ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, ఏప్రిల్ 2019, గురువారం

టెన్షన్ లేకుండా పెన్షన్ రావాలి


టెన్షన్ లేకుండా పెన్షన్ రావాలి (సూర్య 12.4.2018)
అసలే అరవై ఏళ్ళు దాటిన వృద్దులు.పెద్దలను గౌరవించుము అన్న సూక్తికి ప్రతినిధులుగా మనం మర్యాదగా పిలుచుకునే  సీనియర్ సిటిజన్లు.ప్రతిఏటా పెన్షనర్లు మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం పెన్షనర్ల దినోత్సనం జరుపుతుంది.అందులో ఉద్యోగుల నాయకులు చాలా ఆవేదనా భరితంగా విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ బాధలు గాధలు వివరిస్తారు.ఉద్యోగులు రిటైరైన తర్వాత అతి తక్కువ పెన్షన్‌ పొందుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, పింఛనుదారులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వాలు అమలు చేయడంలేదని,పెన్షనర్లకు  ఏ పార్టీ అయితే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తుందో  ఆ పార్టీకే ఓట్లు వెయ్యాలనీ అంటారు.ఈమధ్య ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీవిరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు వీలుకల్పించింది. ఒంటరి మహిళలు,మానసిక వికలాంగులు,దివ్యాంగులు, వ్రుద్ధులకు పించను పెంచటం వలన వాళ్ళు ఎంతగానో సంతోషపడుతున్నారు. పెన్షన్ పెంచటం అనేది ఒక గొప్ప సామాజిక సంక్షేమ కార్యక్రమం. ఉత్తరప్రదేశ్ లో సాధు సంతులకూ సన్యాసులకు కూడా పెన్షన్ ఇస్తుండగా దశాబ్ధాల పాటు ప్రజా సేవ చేసి ఉద్యోగవిరమణ చేసిన విశ్రాంత ఉద్యోగిని సైనికుడితో సమానంగా చూడాలి. 
ఆటో ఐఏయస్
అప్పట్లో చిన్న కారు కూడా కొనుక్కొని మెయింటైన్ చేయలేకపోయిన మాజీ ముఖ్య కార్యదర్శి నటరాజన్ గారి గురించి “ఆటో ఐఏయస్” అని ఫొటోతో సహా పేపర్లో వార్త వచ్చింది. ప్రతి డిపార్ట్ మెంట్ ఉద్యోగుల్లో నిజాయతీ పరులు ఉన్నారు.లంచాలు తీసుకోకుండా ప్రజల పనులు చేసిన నిజాయతీ పరులైన ఉద్యోగులున్నారు . కొంతమంది నిజాయతీ పరులు దురదృష్టవశాత్తు తమ ప్రమేయం లేకుండానే మోసగాళ్ళ వలన చిన్న చిన్న కారణాలతో కేసుల్లో ఇరుక్కొని రిటైర్ అయితే ఏళ్ళతరబడి పూర్తి పెన్షన్ రాకుండా ఆగిపోతోంది. అలాంటి ఉద్యోగుల సస్పెన్షన్ త్వరగా ఎత్తేయాలి.ప్రభుత్వానికి ఆర్ధిక నష్టం లేని మైనర్ కేసుల్ని మాఫీ చేసి పెన్షన్ వారికి త్వరగా వచ్చేలా చేయాలి.ఏదో ఒక కేసులో ఇరుక్కోకుండా బయట పడితే అది ఉద్యోగి అదృష్టమేనని చెప్పుకునే శాఖలు కొన్ని ఉన్నాయి.సొంత ఇల్లు లేకుండానే రిటైర్ అయిన పేద ఉద్యోగులకు ఇల్లో ఇంటి స్థలమో సమకూర్చే పధకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలి.
పెన్షనర్ల కోరికలు
మన రాష్ట్రంలో  58 లక్షల రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాల సమస్యలను ప్రభుత్వానికి ఆన్ని రాజకీయ పార్టీలకు నివేదిస్తూనే ఉన్నారు.ఇపియఫ్  కార్మికులకు కనీస పెన్షన్‌ రూ.3 వేలు చేస్తామని , పెన్షన్‌ పెంపుదలపై హై పవర్‌ కమిటీ  వేస్తామని  2014 ఎన్నికల్లో బిజెపి హామీ ఇచ్చింది. ఇపిఎఫ్‌-95 పెన్షనర్‌లకు కనీస పెన్షన్‌ రూ.9 వేలు చేయాలని, పెరుగుతున్న ధరలకనుగుణంగా ప్రతి ఆరు నెలలకు కరువుభత్యం ఇవ్వాలని, ఉచితంగా ఇఎస్‌ఐ ద్వారా వైద్య సదుపాయం కల్పించాలని, కమ్యుటేషన్‌ పూర్తి అయిన వారికి తిరిగి పూర్తి పెన్షన్‌ పునరుద్ధరించాలని, పెన్షనర్ల డైరెక్టరేట్‌ను  ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. పెన్ష‌న్ అదాల‌త్‌ల ద్వారా పెన్ష‌న‌ర్ల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి. 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్, ఈహెచ్‌ఎస్‌ ద్వారా నగదు రహిత వైద్యం, విశ్రాంత ఉద్యోగులందరికీ సొంత ఇళ్లు ఇవ్వాలి. ఆర్టీసీ బస్సులలో పెన్షనర్లందరికి 50శాతం రాయితీ ఇవ్వాలి. ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీంను 70 సంవత్సరాల అనంతరం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచాలి. పెన్షనర్ల పింఛన్‌ను ఆదాయ పన్ను నుంచి మినహాయించాలి.విశ్రాంత ఉద్యోగులు అందరికీ కామన్ ఖర్చు రక్తపోటు,సుగర్ పరీక్షలు,మందులు.అవితట్టుకునేలా పెన్షనర్‌లకు ఇస్తున్న300 రూపాయల మెడికల్ అలవెన్స్ ను  4  వేల రూపాయలకు పెంచాలి.రిటైర్ అయ్యాక నెలరోజుల్లోపే  హెల్త్ కార్డులు అందజేయాలి. విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలి. అన్నీ  జిల్లాలో పూర్తిస్థాయి వసతులతో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చెయ్యాలి. విశ్రాంత ఉద్యోగులకు వైద్య ఖర్చులపై పరిమితి లేని హెల్త్‌ కార్డులు పంపిణీ చెయ్యాలి.రికవరీలు పెన్షన్ నుంచి చెయ్యకుండా కరువు భత్యం నుంచే చెయ్యాలి. అభియోగాల విచారణకు కాలపరిమితి విధించి సత్వరమే పూర్తిచెయ్యాలి. నేరము రుజువు కానప్పుడు ఉద్యోగికి బిగబట్టిన బకాయీలన్నీ వడ్డీతో సహా రిటైర్ అయిన తేదీ నుంచి తిరిగి చెల్లించాలి.నిరపరాధికి కలిగిన నిర్హేతుక మానసిక క్షోభకు,పరువు నష్టానికి కొంత పరిహారం కూడా ఉండాలి.పెన్ షన్ పై ఆదాయపు పన్ను ఎత్తివేయాలి.    
పెన్ష‌న్ మంజూరుకూ ఎన్నోఅవ‌రోధాలు
పదవీ విరమణ రోజునే పింఛనుకూడా చేతికివ్వాలనే ప్రభుత్వ  నిర్ణయం  ఇంకా అమలు కాలేదు. ప్రస్తుతం ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్ రావ‌డం కూడా ఒక పెద్ద ప్ర‌క్రియే. దానికి ఎన్నోఅవ‌రోధాలున్నాయి.ఎన్నో ఫారాలు పూర్తి చేయాలి. అధికారుల చుట్టూ తిర‌గాలి. నెల‌ల త‌ర‌బ‌డి వేచి ఉండాలి.వేరే డిపార్ట్ మెంటుకు బదిలీ అయిన ఉద్యోగి అక్కడే రిటైర్ అయితే అతనికి పెన్షన్ రావటం మరీ కష్టం.తన సొంత శాఖలో వాళ్ళు పట్టించుకోరు,బదిలీ అయిన శాఖలో వాళ్ళు నీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత మాదికాదు అని తప్పించుకుంటారు.ఏదన్నా చిన్నా చితకా క్రమశిక్షణ కేసుల్లో చిక్కుకున్నాడంటే వాటిని తొందరగా తెమల్చరు. అతను నిర్దోషిగా తేలి పూర్తి పెన్షన్ విడుదల కావటానికి దశాబ్దమో,పుష్కరమో పడుతుంది.ఈలోపు ఉద్యోగి శారీరక మానసిక రోగాలతో, మనోవేధనతో, ఆర్ధిక బాధలతో చనిపోవచ్చు.అందువలన ప్రభుత్వానికి వీళ్ళ వినతి ఏమిటంటే ,రిటైర్ అయిన ఉద్యోగులను సగౌరవంగా సన్మానించి పంపాలనే జీవో ప్రకారం వారికి రావలసిన పెన్షన్,గ్రాట్యుటీ,త్వరగా వచ్చేలా వారిపై పెండింగ్ లో ఉన్న కేసుల్ని త్వరగా తేల్చాలి.ముఖ్యంగా ప్రభుత్వానికి ఆర్ధిక నష్టం లేని మైనర్ కేసుల్ని ఆయా శాఖాధిపతులే ముగించేలా చర్యలు తీసుకుంటే అదే పెద్ద సన్మానం.మరీ పెద్ద కేసులైతే కోర్టుల్లోనో పెన్షనర్ల ఆదాలత్ లోనో తేల్చుకోవచ్చు.
పెన్షనర్ల పట్ల మర్యాద
పెన్షనర్లు దశాబ్దాల తరబడి ప్రజాసేవలోనే తమ ఆరోగ్యాన్ని హరింపజేసుకున్న సైనికులు.స్త్రీ బాల వ్రుద్ధులను కనికరంతో చూడమని మనకు పెద్దలు చెప్పారు.తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘన పరచి నీ దేవునికి భయపడవలెను అనేది మన సంప్రదాయం. సీనియర్ సిటిజన్లను అందుకే గౌరవిస్తాం.ముసలివాళ్ళు ఆఫీసుల్లో పనులమీద వచ్చినపుడు వాళ్ళకు మార్గదర్శనం చెయ్యటం ,ఫారాలు పూర్తిచెయ్యటం ద్వారా సహాయ పడవచ్చు.పెన్ షనర్లు చివరికి  ట్రెజరీ ఆఫీసులకే వస్తారు. అక్కడ వారిని కసురుకోకుండా వారు ఏపని మీద ఎందుకు వచ్చారో కాస్త పలకరిస్తే చాలు.ఈనాటి ఉద్యోగులే రేపటి పెన్షనర్లు అనే గ్రహింపు ఉన్నవాళ్ళు పెన్షనర్లను  చులకనగా చూడరు. వేలి గీతలు అరిగిపోయి వేలి ముద్రలను బయో మెట్రిక్ యంత్రాలు గుర్తించలేని  సందర్భాలలో ట్రెజరీ అధికారులు వాటిని రూఢి పరిచే అవకాశం ఇవ్వాలి. జిల్లాకలక్టర్లు కూడా ట్రెజరీ అధికారులతో,పెన్షన్ బాధితులతో కలిపి నెలకొకసారి సమావేశమై సమస్యలు వినాలి. పరిష్కార బాధతలను ట్రెజరీ అధికారులకు అప్పగించాలి. డైరెక్టరేట్లు,కమీషనరేట్లలో పెన్షన్ ప్రతిపాదనలు,శలవుల బిల్లులు, లాంటి పనులన్నీ కావాలి కాబట్టి సిబ్బంది కొరతను కారణంగా చెప్పి విశ్రాంతి పొందాల్సిన ఉద్యోగికి విశ్రాంతి లేకుండా చేస్తారు. అవసరమైన చోట ప్రభుత్వం సిబ్బందిని సమకూర్చాలి.   
బిగబట్టే పెన్షన్ సొమ్ములు   
ఏదైనా కేసులో ఇరుక్కుంటే అది చిన్నదా పెద్దదా అనితేల్చటానికి చాలా సమయం పడుతోంది. న్యాయం ఆలశ్యంగా జరిగితే న్యాయం జరగనట్లే అంటారు.ఒక ఆకాశరామన్న ఉత్తరాన్ని అడ్డం పెట్టుకొని పెన్షన్ పేపర్ ఆపకూడదు.ఆకేసు తేలేవరకు 75% సొమ్ము ప్రొవిజనల్ పెన్షన్ గా ఇస్తారు. అలాగే 80% గ్రాట్యుటీ డబ్బు ఇస్తారు.వృద్ధ ఉద్యోగికి రిటైర్మెంట్  తరువాత ఆర్ధిక బాధలు తగ్గాలంటే ఈ ప్రయోజనాలన్నీ త్వరగా సజావుగా అతనికి చేరాలి. పెన్షన్ల మంజూరు  నియమావళి సరళం చెయ్యాలి.అతను ఉద్యోగ కాలమంతా కూడబెట్టిన జీపీఎఫ్,గ్రూప్ ఇన్సూరెన్స్,చివరిగా ఇచ్చే 3 నెలల సంపాదిత శలవు డబ్బు ,ఇంకా మంజూరు కావలసిన పెండింగ్ శలవు డబ్బు అన్నీ రాబట్టి రిటైర్ మెంట్ తేదీ నాటికి ఇచ్చేస్తే చాలు.శాఖాధిపతులు ఇలాంటి కేసుల్ని ఎందుకు పెండింగ్ లో పెట్టారోనని  తరచుగా సమీక్షిస్తే అవి త్వరగా పరిష్కారమౌతుంటాయి.25% పెన్షన్ డబ్బు,20% గ్రాట్యుటీ డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కాబట్టి మిగతా ప్రయోజనాలు ఏవీ ఎక్కడా ఆగకుండా పెన్షనర్ కు అందేలా శాఖాధిపతులు తొందర చెయ్యాలి. పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యలు శాఖాధిపతులకు చేరవేయటానికి, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి  చొరవ చూపాలి.  
భరించలేని వైద్య ఆరోగ్య ఖర్చులు
60 ఏళ్ళ వయసు దాటాక విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్యం ధారుణంగా దెబ్బతింటుంది.ఒత్తిడి ఎక్కువగా ఉండే పోలీసు,రెవిన్యూ లాంటి శాఖలలో గుండెజబ్బులు ఎక్కువ.స్టెంటులు వెయ్యటం, కిడ్నీలు దెబ్బతినటం, మెదడులో గడ్డలు కట్టటం, కళ్ళలో శుక్లాలు రావటం, మధుమేహంతో మిగతా అవయవాలన్నీ పాడవటం వలన వైద్య పరీక్షలకు,వ్యాధుల చికిత్సకు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఉద్యోగులు రిటైర్ అయిన త‌ర్వాత పెన్ష‌న్ ద్వారా వ‌చ్చే సొమ్ము తోనే జీవ‌నం సాగిస్తారు. అందుకోసం ప్ర‌తి నెల త‌మ జీతంలో కొంత భాగాన్ని భ‌విష్య నిధికి కేటాయిస్తారు. అయితే ఉద్యోగుల్లో 90 శాతం మంది కేవలం పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పేద విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు చాలా ముఖ్యం .ఎందుకంటే తమ యవ్వనమంతా ప్రభుత్వ సర్వీసుకే ధారపోసిన ఉద్యోగులు రిటైర్ అయ్యాక వృద్ధాప్యంలో తప్పక మొయ్యవలసి వచ్చేది వైద్య ఆరోగ్య ఖర్చులే. అవి లక్షల రూపాయలు అయ్యేటట్లయితే వేలల్లో వచ్చే పెన్షన్ మొత్తం చాలదు. విశ్రాంత ఉద్యోగులకు వైద్య ఖర్చులపై పరిమితి లేని హెల్త్‌ కార్డులు పంపిణీ చెయ్యాలి.
కొత్త పెన్షన్ యాప్‌
ప్ర‌తి నెలా జీతం లాగానే ఇప్పుడొస్తున్న  పెన్ష‌న్  కూడా మ‌న ఖాతాలో జ‌మ అవుతూ ఉంటుంది. గ‌తంలో పెన్ష‌న్ డ‌బ్బుల‌ను పెన్ష‌న్ ఆఫీసుకు వెళ్లి తీసుకోవాల్సి వ‌చ్చేది. ఊళ్ల‌లో అయితే ట్రెజ‌రీల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోవ‌డంతో పెన్ష‌న్ ప‌నులు కూడా సుల‌భం అయిపోయాయి. ప్ర‌తి నెల  మ‌న పింఛ‌ను మ‌న ఖాతాలోకి ప‌డిపోతుంది. ఎవ‌రినీ దీని గురించి అడ‌గాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే ఫోన్ నంబ‌ర్లు మార్చుకోవ‌చ్చు , అడ్రసు  మార్చుకోవ‌చ్చు.బ్యాంకు ఖాతాను మార్చుకోవచ్చు. పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ (పీపీవో) తో పాటే ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన రోజే అత‌నికి పెన్షన్ ఖాతా మొద‌లవుతుంది.దీని కోసం పెన్ష‌న్ యాప్‌లోని  పెన్ష‌న్ పోర్ట‌ల్ లో పెన్ష‌న‌ర్ త‌న తొలి పెన్ష‌న్ ఏరోజు, ఏ తేదీని ప‌డింది, తన సమస్యపై తీసుకున్న చర్య , పెన్షన్ లెక్కింపు,ప్రశ్నకు జవాబు,కొత్త జీవోలు తెలుసుకోవచ్చు.
పెన్షనర్ల సంక్షేమ నిధి
త్వరలో పెన్షనర్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నిధి ఏర్పాటుతో పదవీ విరమణ తరువాత ఉద్యోగి ప్రశాంతంగా జీవించేందుకు పింఛను లభిస్తుందన్నారు. ఉద్యోగి ప్రశాంతంగా జీవించేందుకు పింఛను సౌకర్యం ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల ఖాతాలను ఆధార్‌ నంబరుతో లింక్‌ చేసే పనిని  పోస్టాఫీసులు చేస్తాయి.
అకౌంటెంట్ జనరల్ ఆఫీసు ఆదర్శం
ఎంతో బాధ్యతాయుతంగా సరైన సమయానికి పనిచేసి నాకు పెన్షన్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసు వారి పనితీరును కొనియాడుతున్నాను.శాఖాధిపతి కార్యాలయం నుండి పెన్షన్ ప్రతిపాదనలు వెళ్ళినప్పటినుండి వారి పని వారు చక్కగా సకాలంలో నిర్వహించారు.అడిగిన సందేహాలకు ఫోనులో సగౌరవంగా సమాధానమిచ్చారు.నేను వారి కార్యాలయానికి వెళ్ళనేలేదు.ఒక నెల ముందుగానే ఎలాంటి జాప్యం లేకుండా పోస్ట్ ద్వారా ఆర్డర్ కాగితం ఇంటికి పంపారు.ఇది ఇండియా యేనా అని ఆనందాశ్చర్యాలకు గురి అయ్యాను. అన్ని పేపర్లు సరిగ్గా ఉంటే ఏజి ఆఫెస్ లో ఏమాత్రం ఆలస్యం అవద.ఉద్యోగులు అక్కడికి ఏమాత్రం వెళ్ళనక్కరలేదట.అన్ని పేపర్లూ సరిగా ఉన్నా ఎవరన్నా విశ్రాంత ఉద్యోగికి పించను ఆలస్యం అయితే అతని పెన్షన్ వ్యవహారాలు చూస్తున్న ఉద్యోగికి మెమో ఇస్తారట. అక్కడి ఉద్యోగులకు కూడా నెలకు ఎన్ని పెన్షన్ కేసులు పూర్తి చెయ్యాలో టార్గెట్ ఇచ్చారట.అకౌంటెంట్ జనరల్ కార్యాలయ పద్ధతులను మిగతా కార్యాలయాలన్నీ ఆదర్శంగా తీసుకోవచ్చు,తీసుకోవాలి.
నూర్ బాషా రహంతుల్లా
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్
అమరావతి 6301493266 

 గీటురాయి26.4.2019


1 కామెంట్‌: