ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, మార్చి 2020, బుధవారం

మహమ్మారులను ఆపాలి ! మానవజాతిని రక్షించాలి !

                                                           
మహమ్మారులను ఆపాలి !మానవజాతిని రక్షించాలి ! 

మనిషి కంటే ముందే పుట్టిన సూక్ష్మజీవులే  మహమ్మారులు. మిగతా జీవుల ప్రాణాలు తీయటం ఈ భూతాల పని.వైరస్ లు,బ్యాక్టీరియా ల రూపంలో ఇవి మన ప్రాణాలు తీస్తూ ఉంటాయి.అధికజనాభాను తగ్గిస్తూ అహంకరించిన మానవుల గర్వాన్ని అణుస్తూ ఉండటంకూడా ఈ భూతాలకు పనిలోపని అంటారు మాల్తస్ లాంటి శాస్త్రవేత్తలు. 13వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వల్ల మూడు కోట్ల మంది చనిపోయారు.తరువాత కలరా,ఫ్లూ,ప్లేగు,మశూచి,ఎయిడ్స్ లాంటి అంటురోగాలు కోట్లమందిని బలితీసుకున్నాయి. ఈ ఏడు  కరోనా వల్ల 199 దేశాలలో 24 వేలమంది మరణించారు.ఇటలీలో 8300,స్పెయిన్ లో 4400,చైనాలో 3300 ,ఇరాన్ లో 2500,ఫ్రాన్స్ లో 1700,అమెరికాలో 1300 మంది చనిపోయారు.బ్రిటన్ యువరాజు చార్లెస్ కూ వచ్చింది.ఇటలీలో రోడ్లమీదనే రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారట. రాజు పేద అనేతేడా లేకుండా అందరికీ వ్యాపిస్తోంది ఈ అంటు రోగం . ప్రజలు అందరూ అంటరానివాళ్లే అయ్యారు. కలిసి గుంపులుగా తిరగటం, కరచాలనాలు మానేశారు.
ఆవుమాంసం తినేవాళ్లూ పందిమాంసంతినేవాళ్లను పరస్పరం అసహ్యించుకుంటుంటే ,అసలు మాంసాహారం వల్లనే ఈ వైరస్ లు చెలరేగుతున్నాయని శాకాహార పండితులు విమర్శిస్తున్నారు.అయితే మాంస సారమైన పాలు,పెరుగు,వెన్న,నెయ్యి కూడా మానెయ్యండి అని మాంసాహారులు ఎత్తిపొడుస్తున్నారు. భరద్వాజుడి దగ్గరనుండీ మాంసాహార విందులు తిని ఇప్పుడు మమ్మల్ని తినోద్దు అంటారా, తినేవాళ్ళ కడుపుకొడతారా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.దేవుని దృష్టిలో మాంసాహారం ,శాకాహారం అనే తేడాలేదు.రెంటినీ ఆయనే సృష్టించాడు.జంతువుకి ఆహారం మాంసమే కదా?పూర్వజన్మల్లో మనంకూడా జంతువులుగా పుట్టి ఉంటాము అని మాంసాహార భక్తులు వాదిస్తున్నారు. గబ్బిలాలు,పాములు,తేళ్ళు, కోతుల వంటి జంతువుల మాంసాహారం ద్వారా మనిషికి రోగాలు వస్తాయని వీళ్ళ బాధ. క్షయ,రెబీస్,ఆంత్రాక్స్,ప్లేగు,ఎబోలా,మెదడువాపు,స్వైన్ ఫ్లూ,బర్డ్ ఫ్లూ లాంటి వ్యాదులు అలాగే వచ్చాయట. మనది గోమూత్రం సేవించే వేద భూమి కాబట్టి ఇలాంటి కరోనాలు ఏమీ చేయవని, పాములు, కుక్కల్ని తినే చైనా వాళ్ళకే ఇది వస్తుందని వాదిస్తున్నారు.అసలు మోషే ధర్మశాస్త్రంలోనే దేవుడు ఫలానా జంతువులు పక్షుల మాంసాలు తినవచ్చనీ,ఫలానావి తినకూడదనీ చెప్పాడు కాబట్టి ఆ ఆహారనియమాలు పాటించాలనీ ఆ మతపెద్దలు వాదిస్తున్నారు.  
మేము కరోనాతో కరీంనగర్‌ జిల్లా వచ్చినా అల్లా దయవల్ల కరోనా వదిలిందని ఇండోనేషియో నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దల వాదన.వైరస్ లు దేవుని ఆజ్నలు నెరవేర్చే భూతాలు కాబట్టి దైవ విదేయతలేని పాపులకు పాఠం నేర్పే పోతాయని అధిక జనాభాను అవే తగ్గిస్తాయని వాళ్ళు అంటున్నారు. ఎవరివాదనా పట్టించుకోకుండా వైరస్ జనాన్ని చంపుకుంటూ పోతోంది.భూమిమీద ఉన్న రకరకాల వైరస్ లు భూమిపై ట్రోపో స్పియర్ లోకి వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్లుప్రయాణించి మరో భూ ప్రాంతానికి చేరుకుంటున్నాయట.సకలదేశాలలో వ్యాపించే సర్వాంతర్యామి లక్షణాలు చూసే ఈ వైరస్ లను మహమ్మారులు అన్నారట. ఇంత చిన్న సూక్ష్మ జీవుల వల్ల దేశాలమధ్యజరిగే యుద్ధాలలో చనిపోయేవారికంటే ఎక్కువమంది చనిపోయారట.మహమ్మారులకు మనుషులను చంపటం తప్ప మరే మంచి పనీ లేదా అంటే మిగతా జీవులు ఉత్పత్తి చేస్తున్న చెత్తను శుభ్రం చేస్తున్నాయట.మన వ్యర్ధాలను నిర్మూలం చేస్తున్నాయట.ఏనాటికైనా యముని దూతలైన మారెమ్మల ద్వారానే మనకు చావు కాబట్టి తప్పని చావుని గురించి ఆలోచించుకొమన్నారు.మరణం రెండూరకాలు. కాలమరణాలు,అకాలమరణాలు.ఆత్మహత్యలన్నీ ఇచ్చామరణాలు. జీవులకు ముసలితనంలో వచ్చే చావులు కాలమరణాలు, అంటువ్యాధులు,ప్రమాదాల ద్వారా వచ్చే చావులన్నీ అకాలమరణాలు.జాతస్య మరణం ధృవం కాబట్టి రాలే ఆకు కూడా అల్లాహ్ కు తెలియకుండా రాలదు. కరోనాల ద్వారా దేవుడు మనుషులకు పునరపి జననం అనే గుణపాఠం నేర్పుతాడు,మరణం సంపూర్ణ ముగింపు కాదు మళ్ళీ మరోకచోట పుట్టిస్తాడు, సూక్ష్మ పాపాల బాకీ తీరేదాకా దయ్యంగానైనా బ్రతికిస్తాడు అని భక్తులను ఓదారుస్తున్నారు.పైగా మనందరం కనపడే దయ్యాలమేనంటున్నారు.ఈ వ్యాధి నుండి ఏ దేవుడూ రక్షించలేడన్నట్లు దేశవ్యాప్తంగా వున్న అన్ని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు కూడా మూసివేశారు. గోమూత్రం త్రాగితేనో, ఆవు పేడ పూసుకుంటేనో, ఎండలో నిలబడితేనో కరోనా తగ్గుతుందనే వార్తలను జనం తిరస్కరించారు, గుంపులు గుంపులుగా బయట తిరగకూడదన్నారు.
 కష్టకాలంలో కొందరు మనుషుల్లో మానవత్వం వెల్లివీరుస్తుంది.శతృభావం వదిలి బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారోకు క్యూబా వైద్యుల సహాయం అందించింది. విప్రో అజీమ్ ప్రేమ్ జీ కరోనా నివారణ పనుల కోసం 52 వేల కోట్ల రూపాయలు , సిప్లా యూసుఫ్ హమీద్,వేదాంత అనిల్ అగర్వాల్ వంద కోట్ల రూపాయలు, ఆలీబాబా జాక్ మా 10 కోట్ల యువాన్లు విరాళం ఇచ్చారు.అమీర్ ఖాన్ 250 కోట్ల రూపాయలు ఇచ్చారు.అలాగే ఇంకా కొందరు దాతలు.
మహమ్మారుల వల్ల చనిపోయే వృద్ధులు,పేదల తో  ఎలాంటి ఉపయోగం లేదని, ఇటువంటి వారు చనిపోతే బాధపడనక్కర్లేదు అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. కరోనాతో ఇరాన్‌లో పెద్దయెత్తున జనం చనిపోతుంటే ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలనుఅమెరికా ఉపసంహరించుకోలేదు. కరోనాను అదుపు చేసేందుకు అమెరికా చేసిందేమీ లేదు. కరోనా మందు తయారీలో పరిశోధన చేస్తున్న జర్మనీ కంపెనీని కొనేసేందుకు అదియత్నించింది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక 'ఒబామా హెల్త్‌ కేర్‌' ను రద్దు చేశారు. ఔషధ రంగంలో పరిశోధనలకు నిధుల్లో కోత పెట్టి, అంతరిక్ష సైనికీకకరణకు వాటిని మళ్లించారు.