించుకొనే బాధ్యత ఆ పార్టీలు స్వీకరించడం లేదు. బీసీ అభ్యర్థులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించడం లేదు. ఫలితంగా శాసనసభలో బీసీల సంఖ్య 50 దాటటంలేదు. సామాజిక న్యాయ సూత్రం ప్రకారం దక్కాల్సిన 150స్థానాల్లో ప్రతిసారీ 100స్థానాలు కోల్పోతున్నాము. బడ్జెట్‌లో ఒక్కో కుల సమాఖ్యకు రూ.15 నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయింపులు చూపెట్టినా... ఈ సమాఖ్యల కింద రిజిస్టర్ చేసుకున్న ఒక్క సొసైటీకి కూడా ఆర్థిక సాయం లేదు. రాజీవ్ అభ్యుదయ యోజన ,బీసీ కార్పొరేషన్ కార్యక్రమాలకు కూడా చిల్లిగవ్వ ఖర్చుచేయలేదు. మరోవైపు ఇతర కులాల వారిని కులాంతర వివాహం చేసుకుంటే ఇచ్చే వివాహ ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో రూ.5.2 కోట్లు చూపెట్టినప్పటికీ ఒక్క రూపాయి కూడా బీసీ శాఖకు ఇవ్వలేదు.  సబ్‌ప్లాన్ పెడతారట...: ప్రణాళిక నిధులనే ఖర్చు పెట్టకుండా, బడ్జెట్‌లో చూపెట్టిన నిధులను కనీసం బీసీ శాఖకు కూడా ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీల కోసం కూడా సబ్‌ప్లాన్‌ను పెడతామని చెపుతున్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లతోపాటు ఒక రాజకీయ శక్తిగా కూడా బీసీలు ఎదగాలి.అలా ఎదగడం వల్లనే ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో బీసీలు రాజ్యాధికారానికి రాగలిగారు.


ఓబీసీ జాబితాలోకి మరిన్ని కులాల ప్రవాహం
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అన్ని బీసీ కులాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చలేదు. మన రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 144 కి చేరింది. 'గ్రూప్ ఏ లో 54, 'గ్రూప్ బి లో 28, 'గ్రూప్ సి లో 1, గ్రూప్ డి లో 47, గ్రూప్ ఇ లో 14 కులాలున్నాయి.వెనుకబడిన కులాలకు మొత్తం ఉన్న 29 % రిజర్వేషన్లలో గ్రూపు-ఏ కు 7శాతం, గ్రూ పు-బీ కు 10 శాతం, గ్రూపు-సీ కు 1శాతం, గ్రూపు-డీ కు 7శాతం గ్రూపు - ఇ కు 4 శాతం రిజర్వేషన్లుంటాయి. కేంద్రం గుర్తించిన ఒబిసి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ కులాలు 107 మాత్రమే గుర్తింపు పొందాయి.. ఇటీవల కేంద్రం ఓబీసీ క్రిమిలేయర్ పరిమితి పెంచింది. జాబితాలోకి రాని కులాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతున్నాయి. దేశవ్యాప్తంగా బీసీ కులాలు, ఓబీసీల జాబితా ఒకేరకంగా లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం బీసీ జాబితాలో చోటు పొందింది. కొన్ని రాష్ట్రాల్లో బీసీ కులాలు పెద్ద ఎత్తున ఈ జాబితాలో చేరాయి. వివిధ రాష్ట్రాల్లో ఓబీసీ కులాల సంఖ్య వేరు వేరుగా ఉంది.మహారాష్ట్రలో 261 ,ఒడిషా లో 200,కర్ణాటకలో 195,తమిళనాడులో 180,బీహార్ లో 133,జార్ఖండ్ లో 127,అస్సాంలో 124,కులాలు ఓబీసీ జాబితాలో చేరితే ,ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 107 కులాలే కేంద్రజాబితాలో చోటు చేసుకోగలిగాయి.ఇతర రాష్ట్రాలలో లాగానే మన  రాష్ట్రంలో కూడా  కొన్నేళ్లుగా అనేక కులాలు తమను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఓబిసిల జాబితాలో లేని మన రాష్ట్ర కులాలు
పహిల్వాన్, బరాయి(మాల్), దావర్ష్(పక్కీర్), కూర్మి, గౌడ, బారె, గుడియా, బుంజూవా(బదుంజా), కత్రియా రాజ్‌పుత్, తూర్పు కాపు, గాజుల కాపు, లక్కమాని కాపు, బేరి వైశ్య, శెట్టి, అంబిట్టి వక్కలీల్, వక్క లింగార, వరాల, వీరశైవ లింగాయత్, లింగ బలిజ, దొమ్మాళి, పుండ్రా, ఆరె మార్తా, సండి, సండీభట్, 14 ముస్లిం కులాలు: అచ్చుకట్ల సాయిబులు, అత్తరు సాయిబులు,  తురక చాకలి , గంటా ఫకీర్లు ,  గారడీ సాయిబులు , గోసంగి సాయిబులు, ఎలుగుబంటు సాయిబులు ,నాయి ముస్లిమ్,  లబ్బి సాయిబులు, డేరా ఫకీర్లు,బొంతల సాయిబులు, కటికసాయిబులు, షేక్ సాయిబులు, సిద్ధి సాయిబులు,రోళ్లకు కక్కు కొట్టే సాయిబులు.  
మరోపక్క తెలుగు సాయిబుల వేదన

 అప్పటికే నిధుల లేమితో కునారిల్లుతున్న  బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి కొత్తగా ముస్లిముల్లోని 14 కులాలను ఇంకా మరిన్ని కొత్త కులాలనూ చేర్చుకుంటూ పోయారు.బీసీల కోటానూ పెంచలేదు,బడ్జెట్ నూ పెంచలేదు.ఇది బీసీలలో అంతర్గత అనైక్యతను ఇంకా పెంచింది.ఒక కులాన్ని మించి ఇంకో కుల ఎదిగిరావాలనే ముష్ఠికోసం పోటీ మరీ ఎక్కువయ్యేలా కులాల జాబితా పెరిగిపోయింది.ప్రభుత్వ నిర్ణయం కోర్టులపాలై,తమకు రిజర్వేషన్ ఉంటుందో ఉడుతుందో తెలియని అటూయిటూ కానీ పరిస్థితిలో పడిపోయిన సాయిబుల వ్యధ ఇలా ఉంది:  
ముస్లీం మైనార్టీలను పాలకులు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. దళితుల కంటే ముస్లీములు ఇంకా ఎక్కువ పేదరికంలో మగ్గుతున్నారని సచార్‌ కమిటీ చెప్పినా ప్రభుత్వాలకు పట్టట్లేదు. రాజేందర్ సచార్, రంగనాథ్‌మిశ్రా సిఫారసులను అమలు చేయలేదు.దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు వర్తింప చేసిన విధంగానే రిజర్వేషన్‌లను దళిత ముస్లింలకు, దళిత క్రిస్టియన్‌లకు వర్తింపచేయలేదు. 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ముస్లింలలో 133 కులాలను గుర్తించారు.1911,1932,1935 సంవత్సరాల్లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన జనగణన తర్వాత 96 కులాలను దళిత ముస్లింలుగా షెడ్యూల్డ్ చేసి, వీరికి 1936 నుంచి ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు కల్పించింది. వీటిని దళితముస్లిం వర్గాలు 1950 జూలై వరకు పొందారు. కానీ 10- 08-1950న కాన్సిట్యూషనల్(షెడ్యూల్డ్ కాస్ట్,ప్రెసిడెన్సియల్) ఆర్డర్‌ తో దళిత ముస్లింలకు, క్రిస్టియన్‌లకు, సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించకుండా చేశారు.ఆ తరువాత వీరిని ఓబీసీలుగా చేసినారు. నాటి నుంచి దళిత ముస్లింలే కాకుండా సిక్కలు, క్రిస్టియన్‌లు రిజర్వేషన్లకు దూరం చేయబడ్డారు. ఫలితంగా ఈనాడు సాయిబులకు విద్య, ఉపాధి అవకాశాలు లేవు. పల్లెల్లో కాషి వారి గూడేల్లోనైనా , పట్టణాల్లో ముస్లీం బస్తీల్లోనైనా సాయిబుల  జీవనం దుర్భరంగా ఉంది. వీరిలో బూబమ్మల  పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసుకున్నా వారికి రుణాలు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారు. ఆదరణ లేక అనేక గ్రూపులు రద్దయ్యాయి. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన బడ్జెట్‌ను కేటాయించడంలో పాలకులు వివక్ష చూపుతున్నారు.రాళ్లుకొట్టి బతికే కాషొళ్లు గుట్టలు, బండలు అన్యాక్రాంతమయ్యే సరికి వేసవిలో రాయి కొడుతూ మిగతా రోజుల్లో వ్యవసాయ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ముస్లీంలు ఆర్థిక, సామాజికాంశాల్లోనే కాక అక్షరాస్యత లోనూ వెనకబడి ఉన్నారు. ముస్లీముల్లో ఫకీరు,మెహతారు,దూదేకుల వంటి కులాల వాళ్ళు కూడా నిరుపేదలుగా మగ్గుతున్నారు. షేకుల్లోనూ పేదలు అధికమే. ఉర్దూ రెండో అధికార భాషగా ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఉర్దూ రాయగల్గిన, మాట్లాడగల్గిన సిబ్బంది లేరు. దీంతో ముస్లీములు తమ సమస్యల చెప్పుకునేందుకు వస్తే వాళ్లను పట్టించునే పరిస్థితే ఉండట్లేదు.ముస్లీం మైనార్టీ మహిళలు కూడా పొదుపు సంఘాల్ని ఏర్పాటు చేసుకున్నారు. డ్వామా సంఘాలు ఏర్పాడ్డాయి. మైనార్టీ మహిళలు సభ్యులుగా చేరి పొదుపు చేస్తూ వచ్చారు. మున్సిపాలిటీల్లో బ్యాంకుల ద్వారా నేరుగా మ్యాచింగ్‌ గ్రాంట్‌, పావలా వడ్డీ రుణాలివ్వాలని మహిళలు అనేక సార్లు ఆందోళనలు చేశారు. అధికారులు పట్టించుకోలేదు. సంఘాల్ని గుర్తించే పేరుతో సర్వే చేశారు. సంఘాల నిర్వహణ రికార్డులు సక్రమంగా లేవని చెప్పి సంఘాలకు రుణాలివ్వొదని ప్రతిపాదించారు. దీంతో బ్యాంకర్లు కూడా వెనకడుగేశారు.చివరికి  సంఘాలు నడవట్లేదని చెప్పి రద్దు చేశారు. నడుస్తున్నాయని గుర్తించిన సంఘాలకీ రుణాలివ్వట్లేదు.ఇదంతా కావాలని చేస్తున్నట్లుంది.
ముస్లీం వితంతువులు , ఒంటరి మహిళలు కుటుంబ పోషణ కోసం కూలినాలి పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యవసనాలకు గురైన భర్తలు చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలకు ఉపాధి లభించడం కష్టంగా ఉంది. మహిళలు  బండి హోటల్‌, పుట్‌పాత్‌, పండ్లు, కూరగాయలు, చెప్పులు ఇతర చిల్లర వ్యాపారాలు లాంటివి నడుపుతూ కుటుంబాన్ని పోషిద్దామన్నా వాటి  నిర్వహణకు డబ్బుల్లేక నడిచీ నడవని పరిస్థితి ఉంది . బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆస్తుల్ని ష్యూరిటీ పెట్టాలని నిరాకరిస్తున్నారు.పేదవాళ్ళకు ఆస్తులెక్కడినుంచి వస్తాయి? స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలిస్తే కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారాలు పెట్టుకుని జీవనోపాధి పొందేందుకు వీలుండేది. మెప్మా, డిఆర్‌డిఎ, రాజీవ్‌ యువకిరణాల ద్వారా శిక్షణ ఇస్తున్నామని చెబుతున్నా మైనార్టీలకు ఇవ్వట్లేదు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌, పీర్లమాన్యం, ఆవాక్యూ ప్రాపర్టీ ఆస్తుల్ని స్వాధినం చేసుకుని భూమిలేని పేద ముస్లీంలకు పంపిణీ చేయటం లేదు. కులాంతర మతాంతర వివాహాలు చేసుకొని మిగతా కులాల జనంతో కలిసిపోయిన వారికి  ప్రోత్సహకాలు కూడా సరిగా ఇవ్వటం లేదు.లోపలికొస్తే పొగ - బయటే ఉంటే వెలి అన్నట్లుంది మాపరిస్థితి.ఎవరికి చెప్పుకోము?”
మరీ వెనుక బడ్డ కులాల ఉద్ధరణ
రిజర్వేషన్ల పుణ్యాన ఇన్ని ఏళ్ళ పాలనలో ఏవో కొన్ని కులాలైనా రాజకీయంగా,సాంఘీకంగా,ఆర్ధికంగా పైకి వచ్చి ఉంటాయి.అలా ఎదిగోచ్చిన  కులాలే జాబితాలోని మిగతా అణగారిన కులాలకు కాలం గడిచేకొద్దీ అడ్డమౌతాయి. ఆచరణలో జరుగుతున్నది ఇదే. బీసీలలో జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి.ఇందుకే ఎస్సీ వర్గీకరణ పోరు జరుగుతోంది. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి. శక్తిమంతమైన రాజకీయ పలుకుబడి గల కులాలను అంతకంటే  క్రిందివరస  వర్గంలోకి చేర్చాలి. అలాంటి నిరంతర వడపోత , పునర్వర్గీకరణ పద్ధతి ద్వారా కొంత కాలానికి రిజర్వేషన్లు అక్కరలేదని ఎత్తివేసే పరిస్థితి రావాలి. బాలసంతు, బుడబుక్కల, దాసరి,దొమ్మరి, గంగిరెద్దుల, జోగి, జంగం,కాటిపాపల, మందుల, మొండిబండ,పంబల, పాముల, పెరికి ముగ్గుల, పిచ్చిగుంట్ల,వీరముష్టి ,మెహతార్, అచ్చుకట్ల వాళ్ళు, దేవాంగులు, దూదేకుల,జాండ్ర, కరికాల భక్తులు,సెగిడి, తొగట, ఆగరు, ఆరెకటిక, చిప్పోళ్లు,కొడమి, జక్కల, జింగారు,కచ్చి, కండ్ర, కొష్టి, మాలి, నెల్లి,పస్సి, పూసల, సాతాని, అత్తరు సాయిబులు,తురక చాకలి, నాయి ముస్లిమ్,గంటా ఫకీర్లు,గారడీ సాయిబులు ,పకీరుసాయిబులు,ఎలుగుబంటు వాళ్లు,కుక్కుకొట్టె జింకసాయిబులు,కూడా శాసన సభల్లో ప్రవేసించాలంటే ఇప్పటికే బీసీలలో ఎదిగోచ్చిన కులాలను మరీ వెనుకబడిన కులాలకు అడ్డంరాకుండా తొలగించాలి.కనీసం రొటేషన్ పద్ధతి అయినా పెట్టి అన్నీ కులాలకూ రిజర్వేషన్ ఫలితం అందేలా చెయ్యాలి.ఉమ్మడి ప్రయోజనం కోసం భారీ చాకిరీ చేసినా చివరికి అమృతం దక్కలేదనే ఆవేదనతో ,మోసపోయామనే బాధతో ఆనాడు కొందరు రాక్షసుల్లాగా మారిపోయారు.ఈనాడు 144 కులాల ఉమ్మడి ప్రయోజనాలను ఆశించి ఉద్యమాలు నడుపుతున్న నాయకులు కూడా అందులో మరీ వెనుకబడిపోయిన కులాలు ఏవో గుర్తించి వారిని ముందుకు తేవటానికీ ప్రయత్నించాలి.
సూర్య 22.12.2013
http://www.suryaa.com/opinion/edit-page/article-163816
https://www.facebook.com/photo.php?fbid=683302998368360&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

 సూర్య 25.12.2013 
 http://www.suryaa.com/opinion/edit-page/article-164195

https://www.facebook.com/photo.php?fbid=684783901553603&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater