ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

కోస్తాకు కొత్త రైల్వే జోన్ రావాలి



కోస్తాకు కొత్త రైల్వే జోన్ రావాలి
నూర్ బాషా రహంతుల్లా 9948878833
రాష్ట్రాల ఆధారంగా రైల్వే జోన్లు కుదరవని, మన రాష్ట్రానికి కొత్త జోన్కష్టమేననీ రైల్వేశాఖ మంత్రి మల్లికార్జునఖర్గే  6.2.2014 న లోక్సభలో తెగేసి చెప్పాడు. సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రైల్వే జోన్ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పెట్టిన హామీ నెరవేరేలా కనిపించడం లేదు.దేశంలోని రైల్వే జోన్లు, డివిజన్లను పునర్వ్యవస్థీకరించాలంటూ వచ్చిన సిఫార్సులపై ఆ శాఖ తుది నిర్ణయం తీసుకోలేదట. అందుకు తగిన నిర్దిష్ట సమయం చెప్పలేడట. విస్తీర్ణం, పని భారం, అందుబాటు, ట్రాఫిక్రద్దీ, ఆర్థిక అవసరాల్లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటు గురించి ఆలోచిస్తుందట . వీటిని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల ప్రాతిపదికనో, లేదంటే ప్రాంతీయ, భౌగోళిక అంశాలను దృష్టిలో ఉంచుకొనో ఏర్పాటు చేయడం కుదరదట. కొత్త రైల్వే జోన్లు, డివిజన్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఏడాది క్రితమే ఒక కమిటీ ఏర్పాటు చేశారు . నిర్వహణ, ఆర్థిక, పరిపాలన, సిబ్బంది వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ సదరు కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. దానిపై ఇంతవరకూ తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇదే మల్లికార్జునఖర్గే పదవిలో ఉండగానే తన రాష్ట్ర పనులు చక్కబెట్టుకోవాలని ఎందుకు తాపత్రయపడుతున్నాడు?.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న  గుల్బర్గా పార్లమెంటు నియోజక వర్గానికి చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటుకు చకచకా పావులు కడుపుతున్నాడట.ప్రస్తుతం గుల్బర్గా ముంబై జోన్ లోని షోలాపూర్ డివిజన్ లో ఉంది. దీనికి ఏ ప్రజాభిప్రాయ సేకరణా జరుపలేదు,ఆయన మిగతా దేశం కోసం సభలో ఉటంకించిన ఏ సాంకేతిక అంశాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. మరి ఇక్కడ మన తెలుగు జనం ఏళ్ళ తరబడి అడుగుతున్న ఒక్క పనీ ఇంతవరకు జరుగలేదే?.భువనేశ్వర్ జోన్ లోనుండి విడగొట్టి విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు చెయ్యాలనీ,దానిని దక్షిణ మధ్య రైల్వేలో కలపాలని 20 ఏళ్ళ నుంచీ ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ఏ  రైల్వే మంత్రన్నా  పట్టించుకున్నారా? మళ్ళీ రైల్వే బడ్జట్ రాబోతోంది. ఇక్కడ మన నాయకులంతా రాష్ట్ర విభజన గొడవల్లో మునిగిపోయి ఉన్నారు.ఏ ఒక్కరూ కొత్త రైలు మార్గాల గురించీ  కొత్త రైళ్ళ గురించీ అడగరు,అడగలేరు అని భావించిన రైల్వే మంత్రి  తన పని తను చేసుకుపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటిగా కలిసున్నప్పుడే ఈ ఎంపీలు ఏమీ సాధించలేకపోయారు.ఇక ఇప్పుడు విభజన గొడవల్లో ఏమి అడుగుతారు? ఎవరికోసం అడుగుతారు?తెలంగాణా సీమాంధ్రలను కలిపే రైలు మార్గాలు అడగగలరా?అలాంటి విశాల ఉదార హృదయులు ఇప్పుడే వరన్నా ఉన్నారా?అలా అడిగే వాతావరణం ఉందా?రాజకీయాలకోసం ప్రజల అవసరాలు బలికావడం అంటే ఇదేకదా? భారతదేశం లోని 19 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే( South Central Railway) సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా 1966, అక్టోబర్ 2న ఏర్పడింది. ని పరిధిలో హైదరాబాదు దీ, సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ డివిజన్‌లు ఉన్నాయి. కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్,లలో కూడా వ్యాపించిఉంది.రాష్ట్రం భాషా ప్రాతిపాధికమీద  ఏర్పడ్డా తెలుగు ప్రాంతాలు పూర్తిగా ఒక జోన్ క్రిందకు ఎప్పుడూ రాలేదు. రాష్ట్రంలో పెరిగిన జనాభాతో పాటు రైల్వే మార్గాలు పెరగలేదు.దక్షిణ మధ్య రైల్వే 5810 కి.మీ.ల మార్గాలతో దేశంలో మూడవ స్థానంలో ఉన్నా  మన రాష్ట్రం మొత్తం దీని పరిధిలోకి రాలేదు.విశాఖపట్టణం డివిజన్ ను,గూడూరు ను  జోన్ లో కలపాలని ఇప్పటికీ ప్రజలు గోల చేస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రానికి ఇంకా రైలు మార్గం  లేదు. భద్రాచలం, అమలాపురం, నాగర్ కర్నూల్, సిద్దిపేట పార్లమెంటు స్థానాలకు రైలు మార్గం లేదు. అలాగే      ఉట్నూరు,బోత్, అసిపాబాద్, వనపర్తి, జమ్మలమడుగు, కందుకూరు,కొత్తగూడెం,పరకాల,నర్సీపట్నం,పాడేరు,పాలకొండ,పెద్దాపురం,రంపచోడవరం,రామచంద్రాపురం,జంగారెడ్డిగూడెం,ఆత్మకూరు,చంద్రగిరి,కళ్యాణదుర్గంచేవెళ్ళ,వనపర్తి,నారాయణపేట,సిరిసిల్ల,పరకాల,జనగాం,నర్సంపేట,పాల్వంచ,సూర్యాపేట,దేవరకొండ,సంగారెడ్డి,మెదక్, సిద్దిపేట,ఆసిఫాబాదు,మొదలైన రెవిన్యూ డివిజన్ కేంద్రాలకు ఇప్పటికీ రైలు మార్గం విస్తరించలేదు.రాష్ట్రం విడిపోయినా మన ప్రజలందరికీ కావలసింది రైలుమార్గాలు. రైలు ప్రయాణం  ప్రజల ప్రాధమిక హక్కు. పాలనాపరంగా ప్రాంతాలు వేరైపోయినా మన జనం ఇక్కడే ఉంటారు.రాష్ట్రం ఏర్పడింది మొదలు ఇంకా అవతరించని కొత్త రైలుమార్గాల విషయమై ఇరు ప్రాంతాల నేతలూ రైల్వే మంత్రులపై ఒత్తిడి తేవాలి. పుచ్చలపల్లి సుందరయ్య గారి  కల నెరవేర్చి ఇరుప్రాంతాల ప్రజలకూ మేలు చేకూర్చాలి.
1946 లో పుచ్చలపల్లి సుందరయ్య కోరిన కొత్త రైలు మార్గాలు :
కీర్తిశేషులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు 1946 లో "విశాలాంధ్ర   లో ప్రజారాజ్యం" అనే పుస్తకంలో 12 రైలు మార్గాలు వెయ్యాలని కోరారు.   అవి   ఈనాటికి కూడా నిర్మించబడలేదు. ఆయన కోరిన రైలు మార్గాలు   ఇవి:

1.           విశాఖపట్నం-భద్రాచలం-వరంగల్లు
2.          
హైదరాబాద్-దేవరకొండ-మాచర్ల-దొనకొండ-పొదిలి-ఒంగోలు
3.          
ఒంగోలు-అద్దంకి-నర్సరావుపేట-సత్తెనపల్లి-అచ్చంపేట
4.          
ఒంగోలు-పొదిలి-కనిగిరి-బద్వేలు-కడప-రాయచోటి-మదనపల్లి-
           బెంగుళూరు
5.          
నెల్లూరు-బద్వేలు-మైదుకూరు-ప్రొద్దుటూరు-ఆళ్ళగడ్డ-నంద్యాల-
           ఆత్మకూరు
6.          
గూడూరు-రాపూరు-రాజంపేట-రాయచోటి-కదిరి
7.          
రాయదుర్గ-కళ్యాణదుర్గ-అనంతపురం-తాడిపత్రి-కోయిలకుంట్ల-              
          నంద్యాల
8.          
బళ్ళారి-ఆదోని-కర్నూలు-ఆత్మకూరు-ఎర్రగొండపాలెం-మాచర్ల
9.          
కదిరి-పులివెందుల-ఎర్రగుంట్ల-ప్రొద్దుటూరు
10.    
ఖమ్మం-తిరువూరు-చింతలపూడి-జంగారెడ్డిగూడం-నిడదవోలు
11.    
చల్లపల్లి-పామర్రు-గుడివాడ-నూజివీడు-తిరువూరు
12.    
రాజమండ్రి-భద్రాచలం

ఆయన జీవిత కాలంలో ఈ రైలు మార్గాలను చూడలేకపోయారు.ఆయన కోరాడు కాబట్టి ఆ రైలు మార్గాలు మాకు అక్కరలేదు అని ఆంధ్రప్రదేశ్ లోని మిగతా రాజకీయ పార్టీలవాళ్ళు ఎన్నడూ అనలేదు. పైగా వాటికోసమే ఎన్నోసార్లు పోరాడారు. ప్రజలూ ప్రజాప్రతినిధులూ కలిసి అడుగుతున్నా ఈ రైలుమార్గాలు మనకు ఈనాటికీ కేంద్రం అనుగ్రహించలేదు.సమైక్య విభజన ఉద్యమాలలో చూపించిన తెగువ రైలుమార్గాల గురించి చూపించినట్లయితే మన రాష్ట్రం మరింత బాగుపడేది.
1960 లో రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదించిన మార్గాలు:
బొగ్గు, సిమెంటు, ఎరువులు, ముడి ఇనుము, ఆహారధాన్యాలు, పంచదారబెల్లం, చేపలు, పండ్లు మొదలైన వస్తువుల మన రాష్ట్రం నుండి రవాణా    అవుతాయి. ఈ రవాణా కోసం రైలు మార్గాలు ఎంతో అవసరం. రాష్ట్రంలోని   వివిధ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ప్రభుత్వం 1960 లో ఈ క్రింది కొత్త రైలు మార్గాలను ప్రతిపాదించింది.

·       కొవ్వూరు-భద్రాచలం-దంతెవాడ-(మద్యప్రదేశ్)
·      
గద్వాల-రాయచూర్
·      
రామగుండం-జగిత్యాల-నిజామాబాద్
·      
లింగంపల్లి-పటాన్ చెర్వు-మెదక్-సిద్దిపేట-సిరిసిల్ల-కరీంనగర్- పెద్దపల్లి
·      
జగ్గయ్యపేట-వాడపల్లి
·      
నడికుడి-వినుకొండ-దర్శి-పొదిలి-ఉదయగిరి-ఆత్మకూరు-రావూరు- 
     గూడూరు.
ఈ మార్గాలన్నింటికీ ప్రాథమిక సర్వే పని పూర్తయ్యింది. కాని కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించడం లేదు.
మొదటి రాజధాని దురవస్థ
కర్నూలు కొన్నాళ్ళపాటు రాష్ట్ర మొదటి రాజధాని అని పేరే గానీ ఇంకా సింగిల్ లైనుతో దేకుతోంది.ఈ వైపు ఏమైనా అభివృద్ధి జరిగిందా? రెండవలైనుకి ఈనాటికీ ఎందుకు నోచుకోలేదు? లైనువేస్తామంటే ఎవరూ  అడ్డంపడలేదే? కర్నూలు నుండి శ్రీశైలం మీదుగా ఒంగోలుకు రైల్వే లైను వేస్తామంటే ఎవరన్నా వద్దన్నారా?అసలు అలాంటి ఆలోచన చేయటం కూడా అత్యాశగా భావించాల్సివస్తోందంటే  మన తెలుగు ప్రజలు ఎంతగా నిరాశా నిస్పృహలలో కూరుకుపోయారో అర్ధం అవుతోంది.
కోనసీమలో రైళ్ళవల్ల లాభంలేదట
కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్, కాకినాడ మెయిన్ రైల్వేలైన్...ఈ రెండు రైల్వే ప్రాజెక్టులూ కోనసీమ వాసుల చిరకాల వాంఛ. ఏటా ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయన్న  ఎప్పటికప్పుడు ఎంపీల అంటూనే ఉన్నారు.దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవ ఆ రెండు రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కడం ఇక అసాధ్యమని తేల్చిచెప్పేశారు. కాకినాడ-పిఠాపురం మెయిన్ లైన్ తగిన ట్రాఫిక్ లేకపోవడంతో ఉపయోగం లేదని,కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ కోసం గోదావరిపై మూడు వంతెనల   నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినా, ‘తగిన ప్రయాణికులు, సరుకు రవాణా రాబడి, ట్రాఫిక్ ఉండాలి కదా?’ అని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా రైల్వేలకు ప్రయోజనం లేకపోతే రైలువేయరన్నమాట. ప్రజాప్రయోజనంకోసం కాకుండా లాభాపేక్షతో రైలుమార్గాలు వేస్తారా?అయితే ఇక బ్రిటీష్ వారికీ స్వదేశీ పాలకులకూ తేడా ఏమిటి? కోనసీమవాసులకు రైలు కూత వినిపిస్తామని జబ్బలు చరిచి, ఆందోళనలంటూ జనాన్ని రోడ్డెక్కించిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఏమంటారు? కేవలం 18 కిలోమీటర్ల నిడివి కలిగిన రైల్వేలైన్‌ను అనుసంధానించడం పెద్ద విషయం కాదనే పళ్లంరాజు చెబుతూ వచ్చారు. తీరా గత రైల్వే బడ్జెట్‌కు ముందు మెయిన్‌లైన్‌లో కలపాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు.