ట్రంప్‌ కార్పొరేట్లకు లక్షన్నర కోట్ల డాలర్ల బెయిలవుట్‌ ప్యాకేజి ప్రకంటించారు ,ఎంతమంది చనిపోయినా వారికి డబ్బులిస్తాం కానీ అమెరికాను లాక్ డౌన్ చేయం అన్న ట్రంప్ కు తిరిగి డబ్బులు సంపాదించుకుంటాముగానీ పోయినప్రాణాలను తిరిగి తేలేము అని బిల్ గేట్స్ బుద్ధి చెప్పాడు.  వూహాన్‌లో కరోనా తలెత్తగానే బెంబేలెత్తిన అమెరికన్‌ కంపెనీలు,సెనెటర్లు తమ షేర్లను ఒక్కసారిగా అమ్మేసి స్టాక్‌ మార్కెట్‌లో కల్లోలానికి కారణమయ్యారు. అమెరికన్‌ కంపెనీల షేర్లను చౌకగా కొనుగోలు చేసిన చైనా కంపెనీలు ఇప్పుడు నిలదొక్కుకోవటంతో ట్రంప్‌ కంటగిస్తున్నాడు.కరోనా వైరస్‌ చైనాలో పుట్టింది కాబట్టి వాళ్ళే దీన్ని సృష్టించారని అమెరికా ప్రచారం చేస్తోంది. కానీ బయోటిక్‌ ఆయుధాలను, వైరస్‌లు సృష్టించి శత్రు దేశాలపై ప్రయోగించిన చరిత్ర అమెరికాదే. గతంలో అమెరికా ఎయిడ్స్‌ వైరస్‌ను సృష్టించింది.
భారత్‌ 135 కోట్ల జనాభాతో దుర్భర దారిద్ర్యంలోనూ మశూచి,పోలియో లను తప్పించుకున్న దేశం. కిక్కిరిసిన ఇళ్ళలో ఏకాంతం పాటించలేని దేశం.కానీ వేడి వాతావరణంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండటం మన దేశానికి మంచిదయ్యింది. లాక్ డౌన్లు బడుగు వర్గాల జీవితాలను మరింత దుర్భరం చేస్తాయి. అర్ధాకలితో బతుకులు వెళ్లదీసే బడుగు జీవుల్ని అసలు గడప దాటొద్దంటే కొత్త సమస్యలు వస్తాయి. జనం అటూ ఇటూ పోకుండా కొన్ని గ్రామాలలో  స్థానికజనమే రోడ్లకు ముళ్ళకంచెలు అడ్డువేస్తున్నారు.కొన్నిచోట్ల ఇరుక్కుపోయిన జనం చాలాదూరం నడుస్తున్నారు. చాలామంది ఆకలితోనే చనిపోయేలా ఉన్నారు. అందువలన అడ్డా కూలీలు ,ఇండ్లలో పనివాళ్ళు, అద్దె ఆటో డ్రైవర్లు, బిచ్చగాళ్ళు, వ్యవసాయ కూలీలు,హమాలీ కూలీలను ఆదుకోవటం కోసం 80 కోట్ల మంది పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసే పధకాలు ప్రవేశపెట్టారు. కేరళలో ముందుగానే అందరికీ ఉచితంగా బియ్యం, ఇతర నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించారు.మద్యాహ్న భోజనాన్ని ఇళ్లకే పంపిస్తున్నారు. తమిళనాడు,పుదుచ్చేరి,ఆంధ్రలలో 9 వతరగతి దాకా పిల్లలందరినీ పరీక్షలు లేకుండానే పాస్ చేశారు.టోల్ గేట్లు రద్దు చేశారు.ఉచిత రేషన్‌ తో పాటు ఆర్థిక సహాయం ప్రకటించారు. కార్పొరేట్‌ వైద్యశాలలు కమ్యూనిటీ వైద్యాన్ని అందించవు కాబట్టి కేజ్రీవాల్‌ ప్రభుత్వం వీధి మొహల్లా క్లినిక్‌ల లాగా, రాజశేఖరరెడ్డి హయాంలోని 108 వాహనాలలాగా ప్రాధమిక వైద్యం దొరకాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రజల ఆపదల్ని తమ లాభాల కోసం మలుచుకొనే లాభార్జనాపరుల్ని,జలగల్లా పీడించే  వడ్డీ వ్యాపారులను రంగంలోనుంచి తప్పించమని కోరుతున్నారు.శరణార్ధులకోసం డిటెన్షన్‌ సెంటర్లు కట్టినట్లుగా దేశంలో కరోనా కట్టడికి ఆసుపత్రులు,ల్యాబ్ లు,ఐసోలేషన్‌, క్వారంటైన్‌ సెంటర్‌లు కట్టాలి. మాస్కులు, వెంటిలేటర్ల తయారీ పెంచాలి. మనుషుల అంతు చూసే మహమ్మారులను ఆపాలి !

--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

19, మార్చి 2020, గురువారం

న్యాయ మూర్తులకు కీర్తి ప్రతిష్ఠలే కదా ఆస్తులు !


న్యాయ మూర్తులకు కీర్తి ప్రతిష్ఠలే కదా ఆస్తులు ! (సూర్య 22.3.2020)


అరాచకశక్తులనుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడే అంతిమరక్ష సుప్రీంకోర్టు అని జస్టిస్ రంజన్ గొగోయ్ గతంలో అన్నారు.ఎన్నో నీతులు చెప్పిన రంజన్‌ గొగోయ్‌ తనను రాజ్యసభకు నామినేట్‌ చేయగానే ఏమాత్రం సంకోచంలేకుండా చేరిపోయారు.పైగా శాసన, న్యాయవ్యవస్థలు రెండూ కలసికట్టుగా పనిచేయాలన్న కోరికతో రాజ్యసభ పదవిని అంగీకరించాడట. గతంలో జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు సిక్కుల ఊచకోత కేసులో ప్రభుత్వ సానుకూల తీర్పు ఫలితమే రాజ్యసభ సీటు అని గగ్గోలు పెట్టిన గొగోయ్ తన దగ్గరకు వచ్చేటప్పటికి కళ్లుమూసుకున్నారు. మరి గొగోయ్ కూడా జాతీయ పౌర పట్టిక, రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు,అయోధ్య బాబ్రీ మసీదు రామజన్మభూమి కేసుల్లో తీర్పులిచ్చారు.వీటన్నిటికి ఈ రాజ్యసభ సీటు ప్రతిఫలమా అని మదన్ లోకూర్ ,కురియన్ జోసఫ్ లాంటి తోటి న్యాయమూర్తులే విమర్శిస్తున్నారు.పైగా ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలున్నగొగోయ్‌కి పెద్దలసభ పదవి ఇవ్వడం తగదని అంటున్నారు.జస్టిస్ మార్కండేయ కట్జూ అయితే గొగోయ్ సిగ్గుమాలిన న్యాయమూర్తి అన్నారు. లంచానికి ,మంచానికీ ఆశించే న్యాయమూర్తులవలన న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు పెరుగుతాయనీ ,న్యాయ పదవుల గౌరవం తగ్గిపోతుందనీ కొందరు పెద్దలు ఆక్రోశించారు.
పూర్వం జస్టిస్ నిసార్‌ అహ్మద్‌ కక్రూ, బహరుల్‌ ఇస్లాం, రంగనాథ్‌ మిశ్రా, హిదయ తుల్లా, ఫాతిమా బీవీ లాంటి కొందరికి పదవులిచ్చారు. బహరుల్‌ ఇస్లాం రాజ్యసభకు ఎన్నికై ఆ పదవికి రాజీనామా చేసి గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరయ్యాక ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. తరువాత పదవిని వదులుకుని అసోం నుంచి లోక్‌సభకు కాంగ్రెస్‌ తరఫున పోటీచేశారు. జస్టిస్‌ సదాశివం కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు.న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తారు. పదవీ విరమణ అనంతరం ఆశబోతుతనంతో ప్రభుత్వాలిచ్చే రాజకీయ పదవులు తీసుకోకూడదని,ఇలా వచ్చే పదవుల్ని ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తున్నారని స్వర్గీయ అరుణ్‌ జైట్లీ వాదించేవారు. సీనియారిటీని కాదని జస్టిస్ రే,బేగ్ లకు ప్రధాన న్యాయమూర్తుల పదవులు ఇవ్వకూడదని ఆనాడు భీష్మించిన బీజేపీ తనవాదనలను తానే ఉల్లంఘించింది అంటున్నారు.
సీవీసీ లాగా న్యాయమూర్తులు కూడా పదవీ విరమణ చేశాక మరే పదవి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధన ఉండాలి. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు ఏ పదవీ చేపట్ట కూడదని జస్టిస్‌ కేటీ థామస్, జస్టిస్‌ లోథాలు చెప్పారు.గతంలో ఇవే మాటలు చెప్పిన జస్టిస్‌ గొగోయ్‌ రిటైరైనాక ఇప్పుడు మాటమార్చి రాజ్యసభ సభ్యత్వాన్ని అంగీకరించారు.ఆనాడు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ప్రధాని మోడీని బాహాటంగా కీర్తించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి అంటే ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే రక్షకుడు అని ప్రజలు భావిస్తారు. అలాంటి న్యాయరక్షకుల్ని పాలకులు మళ్ళీ తమసేవలోనే పెట్టుకోవటం ఎందుకు? తమకు అనుకూలంగా తీర్పులిచ్చిన న్యామూర్తులకు పదవీ విరమణ తరువాత పదవులిచ్చి కాపాడుకోవటం లంచగొండితనం కాదా? న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తరువాత లాభదాయక పదవులు పొందితే వారి తీర్పులపై అనుమానం రాదా? న్యాయవ్యవస్థ స్వతంత్రను స్వచ్ఛతను కాపాడేందుకు రిటైరైన వారు పదవులకు దూరంగా ఉండాలనే విషయమై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హెచ్‌ ఎల్‌ దత్తు,ఎస్‌ఎ బాబ్డే ధర్మాసనాలు కొట్టివేయటం సబబేనా? న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత ఎలాంటి పదవులను చేపట్టరాదని చెప్పిన న్యాయమూర్తులే మాటతప్పితే ఎలా?పెన్షన్ తో ఏ పదవీ లేకుండా శేష జీవితం గడపలేరా?ఇప్పటికైనా దీనికి ఒక రాజ్యాంగ శాసనం రావాలి.
గతంలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దకుండా అదే తప్పును తాము చేస్తామనడం ఎవరికీ తగదు. ప్రభుత్వం పదవులు లంచంగా ఇచ్చి న్యాయవ్యవస్థను లొంగదీసుకోకూడదు. న్యాయమూర్తులు ప్రజలు అందరికీ ఆదర్శంగా ఉండాలి.లేకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థమీద నమ్మకం పోతుంది. మన నేతలు స్వార్ధం విడిచి పదవులు త్యాగాలు చేశారు.ఏపదవీ పొందని గాంధీజీనే మనకు ఉదాహరణ. న్యాయవాది కూడా తనకు స్వీయ నియంత్రణ విధించుకుంటాడు.విధించుకోవాలి. న్యాయమూర్తికి అవినీతి,ధనాపేక్ష ,కుల పక్షపాతాలులాంటి అవలక్షణాలు ఉండకూడదనే అతన్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా న్యాయపాలకునిలాగా పెద్దలాగా ఉంచి గౌరవించారు. న్యాయవాది న్యాయమూర్తిగా మారేటప్పటికి న్యాయంగా బ్రతకడంలో మరింత పరిణితి చెందాలి.ఎన్నో వివాదాలలో తీర్పులు ఇచ్చిన అనుభవం న్యాయమూర్తికి కొన్ని ఆదర్శాలు నెరుతుంది.హత్యాచారాలు చేసిన దుర్మార్గుల తరుపున అసలు న్యాయవాదనే చెయ్యమని నిరాకరించిన న్యాయవాదులు కొందరు ఉన్నారు.న్యాయవాదిగా గాంధీజీ ఇలాగే ముందు వాది దగ్గర విషయాలు ముందుగానే కనుక్కొని ఆరా తీసేవాడట.మరి ఇప్పుడు సమాజంలో అలాంటి న్యాయవాదుల్ని గుర్తించటం తప్పనిసరి.న్యాయం త్వరగా జరక్క ,అసలు జరుగుతుందో లేదో తెలియక నిర్భయ తల్లి ఇప్పటికీ ఏడుస్తోంది.అయిషా బేగం తల్లి ఏడుస్తోంది.నిర్భయ హత్యాచార దోషుల పక్షాన ఉరి వద్దని నిస్సిగ్గుగా వాదిస్తున్న ఏపి సింగ్ లాంటి న్యాయవాదులకు , నిర్భయ దోషుల్ని ఉరి తీసినంత మాత్రాన నేరాలు ఆగవని నిరాశ పరిచే కురియన్ జోసఫ్ లాంటి న్యాయమూర్తులకు న్యాయ వ్యవస్థ అడ్డుపడాలి. న్యాయవాదులు,న్యాయమూర్తులు,అధికారులు,రాజకీయనాయకులు కలిసి పనిచేయటం వల్ల నేరగాళ్ళను పట్టుకొని త్వరగా శిక్షించాలి.న్యాయమూర్తులు రాజకీయనాయకులతో కలిసి పనిచేయటం అనేది ఇప్పుడున్న సమాజంలో సాధ్యమేనా?కోర్టులనీతి మీద నమ్మకం ప్రజలకు ఇకపై ఉంటుందా? విశ్రాంత న్యాయమూర్తిని రాజ్యసభలో కూచోబెట్టడం ఎందుకో? ఇంకా కావాలనే దురాశకు పోతే ఇచ్చినవారికీ పుచ్చుకున్నవారికీ కూడా అప్రదిష్టే మిగులుతుంది. విశ్రాంత ఉద్యోగులకు మళ్ళీ పదవులిచ్చి నిరుద్యోగులకు అన్యాయం చెయ్యకూడదని ప్రభుత్వాలకు ఎందరో చెబుతున్నారు.అలాగే విశ్రాంత న్యాయమూర్తులు రాజకీయపార్టీలలో చేరకూడదని ఎలాంటి లాభదాయక పదవులనూ పొందకూడదని రాజ్యాంగ సవరణ చెయ్యాలి.న్యాయవ్యవస్థలో చేరేటప్పుడే న్యాయవాది ఆశానిగ్రహం అలవాటుచేసుకోవాలి.న్యాయవాద పదవులకు ధన సంపాధనే లక్ష్యం కాకూడదు. జస్టిస్ మురళీధర్ బదిలీకి వెరవకుండా ఢిల్లీ పోలీసుల్ని ప్రశ్నించారు.జస్టిస్ లోయాను తీర్పు నచ్చని దుర్మార్గులు హతమార్చారు. న్యాయమూర్తుల జీవితం కత్తిమీదసామూలా ఉంటుంది.దురాశకుపోతే దొరికినంత సంపాదించుకోవచ్చు కానీ దురాశ దుఖము చేటు అన్నారు. న్యాయ మూర్తులకు చివరికి మిగిలేది కీర్తి ప్రతిష్ఠలే అని గ్రహించి శాసన కర్తలు ఇప్పుడైనా రాజ్యాంగ సవరణకు పూనుకోవాలి.
 నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

11, మార్చి 2020, బుధవారం

సానబెడితే మన పిల్లలూ ఆటల్లో వజ్రాలే




సానబెడితే మన పిల్లలూ ఆటల్లో వజ్రాలే
https://www.facebook.com/williams32143/posts/3084517791580190

స్వర్గీయ  షేక్ షంషేర్ ఖాన్ ఒలంపిక్స్ లో తొలి భారతీయ ఈతగాడు,బందరు దగ్గర పల్లెటూరువాసి.ఏటిమరుపు రజని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి చిత్తూరుజిల్లా కుగ్రామీణ యువతి . విలువిద్యాకారిణి జ్యోతి సురేఖ  స్వర్గీయ విలుకాడు చెరుకూరి లెనిన్ కుమార్తె . .భారత పరుగుల వీరులు కంబళ పోటీల్లో గెలిచిన శ్రీనివాస గౌడను నిశాంత్ శెట్టిని భారతీయ ఉసైన్ బోల్ట్ అని పొగుడుతున్నారు. స్వయంకృషితోనే మేరీకోమ్‌, సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, సింధు, హరికృష్ణ, హంపి, జ్యోతి సురేఖ ,రాగాల వరుణ్ ,హిమాదాస్ లాంటి క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అర్జునుడితో పాటు ఏకలవ్యుడు, కర్ణుడుకూడా విలువీరులుగా ఎదిగిన జాతి మనది. ప్రభుత్వ వ్యవస్థల ద్వారా పైకెగసిన ఆటగాళ్లు భారత్‌లో అతి అరుదు. వీళ్ళ ప్రతిభకు సానబెడితే భారత్ కు స్వర్ణ పతకాలు ఖాయం. సౌకర్యాల ఊసే లేని కుగ్రామాల నుండి అంతర్జాతీయ స్థాయికి చేరిన కష్టజీవులు కొందరు. విజయాలవెనుక వారి కుటుంబాలు పడిన ఇబ్బందులు, అవమానాలు ఎన్నో. హైస్కూలు దశలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్సహించిన వాళ్ళూ ,ఆటలను సీరియ్‌సగా తీసుకొని ప్రాక్టీస్‌ చేసినవాళ్లూ, ఏళ్లతరబడి శిక్షణ తీసుకున్నవాళ్ళూ ,రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చూపించారు. అంచెలంచెల విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు దొరికింది. మన గ్రామీణ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం కానీ, క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచే సౌకర్యాలు కానీ లేవు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగడం సాధారణమైన విషయం కాదు.చదువులో వెనకబడినా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, తాహతుకు మించి అప్పులు చేసి మరీ శిక్షణకు వెళ్ళాలి. శాప్‌ శిక్షణ కేంద్రాలలో రాటుతేలాలి. ప్రభుత్వం కొందరు విజేతలకు నగదు బహుమతి, గ్రూప్‌-1,2 ఉద్యోగాలు ఇస్తోంది. ఆ బహుమతులతో పేద క్రీడాకారుల కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. క్రీడారంగంలో ఉన్న మహిళల్ని అన్ని విధాలా ప్రోత్సహించాలి. అప్పుడే మరికొంత మంది మహిళలు ఈ రంగంలో ప్రవేశించగలుగుతారు.

ప్రపంచకప్‌ సాధనే లక్ష్యంగా చైనా ఫుట్‌బాల్‌ యజ్ఞంలా చేస్తోంది.చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ స్వయంగా ఫుట్‌బాల్‌ క్రీడాభిమాని! ఆయనే ముందుండి ఈ మహాయజ్ఞాన్ని నడిపిస్తున్నారు.చైనా ప్రభుత్వం లక్ష్యసాధనను ఫాస్ట్‌ట్రాక్‌పై పెట్టింది. కఠిన శిక్షణలా కాకుండా వినోద, విజ్ఞాన ప్రధానంగానే ఈ పాఠశాలల్లో చిన్నారులకు ఆటను నేర్పిస్తున్నారు.2004, 2012, 2016 ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో అమెరికా తరవాత రెండు మూడు స్థానాల్లో చైనా ఉంది. 2008లో ఒలింపిక్స్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడమే కాదు, 48 స్వర్ణాలతో మొత్తం వంద పతకాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. అయిదేళ్లలో క్రీడల ద్వారా 46 వేలకోట్ల డాలర్లను ఆర్జించవచ్చని, 2025 నాటికి అది 81,300 కోట్ల డాలర్లకు పెరగవచ్చని చైనా అంచనా వేస్తోంది. ప్రఖ్యాత బ్రెజిల్‌ దిగ్గజ ఆటగాళ్లు రొనాల్డొ, రొనాల్డిన్హో వంటి ఆటగాళ్లు, కోచ్‌లు సైతం చైనా బాటలో నడుస్తున్నారు.

ప్రస్తుతం చైనావ్యాప్తంగా అయిదు కోట్ల మంది పిల్లలు, యువకులు ఫుట్‌బాల్‌ నేర్చుకుంటున్నారు. చైనా ఇదే దూకుడు కొనసాగిస్తే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్పు విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం! క్రికెట్‌ ఆటకు భారత్‌ ఆర్థిక రాజధాని అయినట్లుగానే, ఫుట్‌బాల్‌ ఆర్థిక వ్యవహారాలకు చైనా ప్రధాన కేంద్రమవుతుందట. ఒక ఆటను ప్రోత్సహించాలంటే ప్రణాళికలు ఎంత పకడ్బందీగా రచించాలో చైనాను చూసి భారత్‌ నేర్వాలి. చైనాలో వ్యవస్థల ద్వారా వందలు, వేల సంఖ్యలో ఆటగాళ్లు ఉద్భవిస్తున్నారు. మనదేశంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. క్రికెట్‌ మినహా ఇతర క్రీడలకు భారత్‌ ఇస్తున్న ప్రోత్సాహం పెద్దగా లేదు. చైనాలో ఉన్నది, భారత్‌లో లేనిది ఏమిటంటే మూలమూలకూ క్రీడాసంస్కృతి విస్తరించడం. చైనా మాదిరిగా భారత దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులను ఏదో ఒక ఆటలో రాణించేలా చేయాలి. ఇప్పటివరకు అంతర్జాతీయ ఆటల పోటీలలో మన దేశం నవ్వుల పాలవుతోంది. క్రికెట్, టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ వంటి వేర్వేరు క్రీడాంశాల్లో దిగ్గజాలున్నారు.కరోనాను నిర్మూలించటంలో చైనా వారి కృషి ఎంత గొప్పదో మన కళ్లతో చూశాం.అలాగే పతకాలను సొంతం చేసుకోటానికి చైనా ఆటలపై పెడుతున్న శ్రద్ధ మనమూ పెట్టాలి .

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం దేశంలోని 40 శాతానికిపైగా బడులకు ఆట స్థలాలు, విద్యుత్‌ సదుపాయం, పాఠశాలలకు ప్రహారీ గోడల్లేవని, ఇది పిల్లల భద్రతకు, ఆ బడులకు సంబం ధించిన ఆస్తికి చేటు తెస్తుందని హెచ్చరించింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ బడుల ప్రహారి గోడల నిర్మాణం చేయిస్తే మంచిదని ప్రతిపాదించింది. మన రాష్ట్రంలోమన బడి నాడునేడుకార్యక్రమానికి 15 వందల కోట్లు కేటాయించారు. ఈ డబ్బుతో బడుల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, అదనపు తరగతి గదుల నిర్మాణం, బ్లాక్‌బోర్డుల ఏర్పాటు, ప్రహారీల నిర్మాణంవంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. దేశ జనాభాలో సగానికిపైగా పాతికేళ్లలోపువారే. వీరంతా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకుంటున్నారు. భారత క్రికెట్‌ జట్టులోకి ప్రవేశించిన సచిన్‌ తన ఎదుగుదలకు చిన్ననాడు చదువుకున్న బడిలోని ఆట స్థలమే దోహదపడిందని వివరించాడు. కానీ బడుల ఆటస్థలాలను పట్టించుకున్నవారేరి?సానబెడితే మనపిల్లలూ వజ్రాల్లా తయారవుతారు.

n   నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266