ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, మే 2020, శనివారం

ఎన్ని కష్టాలురా దేవుడా ?

ఎన్ని కష్టాలురా దేవుడా ? (సూర్య 31.5,2020)
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను తాకాయి.మనదేశంలో వడదెబ్బతో ఏటా ఐదారువేల మంది మరణిస్తూ ఉంటారు. ఇప్పుడైనా వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించాలి. వడగాడ్పులకు కొన్ని రాష్ట్రాలలో రాకాసి మిడతలు లక్షలాది ఎకరాల్లో పంటను నాశనం చేస్తున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో డ్రోన్లతో మందులు పిచికారీ చేయిస్తున్నారు.కొన్నిచోట్ల పొలాలలో బాతుల గుంపులు మిడతలను కొంతవరకు నివారిస్తున్నాయట. భారత స్వావలంబనలో బాతులపెంపకందారులను కూడా ప్రోత్సహించాలి.
ఔరంగాబాద్ రైలుపట్టాలపై పడుకొని చనిపోయిన కూలీలు, ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై వడగాలికి చనిపోయిన ్లి,బిడ్డల మరణ దృశ్యాలు ప్రజల్ని కంటతడి పెట్టించాయి.వేలాదిమైళ్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు వెళుతున్న అసంఖ్యాక కార్మికులు ఆకలిదప్పులకు గురవుతూనే నడచుకుంటూ పోతున్న పిల్లలు, మహిళలు రహదారులపై, అడవుల్లో, రైల్వే ట్రాక్‌లమీదే పడి కుప్పకూలిపోతున్నారు. ఆత్మనిర్భర భారత్‌లో రహదారులన్నీ వలసకూలీల పాదాలతో రక్తమోడుతున్నాయి. కరోనా బారినపడి వలసకూలీల్లో చాలామంది చనిపోతున్నారు. ప్రైవేట్‌ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా మూతపడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యం పొందాలి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు,రంగంలోకి దిగి చేతనైనంత సాయం చేస్తున్నారు.
ఇకమీదట ఉత్తరప్రదేశ్‌ కూలీలకోసం ఆరాష్ట్ర వలసల కమిషన్‌ ను అభ్యర్దించాలి.కార్మికులను కావాలని అడిగిన రాష్ట్రం, ఆ కార్మికుల సంక్షేమానికి, వారి సామాజిక భద్ర తకు ఎలాంటి చర్యలు తీసుకోదల్చుకున్నదో కమిషన్‌కు చెప్పాలట. బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇవ్వాలట. అమలుజరిపితే ఈ నియమాలు మంచివే. ఎందుకంటే మనకోసం మాల్స్, మల్టీప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు కట్టిన శ్రామికులకు మేలు జరగాలి.
అసంఘటిత రంగంలో ఉన్న కూలీలకు పెద్ద పెద్ద కోర్కెలు తీరవు.పుట్టినచోటే ఏదో ఒక పని దొరికితే చాలు.వలస కూలీలుగా కన్నవారిని విడిచి, భార్యాబిడ్డల్ని వదిలి వేల కిలోమీటర్ల దూరం దాటి రావల్సిన అవసరం వీరికి వుండదు. పేదరిక నిర్మూలన పథకాలు ఎన్ని వున్నా ఉపయోగపడ లేదు. వలస జీవులతో పనులు చేయించుకుంటున్న యజమానులు కార్మికులకు న్యాయంగా దక్కవలసినవి దక్కనివ్వాలి.గ్రామాలకు చేరుతున్న వారికి ఉపాధి హామీ చట్టం కింద పనులు కలిపించడానికి రాష్ట్రాలన్నీ ముందుకు రావాలి.అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో పట్టణ కార్మికుల్లో 80 శాతంఅంటే 9.3 కోట్ల మంది లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధిని కోల్పోయినట్టు తేలింది. నగరాలు, పట్టణాల్లో మిగిలిపోయిన అసంఘటిత రంగంలోని అసంఖ్యాక కార్మికులకు పనులు కల్పించాలి. కార్పొరేట్‌ విద్యా సంస్థలు తమదగ్గర పనిచేసిన ఉద్యోగులకు జీతాలివ్వాలి.కార్డుల్లేని వారికి రేషన్‌ కార్డులు ఇవ్వాలీ.
ఎండాకాలంలో అందరికీ నీడనిచ్చే చెట్లు కావాలి , నీళ్ళకోసం చెరువులు , బావులుకావాలి.నీరు నీడ కల్పించే పనుల్ని తిరిగి గ్రామాలు చేరుకున్న కూలీలకు ఉపాధి హామీ పధకంలో పనులు కల్పించాలి.ఇక వేరే ఊళ్ళకు వలస పోకుండా సొంత రాష్ట్రాలలోనే పనులు దొరికేలా పరిశ్రమలు నెలకొల్పాలని పారిశ్రామిక వేత్తలను కోరాలి.స్వయం ఉపాధి భారీ ఎత్తున విస్తరించాలి .అడవులను నరకడం ఆపాలి. విషపూరిత రసాయనాలు, వాయువులను వెదజల్లే పరిశ్రమలను జల్లెడపట్టాలి. లాక్ డౌన్ వల్ల ఇలాంటి విషపరిశ్రమలు మూతపడి గంగ ,యమున లాంటి నదులు శుభ్రపడ్డాయట.అభివృద్ధి పేరిట పర్యావరణ చట్టాల నిబంధనలను తుంగలో తొక్కి గనుల తవ్వకం జరుపకూడదు.ఏదైనా కొత్త పరిశ్రమ నిర్మాణానికి ముందు స్థానిక ప్రజల మొరవినాలి. అటవీ పర్యావరణ శాఖ జాతీయ సంస్థలు డెహ్రాడూన్‌, ఛండీగఢ్‌ లో వున్నాయి. 19 ప్రాంతీయ కార్యాలయాలు ఆయా అడవులకు సమీపం లోనే వున్నాయి. వాటన్నిటికీ నియంత్రణ శక్తి సామర్ద్యాలను పెంచాలి.సముద్ర తీర పరిరక్షణ సముద్ర తీరం ఆక్రమణల పరం కాకుండా జరగాలి. తీరం వెంబడి విస్తరించిన మడ అడవులు బ్రతకాలి. మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు వస్తే వారు గుజరాత్ లాంటి దూర రాష్ట్రాలకు వలస పోకుండా ప్రత్యామ్నాయ జీవన మార్గాలు కల్పించాలి.కరోనా దెబ్బకు దేశంలో నిరుద్యోగిత 1.2 కోట్లమందితో 24 శాతానికి చేరుకుంది.నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు తమ రిజిస్ట్రేషన్‌లు రద్దు చేసుకుంటున్నాయి.గ్రామీణ ఉపాధి కల్పన పథకానికి కేంద్రం రూ. 40,000కోట్లు ప్రకటించటం మంచిపనే.గ్రామాలలో మరింతమంది కార్మికులకు ఉపాధి దొరకడంతోపాటు ఉత్పత్తి చేసిన సరుకులకు డిమాండ్‌ ఏర్పడుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన సరుకుల వినియోగం పెరగాలంటే ప్రజల కొనుగోలుశక్తి పెరగాలి. కాబట్టి అమెరికా, బ్రిటన్‌ లలో లాగా ఇక్కడా నిరుద్యోగులకు భృతి, నగదు తోడ్పాటు ఇవ్వాలి.
వీటన్నిటికి తోడు అరుణాచలప్రదేశ్ భూభాగం లోకి చైనా సైనికులు దూసుకొచ్చి మన సైనికులతో ఘర్షణకు దిగారట. జనం కరోనాతోనే పెద్ద యుద్ధం చేస్తున్నారు.తమ ప్రాణాలు నిలుపుకుంటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.రోగుల ప్రాణాలను కాపాడటానికి చైనా కూడా టీకా తయారీ ప్రయోగాలలో సఫలం కాబోతోందని వార్తలొస్తున్నాయి. ఆ సంతోషం నిలువకుండానే ఈ యుద్ధవార్తలేమిటి? అంటే ఓర్చుకోవాలి నాయనా! జీవితం అంటేనే వ్యాధులు బాధలు వ్యధలు వేదనలు అన్నాడు ఒకాయన.
