సహజీవనం
సహజీవనం
నూర్ బాషా రహంతుల్లా 9948878833
పెళ్ళి చేసుకోకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, ప్రేమికులైనా కాకపోయినా స్త్రీ, పురుషుడు కలిసి ఉండడమే సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్షిప్). ఈ ‘సహజీవన’ సంస్కృతి పాశ్చాత్య దేశాలకు పాతే కావచ్చు గానీ మన దేశానికి కొత్త
. ‘పెళ్లి అనేది పాత కాన్సెప్ట్’ అంటూ సినీనటులు కొందరు సహజీవనం చేస్తున్నారుగానీ సామాన్యజనం
మాత్రం సహజీవనాన్నీ సహజీవనుల్నీ చీదరించుకుంటూనే ఉన్నారు.
సమైక్యమా? సమన్యాయమా?
భార్య ఉంటుండగా, ఆమెతో పాటు మరో మహిళతో సహజీవనం
సాగిస్తున్న వ్యక్తి ఇద్దరితోనూ సరిసమానమైన సమయం గడపాలంటూ మధ్యప్రదేశ్లోని
ఖాండ్వాలో లోక్ అదాలత్ 1.12.2013 న విలక్షణమైన
తీర్పునివ్వటంతో కొత్త చర్చకు తెరలేచింది.లోక్ అదాలత్ తీర్పు మీద అపీలుండదు.ఈ తీర్పు బహుభార్యత్వాన్ని సమర్ధిస్తోందా ?భార్యలమధ్య
సమాన న్యాయం పాటించాలనే షరియత్ కూ దీనికీ పెద్ద తేడా ఏముంది?
అని విమర్శలు రేగాయి.ఏకపత్నీవ్రతాన్నీ ,ఏకపతీవ్రతాన్నీ,పెళ్లంటే నూరేళ్లపంట అనే భావనను ఇలాంటి తీర్పులు బలహీనపరుస్తున్నాయని,ఉత్తరోత్తరా బహుభర్తృత్వం కూడా దేశంలో ప్రబల వచ్చనీ , భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ వాదులు గగ్గోలుపెడుతున్నారు. అంతకుముందు 28.11.2013 న సుప్రీంకోర్టు కూడా సహజీవనం నేరం కాదు అని తేల్చేసింది. సహజీవనం
చేసి విడిపోయిన మహిళలకు , సహజీవనం
ద్వారా పుట్టిన సంతానానికి రక్షణ కల్పించే చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు
పార్లమెంటును కోరింది.'సహజీవనం మన దేశంలో సామాజికంగా ఆమోదం యోగ్యం
కాకపోయినా అది నేరమో పాపమో కాదు. పెళ్లి చేసుకోవాలా, వద్దా
అన్నది పూర్తిగా వ్యక్తిగతమైనది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో నష్టపోయేది మహిళలు,
పిల్లలే. అందుకే వారి రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది'
అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది.
అదే సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం పెళ్లికి ముందే శృంగారాన్ని ప్రోత్సహించేదిగా ఉండకూడదని అభిప్రాయపడింది.
సహజీవనాన్ని గుర్తించేందుకు ఎంతకాలంగా వారు కలిసి జీవిస్తున్నారు, వారి ఆర్థిక, సామాజిక
పరిస్థితి, పిల్లలు ఉన్నారా లేదా, సహజీవనం
చేసే వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ సూచించింది.
''సహజీవనం
కూడా పెళ్లి లాంటిదే'' అనే అర్థం వచ్చేలా చట్టాలు తయారుచేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పార్లమెంటు
ఈ అంశాలపై స్పందించాలని, తగిన చట్టం చేయడం లేదా ఉన్న చట్టాలకే సవరణ చేయడం ద్వారా మహిళలు, వాళ్ల పిల్లలకు రక్షణ
కల్పించాలని తెలిపింది. ఇలాంటి సంబంధాలు పెళ్లిలాంటివి
కాకపోయినా, ఈ రక్షణ మాత్రం వారికి అవసరమని
ధర్మాసనం చెప్పింది. పెళ్ళైనా సహజీవనమైనా మహిళలు
మగవాడి దాష్టీకానికి గురయినప్పుడు ,పురుషుడికి వ్యామోహం తీరినప్పుడో, అహం దెబ్బతిన్నప్పుడో ఆ మహిళలు నిరాశ్రయులయితే వారిని
రక్షించే చట్టం తయారు చెయ్యమని కోరింది.
ఎన్నో
కారణాలు
స్త్రీ సంపాదన
పెరిగే కొద్దీ ‘పెళ్లి’ కొంచెం కొంచెంగా అంతరిస్తోంది.మన
దేశంలో కూడా క్రమంగా సహజీవనాలు పెరుగుతున్నాయి.సంతోషకరమైన పెళ్ళిళ్ళు-సులభమైన
విడాకులు (“హ్యాపీ మ్యారేజెస్ ఈజీ
డైవోర్సెస్”) శకం ఆరంభమయ్యిందని సామాజిక
శాస్త్రవేత్తల అభిప్రాయయపడ్డారు.విడాకుల
కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో విడాకుల కేసుల విచారణ కోసం చెన్నై కోర్టు
ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేసింది. కుటుంబ ఉమ్మడి లక్ష్యాలు లోపించడం, వ్యక్తిగత అహంకారాలకి ప్రాధాన్యం
పెరగడం, దంపతులిద్దరూ చెరోలోకం అన్నట్టు
ఉండడం.. వంటివన్నీ దాంపత్య బంధాల
వైఫల్యానికి సహజీవనాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. పాలు అమ్మే వ్యక్తి
దగ్గర్నుంచి పక్కింటి వ్యక్తి వరకు ఎంతో మంది అనుమానపు చూపులు ఎదుర్కోవల్సి రావడం, కొన్నేళ్ల పాటు కలిసి జీవించినా ఒకరిపై ఒకరికి ఎటువంటి హక్కులూ సంక్రమించకపోవడం, అకస్మాత్తుగా భాగస్వామిని కోల్పోతే.. జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎటువంటి వీలూ
లేకపోవడం లాంటి ప్రతికూలతలు కనబడుతున్నా
బంధమే తప్ప నిర్బంధాలు లేకపోవడం, ఏ రోజైనా స్వేచ్ఛగా నిష్ర్కమించే వీలుండడం లాంటి కొన్ని ఆకర్షణలు సహజీవనం
వైపు లాగుతున్నాయి.
ఏం
చెప్పాలో ఎలా చెప్పాలో పెద్దలకే తెలియడంలేదు
సహజీవనులు చాలా
మంది ఇష్టపూర్వకంగా దీనిలోకి దిగుతున్నారు. చిన్న చిన్న ఊర్లకు సైతం ఇది పాకింది. అనుకున్నదే తడవు కలిసిపోతున్నారు.దీనికి
పెద్దగా సన్నాహాలేవీ అక్కర్లేదు కాబట్టి సులభంగా
అనుబంధంలోకి దిగిపోతున్నారు. అంతే సులభంగా విసిగిపోతున్నారు,విడిపోతున్నారు. ఒంటరి వృద్ధులు కూడా సహజీవన జంటలుగా మారుతున్నారు. కొన్ని నగరాల్లో
సీనియర్ సిటిజన్స్ కోసం సహజీవన మేళాలు
జరుగుతున్నాయి. ఈ మేళాలకు వేలాదిమంది హాజరవుతున్నారు. హైదరాబాదులో కూడా ‘తోడు నీడ’ అనే స్వచ్ఛందసంస్థ ఈ తరహా
కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హక్కులు,
బాధ్యతలు లేని సంబంధం కాబట్టి వారికి ఎలా సలహా ఇవ్వాలో కౌన్సిలర్లకు అర్థం కావడం లేదు. సివిల్ కోర్టులలో ఈ తరహా కేసులు బాగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే సహజీవనాన్ని చట్టబద్ధం
చేశారు. వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం నేరమో, పాపమో
కాదని చెప్పిన మన సుప్రీంకోర్టు,సహజీవన చట్టం పెళ్ళికి ముందే శృంగారాన్ని ప్రోత్సహించేలా
ఉండకూడదని , సహజీవనం పరిధిలోకి అక్రమ
సంబంధాలు రాకూడదని కూడా హెచ్చరించింది.
సామాజిక
కట్టుబాట్లూ జీవన విలువలు చెడిపోతాయి
సంస్కృతీ
పరిరక్షకుల వాదన ఇది: “సహజీవన
విధానం అనేదే సరైంది కాదు. దీనివల్ల జీవన
విలువలు చెడిపోతాయి.ఇది సంఘానికి అనర్థదాయకం.శరీర కోరికలను సంతృప్తి పరుచుకోడానికే సహ జీవన విధానం కొనసాగుతున్నది. దీనిని
సంఘం ఆమోదించదు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు మీద భరోసా ఉంటుంది. కానీ యాంత్రికమైన సహజీవనంలో ఒకరిపై
ఒకరికి నమ్మకం ఉండదు.నమ్మకం అవసరం.
సహజీవనులు పిల్లల్ని
కనరు. ఒకవేళ కన్నా అప్పటికే వయసు మించిపోయి గర్భం దాలిస్తే పుట్టే పిల్లలు మానసికంగా, శారీరకంగా సరిగా ఎదగరు. సహజీవనుల
పిల్లల్ని సంఘం కూడా ఆమోదించదు. పెళ్ళి జరిగితే సమస్యలు రావు. వస్తాయనటం అపోహ,మూర్ఖత్వం. మన శాస్త్రాలూ పురాణాలన్నీ పెళ్లి గురించి ఎంతో
గొప్పగా చెప్పాయి. అలాంటి పెళ్ళిని కాదని సహజీవనం సాగించడం మంచి పరిణామం కాదు. పెళ్ళి చేసుకునేవాళ్ళకే అన్ని
హక్కులూ ఉంటాయి. సహజీవనం చేసేవాళ్ళకి హక్కులు ఏమీ ఉండవు.
సహజీవనం అంటే కేవలం
కామ సంబంధమే. పెళ్ళి కి కట్టిన తాళిబొట్టు కూడా
బరువేనా? బాధ్యతల నుంచి
తప్పించుకోవడం కోసమే ఇలాంటి వికృత చేష్టల్లో అడుగుపెడుతున్నారు.వికృత
చేష్టలకు విపరీతమైన ఫలితాలే ఉంటాయి. సహజీవనం ప్రతివాడికీ ఒక ఫ్యాషనై పోయింది. అలాంటి తప్పుడు
సహజీవనం అవసరమా? మంత్రాల పెళ్ళి వద్దనుకునేవాళ్ళు కనీసం రిజిస్టర్ పెళ్ళినైనా
చేసుకోవాలి. దానివల్ల చట్టభద్రత ఉంటుంది. సహజీవనం సాగించే అమ్మాయికే అసలు సమస్య. ఆమెకు భార్య అనే స్టేటస్ ఉండదని తెలిసినా అక్రమ సంబంధానికి తెగబడటం ఏమిటి?అక్రమ సంబంధం ఏదైనా తాత్కాలికమే. సహజీవనులకు
అసలు బుద్ధి ఉందా?ఇష్టం లేనప్పుడు
విడిపోతామని కూడా తెలుసు కాబట్టి వీళ్లు ఆచారాలకు, కట్టుబాట్లకు విలువ ఇవ్వరు. ఏ సమయంలోనైనా విడిపోవచ్చు అనే అనుకుంటారు.సహజీవనుల
పిల్లలకు మరీ ఇబ్బంది. విడిపోతే ఆ పిల్లలు అనాథలే కదా? దీనివల్ల సమాజానికి చెడ్డ సంకేతాలు
వెళతాయి. సహజీవనం సాగించేవాళ్ళకి భద్రత లేదు.ముఖ్యంగా ఆడవాళ్ళకి! మగవాడు ఆమెను
విడిచిపెట్టి పారిపోతే? మహిళా
సంఘాలు ఇలాంటి వాటిని ప్రోత్సాహించకూడదు. చట్ట ప్రకారం, సమాజంలో కూడా ఇది ఆమోద
యోగ్యం కాదు. సహజీవనం అనేది విదేశీ
కల్చర్. అక్కడ కేవలం అవసరం ఉన్నంతవరకు కలిసి ఉండి, ఇష్టం లేకపోతే విడిపోతారు. అలాంటి వాటిని ఆహ్వానించకూడదనే పెళ్ళి అనే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు
మనవాళ్లు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు మనదేశానికి మోసుకొచ్చిన పాప ప్రయోగమే ఈ సహజీవన విధానం.ఆడవాళ్ళు కూడా విదేశాలలో ఉద్యోగాలు
చేస్తూ సంపాదన మొదలుపెట్టాకనే ఈ దరిద్రం మన దేశానికి చుట్టుకుంది.”
పెళ్ళే
కావాలా? కలిసుంటే చాలదా?
సహజీవనుల సమాధానం
ఇది: “సంసారం ఒక సాగరం.కష్టాలు అనంతం.జీవన పోరాటం దంపతులెవరికైనా తప్పదు. సహజీవనులకు కూడా గృహహింస
చట్టం ఇస్తున్న భద్రత వర్తిస్తుంది. విడిపోయినప్పుడు మహిళ , ఆమె పిల్లలు భరణం పొందవచ్చు. పెళ్ళి అనే
తంతు అవసరం లేదు. పెళ్లి అంటే మతం,కులం,
గోత్రం,పురోహితులు,మంత్రాలు, లాంటి తంతులన్నీ అవసరం. ఇద్దరు
కలిసి ఉండాలంటే వారి మధ్య స్నేహం, పరస్పర గౌరవం అవసరంకానీ ,భారీ
ఖర్చుతో కూడిన ఈ అనవసరమైన తంతులు ఎందుకు?ఈనాడు ఉమ్మడి
కుటుంబాలు లేవు.ఎటో వెళ్ళి పోయాయి.సంప్రదాయవాదులు వాటిని కాపాడగలిగారా?ఎవరి ఆర్ధిక అవసరాలు వారివి. ప్రేమ
వివాహాలు,వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగాయి?పెళ్ళి అనే అనవసరపు తంతు లేకుండా
కలిసుంటే చాలదా? సరిపడకపోతే పెళ్ళి
జీవితకాలం మంటే కదా? పెళ్ళినాటి బులుపు ఎల్లకాలం ఉంటుందా? కలిసున్నంతకాలం సుఖంగా, ప్రశాంతంగా ఉండి
నచ్చనప్పుడూ అంతే ప్రశాంతంగా విడిపోకూడదా ? మనసులు కలవకపోయినా సమాజంకోసం కలిసుంటూ ఇల్లు నరకం చేసుకోవాలా ? అలాంటి కష్టాలను పిల్లలకు ఎందుకు పంచాలి?పెళ్లంటే ఒక యావజ్జీవ చెరసాల .
సహజీవన పద్ధతిలో స్వేచ్ఛగా బతికేయొచ్చు.సహజీవన
బంధానికి చట్టబద్ధత ఉంది.చాలాకాలంగా
కలిసి సహజీవనం
చేస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 112 ప్రకారం దానిని భార్యభర్తల
సంబంధంగానే గుర్తిస్తారు.అది అక్రమ సంబంధం
కాదు.సహజీవనం
వేరు. అక్రమ సంబంధం వేరు. సహజీవనం ద్వారా ఒకరిమీద ఇంకొకరికి ఉన్న ప్రేమ నిజమో కాదో
తెలుసుకోవచ్చు. అభిరుచులు, అభిలాషలు, అంతరంగాలు, అంతరాలు ఇష్టాలు, అయిష్టాలు, బరువు బాధ్యతలు అర్థం చేసుకోవచ్చు.