 కోనసీమ మీదుగా నరసాపురానికి తలపెట్టిన రైలు మార్గానికి గోదారులే ప్రతిబంధకమయ్యాయి. వాటిపై వంతెనల నిర్మాణానికి ఖర్చు ఎక్కువే అవుతుంది.కానీ ఏటా తుఫానులూ వరదలతో సతమతమౌతున్న ఈ ప్రాంత ప్రజలకు రైలుమార్గం వరప్రదాయనికాదా? వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి-నరసాపురం, వైనతేయపై బోడసకుర్రు-పాశర్లపూడి, గౌతమీపై కోటిపల్లి-ముక్తేశ్వరంల మధ్య రోడ్ కం రైలు వంతెనలు నిర్మించాలి. జీఎంసీ బాలయోగి కృషితో 2000 నవంబరు 16న కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది. ఇక అంతే సంగతులు.
2000లో కోనసీమలో రైల్వేలైన్ నిర్మించాలని తలపెట్టినప్పుడు ఆ శాఖ సమగ్రంగా సర్వే చేసింది. ఈ ప్రాంతంలో రైల్వేలైన్ అవసరమని, రైల్వే శాఖకు ఆదాయం కూడా బాగానే ఉంటుందని తేల్చింది. ఆ సర్వే నివేదిక ఆధారంగానే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సాక్షాత్తూ అప్పటి రైల్వేమంత్రి మమతా బెనర్జీ, నాటి సీఎం చంద్రబాబు పునాదిరాయి వేశారు. ఇప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల లైన్ నిర్మాణం సాధ్యం కావడం లేదంటే 2000లో జరిగిన సర్వేలు, నివేదికలకు విలువ లేనట్టేనా ?

వివాడ-గుంటూరు-తెనాలి త్రినగర మెట్రో
విజయవాడ-గుంటూరు-తెనాలి ప్రాంతాలను మెట్రో నగరంగా అభివృద్ధి పరచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఏడాదిలోగా నివేదికను అందించాలనీ,  విశాఖపట్నంలో మెట్రోరైలు ఏర్పాటు అంశాన్నీ పరిశీలించాలనీ కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోని 13వ షెడ్యూల్‌లో చివరి అంశంగా దీన్ని చేర్చింది. రాష్ట్ర విభజన జరిగి విజయవాడ, గుంటూరు నగరాల మధ్య రాజధాని ఏర్పాటుచేస్తే  విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్కులర్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడూ ముఖ్యమైన రైల్వే జంక్షన్లే కాబట్టి ఈ స్టేషన్లమధ్య మూడవ లైనువేసి రోజంతా మెట్రో రైళ్ళను నడిపితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల రాకపోకల ప్రయాణం సులువౌతుంది. దక్షిణ, ఉత్తరభారత దేశాల మధ్య వారధిగా విజయవాడ రైల్వేస్టేషన్‌ ఉంది. ప్రయాణికులను తీసుకెళ్లే రైళ్లు 250కు పైగా ఈ స్టేషన్‌ మీదుగా నిత్యం వెళతాయి. విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం ఉంది. దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలి.కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ జరుగుతోంది. మచిలీపట్నం-హైదరాబాద్‌ జాతీయ రహదారి ఉంది. రూ.1800 కోట్లతో విజయవాడ బైపాస్‌ నిర్మాణానికి టెండరు ఖరారైంది. కృష్ణా నదిపై నాలుగు వరుసల వంతెన రానుంది.విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం- ఉడా) సుమారు ఏడు వేల చదరపు కిలోమీటర్లలో సత్తెనపల్లి,పొన్నూరుల వరకు విస్తరించింది.బందరు పోర్టు ఏర్పాటుకు 2008 ఏప్రిల్‌ 23న పోర్టుకు శంకుస్థాపన చేశారు. విజయవాడ నుంచి గుంటూరు-తెనాలి-రేపల్లె- మచిలీపట్నం గుడివాడ ఏలూరు - గన్నవరం మీదుగా విజయవాడకు సర్క్యూట్‌ రైలును ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. 216 జాతీయ రహదారి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా త్రోవగుంట వరకు రావాలి. కృష్ణా జిల్లాలో పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని రేపల్లె, బాపట్ల మీదుగా ఈ రహదారి వస్తే కోస్తా తీరంలో జాతీయ రహదారి కూడా వచ్చినట్లవుతుంది. 
ప్రజలు కోరుతున్నకొత్త రైలు మార్గాలు:
 ఇక ఆయా ప్రాంతాల ప్రజలు ఈ క్రింది రైలు మార్గాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు.
      హైదరాబాదు-సూర్యాపేట-కోదాడ-విజయవాడ
      
కొత్తగూడం-ఖమ్మం-సూర్యాపేట-నల్గొండ-జడ్చర్ల
     
కడప-ఆళ్ళగడ్డ-నంద్యాల
     
బాపట్ల-నిజాంపట్నం- రేపల్లె-అవనిగడ్డ-మచిలీపట్నం
    
 కైకలూరు -ఏలూరు
     
మచిలీపట్నం నర్సాపురం -కాకినాడ

ప్రజల ప్రయాణ అవసరాలను కేంద్రప్రభుత్వం శ్రద్ధగా గమనిస్తే ఈమార్గాలు ఎంత ప్రాముఖ్యమైనవో తెలుస్తాయి.తరచుగా వరదలు తుఫానులకు గురయ్యే కోస్తా ప్రాంత ప్రజలకు ప్రయాణ బాధలుఎక్కువగా ఉంటాయి.ఈ కొత్త రైలుమార్గాలు మన తెలుగునాట సముద్ర తీరప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి.
పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజాప్రతినిధులందరూ కలిసి పార్లమెంటులో కేంద్రం మీద కొత్త  రైలు మార్గాల కోసం వత్తిడి తేవాలి. 275 వేల చ.కి.మీ విస్తీర్ణం గల మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి కిలో మీటర్ల భూమికి కేవలం 18 కి.మీ. రైలు మార్గం మాత్రమే ఉంది. సగటున ప్రతి ఆంధ్రుడు రైలు బండి ఎక్కాలంటే 45 కిలోమీటర్లు పోవలసి వస్తున్నది. కొన్నిచోట్ల అయితే దాదాపు 60 కి.మీ. వ్యాసార్థంలో రైలు సౌకర్యం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బ్రిటిష్ వాడికంటే వేగంగా నిర్మాణం కావలసిన రైలు మార్గాలు నత్త నడక నడుస్తున్నాయంటే సిగ్గుచేటు. రైల్వే మంత్రి పదవి కూడా ఆంధ్రుల కింతవరకు ఇవ్వలేదు. కొత్త  రైలు మార్గాల సాధన కోసం మన ఎంపీలు గట్టి కృషిసల్పాలి.రాష్ట్రం విడిపోయినా ప్రజలకు రైళ్ళ లేమి బాధ తప్పదు.మార్గం ఉంటేనే కదా  బండి నడిచేది?రాష్ట్ర ప్రభుత్వాలైనా భూసేకరణ జరిపి రైలుమార్గాలు నిర్మించి నిర్వహించటానికి కేంద్రాన్ని ఒప్పించాలి.డబ్బులున్నవాళ్ళు విమానాల్లో ప్రయాణిస్తారు. సామాన్యజనం మాత్రం రైళ్ళనే ఎక్కువగా ఆశ్రయిస్తారు. కాబట్టి చక్కని రైళ్ళ వ్యవస్థ శ్రేయోరాజ్య లక్షణం. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఎంతకాలం ఉన్నా మనం సీమాంధ్రకు కొత్తరైలు మార్గాలు సాధించుకోలేము. విడిపోతే ఇంతకంటే కొత్తగా వచ్చే నష్టం ఏమీ  ఉండదు. ఎవరి ప్రాంతం అభివృద్ధి మీద వారు దృష్టి పెడతారు. ఎన్నేళ్ళు కలిసున్నా ఏమీ సాధించకపోవటం కంటే ఎవరి ప్రాంతానికి వారు ఏదో ఒకటి సాధించుకోవటం నయం కదా? కలిసున్నా విడిపోయినా రైలు మార్గాల సాధన ఒక గొప్ప ప్రజాప్రయోజన కార్యక్రమమని ఇరుప్రాంతాల నేతలూ ప్రజలూ గుర్తించి ఆ దిశగా అడుగులు వెయ్యాలి.
సూర్య9.2.2014
https://www.facebook.com/photo.php?fbid=708656329166360&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

 (ఆంధ్రపత్రిక 22.12.1990)
 https://www.facebook.com/photo.php?fbid=503406646357997&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater