ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, ఆగస్టు 2020, శనివారం

కూతుళ్లకూ సమాన ఆస్తిహక్కు

కూతుళ్లకూ సమాన ఆస్తిహక్కు (సూర్య 16.8.2020)
సృష్టిలో సగభాగం స్త్రీ అంటారు.నరుని పక్కటెముకలోనుంచి తీసినది కాబట్టి నారి అన్నారు. కులుకు మిటారి, బంగరు బొమ్మ, కప్రంపుదిమ్మ, అన్నులమిన్న,సంపెంగగున్న, వన్నెల దొంతి, మువ్వల బంతి, రతనాల తేట, వరాల మూట, పండు వెన్నెల సౌరు, వలపుల మొక్క, మేలు తలపుల చుక్క అని అతివ ను అందమైన పేర్లతో పొగిడారు. కానీ వేల ఏళ్లపాటు ఆమెకు పురుషునితోపాటు సమాన ఆస్తి హక్కు ఇవ్వలేదు. కట్నాలు ఎన్ని ఇచ్చినా ఆడవాళ్ళకు సరైన రక్షణలేదు. స్త్రీ, పురుష సమానత్వం కోసం ఎన్ని చట్టాలు వచ్చాయో? గృహహింస,దిశ ,నిర్భయ లాంటి చట్టాలు అనేకం వచ్చాయి. తండ్రి ఆస్తిలో మగ పిల్లలతోపాటు ఆడపిల్లలకు కూడా సమాన వాటా రావాల్సిందేనని మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఎటువంటి ఆస్తీ లేక జీవితం దుర్భరంగా తయారయిన విధవరాళ్ళకు కూడా ఇది ఎంతో మేలు చేసే తీర్పు.ఇన్నాళ్లూ భారతీయ స్త్రీలు“పతి పద సేవయే యోగముగా నాతికి పతియే దైవముగా “ అన్నారు. ఆలయమేలా ? అర్చన లేలా ?ఆరాధన లేల ?పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా ?అదే పరమార్ధము కాదా ?అని పాడారు. అసలు నిజం తెలుసుకున్న కొందరు పురుషులు మాత్రం “ఆలయన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి”అని భార్యలను దేవతల్లాగా చూసుకొంటున్నారు. స్త్రీలను పూజించే చోట దేవతలు నడయాడతారనే సూక్తిని పాటిస్తూ ఇంటికి దీపం ఇల్లాలే అంటున్నారు.బెంటింగ్ లాంటి మహనీయులు సతీ సహగమనాన్ని రూపుమాపారు. గురజాడ , కందుకూరి వీరేశలింగం లాంటి మహనీయుల తీవ్రకృషి వల్ల మన రాష్ట్రంలో బాల్యవివాహాల పీడ విరగడయ్యింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు కారల్‌ మార్క్స్‌. ఆడపిల్లలకు ఆస్తులు పంచాల్సి వచ్చినప్పుడు ,వారసుల మధ్య ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు మనుషుల అసలు రంగు బయటపడుతుంది. 1937 వరకూ పెళ్లి కానుకలు మాత్రమే స్త్రీ ధనంగా ఆమెకు దక్కేవి.వితంతువుకు భర్త ఆస్తిని అనుభవించే హక్కు మాత్రమే ఉండేది. కానీ దాన్ని అమ్ముకునే హక్కు లేదు. మహిళ లను పూజించనక్కరలేదు ,తోటి మనిషిగా గుర్తించి, వారికి పురుషులతోపాటు సమాన హక్కులు ఇస్తే చాలని అంబేద్కర్ అన్నారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు ఆస్తి దక్కాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్‌ బిల్లును తయారుచేశారు.