ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, జూన్ 2020, గురువారం

దేహమేరా దేవాలయం! జీవుడే సనాతన దైవం!


దేహమేరా దేవాలయం! జీవుడే సనాతన దైవం!
1986 లో వచ్చిన మెదడు వాపు వ్యాధికూడా కరోనా లాగే జనాన్ని కలవరపెట్టింది. ఆనాడు ఆ విచిత్ర వైరసు పందులలో పెరిగి దోమల ద్వారా వ్యాపిస్తున్నట్లు వైద్యులు విన్నవిస్తే వైరస్ కు కారకములైన వరాహములను దోమలను వధించండి అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అధికారులను ఆజ్నాపించాడు. దోమల్ని నిర్మూలించటం తమ తరంకాదని అందరూ పందులమీదపడి వేటాదారు.అప్పట్లో ఎరుకల వాళ్ళ సంఘం హైకోర్టుకువెళ్లి పందుల్ని కాపాడుకొంది.కొన్నిచోట్ల ఆలయాల్లో మూలవిరాట్టులకు భక్తజనులు ఉన్నిబట్టలు, చలికోట్లు, టోపీలు అలంకరించారు. ‘ఈశ్వరుడే సత్యం ,సత్యమే ఈశ్వరుడు’ అనే భక్తుల విశ్వాసాల నుండి సగుణారాధన ,నిర్గుణోపాసన పుట్టాయి. ప్రార్థనల కోసం దేవాలయాలు , పూజల కోసం, దేవతా విగ్రహాలను ప్రతిష్టించారు. దేవుడంటే ఒక నమ్మకం, ఒక మానసిక స్థైర్యం. గుడి,చర్చి, మసీదు అని పిలిచే పేరులో మార్పు తప్ప...భావం ఒక్కటే. దేవాలయానికి వెళ్లడమంటే ప్రాపంచిక విషయాలను పక్కనబెట్టి నిర్మలమైన హృదయంతో దేవుని ముందు తనను తాను ఆవిష్కరించుకోవడం. కరోనా ప్రభావంతో మూతబడిన దేవాలయాలు చాలా వరకు తెరుచుకున్నాయి. భక్తులంతా మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకుంటున్నారు. 4.5 లక్షల మందిని చంపిన కరోనాను మహమ్మారి అని కొందరు , కరోనా దేవత అని కొందరు పూజలు చేస్తున్నారు. అయితే దైవ దర్శనానికి వెళ్లిన వారిని కూడా కరోనా వదలడంలేదు. మనిషి పుట్టినప్పటినుండి కోట్లాది జీవకణాలను తయారుచేసిన దేహం ముసలితనంలో ఆగిపోతుంది.ఇక్కడ ఆగితేనే మరోకచోట పుట్టటం సాధ్యం కాబట్టి మరణమే పునర్జన్మకు సోపానమని కొందరు ఆధ్యాత్మిక వాదులు అంటారు.చావబోయేవాళ్లు చనిపోయిన వానికోసం ఏడుస్తున్నారు ,ఎవరి చావుకూ బాధపడకూడదని శంకరాచార్య సలహా ఇచ్ఛాదట..కానీ మామూలు మనిషికి అంత తెలివి ఎక్కడిది?దుఖిస్తూనే ఉంటాడు.
జగన్నాధుడికి జ్వరమొస్తే దశమూలికా వైద్యం చేశారట.మక్కా ,జెరూసలేము ,కాశీ, అయోధ్య ,తిరుపతి లాంటి అన్నీ ప్రాంతాలను కరోనా వైరస్‌ కమ్మేసింది. లక్నో లోని దేవాలయంలో దేవుడికి కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతో శివలింగానికే మాస్క్‌ వేసేశాడో పూజారి.'చిత్తం శివుడి మీద, మనసు చెప్పుల మీద' అన్నట్టుగా భక్తుల మనసు దేవుడికంటే ఎక్కువ కరోనా మీద ఉంటోంది.గుడిని దేవుడినీ నమ్ముకొని భక్తులు వస్తే భక్తులను నమ్ముకొని ఎంతోమంది వ్యాపారులు బతుకుతూ ఉంటారు.వ్యాపారం నడవాలంటే ప్రజలే భక్తులై రావాలి.దేవుని దర్శనం తర్వాత కాసేపు గుడిలో కూర్చోవాలని చెప్పిన ఆగమ శాస్త్రం కరోనా నయం చేయటం ఎలాగో చెప్పలేదు.వైద్యానికి డాక్టర్లే కావాలి.ఇంతటి దయనీయ స్థితిలో కూడా కొట్లాటలు,తుపాకీ కాల్పులు ఆగలేదు.భారత చైనా దేశాల సైనికులు కొంతమంది చనిపోయారు. యుద్ధం చేసి తలలు తెగవేయగలము , తెగిపోయిన తలలను తిరిగి అతికించగలముగానీ తిరిగి ప్రాణంపోయలేము.ఆస్థాయికి నేటికీ వైద్యవిద్య ఎదగలేదు.యుద్ధం ఇరుదేశాలకు నష్టమే.తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి, శ్రీకాళహస్తి ఆలయంలో పూజారికి కరోనా సోకింది. గుంపులు గుంపులుగా చేరిన హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరినీ కరోనా వదలటంలేదు. తబ్లిగి వెళ్లొచ్చిన కరోనా ముస్లిముల కంటే మరింత ఎక్కువగా మహమ్మారిలా కరోనా వ్యాపించింది.ట్రంప్ చర్చీలు తెరవాల్సిందే అన్నాడు. ఇక్కడ కూడా దేవాలయాలు, చర్చిలు, మసీదులు తెరవడానికి అనుమతి ఇచ్చారు. దేవుడు వరమిచ్చినా కరోనా వరమివ్వలేదు.దేవుడి తర్వాత దేవుడిగా, దేవుడి ప్రతిరూపాలుగా చెప్పుకునే పూజారులకే కరోనా వచ్చి డాక్టర్లదగ్గరకు వెళుతున్నారు.రెడ్.ఆరంజ్,గ్రీన్ జోన్లు లేవు.అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. చస్తే కరోనా, బతికితే డయేరియా అంటారు. స్కూళ్లు, కాలేజీలు తెరవడానికి కూడా భయపడుతున్న సమయం ఇది. కరోనా వచ్చిన చోట ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూస్తున్నారు. ఇళ్లదగ్గరే ఉండి పనిచేయమంటున్నారు.పూర్వంలాగా సినిమా హాళ్ళకు జనం రారు.పిల్లలను ఎక్కువగా కనరు.విదేశాలకు,రాష్ట్రాలకు వలసలు పోరు.అందరికీ ప్రాణ భయం ఏర్పడింది.బలుసాకు తినయినా బతికుంటే చాలు అనుకుంటున్నారు.ఏది ఏమైనా కరోనా కు టీకారావాలి. మందుకనుక్కోవాలి. ఇప్పుడే దేవాలయాలు తెరవడం అనవసరం. భక్తులు భయం భయంగా దేవాలయాలకు వెళ్లకూడదు. కరోనాను తెచ్చుకోకూడదు. అమ్మలారా నాకోసం ఏడ్వకండి , మీకోసం మీబిడ్డలకోసం ఏడవండి అనే ఏసుక్రీస్తు మాటలు అందరికీ గుర్తొస్తున్నాయి. కాదనటానికి లేదు.దేవుడు సర్వాంతర్యామి,సర్వోపగతుడు అని నమ్మితే ఆయన్ని చూడటానికి ఎక్కడికీ వెళ్ళనవసరంలేదు. ఇందుగలడందులేడను సందేహము వలదు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అని ప్రహ్లాదుడు లాగా హృదయంలోనే దర్శించుకోవాలి.దేవాలయాలకు కూడా కరోనా కాలంలో గుంపులుగా వెళ్లకూడదు. కరోనా తగ్గేవరకూ ఆగుదాం.
1985 దేవాలయం సినిమాలో వేటూరి రాసిన పాటలోని మాటలను ఓదార్పుకోసం అదేపనిగా గుర్తుచేసుకుందాం;
శిలా గోపురం ఆలయమా? శఠగోపురమే అర్చనమా?
దేహమేరా దేవాలయం! జీవుడే సనాతన దైవం!
నేనే బ్రహ్మ ,నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే
ఏ అర్హత నాకుండాలీ? ఏ అధికారం కావాలీ?
అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి
--నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

13, జూన్ 2020, శనివారం

కపట వైఖరి వద్దు


కపట వైఖరి వద్దు (సూర్య 14.6.2020)
గడ్డి తినైనా సరే గండ్ర గొడ్డలి కొని తీరుతానని శపథం చేసిన దుష్టులను నీతి బోధతో ఎవరాపగలరు ? ఖానేకు నహీ ఎల్లీకి బులావ్ అన్నట్లుగా కొన్ని దేశాలు ఆయుధాల సేకరణ కోసం తలకు మించిన బరువును ఎత్తుకుంటున్నాయి. మన దేశం కూడా వేల కోట్ల రూపాయలు రక్షణ రంగానికే వ్యయం చేస్తున్నది. ఈ ఖర్చు మీద ఎలాంటి ఆడిట్ ఉండకపోవటం, రక్షణ ఖర్చులన్నీ రహస్యంగా ఉండటం,భారీగా ముడుపులు ముట్టడం లాంటి ఆశాజనకమయిన విషయాలు రాజకీయ నాయకులకు ఉన్నందువల్ల పొరుగు దేశాన్ని బూచిగా చూపించి, ప్రజల్ని భయపెట్టి, పొరుగు దేశాన్ని తిట్టడం ద్వారా దేశభక్తిని ప్రదర్శించి, ఓట్లు రాబట్టి, తమ పదవులను నిలుపుకొని, ఆదాయం పొందటానికి అతి అనువుగా ఉంది ఈ రక్షణ రంగం.ఆయుధాల తపన ఆగిపోతే మిగిలే డబ్బుతో ఆకలి చావుల్ని ఆపవచ్చు.అడుక్కుతినే వాళ్ళను అరికట్టవచ్చు. అక్షరాస్యతను పెంచవచ్చు. ఇల్లు కట్టించవచ్చు. ఇంకా ఎన్నో చేయవచ్చు. అయితే ఈ అత్యవసరమయిన పనులన్నిటినీ అవతల పెట్టి ఆయుధాలు కొంటున్నారంటే అర్ధం ఏమిటి ? చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఇప్పుడు 179 బిలియన్ డాలర్లు చేసిందట.. భారతదేశ రక్షణ కేటాయింపులతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువట. స్వార్ధమా పరమార్ధమా ? ఎందుకీ ఆయుధ పిచ్చి ?
ఆగ్రరాజ్యాలు అని మనం ముద్దుగా పిలుచుకొనే అన్నలు ఎప్పుడైనా ముఖాముఖీ తలపడ్డారా? పైగా మోహరించిన బలగాలను తొలగించుకుంటూ పరస్పరం సుహృద్భావ పర్యటనలు జరుపుకొంటున్నారు.మధ్యలో పిచ్చిపట్టి తన్నుకుంటున్న వర్ధమాన దేశాలకు బుద్ధిలేనట్లే గదా! తోటివాడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాల్సిందేనంటారు గానీ ఏ దేశంలోనూ విశ్వమానవత వినరాదు.
కోడిని కోసి గోత్రానికంతా పగ అయినట్లుగా పాకిస్తాన్,చైనా,ఉత్తర కొరియా మొదలైన దేశాలు పరిసర దేశాల ఆగ్రహానికి గురి అయ్యాయి.ఒక్కో దేశానికి ఒక్కో కారణం. స్నేహం సజావుగా సాగితేనే స్నేహం. కలిసినప్పుడు కృత్రిమంగా నవ్వుకోవటం, చాటున గోతులు తవ్వుకోవటం. లేకపోతే ఎవరికైనా చెప్పి ఏడ్చుకోవటం, ఇవన్నీ కొంపలు ఆర్పుకునే పద్ధతులే. ఇలాంటి దొంగ స్నేహంకంటే నిర్మొహమాటమయిన ఎడబాటే మేలు. క్రికెట్ అనీ, సార్క్ అనీ పాకిస్తాన్ ను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు అనుభవం మీద మానేశారు. చైనా చేపట్టిన 'బెల్ట్‌ అండ్‌ రోడ్డు ఇనీషియేటివ్‌'లో ఇండియా చేరలేదు. భారత–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వివాదాస్పద సరిహద్దులనుంచి ఇరు దేశాల సైన్యాలూ 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయట. మన దేశం అమెరికాతో సన్నిహితం కావడం చైనాకు నచ్చడం లేదు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో తన ప్రయోజనాలను దెబ్బతీసేలా అమెరికా పావులు కదుపుతోందని, అందులో భారత్‌ భాగస్వామిగా మారుతోందని చైనా ఆందోళన. ఈ సరిహద్దు వివాదం 1962లో యుద్ధానికి దారి తీసింది. బ్రిటిష్‌వారు గీచిన మెక్‌మోహన్‌ రేఖను తాము ఎలా గుర్తిస్తామని చైనా వాదిస్తుంటే, వాస్తవాధీన రేఖ అస్పష్టంగా ఉందని భారత్‌ వాదిస్తున్నది. ఏ దేశంపై ఏ దేశానికీ నమ్మకంలేదు.రెండు దేశాల మధ్య తగాదాను ఆసరా చేసుకుని వాటిమధ్య తల దూర్చటం ఇద్దరికీ ఆయుధాలు అమ్మటం అమెరికా ఎత్తుగడ..డొనాల్డ్‌ ట్రంప్‌ దీనిలో మధ్యవర్తిత్వం వహిస్థానంటే భారత్‌, చైనా రెండూ వద్దన్నాయి.అన్ని దేశాలపై ఆయుధాల ఖర్చు తగ్గాలి. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద జనాభా దేశాలు చైనా ఇండియా.దేశాలమధ్య మైత్రి సరుకులపై సుంకాలను తగ్గించి ప్రపంచ వ్యాపారాన్ని పెంచుతుంది. భారత్‌, చైనా మధ్య మైత్రీబంధం బలోపేతం కావడం ఇరు దేశాలకు ఉపయోగకరం. పరస్పర స్నేహము,ఇరుదేశాలకు మేలు.
---నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

9, జూన్ 2020, మంగళవారం

సమభావం, సమధర్మం సహజీవనమనివార్యం

సమభావం, సమధర్మం సహజీవనమనివార్యం
(సూర్య లో నా సంపాదకీయం 9.6.2020)
 
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ పెదవివిరిచాడు. కాకి చనిపోతే కాకులన్నీ గుంపుగా చేరి గోల చేస్తాయి. మానవత్వం ఉన్న మనుషులు కూడా అంతే. అలెక్స్ హేలీ రాసిన రూట్స్ ఏడుతరాలు అనే తెలుగు నవలగా వచ్చింది.తెల్లవాళ్లు అమెరికా నుంచి ఆఫ్రికా వచ్చి నల్లవాళ్లను బానిసలుగా పట్టికెళ్లటం కొన్నితరాలపాటు నల్లవాళ్లు బానిసలగానే అమెరికాలో బ్రతకటం చదివితే దుఖం వస్తుంది.అమెరికాలో బానిసత్వాన్ని భరించలేక తిరగబడి పారిపోయి వచ్చిన బానిసలను వెతికి పట్టుకొని మళ్లీ బానిసత్వం లోకి పంపించడానికి 1700 సంవత్సరాల్లో బానిస గస్తీ దళాలు ప్రారంభమయ్యాయి.1868లో బ్లాక్‌ కోడ్స్‌ను పూర్తిగా రద్దు చేసి నల్ల జాతీయులకు కూడా సమాన హక్కులు కల్పించారు. అంతర్జాతీయంగా జాతి వివక్షపట్ల నిరసన వ్యక్తం చేసి సమానత్వం కావాలన్నారు మేధావులు. విధికి లోబడి తనకు తెలియకుండానే మనిషి చెడ్డ పనికి పూనుకొంటాడని భగవద్గీత 18:60 వ శ్లోకం చెబుతోందట. అర్జునుడు తన ఇష్టము లేకనే అస్వతంత్రముగ యుద్ధము చేశాడట.జనమేజయుడు తనకు ఇష్టంలేకపోయినా మాయ ప్రభావంతో బ్రాహ్మణ సాధువు తల నరికాడట.1968లో నల్లజాతీయుడు డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ను హత్య చేశారు. ఇప్పుడు ఫ్లాయిడ్‌ను హత్య చేశాడొక అమెరికన్ పోలీస్‌. ఎవరు ఏమిచేసినా పోయిన ప్రాణం తిరిగిరాదు.చంపకుండానే ఉండాలి. చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కెనేని పొసగమేలుచేసి పొమ్మనుటే చాలు అన్న వేమన సూత్రాన్ని ఈ లోకంలో ఎంతమంది పాటిస్తారు?ఫ్లాయిడ్ ప్రాణం తీసేంతగా చేసిన తప్పు ఏమిటి? అని నల్లవారు అడుగుతున్నారు . విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేసిన వాళ్ళంతా ఫలితంగా తిరుగుబాటును చూశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ బంకర్‌లో దాక్కోవలసి వచ్చింది. సైన్యాన్ని ప్రయోగిస్తాడట. ఇదికూడా విధి రాతయేనా? దేశాధిపతి అయినా జనాగ్రహం ముందు దుర్బలుడే. నిరసనకారులంతా దొంగలని, నిరసనకారులు వైట్‌హౌస్‌లోకి వచ్చినట్లయితే వారిపైన క్రూరమైన కుక్కలు దాడిచేసేవని, అలాగే సీక్రెట్‌ సర్వీస్‌ భద్రతా దళాలు ఆయుధాలను ప్రయోగించేవారని లూటీలు కొనసాగితే కాల్చిచంపుతామని ట్రంప్ అన్నారు. సహనంతో కలిసి బ్రతకాలనే సాధు శాస్త్రాలు మూగబోయాయి. కులము,మతము,రంగును బట్టి వివక్ష చూపేది మానవత్వాన్ని మంటగలిపే నీచ సంస్కృతివద్దు అని పెద్దలు గతంలో ఎంత చెప్పినా రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి.అసలు యుద్ధం జరగని దేశమంటూ ప్రపంచంలో లేదేమో! పేరు ధర్మరాజు అని పేరుగాంచిన పెద్ద మనుషులు కూడా సహనభావం లోపించి కయ్యాలు తెచ్చుకుంటున్నారు. యుద్ధకాంక్షతో రగిలిపోయే వీరులలో యుద్ధ ఆవేశాన్ని తగ్గించి పూర్వం సుందరాంగులు తమ అందచందాలతోశాంతి సహన భావాలను మేల్కొలిపేవారట.ఇప్పుడు ఆ శ్రుంగార భావనలు,విషకన్యలు ఉపయోగించటం లేదు.పట్టరానికోపం,అహంకార ఆధిపత్య ధోరణులు, వివక్ష,ఏదో ఒక సాకుతో రగిలిపోవటం , ప్రతిఘటన కొన సాగిస్తున్నారు.అమెరికా,ఆఫ్రికా, అరేబియా.ఖండాల దేశాలలో అసహనం ఇలా ఉంటే , మనదేశంలో కుల వివక్ష ,అంటరానితనం దుర్మార్గంగా కొనసాగిన రోజులున్నాయి. ఈ కరోనా అందరినీ అంటరానివాళ్లను చేసింది. అయినా ఈ దుర్మార్గాలు ఇంకా దేశాన్ని పూర్తిగా వదలలేదని అడపాదడపా వార్తలు వస్తున్నాయి.కొన్ని చోట్ల దేవాలయాలలోకి రానివ్వలేదని బాధపడుతున్నారు.కొన్నిచోట్ల కులాంతర వివాహితుల్ని చంపారు. కొన్నిచోట్ల చెరువునీళ్లు తీసుకొనివ్వకపోవటం లాంటి దౌర్జన్యాలు జరిగాయి.సోషల్ మీడియాలో ఈ కదనాలు వస్తూనే ఉన్నాయి.
లౌకికవాదం,సమసమాజ స్థాపన కోరిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తానే స్వయంగా అస్పృశ్యత వివక్షలను ఎదుర్కొన్న బాధితుడు.చివరికి బౌద్ధాన్ని స్వీకరించాడు. ఇతర రాష్ట్రాలలో ఎంతోమంది మహనీయులు కుల మత వివక్షలను పోగొట్టటానికి ఎన్నో నవలల్లో, సినిమాల్లో దుయ్యబట్టి హితబోధ చేశారు. తెలుగునాట మన రచయితలు,మహానుభావులు గొప్ప సందేశాలను ప్రజలకు అందించారు. అల్లకల్లోల సమయంలో వాటిని ఒకసారి మనమూ గుర్తుతెచ్చుకుందాం: “మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండే కులములు / మంచి అన్నది మాల అయితే మాల నేనౌతాను” అన్నాడు గురజాడ. “జాతిబేధము కలుగదు నీతికెందు:పాపపుణ్య విబేధ భావమున పొసగు:ధర్మశీలురు నిర్దయాత్మకులు ననడు:రెండే జాతులు మరి వేరొకండు లేదు”.(1937 బాల యోగిని) “మాలలు మాత్రం మనుజులు కారా? మనుజుల విభజనమేలా?” (1938 మాలపిల్ల) "జాతి బేధం సమసిపోదా జనులు సుఖమందా?నీతిలేని పాడు సంఘం నిజము కనుగొనదా?సాటివారి సమత చూచే కాలమేరాదా ?నీవనీ నేననీ బేధమే విడనాడదా ? (1954 సంఘం - తోలేటి) “చిదంబరములో శివుని దర్శనం చేయగరాదనే పూజారి/అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించే “ (1958 జయభేరి - శ్రీశ్రీ) "అంటరానితనము – ఒంటరితనము,/అనాదిగా మీ జాతికి అదే మూలధనము,ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం,తెలుసుకొనుట మీధర్మం"(1972 మంచి రోజులు వచ్చాయి -దేవులపల్లి కృష్ణ శాస్త్రి) “బానిసభావం విడనాడి ,ఏజాతి నిలుచునో అది జాతి” (1973 గాంధీ పుట్టినదేశం - మల్లవరపు గోపి).
మీరూ ఇలాంటి పాటల చరణాలను ఎన్నో చెబుతారు. ఒక్క సినిమా రంగంలోనే జ్నానము తెలిసిన తెలుగు పెద్దలు ఇన్నివిధాలుగా వాపోయారు,ఇప్పటికీ వాపోతూనే ఉన్నారు. మనదీ పెద్ద చరిత్రే. దేశంలో ఎన్నోచోట్ల కులహత్యలు ,అణచివేతల వార్తలు ఈనాటికీ వస్తున్నాయి.దేశ సంపద సృష్టికర్తలైన కూలీలకు వందనాలు ఆర్పిద్దాం. ప్రపంచంలో వివిధ జాతులు కులాలు మతాల మనుషులు మర్యాదగా గౌరవంగా సురక్షితంగా బ్రతకాలి. కాబట్టి మనుషులంతా కలిసే బ్రతకాలి. మానవజాతుల మధ్య సమభావం,సమధర్మం,సహజీవనం తప్పదు.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266