ఆత్రేయ గారి పాటలో కూడా ఇలాంటి ప్రశ్నలే గుర్తొచ్చి వేదాంతంలో పడేశాయి :
తలచినదే జరిగినదా దైవం ఎందులకు?/
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ముగిసిన గాథ మొదలిడదు దేవుని రచనలలో/మొదలిడు గాథ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో
ఎదలో ఒకరే కుదిరిననాడు మనసే ఒక స్వర్గం/ఒకరుండగా వేరొకరొచ్చారా లోకం ఒక నరకం
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు /
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం?
---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

22, మే 2020, శుక్రవారం

వలసబాట పట్టిన బాటసారికి ఎంత కష్టం?


వలసబాట పట్టిన బాటసారికి ఎంత కష్టం?
ప్రతి జీవికీ తన సొంత ఊరుతో ఒక అనుబంధం పెనవేసుకొని ఉంటుంది.అది అతనికి జన్మనిచ్చిన భూమి.తన బాల్యమంతా స్నేహితులతో గడిపిన భూమి. తన జీవనోపాధి కోసం ఎన్నో ప్రాంతాలకు వలస వెళ్లినా, ఏ దో నాటికి తన ఊరికే తిరిగి వస్తాడు.తప్పదు.తప్పిపోయిన కుమారుడిది వలస పోయిన చోట ఎంత దయనీయమైన బ్రతుకో బైబిల్ లో ఏసుక్రీస్తు చెబుతాడు.వలస కూలీ కూడా తనకు పనిదొరికిన ఊరు వదిలి వెళ్లాల్సోస్తే బాధపడతాడు.పని దొరకని సొంత ఊరికి తిరిగి వెళదా మంటే దిగులు.పిల్లల పోషణ ఎలాగా అని భయం.ఏమి బతుకు... ఏమి బతుకు... చెడ్డ బతుకు అని పాడుకోని కార్మికులు ఎవరుంటారు? కాలినడకన వందల కిలోమీటర్లు నడుస్తున్న కూలీలు తమ పిల్లలని కూడా నడిపిస్తుంటే మానవత్వం ఉన్న ఎవరికైనా కన్నీళ్లు వస్తున్నాయి.వడదెబ్బ కు కొందరు చనిపోయారు. అంత పేదరికంలో ఉన్న వారు ఎక్కువమంది పిల్లల్ని కని వారిని బాధపెట్టకూడదు అని అంటే వారి ఇష్టం కననివ్వండి ఎంత జనాభా ఉంటే అంత అభివృద్ధి అంటున్నారు కొందరు.గతంలో చంద్రబాబు నాయుడు గారైతే ఎక్కువమంది పిల్లలతో ఫలానా ఫలానా దేశాలు బాగు పడ్డాయి తెలుసుకొని ఎక్కువ మందిని కనండయా అని బుద్ధి చెప్పారు.
పిల్లలంటే అందరీకీ మక్కువే.కానీ పిల్లలు మంచి సౌకర్యాలతో బ్రతికే పరిస్థితులు కల్పించకపోతే తాను కన్న పిల్లలనే చంకనేసుకొని సంచరించాల్సి వస్తుంది. శ్రీశ్రీ చెప్పినట్లు దిగులు పడుతూ, దీనుడౌతూ తిరగాల్సి వస్తుంది.ఆనాడు సిరిగలవానికి చెల్లును/తరుణుల పదియాఱువేల దగ పెండ్లాడ తిరిపెమున కిద్దరాండ్రా?పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్ అని దేవుణ్ణి కూడా అడిగిన దేశం మనది.ఆత్రేయ కూడా ఆకలిరాజ్యంలో నిరుద్యోగుల అవస్థలకు చలించి స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అంటాడు.చావును పెళ్ళితో పోలుస్తావా అని ఆత్రేయను విమర్శించలేదు.ఆయన సదుద్దేశాన్ని అర్ధం చేసుకొని ఊరుకున్నారు.పెళ్లిళ్ళకే ఒప్పుకొని వాళ్ళు పిల్లలకు ఒప్పుకుంటారా?ఇప్పుడైతే చిన్న కారణం దొరికితే చాలు నీవు ఇంత అజ్నానివా అని ఉతికి ఆరేస్తున్నారు.అక్కిరాజు ప్రసాద్ లాంటివారు ఇదంతా తలుచుకొని ఏమున్నదక్కో ఏమున్నదక్కా , పిల్ల పాపలకు నేర్పిందేమి లేదు అంటూ బాధపడతారు. ఈ కష్టం గడిచే వరకు పనిదొరికినవారు తోటి వారికి తమ పనిలో భాగం ఇచ్చి తోడ్పడలేరు.ఒకరికొకరు సహాయపడే వాతావరణం కరోనా కల్పించిన కరువులో తగ్గి పోయింది. ఎవరి స్వార్ధము వారిది. వలస కూలీలకు రవాణా సౌకర్యాలు కల్పించటానికే చాలా సమయం పట్టింది. వారి తిరుగు ప్రయాణాలకు డబ్బులు ఎలా అని తర్జన భర్జన పడ్డారు .ఛార్జీలు నువ్వు పెట్టుకోవాలంటే నువ్వే పెట్టుకోవాలని కేంద్రము రాష్ట్రాలూ వాదులాడుకుంటూ కాలం గడిపాయి. వలస కార్మికులు ఆకలి మంటలతో రోడ్ల మీద పడ్డారు. అందరినీ ఇళ్లలో ఉండమన్నారు.వలస కూలీలకు సొంత ఇల్లు ఉండదు.యజమాని కట్టించిన రేకుల షెడ్డులోనే కాపురం. కాని వారి తిండి,కనీస అవసరాల కోసం జనం వీథుల్లోకి వస్తున్నారు. ఇక వలస కష్టాలు వద్దు , దొరికిందే తింటాము , ఊళ్లోనే ఉంటాము ఆని గ్రామానికి బస్సుదొరికి తిరిగివెళుతున్న కుటుంబాలు అంటున్న వార్త చూచి ఈ నిర్భాగ్యుల నిర్ణయం నిలుస్తుందా?అనిపించింది.ఇదికరోనా వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాంటి తాత్కాలిక నిట్టూర్పుమాత్రమే అన్నారు కొందరు.అసలు వాళ్ళకు ఉన్నప్రాంతంలోనే ఉపాధి దొరికితే వలసలు ఎందుకు వస్తారు,వీరి కష్టాలకు కన్నీళ్ళకు ఎవరు బాధ్యులు అని కొందరి విశ్లేషణ.సొంత ఇల్లు, భూమిలేని ఈ వలస కూలీలకు ఇల్లు కట్టించి,తలాఒక అరఎకరమన్నా పంచిపెడితే ఊళ్లోనే ఉంటారని మరొకరి సలహా.
వలసకూలీలను తిరిగి పోనివ్వకూడదని వలస రాష్ట్రంలోనే ఆపాలని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఒత్తిడితెచ్చి కొన్ని శ్రామిక రైళ్లు ఆపేశారట.మేధావులు అందరూ వీళ్ళగురించే బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆవరించిన కూలీల నడక కష్టంలో వారికున్న కొద్దిపాటి ఆర్ధికశక్తి తోనే సహాయము చేసిన దారిపొడుగూ నిలబడిన స్థానిక దాతలందరికీ నమస్కారం.దేశ ప్రజలు దీపాలు వెలిగించారు.పూలు చల్లారు.టపాసులు పేల్చారు.అయినా 4 గంటలు మాత్రమే సమయం ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ ప్రకటించక ముందే నాలుగురోజులపాటు సొంత ఊళ్ళకు పోవటానికి వీలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు ఇచ్చినట్లైతే బాగుండేది. తల్లీబిడ్డలతో సహా చంకన సంచులు, నెత్తిన గోతాలు పెట్టుకొని వందల వేల మైళ్లు కాలి నడకన హైవే ల మీదుగా చేస్తున్న ప్రయాణాలు చూసిన వారి కళ్లలో నీళ్లొచ్చాయి.మద్యం పున:ప్రవేశంతో పరిస్థితి మరింత దిగజారింది. రోడ్లపై నడిచిన వలస కార్మికులపై కొన్నిచోట్ల లాఠీచార్జి కూడా చేశారు.పైగా ఇక నుండి కరోనాతో సహజీవనం చేయక తప్పదట. రాష్ట్రాలకు ఋణ పరిమితికి షరతులు పెట్టినందుకు కేంద్రాన్ని కేసీఆర్ విమర్శించారు. ఆనాడు కేంద్రం మిథ్య అన్న ఎన్టీఆర్ మాటలు గుర్తుచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రకటించిన 'ఆత్మ నిర్భర భారత్‌' రుణాలు నడిచే కూలీలకు ఇవ్వాలి. ఆత్మనిర్భరము డబ్బులు ఇస్తే కలుగుతుంది.రైళ్లు వేయకుండా కూలీలు తమ సామానులు బిడ్డలను ఎత్తుకొని నిబ్బరంగా నడవాలంటే ఎలా నడుస్తారు? చివరికి రోహిణి కార్తె సమయంలో శ్రామిక రైళ్లు వదిలారు.పంటను తడిపేందుకు ఒక మగ్గు నీళ్ళు సరిపోతాయా?వేలమంది కూలీల తరలింపుకు అవతలి రాష్ట్రం కూడా అనుమతీస్తేనే రైలు కదులుతుందట.కూలీల గురించి బాధపడుతూనే ఈ ఆంక్షల పరిమితుల్లో జిల్లా కలక్టర్లు కూడా ఏమీ చేయలేక కొన్నిచోట్ల ఆగిపోయారట.
దేవుడు వలసకూలీలను ఎందుకు చేశాడు? అని అడిగితే ఒకాయన సముద్రాల లెవెల్లో ఈ చరణాన్నే సమాధానంగా పాడాడు:
"వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం …
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం"
సరేనని మూసుకొని కూర్చున్నాను.
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ , 6301493266

15, మే 2020, శుక్రవారం

మద్యంలో మునుగుతున్న సంక్షేమం

మద్యంలో మునుగుతున్న సంక్షేమం ( గీటురాయి 15.5.2020) 
 
కరోనా వల్ల ప్రపంచంలో 3 లక్షల మంది,అమెరికాలో 85 వేలమంది.ఇండియాలో 25 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 16 లక్షలమంది భారత్ లో 25 వేల మంది.ఆంధ్రలో 11 వందలమంది కోలుకున్నారు.వీళ్ళు ప్లాస్మా దాతలుగా పనికివస్తారు. కరోనానివారణకు టీకాలు తయారు చేసే పనిలో ఇండియా తోపాటు అమెరికా ,చైనా.ఇటలీ,ఇజ్రాయెల్,బ్రిటన్ లాంటి చాలాదేశాలు ఉన్నాయి.కానీ వ్యాక్సీన్ తయారీకి మిగతా దేశాలు 61 వేల కోట్లరూపాయలు ఇవ్వదలిస్తే అమెరికా మాత్రం డబ్బులేమీ ఇవ్వను అందట. తాము విజయవంతంగా టీకా పరీక్షించామని ఇటలీ , ఇజ్రాయెల్ చెప్పాయి.
విదేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి తీసుకు రావటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మాత్రం సరైనది కాదని, కరోనా లేదని నిర్థారించుకున్నవారిని మాత్రమే ఇలా తేవాలని.ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా విమానంలో ఉన్న మిగతావారంతా ప్రమాదంలో పడతారని. కేవలం థర్మల్‌ స్క్రీనింగ్‌తో విమానాలు ఎక్కించవద్దని కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్‌ అంటున్నారు.
లాక్‌డౌన్‌ వలన దేశంలో 45 రోజులుగా ఎక్కడికక్కడ చిక్కుకున్న వలసజీవుల్ని స్వస్థలాలకు తరలించడానికి ఆర్ధిక ఇబ్బందులతో శ్రామిక రైళ్లు నడుపు తున్నారు. లక్షలాదిమంది కూలీలు సొంతూళ్లకు కాలి నడకన వెళ్ళి 70 మంది చనిపోయారు.కొందరైతే సిమెంట్‌ మిక్సర్‌ కంటైనర్ ట్రక్కులు పట్టుకొని బయలుదేరారు.ఔరంగాబాద్ రైలు లో ప్రయాణిస్తున్న వలసకూలీలు చనిపోయినా , స్వస్థలాలకు పోవడానికి అనుమతించమంటూ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వలసజీవులు తిరగబడటం మొదలుపెట్టారు.శ్రామిక రైళ్ళలో కూలీల ఛార్జీలు కేంద్రం 85 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 15 శాతం భరించాలట. వలసజీవుల తరలింపు కోసం ఛార్జీలు అడగారు.వలసజీవుల్లో 65 శాతంమంది దగ్గర కనీసం వంద రూపాయలు కూడా లేవట. ప్రధాని నరేంద్ర మోదీతో తమకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రులంతా మొర పెట్టుకుంటున్నారు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు అన్నట్లు వలసజీవులకు సొంత ఊళ్ళకు పోవాలనే దిగులు లాక్ డౌన్ కాలంలో పెరిగిపోయింది. ప్రభుత్వం నగదు వసూలు కేంద్రం మాత్రమే కాదు. వలసకార్మికుల తరలింపు చెయ్యాలికానీ ఎక్కడ వున్నవారు అక్కడే వుండిపోవాలని నిర్దేశించ కూడదు. స్వస్థలాలకు పంపే చార్జీల ఖర్చు కొంత తమపార్టీ భరిస్తుందని సోనియా గాంధీ ముందుకొస్తే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరో ఫరో రాజులాగా అడ్డుపడి తమ భవననిర్మాణాల కోసం కూలీలు కావాలని శ్రామిక రైళ్లను ఆపేశారు.
కేంద్రం దగ్గర ప్రస్తుతం 3 కోట్ల 10 లక్షల టన్నుల బియ్యం, 2 కోట్ల 75 లక్షల టన్నుల గోధుమలు నిల్వలు ఉన్నాయి.లాక్డౌన్ కాలంలో కూలీలకు ఇవ్వటానికి ఆహారధాన్యాలను రాష్ట్రాలకు విడుదల చేయటం సంక్షేమ కార్యం. ఒక్క కేరళ రాష్ట్రం మాత్రమే ప్రతి ఇంటికి 19 రకాల ఆహార వస్తువులు 5 వేల రూపాయలు పంపించింది. మోడీ ఆర్థిక ప్యాకేజీ ఏమీ ప్రకటించలేదు. ఈ నిల్వలను మద్యం తయారీకి శానిటైజర్ల రసాయన పరిశ్రమల్లో ఎథనాల్‌ తయారీకి మళ్ళిస్తారట. చమురు ధరలు కారుచౌక గా దొరికే కాలంలో పెట్రోలు డీజిల్‌ కు బదులు ఎథనాల్‌ వాడటం ఎందుకు? ఎథనాల్‌ తయారీ కోసం ఆహారధాన్యాలను మళ్ళించడం అవసరమా? ఐరాస ఆహారధాన్యాలను ఎథనాల్‌ తయారీలో వాడవద్దని, అవి ప్రజల ఆహారం కోసం వినియోగించాలని చెప్పింది.ప్రస్తుతం దేశంలో ఉన్న 50 కోట్ల లీటర్ల ఎథనాల్‌ తో 70 కోట్ల లీటర్ల శానిటైజర్‌ లను కూడా తయారు చేయవచ్చు.ఆత్మనిర్భర భారత అభియాన్ పేరిట 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది.కానీ అందులో పరిశ్రమల యజమానులకే గానీ , వలసకూలీలకు ఏమీ కేటాయించలేదు.
మన దేశానికి ఎండ వాతావరణం ఒక శాపము వరము కూడా. శ్రామికుల కూలీల సహజ వ్యాధి నిరోధక శక్తి, లాక్‌డౌన్‌ కూడా తోడయ్యాయి. లాక్ డౌన్ కాలంలో మద్యం దొరకలేదు. కానీ లాక్ డౌన్ ముగియ కుండానే ఇంత తొందరగా మద్యం షాపులు ఎందుకు తెరిచారు అంటే కేంద్రం మద్యం అమ్ముకోమని చెప్పింది కాబట్టేనట.మద్యందొరికిందని తాగుబోతులు సంతోషపడుతుంటే తాగుబోతులు దొరికారని కరోనా ఖుషీ అయ్యిందట.సురాపాన, మద్యవ్యాపార ఆదాయం చాలా పెద్దది.ఎవరూ సారాయిని బాహాటంగా సమర్ధించకపోయినా,తాగకపోయినా దాన్ని నిషేధించలేరు. సారాయిలో సక్రమ అక్రమ అనే తేడాలే లేవు. కొందరు నాయకులు మాత్రం మద్యనిషేధం సాధ్యం కాదుఅంటున్నారు. మన రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచి తాగుబోతులు గుమికూడటానికి ఆస్కారం ఇచ్చారు. ప్రతి ఏడాదీ 20 శాతం చొప్పున వైన్‌ షాపులు తగ్గించేస్తామన్నారు. 4,380 షాపులను 2934 కు కుదించటం మంచి పనే.సంపూర్ణ మద్య నిషేధం మహిళాలోకంతో పాటు ఎందరో సంతోషించే పని. లిక్కర్‌ ధరలు 25 శాతం పెంచినా తాగుబోతులు ఆగలేదు. లిక్కర్‌ లేనందున లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డు ప్రమాదాలు, గృహహింస, పలు రకాల నేరాలు బాగా తగ్గాయి. మద్యం తాగటం వలన వ్యాధులొస్తాయని అందరికీ తెలుసు . మద్యం అమ్మకాలవలన తప్పనిసరిగా మద్యంరోగుల కేసులు పెరుగుతాయి.సమస్త నేరాలు కూడా పెరుగుతాయి. తాగుబోతులకు మళ్ళీ ఆరోగ్యశ్రీ ఎందుకు? బ్రాంది షాపులకు వెళ్లే వారికి షాకిచ్చేలా ఆంధ్రాలో 75 శాతం ,తెలంగాణ లో 11 శాతం పెంచారట.అయినా తాగుబోతులు తగ్గలేదు.మద్యం కొనుగోలు చేసేవారికి ఆరోగ్యశ్రీ ,రేషన్ కార్డు, పెన్షన్ లాంటివి ఆపాలి అంటున్నారు కొందరు. ఏమి ఆపినా తాగుబోతులు ఆగరు అంటున్నారు మరికొందరు.మద్యం అమ్మకాలను నిషేధించలేమని ఆన్ లైన్ లో ఇళ్లకే సప్లై చేయండి అని సుప్రీం కోర్టు కూడా తేల్చేసింది
96 శాతం తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం కోరితే అది మెజారిటీ ప్రజాభిప్రాయంగా ప్రభుత్వం శిరసావహించింది.తెలుగుమాధ్యమాన్ని కోరే జనం తక్కువైపోయారు కాబట్టి మౌనం దాల్చింది.చివరికి కేరళ ముఖ్యమంత్రి పినరయి లాంటి వాళ్ళు కూడా మద్యము దానివలన వచ్చే ఆదాయమూ కావాలనే అంటున్నారు. ఏసుక్రీస్తును శిలువ వెయ్యండి.బరబ్బా అనే దొంగను విడుదల చెయ్యండి అనే మెజారిటీ ప్రజల అభిప్రాయానికి పిలాతు,హేరేదు తలవంచారు. మాకు మద్యమే కావాలనే తాగుబోతులు చెబుతున్న మద్య ఆదాయ లెక్కలు సినిమాలలో డైలాగులు కూడా అయ్యాయి.ఛీ తాగుబోతుల కోసమా ఇన్నాళ్ళూ నేను సానుభూతి చూపించింది?అని కొంతమంది మనసు మార్చుకున్నారు. భౌతికదూరం అనే మోదీ మాటలు బ్రాందీ షాపుల ముందు పోలీసులు అమలు చేయలేకపోయారు. కోకోకోలా, థమ్సఆప్‌‌ లాంటి కూల్ డ్రింక్స్ లో పురుగుమందులు కలిశాయని తెలిసినా వాటిని త్రాగటం ఆపారా? తాగి తాగి పోతావురాఅంటే , పోనివ్వండీ ఎదవ ప్రాణం ఎప్పటికైనా పోవలసిందేకదా? భోపాల్ లో మిథైల్ ఐసో సైనేట్ , విశాఖలో స్టీరీన్,కోనసీమలో ఓఎన్ జీసీ గ్యాస్ లీకై నిముషాల్లో జనం ప్రాణాలు పోలేదా? మద్యం అంతకంటే విషమా? దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు అన్నట్లు కోటిరూపాయలు ఇచ్చైనా సరే సారాయి దుకాణాలను , తాగుబోతులను కాపాడుటకు ప్రభుత్వముంది కదా? తాగుడూ ఉండాలి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కూడా ఉండాలి.ఇక్కడ చస్తే కదా మరోచోట పుట్టేది? అనివార్య మైన నిరంతర ప్రక్రియ ఇది. తప్పించ వీలుకాని జనన మరణాల చక్రము ఆగదు!ఆగకూడదు అంటాడు.
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266