ఆ బిల్లు ఆమోదం కోసం ఆనాడే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1986లో ఎన్‌టీ రామారావు ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పించారు.ఉద్యోగాల్లో ఆడవాళ్ళకు 30 శాతం, రాజకీయాల్లో 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు.తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా ఈ చట్టాలు తీసుకొచ్చాయి. స్త్రీలకు భూమిపై యాజమాన్య హక్కు రావటం గొప్పమార్పు.ఆమెకు చాలా కాలానికి ఓటు హక్కు ఇచ్చారు.ఆమెకు నేటికీ భూమిపై సరైన హక్కులు లేవు.85 శాతం వ్యవసాయ భూమి పురుషుల పేరుతో ఉంటే 15 శాతం భూమి మాత్రమే స్త్రీల పేరుతో ఉందట.సగం జనాభా స్త్రీలే ఉన్నప్పటికీ స్త్రీలకు భూమి పై హక్కులు వారి జనాభాకు తగ్గట్లు రాలేదు.మిగతా స్త్రీలకు భూమిపై హక్కులు ఎప్పటికీ వస్తాయో ?ఆమె సంపాదనంతా కుటుంబ పోషణ ,పిల్లల చదువుల కోసమే సరిపోతోంది.ఇండియాలో 43 శాతం మంది వ్యవసాయ కూలీలు మహిళలే ఉన్నారు. వారికున్నది 2 శాతం భూమి మాత్రమే.వారిది తీవ్రమైన పేదరికం,చాలీ చాలని కూలి. ఇటీవల ఒంటరి మహిళలకు పెన్షన్,అమ్మఒడి,చేయూత కార్యక్రమాలతో స్త్రీలకు ఆర్ధిక సాయం చేస్తున్నారు.రేషను కార్డు,భూమి ఇల్లు పట్టాలు మహిళ పేరుతో ఇస్తున్నారు.భూమిపై స్త్రీల యాజమాన్య హక్కులు పెరిగేకొద్దీ కుటుంబాల ఆర్ధికాభివృద్ధి జరుగుతుంది.భర్త భూమిలోనే ఎన్నేళ్లు పనిచేసినా భార్యపేరిట భూమిని మార్చరు.ఆడదాని పేరుతో ఆస్తి తరిగిపోతుందని,ఆమెకు అక్కరలేదనే భావన తరతరాలనుండీ పేరుకుపోయింది
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ ,
కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు,
కన్నకడుపున చిచ్చురగిలెనా కరువులపాలౌను దేశం అన్నారు సినారె.
దేశంలోని మహిళలందరికీ మేలు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ దివ్యమైన తీర్పు పట్ల హర్షిద్దాం !
--నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

 

5, ఆగస్టు 2020, బుధవారం

జిల్లాలతోపాటు జోనులూ కావాలి

జిల్లాలతోపాటు జోనులూ కావాలి (సూర్య 13.8.2020)
జోన్లు ఏర్పడ్డాకే రాజధానుల తరలింపు జరుగుతుందని జగన్మోహనరెడ్డి చెప్పారు.జోనులు ఏర్పాటు చేస్తామనటం మంచి ఆలోచనే.మూడు రాజధానులు,సీఆర్ డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు యధాతదస్థితి ని విధించింది.ఒక్క రాజధానినే కట్టలేనప్పుడు మూడు రాజధానులు ఎందుకు? అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని భూములిచ్చిన రైతులు వేడుకొంటున్నారు.కేంద్రాన్ని జోక్యం చేసుకోమంటున్నారు.అమరావతి కోసం పూజలు హోమాలు చేశారు.ప్రజలు మూడు ప్రాంతాలలో కూడా మాకేంటి అని అడుగుతున్నారు.జోనులుపెట్టి అమరావతితోపాటు మిగతా ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని ఎమ్మేల్యేలు కోరుతున్నారు. జిల్లాలంటే అందరికీ తెలుస్తోందికానీ ఈ జోనులంటే ఏమిటో ప్రజలకు పూర్తిగా తెలియలేదు. 1972 జైఆంధ్ర ఉద్యమానికి విరుగుడుగా ఏర్పాటు చేసినవే ఈ జోనులు. విశాఖపట్నం రైల్వే జోను లాంటివే ఈ జోన్లు. ఏ జోనులోని ఉద్యోగాలు ఆ జోను వారికే ఇచ్చి స్థానికుల్ని సంతృప్తి పరచడమే జిల్లాలు,జోనుల ఏర్పాటు లక్ష్యం. 33 జిల్లాలు 9 జోన్లు తెలంగాణా లో ఏర్పాటు చేశారు కానీ ఆంధ్రలో ఆలశ్యమయ్యింది. జోనల్ ఆఫీసులంటే సచివాలయానికి జిల్లాలకు మధ్య బ్రాంచీల వంటివి,హైకోర్టుకు బెంచీలలాంటివి.జోనల్ అధికారికి సచివాలయ స్థాయి అధికారాలు ఉంటాయి. జోనల్ కార్యాలయాలతో సచివాలయ స్థాయి సేవలు కూడా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయి.పరిపాలనా వికేంద్రీకరణ కోసం తలపెట్టిన కొత్తజిల్లాల ఏర్పాటూ జోనుల ఏర్పాటు నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయి.హైకోర్టు,రాజధానుల తరలింపుకు సుప్రీంకోర్టు పార్లమెంటు ఒప్పుకోవాలి.కొత్తగా ఏర్పడే అరకు బాపట్ల అనకాపల్లి అమలాపురం హిందూపురం నంద్యాల నరసాపురం నరసరావుపేట రాజమండ్రి రాజంపేట తిరుపతి విజయవాడ జిల్లాలను కూడా ఈ నాలుగు జోనుల్లో సర్దాలి. జోనుల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటంటే అందరూ విశాఖకో కర్నూలుకో అమరావతికో ప్రయాణం కట్టనక్కరలేదు.ఎవరి జోన్ పరిధిలో వారికి పనులు జరుగుతాయి. నాలుగు జోనుల్లో కలక్టర్ల కంటే పైహోదా కలిగిన నలుగురు కమీషనర్లు రాజధానికి కలక్టర్లకు మధ్య వారధుల్లాగా పనిచేస్తారు.ప్రతిపనికి ప్రజలు రాజధానికి రాకుండా ఈ కలక్టర్లు,కమీషనర్లు జిల్లాలు,జోనులు వారీగా స్థానిక ప్రాంతాలలోనే ఉండి పనిచేస్తారు.కలక్టర్ల దగ్గర పనులు కానివాళ్లు కమీషనర్లను ఆశ్రయిస్తారు. జిల్లాల విభజనకూడా పూర్తయితే ఇంకా బాగుండేది.కొత్తగా కొన్ని జిల్లాలు వచ్చేవి. అన్ని డిపార్టుమెంట్లూ జోనల్ వ్యవస్థను అమలుచేస్తుంటే రెవిన్యూ డిపార్టుమెంట్ లో జోనల్ కార్యాలయాలు ఇప్పటికీ లేవు. జోనల్ కమీషనర్ జిల్లా కలక్టర్ కంటే పై స్థాయి అధికారి.కలక్టర్ల స్థాయిలో పనులు కాకపోతే రాజధానికి పోనక్కరలేకుండా జోనల్ కార్యాలయాలలో చాలా పనులు జరుగుతాయి.వాస్తవానికి మూడు రాజధాని నగరాలను కట్టడం కంటే ఒక్కచోటే నవనగరాలనిర్మాణం కంటే నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు పెట్టటం చవకైనపని , అన్నిప్రాంతాలకూ మరింత ప్రయోజనకరం.పూర్వం జోన్లు ఏర్పాటు చేశారు కానీ అన్ని శాఖలకు జోనల్ కార్యాలయాలను కట్టలేదు. జోనులవల్ల కలక్టర్లకంటే పై స్థాయి సచివాలయ అధికారులు నాలుగు జోనుల్లో నాలుగు ప్రాంతీయ కమీషనర్లుగా పనిచేస్తారు.జోనులు ఏర్పడితే రాజధానుల ప్రాధాన్యత చాలావరకు తగ్గిపోతుంది.ప్రజలు అందరూ రాజధాని సెక్రటేరియట్ కు వెళ్లాల్సిన అవసరం,ప్రయాణ భారం తగ్గుతాయి. అన్ని శాఖల్లో 95 శాతం పనులు జోనుల్లోనే పూర్తవుతాయి.జిల్లా కేంద్రాలు జిల్లా మధ్యలో,జోనుల కేంద్రాలు జోన్ మధ్యలో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది. శివరామకృష్ణ , జి.ఎన్.రావు కమిటీలు జోనుల ఏర్పాటుకు కూడా సిఫారసు చేశాయి.హైకోర్టుకు బెంచీలు పెట్టమన్నాయి. జోనల్ కేంద్రాలు జిల్లాల మధ్యలో దగ్గరగా ఉండాలని చెప్పాయి. ముఖ్యకేంద్రాలన్నిటికోసం ప్రజలు పోటీ పడుతున్నారు.జిల్లా కేంద్రాలకోసం పోటీ ,జోనల్ కేంద్రాలకోసం పోటీ,రాజధాని నగరాలకోసం పోటీ.విశాఖలోసచివాలయం పెడితే రాయలసీమ జిల్లాలకు దూరమని,కర్నూలులో హైకోర్టు పెడితే ఉత్తరాంధ్రకు దూరమని అక్కడి ప్రజలు తమ బాధను వ్యక్తంచేస్తున్నారు. బ్రాంచీలు పెరగటం ఆయా ప్రాంతాల సౌకర్యాలు పెంచటానికే. దగ్గరలో పనులు జరగటం వల్ల ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతుంది. పనులు త్వరగా జరగాలి అంటే పనివిభజన బాధ్యతల విభజన తప్పదు. విజయవాడ,రాజమండ్రి,తిరుపతి పట్టణాలు జిల్లా కేంద్రాలు కాకపోయినా ప్రజల వలసలతో గొప్పనగరాలు అయ్యాయి.నగరాలు ఏవీ ఒక్కసారి ఏర్పడవు.ఏళ్ల తరబడి పోగుబడిన అభివృద్ధే మహా నగరం. విజయవాడ సెంటర్ కాబట్టే అమరావతిని ఎంపిక చేసి వీలైనన్ని భవనాలూ కట్టారు.కట్టిన భవనాలను కూలగొట్టకుండా ప్రభుత్వం వినియోగం లోకి తేవాలి.భూములిచ్చిన రైతులు నష్టపోకుండా అగ్రిమెంటు ప్రకారం పరిహారం చెల్లించాలి.హైదరాబాదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి అంతా ఒకేచోట పొగుపడకుండా జోనుల మధ్య పంచాలి. ఇప్పటికే లక్షలజనాభాతో పెద్దదయిన తీర నగరంపై మరింత జనభారాన్ని మోపటం అనవసరం.ఎంతపెద్దనగరమైనా అది రైలు జంక్షను కాదు.ఒక అంచులో ఉంది. కర్నూలు కర్ణాటక అంచు లో ఉంటుంది . ఉత్తరాంధ్ర రాజధాని కోసం విజయనగరం మధ్యస్థానం , రాయలసీమ రాజధాని కోసం మధ్యస్థానం కడప . వీటిని రైల్వే జంక్షన్లుగా అబ్జివృద్ధి చెయ్యాలి. ఆతరువాత రాజధాని కేంద్రాలుగా వాటంతట అవే అభివృద్ధి చెందుతాయి. రాజధానుల అభివృద్ధికి దూరదృష్టి ఉండాలి. జిల్లా కేంద్రాలు పెరిగితే అన్ని చోట్లకు పెట్టుబడి పాకుతుంది. జిల్లా కేంద్రాలన్నిటినీ రైల్వే జంక్షన్లుగా మార్చాలి.మనకు అధిక జనాభాతో కిక్కిరిసిన మహానగరాలకంటే చిన్న పట్టణాలే మంచిదని కరోనా నేర్పింది. అష్టకష్టాలలో ప్రయాణం కుడా ఒకటి.ప్రయాణం అనుత్పాదకవ్యయం.ప్రజలకు ప్రయాణఖర్చు భారీగా తగ్గాలి.
1. ఉత్తరాంధ్ర విజయనగరం జోను: శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,అరకు,అనకాపల్లి 5 జిల్లాలు
2.మధ్యకోస్తాకాకినాడజోను:తూర్పు,పశ్చిమగోదావరి,కృష్ణా,రాజమండ్రి,అమలాపురం,నరసాపురం,విజయవాడ 8 జిల్లాలు
3.దక్షిణకోస్తా గుంటూరు జోను : గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, బాపట్ల,నరసరావుపేట 5 జిల్లాలు
4.రాయలసీమ కడపజోను:కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు,తిరుపతి,రాజంపేట,హిందూపురం,నంద్యాల 7 జిల్లాలు.
నాలుగు ప్రాంతాలకు మధ్యలో ఉన్న కేంద్రాలుగా విజయనగరం,ఏలూరు,ఒంగోలు,కడప నగరాలను చేయవచ్చు.ప్రాంతాలకు భౌగోళికంగా మధ్యలో ఉండటం కూడా ప్రాంతీయ కేంద్రానికి మంచి అర్హత. రాజధాని నగరాన్ని మరోచోటికి మార్చటం కంటే నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు పెట్టటం చౌక మరింత ప్రయోజనకరం.
అలాగే అమరావతిలో కొత్త కట్టడాల ఖర్చులను కుదించుకొని నాలుగు చోట్ల జోనల్ కార్యాలయాలను కట్టించాలి.అమరావతిలో కట్టిన భవనాలను వాడుకుంటూనే సమన్యాయం కోసం హైకోర్టుకు రెండు చోట్ల బెంచీలు పెడితే రాజధాని కోసం ప్రజలు రానక్కరలేని పరిస్తితి జోనులవల్ల వస్తుంది. ప్రజలు దూరం పెరిగితే భారమై మొరపెడతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎక్కడికక్కడే మాప్రాంతం రాజధానికావాలి ,ప్రాంతీయ కేంద్రం కావాలి అని పోటీ పడుతున్నారు. అందువలన నలువైపులనుండి ప్రజల రాకపోకలకు రైలు,రహదారి సౌకర్యాలు ఉండటమే మండల కేంద్రాలకు గానీ ,రాజధాని నగరానికి గానీ పెద్ద సంపద.జిల్లా కేంద్రాలను,జోనల్ కేంద్రాలను నిర్ణయించే ముందు పెద్దలు శాస్త్రీయంగా ప్రజల రోడ్డు,రైలు రవాణా సౌకర్యాల గురించి ఆలోచించాలి.
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

1, ఆగస్టు 2020, శనివారం

రిజర్వాయర్లు,బ్యారేజీలు, చెరువుల సంఖ్య పెంచాలి

 
రిజర్వాయర్లు,బ్యారేజీలు, చెరువుల సంఖ్య పెంచాలి
వరదలు అంతర్జాతీయ సమస్య.వరదలు,ప్రకృతి ఉత్పాతాలలో భారత్‌ ప్రపంచంలోని తొలి నాలుగు దేశాల్లో ఒకటి.దేశంలో 12 శాతం భూభాగం వరద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.అనేక నదుల వరదలు పంటలను మింగేస్తున్నాయి.వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రకృతి విపత్తుల నిర్వహణ వ్యయమంతా కేంద్రమే భరించాలని బిహార్‌ లాంటి రాష్ట్రాలు కోరుతున్నాయి.వరదలను ఆపటానికి నదులపై ఆనకట్టలు డ్యాంలు, బ్యారేజ్‌ లు కడతారు. చిన్నప్పుడు సాంఘీక శాస్త్రంలో బీహార్ దుఃఖదాయిని అని ఒకనది గురించి చెప్పేవారు. సినిమా న్యూస్ రీల్స్ లో బీహార్ లో వరదలు అని చెప్పే వారు. గంగానదిపై తెహ్రీ డ్యాం కట్టినా బిహార్‌ వరదలు ఆగలేదు.హరిద్వార్ నుంచి కోల్‌కతా దాకా వరదలే. కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము అని శ్రీనాధుడు ఆనాడు వరదలపాలైన పంటకోసం విలపించాడు.కృష్ణా గోదావరులలో నేటికీ వరదలు తగ్గలేదు.ఈ వరద నీటిని దాచుకొనే రిజర్వాయర్లు లేవు.ఎండాకాలంలో నీళ్ళ కొరత.ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో శ్రీశైలానికి ధవళేశ్వరానికి భారీ వరదలు రాబోతున్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు. నదుల్లో సంవత్సరాలుగా ఒండ్రు నిలవ పెరుకుపోతూఉంది. చితాభస్మాలు,కాలిన శవాలు,పరిశ్రమల మురికి,రసాయన వ్యర్ధాలు అన్నీ నదుల్లోకే వదులుతున్నారు.అయిదేళ్ళకో పదేళ్ళకో ఒకసారైనా నదులలో పూడిక తీయరు.వరదలద్వారానే పేరుకుపోయిన వ్యర్దాలన్నీ సముద్రంలో కలుస్తాయి. పూడికలు పోయి నదులకు నీరు పారే శక్తి పుంజుకుంటుంది.డ్యాములు,భారీ ఆనకట్టల ద్వారా వరదలు ఆపుతున్నారు కానీ ఒండ్రును కూడా ఆపుతున్నారు. డ్యాముల దగ్గర విపరీతంగా ఒండ్రు పేరుకుపోతున్నది. సముద్రంలోకి కొట్టుకు పోవడం లేదు.వరద వస్తేనే మురికి సముద్రంలోకి పోవటం. చుట్టుపక్కల పల్లపు ప్రాంతాలన్నీ మునిగిపోవటం జరుగుతున్నాయి.భారీ డ్యాములవల్లనే కొన్ని వరదలు వస్తున్నాయి. వరదలొచ్చినా కొన్ని నగరాలలో త్రాగు నీళ్ళు ఉండవు.ఏటా కురిసిపోయే వర్షాల్లో కేవలం ఎనిమిది శాతాన్నే పొదివి పట్టుకోగలుగుతున్నామన్న మోదీ జల సంరక్షణకు పూనుకోవాలి. దేశంలో 450 నదులు ప్రవహిస్తున్నాయి. కానీ ఆ నీళ్ళు తాగునీటి అవసరాలకు పనికిరావు. 60 కోట్ల భారతీయులు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. 84 శాతం జనావళికి కుళాయి నీళ్లు అందుబాటులో లేవు. 70శాతం జలాలు కలుషితమైపోయాయి. ఏటా రెండు లక్షలమంది జలకాలుష్యంద్వారా రోగాలపాలవుతున్నారు. తాగునీరు పొందడాన్ని ఈ దేశ పౌరుల జీవన హక్కుగా సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. నదులు ప్రాణమున్న చట్టబద్ధ జీవులని, మనిషికి ఉండే చట్టబద్ధ హక్కులన్నీనదులకు ఉంటాయని ఉత్తరాఖండ్ హైకోర్టు చెప్పింది. ఏటా కురిసే వాననీళ్లలో 70శాతం వృథాగా ఉప్పు సముద్రం పాలవుతూనే ఉంది. భూగర్భాన్ని నీటికోసం తొలిచేసి, ఆ వెలితిని పూరించటం లేదు. 160 జిల్లాల్లో భూగర్భ జలం ఉప్పు నీరుగా మారిపోయింది. 230 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ నీళ్లున్నాయి.కలుషిత జలం మానవాళి చరిత్రలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగమని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. యుద్ధవిమానాల కోసం లక్షల కోట్లు కేటాయిస్తూ ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కోసం వేల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు.
నీటితోనే మనిషి మనుగడ ముడివడి ఉంది. అతివృష్టి, అనావృష్టి తో జనజీవనం దుర్భరమై పోతోంది. దేశంలో భిన్న పరిస్థితులున్నాయి.ముంబై లో వర్షాలకు వరదలొస్తే , చెన్నై లో నీటి కరువు. అందువలన జాతీయ రహదారుల వల్ల దేశ రవాణా రంగానికి ఎంతో మేలు జరిగింది.అలాగే నిరంతరం నీరు పుష్కలంగా ఉండే జాతీయ నదులను కరువు నదులతో కలిపి గంగనీటిని కావేరీ దాకా తేవాలి.పట్టిసీమ నీటిని పంపులద్వారా ఎత్తిపోసి విజయవాడ తెచ్చారు.తెలంగాణా కాళేశ్వరం ప్రొజెక్టూ , మిషన్‌ కాకతీయ ఎత్తిపోతల ద్వారా తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల్ని పునరుద్ధరించారు.వరదనీళ్లను సర్దుకోటానికి ఊర చెరువులు , సాగు చెరువులు పెరగాలి. గ్రామాలకు చెరువులు దొరువులే ఆయువుపట్టు. దేశంలో అయిదు లక్షల అరవై వేలకు పైగా చెరువులు అయిదు లక్షలకు పడిపోయాయి. కబ్జాల పాలైన చెరువులు దొరువులను మున్సిపల్‌ ఆస్తులు’గా నమోదు చెయ్యాలి.చెరువులూ కుంటల్ని కాపాడుకోవాలి. చెరువులతోపాటు వాటికి నీటిని తీసుకొచ్చే కాలువలు, ఉప కాలువలూ అన్నీ ఆక్రమణల పాలైపోయాయి.
ఒండ్రువలన నదీగర్భం మట్టం పెరుగుతుంది. పెరిగిన నదీ మట్టానికి సమాంతరంగా గట్ల ఎత్తును పెంచుకుంటూపోతారు. ఎత్తులో నది ఉంటే నది దిగువన పల్లంలో చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి.గట్లు తెగిపోతాయి.మురుగు నీరు వదిలి పోదు.కాస్త వానకే హైదరాబాదు రోడ్లు కాలువల్లా మునిగిపోతున్నాయి.ఎత్తులో ఉన్నాయనుకుంటున్న జాతీయ రహదారులు ,రైలు మార్గాలు కూడా మునిగిపోతున్నాయి. వరదలు తెచ్చే ఒండ్రు వందల బస్తాల యూరియాతో సమానమని గోదావరి జిల్లాల రైతులు సంబరపడేవారు.ఆ ఒండ్రు తమ పొలాలపై పొర లాగా కమ్ముకోవాలని కోరుకుంటారు.నాగార్జునసాగర్ డ్యాము ఉన్నందువలన కృష్ణా నదిలో తెనాలి పొలాలకు ఒండ్రు రాదట. ఒండ్రును ఆపే పోలవరం ఆనకట్ట కూడా మాకు వద్దు , తల్లీ గోదారికే వెల్లువోస్తే అందం అంటూ గతంలో వరదలను నిశ్చింతగా స్వాగతించారు.నదీజలాలు తీసుకువచ్చిన ఇసుక ఒండ్రు మేటలు లంకల మీద గ్రామాలు కూడా ఏర్పడ్డాయి. ప్రజలు కూడా తమ ఇళ్ళలో సురక్షితంగా ఉండే వాళ్ళు. వరదలొచ్చి బ్రతిమిలాడినా సహాయ శిబిరాలకు వచ్చేవాళ్లు కాదు. పోలవరం ప్రాజెక్టు వద్దని,వరదలవల్లనే తమ భూమి సారవంతమవుతుందని కోనసీమ కొబ్బరి రైతులు,తమ కొబ్బరిచెట్లకోసం కోనసీమకు రైలుమార్గం కూడావద్దన్నారని ఒక పుకారు.
భారీ డ్యాముల బదులు నది పొడవునా 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున చిన్న బ్యారేజీలను నిర్మించాలని కె.ఎల్.రావు,విద్యాధరరావు,మెచినేని కిషన్ రావు లాంటి వారి సూచనలను అమలు చెయ్యాలి.చిన్న బ్యారేజీలు లాకులలాగా సరుకు రవాణా పడవలకూ ఉపయోగపడతాయి. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పుసముద్రంపాలు' అన్నాడు ఆరుద్ర. భారీ వ్యయంతో పోలవరం లాంటి భారీ డ్యాములు కట్టే కంటే నదులు సముద్రంలో కలిసే దాకా ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లు,బ్యారేజీలూ కట్టాలి.ఎక్కడికక్కడే చిన్న బ్యారేజీలు,రిజర్వాయర్లు స్థానిక అవసరాలకు ఉపయోగపడతాయి.నది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి.వేరే భూమి కొననక్కరలేదు.నదులలోనే విస్తారమైన జలసంపద నిలువ చేయవచ్చు.
972 కిలోమీటర్ల కోస్తాలోని 66 తీర ప్రాంత మండలాలు ఏటా అకాల వర్షాలు,వరదలు,తుఫాన్ల కారణంగా అపార నష్టానికి గురవుతున్నాయి.ఈ 66 మండలాలను మండలాలను కలుపుతూ కోస్తా రహదారి నిర్మించాలి. తీర ప్రాంతంలో చేపల రేవుల్ని నిర్మించాలి. వరదలు,తుఫానులు తట్టుకొనేలా మెరకపోసి పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలి.తుఫాను షెల్టర్లు,లింకు రోడ్లు,వంతెనలు విస్తృతంగా నిర్మించాలి. రేపల్లె-బందరు-నరసాపురం- కాకినాడ - విశాఖపట్టణం టెర్మినల్స్ ను కలుపుతూ తీరం వెంట కొత్త రైలుమార్గం వేయాలి.ఎక్కడ రేవు దొరికితే అక్కడ ఫార్మా ఉక్కు పరిశ్రమలతో నింపారు.సముద్రతీరం విషవాయువులతో తాండవిస్తోంది.సెజ్ లు వచ్చాక సముద్ర తీరంలోని ఇసుక దిబ్బలు,సరివి తోటలు గ్రామాలకు గ్రామాలే క్రమంగా మాయమైపోయాయి.తీరవాసులు వరదలు మోస్తున్నారు.తుఫానులు కాస్తున్నారు. వాగులపై వంతెనలు లేక, సరైన రవాణా వ్యవస్థ లేక కష్టాలు పడుతున్నారు. నదులు,వాగులు,మురుగుకాలవలు దాటలేక అవస్థలు పడుతున్నారు.వరదలు ఎదుర్కోటానికి భారీ డ్యాములకు బదులు పెద్ద సంఖ్యలో రిజర్వాయర్లు,బ్యారేజీలు కట్టించాలి.కొత్త చెరువులు తవ్వించాలి. ఎందుకంటే మనకు నీళ్ళ కొరత,కరువు కూడా ఉన్నాయి.ఎండాకాలం మంచినీళ్ళ కోసమే కాక పచ్చదనం కోసం గ్రామగ్రామాన నిరంతరం చెరువుల్లో నీళ్ళు నిలవ చేయాలి.
 నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266