జీవితంలో ఇద్దరి భాగస్వామ్యం అనుకూలంగా ఉంటుందో లేదో ఇద్దరికీ పొసగుతుందో లేదో తెలుసుకుని
మార్పులు, చేర్పులు, చేసుకోవచ్చు. సహజీవనం ఒక శాస్త్రీయ ప్రయోగం. ఇందులో అంతా ప్రమోదమే కానీ ప్రమాదమేమీలేదు.సహజీవనులు ఎవరినీ నష్టపరచటం లేదే?మాకులేని
బాధ మీకెందుకు?ఎప్పుడూ పొరుగువాళ్ళలో లోపాలు వెతకటం
తప్ప సంప్రదాయులకు వేరే పని లేదా ? మత
నియమాలతో ఖాఫ్ పంచాయతీల లాగా మనుషుల స్వేచ్ఛను నిరంకుశంగా నియంత్రించటం తప్పు కాదా
?ఇలాంటి ఘోరమైన హద్దులు గీసే పెద్దలమాట మేం వినం.మా జోలికి రాకండి.సహజీవనులు మీ జోలికొస్తే అడగండి.అడ్డదిడ్డంగా వాదిస్తున్నామని అనకండి.”
కష్టమొచ్చినప్పుడు
తిరిగొస్తున్నారు
ఇష్టమొచ్చినప్పుడు
ఒకలాగా కష్టమొచ్చినప్పుడు మరొకలాగా ఉండటం మానవ నైజం.అయినా బాధితులకు న్యాయం చెయ్యటం ప్రభుత్వ బాధ్యత గనుక
కొన్ని రక్షణ ఏర్పాట్లు చేశారు.
ఇష్టమొచ్చినంత
కాలం కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయినా సహజీవనంలో మోసపోయిన
మహిళలకు ఆస్తిహక్కు, సంతాన హక్కులు, గృహహింస చట్టం ద్వారా రక్షణపొందే హక్కు ఉంటాయి. కాకపోతే మోసపోయిన
మహిళ తాను సహజీవనం చేసిన చోట స్థానికులతో వారు భార్యాభర్తలుగా సహవాసం చేశారని
సాక్ష్యం చెప్పించాలి.ఓటరు కార్డూ , రేషన్ కార్డు లాంటి
ఋజువులతో వారిని భార్యభర్తలుగా గుర్తిస్తారు.మోసగాళ్ళను వడపోసేందుకు కొన్ని షరతులు
పెట్టారు. సహజీవనులు అవివాహితులై ఉండాలి. జీవించి ఉన్న భర్త, భార్య ఉండకూడదు. ఇరువురికి మైనారిటీ తీరాలి. వివాహం అయినా కూడా కాలేదని తెలియజేయకుండా సహజీవనం చేసేవాళ్ళు శిక్షార్హులవుతారు.
సహజీవనంలో మోసం చేస్తే 498/A కేసు నమోదు చేయొచ్చని తీర్పు వచ్చింది. దీనిలో మహీళ ఎలాంటి సాక్ష్యాలు
చూపించాల్సిన అవసరం లేదు 498/A గ్రుహహింస,420 చీటింగ్,493 మభ్య
పెట్టడం లాంటి కేసులు నమోదు చేసి సహజీవనం లో మోసపోయిన మహిళ న్యాయం
పొందవచ్చు. సహజీవనంలో ఉండి విడిపోయే మహిళలకు విదేశాల్లో ‘పాలీమనీ’ పేరిట భరణం ఇస్తారు. భార్య హోదాలో భరణం కూడా పొందవచ్చు.
సుఖాలున్నా
కష్టాలే ఎక్కువ
పెళ్లయిన మహిళ ఏ
కారణాల వల్లనైతే గృహహింసకు గురవుతుందో ఆ
కారణాలతోనే సహజీవనంలో కూడా మహిళ కడగండ్ల పాలవుతోంది. సహజీవనుల్లో సహోద్యోగులే ఎక్కువ. కలిసి పనిచేసే చోట ఉండే ఘర్షణ ఇంటి
లోకీ విస్తరిస్తోంది. మన దేశంలో పెళ్ళి సహజీవనానికి ఒక లైసెన్స్. కొన్నిదేశాల్లో అది ప్రత్యామ్నాయం. అక్కడ ఏమోకానీ ఇక్కడమాత్రం సహజీవనంలో పిల్లలు పుట్టాకే సమస్యలు మొదలవుతున్నాయి. అటు బంధువులుకాని, ఇటు చుట్టుప్రక్కల వారుకానీ సహాయ
సహకారాలు అందించరు.ఆటుపోట్లను వారిద్దరే
భరించాలి. అసలు గొడవలు మొదలయ్యేది అక్కడనుంచే.
సహజీవనం చేసేవారికి ఇల్లు దొరకటం చాలా కష్టం. మన సమాజం వారిని
చిన్నచూపు చూస్తుంది .మతపరంగా కూడా సహకారం లేదు.సహజీవనంలో సంతానం కలిగితే సంతానానికి అన్ని
హక్కులు రావటం లేదు.సహజీవనం చేసిన మహిళ తాను మోసపోయినా ఎలాంటి న్యాయం జరుగక పోవడం, తల్లిదండ్రుల వైపునుంచి ఆదరణ,ఓదార్పు లేకపోవడంతో మోసపోయిన కొందరు మహిళలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. మనసుకు నచ్చిన వ్యక్తితో పేళ్ళీళ్ళూ
పేరంటాలు కట్నాలు కానుకలు లాంచనాలు లేకుండా కలిసి
సహజీవనం మొదలుపెట్టినప్పుడున్న
సంతోషం కడదాకా
మిగలటం లేదు. సహజీవనానికి ఒప్పుకున్న మహిళ అంటే సంఘంలో చాలా చిన్న చూపు ఉంది.అనుమానాలు అవమానాలు వేదింపులకు
గురవుతున్నారు.పైగా శారీరక
సంబంధాలు తీర్చుకోవటానికి మాత్రమే సహజీవనం
చేస్తే అది వైవాహిక జీవితాన్ని పోలినటువంటి బంధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అసూయ, అహంకారం , అనుమానం
సహజీవుడు వృత్తిపరమైన అసూయ కారణంగా హింసకు దిగుతాడు. సహజీవనంలో అనుబంధానికి కట్టుబడి ఉండాలనే నియమమేదీ
లేకపోవడంతో సహజీవనులిద్దరూ ఒకరిపై మరొకరు అనుమానాలు
పెంచుకుంటారు. అనుమానించిన సహజీవి డిటెక్టివ్ని ప్రయోగిస్తారు, ఆ విషయం తెలుసుకున్న సహజీవి అనుబంధాన్ని తెంచుకుంటారు.పెళ్లి వల్ల పురుషుడికి అపరిమిత అధికారాలు
సంక్రమిస్తాయని సహజీవని అభిప్రాయం. చుట్టుపక్కల ఇళ్లలో మమ్మల్ని ఎవరూ దంపతులుగా గుర్తించకపోవడమే కాకుండా
కనీసం ఎటువంటి సాయం కూడా చేయకపోయినా ఆ
సమస్యలన్నీ నా సహజీవి పెట్టే చిత్రహింసల దెబ్బకు ఏ మూలకో పోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గానీ అసలు ఆ సహజీవన మార్గం ఎంచుకున్నందుకు మాత్రం సహజీవనులెవరూ పశ్చాత్తాపం చెందడం లేదు.
షరతులు వర్తిస్తాయి
స్త్రీ, పురుష సహజీవనం
వివాహం ద్వారా
ఏర్పడాలా, మరే ఇతర పద్ధతిలోనైనా ఉండవచ్చునా అనే సమస్య ఎప్పుడూ ఉంది. ఫలానా సంబంధం మాత్రమే
సరైందని నిర్ధారించడానికి వీలులేదు. భిన్న మతాలు
సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న మన సమాజంలో ఏదో ఒకటి మాత్రమే సరైనదని చెప్పడానికి లేదు.సహజీవన సంబంధాలను
కూడా ‘వివాహ స్వభావంగల సంబంధాలు’గా పరిగణించడానికి సుప్రీంకోర్టు
కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
1.
సహజీవనం
చేస్తున్న జంట భార్యాభర్తల తరహాలో ఉంటున్నట్లుగా సమాజానికి చాటాలి.
2. వివాహం చేసుకోవటానికి అవసరమైన చట్టబద్ధమైన వయస్సు వారిద్దరికీ
ఉండాలి.
3. అవివాహితులుగా ఉంటూ చట్టబద్ధంగా వివాహం చేసుకోవటానికి అర్హులై
వుండాలి.
4. సహజీవనం చెయ్యటానికి స్వచ్ఛంధంగా ముందుకొచ్చి ఉండాలి. కొంతకాలంగా
భార్యభర్తల్లా జీవిస్తున్నట్లుగా సమాజంలో నమ్మకం కలిగించాలి.
ఒక మహిళ ఆర్థిక భారాన్ని భరిస్తూ ఆమెను ఎవడన్నా తన శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నా, ఆమెను పనిమనిషిగా చూస్తూ చాకిరీలు
చేయించుకుంటున్నా అది వైవాహిక జీవితం లాంటి సహజీవన బంధం కాదు.సహజీవనం
పేరుతో అక్రమ
సంబంధం కొనసాగిస్తున్న మహిళలు, గృహ హింస చట్టం క్రింద ప్రయోజనాలను పొందలేరు.
బుద్ధి
కర్మానుసారిణి అంటారు కానీ మనిషి బుద్దే చెడ్డది.చట్టాలు ఉంటేనే నేరాలూ
ఘోరాలూ ఆగటంలేదు.ఇక చట్టం కూడా లేకపోతే నేరగాళ్ళకు పట్టపగ్గలుండవు.సతీ
సహగమనం విలసిల్లిన స్థితినుండి వేలాది సంస్కరణల ఫలితమే నేటి సమాజం.నాగరికత
మనుషులకు మరింత మంచి సమాజాన్నీ,న్యాయాన్నీఅందించాలి. మహిళపై
హింస అన్యాయం పెళ్ళి చేసుకున్న భర్త ద్వారా కలిగినా,సహజీవనుడి ద్వారా
కలిగినా ఒకే చట్టాన్ని ఇద్దరికీ సమానంగా అమలు చెయ్యాలనేదే కోర్టు
తీర్పు.ఇది చట్టం అయితే సహజీవనికి,పుట్టే పిల్లలకు ఆస్థి హక్కు,భరణంహక్కు
సంక్రమిస్తాయనే భయంతో అక్రమసంబంధాలు తగ్గే అవకాశం కూడా ఉంది.హక్కులులేని
అబల జీవితం మరీ అద్వాన్నంగా ఉంటుంది.కుటుంబవ్యవస్థలో నమ్మకం,నైతికత
అవసరం.సహజీవనాన్ని ఏకపక్షంగా సమర్ధించలేము. పెడదోవపట్టిన వివాహితులను కూడా
స్ప్రైట్ లాంటి బహుళజాతి కంపెనీలు సమర్ధిస్థాయి.సుప్రీంకోర్టు,సహజీవన
చట్టం పెళ్ళికి ముందే శృంగారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని , సహజీవనం
పరిధిలోకి అక్రమ సంబంధాలు రాకూడదని కూడా హెచ్చరించింది.ఆడపిల్లకు ఆస్థిహక్కు
కల్పించిన అన్నగారికి అందుకే అంత పేరు వచ్చింది.
సూర్య 8.12.2013
https://www.facebook.com/photo.php?fbid=676219635743363&set=p.676219635743363&type=1&theater
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి