ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, ఏప్రిల్ 2020, బుధవారం

ఆకలికి అన్నము వేదనకు ఔషధం


ఆకలికి అన్నము వేదనకు ఔషధం  (సూర్య 3.5.2020)
దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంది కాబట్టి రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. కానీ కేంద్రం కార్పొరేట్లకు, విదేశీ గుత్త సంస్థలకు మెహుల్‌ చోక్సీ,విజయ్ మాల్యా లాంటి ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసే బడా కంపెనీల అధిపతులకు 50 మందికి ప్రభుత్వం రూ. 68,607 కోట్ల మేర రుణాలను మాఫీ చేసింది. సూపర్‌ రిచ్‌కు పన్నుల రాయితీల రూపంలో రూ.1.45 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. రియల్‌ ఎస్టేట్‌, ఎగుమతి వ్యాపారులకు రూ.70 వేల కోట్ల రాయితీలు ఇచ్చింది. కేపిటల్‌ గెయిన్స్‌పై పెంచిన సర్‌చార్జీని ఎత్తివేసింది. లాభాలు చేకూర్చిన ప్రభుత్వం చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్యాకేజీ ప్రకటించాలి . లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లకు కేరళలో 5 వేల రూపాయలుఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం రూ.500 ఇస్తానంటుంది. ఎవరినీ పని నుంచి తొలగించ వద్దని మోడీ కోరారు. వారి వేతనాల్లో కొంత భాగం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటిస్తే యాజమాన్యాలకు బాగుండేది. కరోనాలో కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచారు.ఎక్కువ సేపు పనిచెయ్యాలన్నా , రోగనిరోధక శక్తి కావాలన్నా మళ్ళీ మంచి తిండే కావాలి. ఆహార గిడ్డంగుల్లోని 7.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను బయటకు తీసి ప్రజలకు పంచిపెట్టాలని. మళ్లీ రైతుల నుంచి కొత్త పంటను కొనుగోలు చేయాలని జగన్‌మోహన్‌ రెడ్డి లాగా చాలా మంది ముఖ్యమంత్రులు మోడీని కోరారు.
కరోనా అంటు రోగానికి ప్రపంచం 2.26 లక్షలమందిని , అమెరికా 60 వేల ప్రాణాలను పోగొట్టుకొంది. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీలు ప్రయివేట్‌ హాస్పిటళ్ళ నెలవు. ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలు కరోనా లాంటి వ్యాధులకు ఏమీ చెయ్యవు. రోగుల నుండి వచ్చే లాభాల మీదే ప్రైవేటు హాస్పిటళ్ళు నడుస్తాయి.పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, శ్రీలంక, గాంబియా, అంగోలా, కాంగో, ఘనా, లెబనాన్, కామెరూన్, లావోస్‌ లాంటి పేద దేశాలు డబ్బుల్లేక అల్లాడుతున్నాయి. కరోనా అంతరించేసరికి ప్రపంచ జనాభాలో సగంమంది పేదరికంలో మగ్గుతారట.
130 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రైవేట్‌ ఆసుపత్రుల చేతుల్లోకి కూడా వెళ్లింది. జనాభాలోని 55 శాతం మంది పేదలు, కార్మికులకు పేలవంగా ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.
మోడీ సప్తసూత్రాలలో వృద్ధుల సంరక్షణ, పేదలకు సాయం, వైద్య సిబ్బందిని గౌరవించడం, యాజమాన్యాలు ఉద్యోగులకు అండగా ఉండటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వంటి సూత్రాలు మంచివే.ఆకలికి అన్నము,వేదనకు ఔషధం లాంటి సూత్రాలు కూడా ఉంటే బాగుండేది. మార్చి 25 నుండి నలభై రోజులకు పైగా దేశం లాక్‌డౌన్‌ లో ఉంది. 36 కోట్ల మంది వలస కూలీలు కార్మికులు,హమాలీలు , లారీ, ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇళ్లల్లో పాచి పని చేసుకునేవారు తిండికి దూరమయ్యారు. ఆకలిగొన్నవారి కి సిద్ధాంతాలు చెప్పడం కాదు, ఆకలి తీర్చాలని స్వామి వివేకానంద చెప్పారు. కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే అంతం కాదని ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగుతుందట. 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 23.6 శాతానికి పెరిగింది. లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్లు పెరిగిపోయి కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట అమ్ముకునే మార్గం లేక రైతులు, పనులు లేక వృత్తిదారులు ప్రభుత్వం ఆదుకోకుంటే మరణమే శరణ్యమంటున్నారు.
మందులు ఉత్పత్తి చెయ్యాలంటే లాక్‌డౌన్‌ సడలించాలి కర్మాగారాలు పనిచేయాలి , పండించిన పంటను రైతులు అమ్ముకొనేలా రవాణా మార్గాలు తెరవాలి. మొబైల్ చార్జీలు, పెట్రోలు, గ్యాస్‌ రేట్లు తగ్గించాలి. రేషన్‌ కార్డు ఉన్న పేదలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున, అదీ కిలో మూడు రూపాయల వంతున బియ్యం, గోధుమలను అదనంగా ఇస్తామంది. రేషన్‌ కార్డులు లేని కూలీలకు రేషన్ కార్డులు ఇవ్వాలి. కేరళ లో కూలీలకు ముందుగానే మూడు మాసాలకు రేషన్ ఇస్తున్నారు. ప్రజల ఆహారానికి ఎక్కువగా ఖర్చు పెట్టాలి.క్యూబా లాంటి చిన్న దేశంలో ఎంతోమంది డాక్టర్లు తయారై ఆరోగ్య అవగాహన పెంచారు.మనం వాడుతున్న దోమల బ్యాట్లు కూడా చైనావే. క్యూబా, చైనాల లాగా మనంకూడా కరోనా రోగులకు ప్లాస్మా వైద్యం చేయించాలి. అందుకు కేంద్రం అనుమతించాలి. ప్రపంచంలో 32 లక్షలమంది కరోనా సోకిన వారిలో 9.77 లక్షలమంది కోలుకున్నారట.వీరినుండి ప్లాస్మా సేకరిస్తున్నారు.డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ప్లాస్మాదాతలను అభ్యర్ధించారు.
తబ్లిక్ వాళ్లతోసహా చాలామంది ప్లాస్మా దాతలు ముందుకు రావటం హర్షణీయం. కరోనా వైరస్‌ పై మతం ముద్ర వేసే శక్తులకు శాస్త్రీయంగా బుద్ధి చెప్పాలి. తబ్లిక్ భక్తుల కల్లోలం మరువకముందే మధ్య్రపదేశ్‌ లో పల్లవి జైన్ అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ కుటుంబ సభ్యులకు అంటించి కూడా వైద్యశాలకు పోవడానికి కూడా నిరాకరించారు. నెల్లూరు డాక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి విదేశాల నుంచి వచ్చి కరోనాతో మద్రాస్‌ అపోలోలో చనిపోయారు. ముంబయిలో గాయని కనికా కరోనాతోనే విందు ఇచ్చారు. సాయం జరుగుతుందంటే ఎన్నిసార్లయినా చప్పట్లు కొడతారు, లైట్లు ఆర్పి దీపాలు వెలిగిస్తారు ఇలాంటి ఖర్చు లేని పనులు ప్రజలు ఎన్నయినా చేస్తారు.పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా అని ప్రార్ధనలూ చేస్తారు.
కానీ కాలినడకనసొంత ఊళ్ళకు పోయే వారి యాతన తగ్గాలి.రైళ్లు బస్సులలో త్వరగా కూలీలను రవాణా చెయ్యాలి.దేశమంతా ఒకే స్థితి లేదు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువుంటే, మరికొన్నిచోట్ల దాని జాడలేదు. భిన్న పరిస్థితులున్న దేశంలో అన్ని రాష్ట్రాలకూ, అన్ని ప్రాంతాలకూ ఒకే రకమైన విధానం అక్కరలేదు. కోలుకుంటున్నవారి సంఖ్య సైతం పెరుగుతోంది. రెడ్‌జోన్‌లలో పూర్తిగా కట్టడి చేయాలి. గ్రీన్‌జోన్‌లో కార్యకలాపాలు కొనసాగాలి. జనం ఎక్కువగా గుమిగూడ కూడదు.మాస్కులు వాడాలి. లక్షలమందికార్మికులు,కూలీలు వేలకిలోమీటర్లు స్వస్థలాలకు నడుచు కుంటూ వెళుతున్నారు. వందల మైళ్ళ నడకదారి పట్టిన వలస కూలీలు 25మంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చటం కోసం రైళ్లు కూడా నడపాలి.
---నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

20, ఏప్రిల్ 2020, సోమవారం

సుఖ మరణమే స్వర్గం


సుఖ మరణమే పెద్ద స్వర్గం (సూర్య 26.4.2020)
కరోనా మరణం ఎంత బాధాకరంగా ఉంటుందో నెట్లో వీడియో లలో చూశాం. ఎగఊపిరితో శ్వాస ఆడక హృదయ విదారకంగా చనిపోతున్నారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు లక్షలమంది ప్రజలుకొన్ని నెలల్లోనే చనిపోయారు.అమెరికాలోనే 53 వేలమంది ప్రాణాలు వదిలారు. ఇన్ని వ్యాధులకు మందులు కనుక్కున్న శాస్త్రవేత్తలు,వైద్యులు సుఖంగా యాతనలేకుండా చనిపోయే మందు ఇంతవరకు కనుక్కోలేదు.అసలు సుఖ మరణం అనే ప్రస్తావనే ఎవరూ తేవడంలేదు.రోగులు లోపల్లోపలే బోలెడంత ఆవేదన చెందుతుంటారు.బాధలు తగ్గినప్పుడు రోగులు చురుకుగా ఉంటారు. సుఖంగా బ్రతకడం ఎంత అవసరమో సుఖంగా చనిపోవటం కూడా అంత అవసరం అనిపిస్తోంది.
నిర్ణీత కాలానికి మన ప్రాణాలు దేవుని పర్మిషన్ తోనే పోతాయి.మన అనుమతి లేకుండానే పోతాయి.చావు జీవులకు తప్పదు అని అన్నిమతాల బోధ.కరోనామరణంఎన్నో ఆలోచనలు రేపింది.మరణం ద్వారా సృష్టికర్త ఎలా న్యాయం చేస్తాడు? ఏమి మేళ్ళు ఇస్తాడు?శివుని ఆజ్ఞ లేకపోతే నీవు చావలేవు తమ్ముడూ అని నాగభూషణం ఎన్టీఆర్ తో అంటాడు ఒక సినిమాలో. మతగ్రంధాలన్నీ ఇదే మాట . చనిపోయాక స్వర్గం వస్తుందని అందులో నానారకాల పండ్లు తింటామని , మోక్షంలో ఎన్నో భోగాలు ఉంటాయని అవి దొరకాలంటే నీ కర్మల మోత తగ్గించుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు అన్నాడు ప్రసంగి.మరణం ఎలాగ మేలా అని మొన్న నాజన్మదినం రోజున ఆలోచించాను మిత్రులందరినీ ఆలోచనలో దింపాను.శుభమా అని పుట్టినరోజునాడు ఈ చావు ఆలోచన అవసరమా అని కొందరు వెనుదిరిగారు.ఏమైనా చివరికి చావుతప్పదుకదా అని కొందరు విజ్నులు ధీరులు మాత్రం చర్చలో నిలబడ్డారు.చెడ్డవాడు చనిపోతే పీడ విరగడ అయ్యిందని మేలుగా భావిస్తారని భావించిన మిత్రుడు మంచివాడు చనిపోతేనో అంటే మేలు ఏంటో చెప్పలేకపోయాడు. మదర్ తేరీసా లాగా మంచివాడు తన మరణ దినం వలన పదిమందికి తెలుస్తాడ ని మరో మిత్రుడు సూత్రీకరించాడు.ఎప్పటికైనా తప్పని మరణదినం గురించి శోకం మనకు లేదు. అది మేలైనది ఎలాగో ఇప్పుడే తెలుసుకుంటే మేలు కదా?అనే చర్చ సాగించాం. చనిపోయిన తర్వాత చాలా పొడవైన జీవితం చాలా దుర్భరంగా ఉంటుందట.బ్రతికి ఉన్నప్పుడే పుణ్యం చేసుకుని పాపం హరించుకొమ్మని,చనిపోయిన తర్వాత ఏ అవకాశం కూడా లభించదని జీవితం మృత్యువు కంటే చాలా విలువైంది కాబట్టి పుణ్యం సంపాదించడానికి ఇంకా జీవిత కాలం పోడిగించమని అల్లాహ్ ను వేడుకోవాలని మరో మిత్రుడు సలహా ఇచ్చాడు. చనిపోయినవారు మంచివాళ్ళని జనం పొగిడినా అన్నీ తెలిసిన దేవుడు సిఫారసుగా అంగీకరించడట.పుణ్యస్థితిలో దేవుని కి విధేయుడు గా ఉన్న సమయంలో చనిపోతే స్వర్గం లభిస్తుంది.అంతకన్నా ఎక్కువగా అల్లాహ్ దర్శన భాగ్యం కలగడం కన్నా మేలు ఇంకేం కావాలి అని ఎదురు అడిగాడు. మళ్ళీ దైవదర్శనం కోసం ఆత్మహత్య చేసుకుంటే పాపం కాబట్టి నరకం వస్తుందట. అయితే చివరికి స్వర్గంలో మేళ్ళు ఏమిటో విడిగా చెప్పలేకపోయాడు.ఇప్పుడు మనము అనుభవించే కష్టాలే నరకం, అనుభవించే సుఖాలే స్వర్గమని కొందరు తేల్చారు.మోక్షం ద్వారానే మేలు జరుగుతుందన్నారు.
కర్మ ప్రకారమే మేలు లభిస్తుంది గానీ కోరితే ఏది లభించదు.దైవము శరీరములో కార్యకర్తగా ఉండి ఎవరి కర్మ ప్రకారము వారిని నడిపిస్తుంది . శరీరములో జీవుడవై నువ్వు చేయని పని నేనే చేస్తున్నాను అని అనకూడదని మరో మిత్రుని సలహా. జననం ధర్మమనీ మరణం కర్మమనీ, తెలిసినా జనన మరణ చక్రమాగదు,పువ్వులు లలితమని తాకితే రాలునని ,తెలిసినా పెనుగాలి రాక ఆగదు,మరణం తధ్యమనీ ఏ జీవికి తప్పదనీ,తెలిసినాఈ మనిషి తపన ఆగదు,ఈ బ్రతుకు తపన ఆగదు అని దాసరి నారాయణరావు గారి పాట గుర్తుకొచ్చింది. ఒకామె ఒంటరిగా తన తండ్రికి అంత్యక్రియలు చేసింది.అప్పుడు పది మాసాలు మోశావు పిల్లలను,బ్రతుకంతా మోశావు బాధలను,ఇన్ని మోసిన నిన్ను,మోసే వాళ్ళు లేక వెళుతున్నావు అనే ఆత్రేయ గారి పాట మదిలో మేదిలింది. కరోనాభయంతో విసిరిపారేసిన వృధా కోడిగుడ్ల గుట్ట లోంచి ఎవరికీ అక్కరలేని జీవులుగా వేలాది కోడిపిల్లలు ఆశర్యకరంగా పుట్టాయి. జీవోత్పత్తి ఆగలేదు మరణము ఆగదు.అయ్యో కోడిపిల్లలది తాత్కాలిక జన్మేనా?వీటికి గింజలువేసి నీళ్లుపోసి కాపాడేదెవరు? అని బాధ పడ్డాము.ఆ చిట్టి జీవుల వీడియో నిజం కాదని మనిషి కూడా భాధాకరంగా చనిపోతున్నాడనీ మరో మిత్రుడు బాధ పడ్డాడు. కరోనా లాంటి బాధాకరమైన మరణాన్ని ఎవరుకోరుకుంటారు? మనజన్మా ఇంతేనా? అని ఆలోచనలు కలిగాయి.మేలంటే అనాయాస మరణమేననీ , మోక్షం లో దొరికే మేలు రంభ ఊర్వశి లాంటి స్వర్గ కన్యల పొందు కాదని , జన్మరాహిత్యమేనని,మళ్ళీ పుట్టకపోవటమే పెద్దమేలని మోక్షమని ఒప్పుకున్నారు.ఆకలి దప్పులు రోగాలు ఉండకపోవడమే పెద్దమేలు అన్నారు. సుఖ మరణమే పెద్ద స్వర్గం అని తేల్చారు.బాధే సౌఖ్యమనే భావన రానివ్వటం దేవదాసు లక్షణం.కానీ ఈనాడు నొప్పి లేని మరణాన్ని చాలామంది కోరుకుంటున్నారు.
సుఖ మరణాన్ని ప్రసాదించే పాలియేటివ్ కేర్ లాంటి వైద్యం మరింత వృద్ధి చెందాలి.చౌకగా దొరికాలి.మరణయాతన చెందుతున్న ముసలివారికి ,రోగులకు సుఖమరణాలను కలుగనివ్వాలి. అమ్మను బాధతో పంపిస్తే నాన్నను రోగబాధ తేలియకుండా హాయిగా ఉంచేసింది ఈ పాలియేటివ్ కేర్ వైద్యం అన్నాడు అక్కినేని నాగార్జున.క్యాన్సర్ ఒక్కటే కాకుండా నయమయ్యే అవకాశం లేని అల్జీమర్స్‌ , కిడ్నీ ,లివర్‌ లాంటి ఏ రోగంతోనైనా మరణ శయ్యపై ఉన్నవారికి నొప్పిని ఒత్తిడిని నివారించే ఈ వైద్య విదానాలకు భారీగా నిధులు కేటాయించాలి.
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

16, ఏప్రిల్ 2020, గురువారం

లాక్ డౌన్ కాలంలో ఆహార సరఫరా పెంచాలి !

లాక్ డౌన్ కాలంలో ఆహార సరఫరా పెంచాలి !(గీటురాయి 1.5.2020)
కరోనా అంటు రోగానికి అమెరికా 27 వేల ప్రాణాలను పోగొట్టుకొంది. ఆరోగ్యం కన్నా ఆర్థిక వ్యవస్థే ముఖ్యం అన్న ట్రంప్‌ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా చితికిపోయింది. ఆర్ధికవ్యవస్థ బాగుండాలంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలి. చైనా మాస్క్‌లు, వైద్య ఉపకరణాలను అమెరికా హైజాక్‌ చేసి తీసుకుపోయింది.మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ను, కరోనా యాంటీ బయాటిక్‌ అజిత్రోమైసిన్‌ మందులను అమెరికాకు ఎగుమతి చేయాలని భారత దేశాన్ని ట్రంప్‌ ఆదేశించి తీసుకెళ్ళాడు. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీలు ప్రయివేట్‌ హాస్పిటళ్ళ నెలవు. ట్రంప్‌ అమెరికాలోని మొత్తం ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ని ప్రైవేట్‌ కంపెనీల పరం చేశాడు కానీ ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలు కరోనా లాంటి వ్యాధులకు ఏమీ చెయ్యవు. బ్రిటన్‌ మాత్రమే లాక్‌ డౌన్‌ లో ఉద్యోగాలు పోయినవారి 80 శాతం వేతనాలను చెల్లిస్తానంది. రోగుల నుండి వచ్చే లాభాల మీదే ప్రైవేటు హాస్పిటళ్ళు నడుస్తాయి. ఈ ప్రైవేట్‌ ఆసుపత్రుల వ్యాపారానికి ఇప్పుడు గండిపడింది. డబ్బులున్న అగ్రదేశం కాబట్టి చెల్లింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, శ్రీలంక, గాంబియా, అంగోలా, కాంగో, ఘనా, లెబనాన్, కామెరూన్, లావోస్‌ లాంటి పేద దేశాలు డబ్బుల్లేక అల్లాడుతున్నాయి. కరోనా అంతరించేసరికి ప్రపంచ జనాభాలో సగంమంది పేదరికంలో మగ్గుతారట. కరోనా పరీక్ష ఫీజు తగ్గాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు అన్నారు. చైనా లాగా మనమూ కొత్త ఆసుపత్రులు కట్టాలి. కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్‌ కిట్లను , సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పిపిఇ), రోగులకు అత్యవసరమైన వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలి.ఆనాడు ముషీరాబాద్‌ జైలు స్థలంలో కట్టిన గాంధీ ఆప్పత్రి ఈనాడు కరోనా రోగులకు నివారణా కేంద్రంగా పనికొచ్చింది.
130 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కొంతమేరకు ప్రైవేట్‌ చేతుల్లోకి కూడా వెళ్లింది. ప్రైవేట్‌ ఆసుపత్రులు బాగా పెరిగాయి. జనాభాలోని 55 శాతం మంది పేదలు, కార్మికులకు పేలవంగా ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. కరోనాలో డాక్టర్లంతా యుద్ధసైనికులే.ప్రైవేటు డాక్టర్లు, నర్సులు ప్రస్తుతం ఇంటి దగ్గర కూర్చుంటున్నారు కాబట్టి వీరి సేవలను తీసుకోవాలి.ఎక్కువ వేతనం ఇచ్చైనా సరే. సైన్యం, పోలీసుల్లాగే డాక్టర్లు కూడా జాతీయ రోగనివారణ విధుల్లో పాల్గొనాలి. ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ కూడా ఏకంగా నలభైరోజుల లాక్‌డౌన్‌లో లేదు. నాలుగు గంటల ముందస్తు హెచ్చరికతో లాక్‌డౌన్‌ తో ఎక్కడికక్కడే అరెస్టయ్యారు కార్మికులు. బాంద్రా రైల్వేస్టేషన్‌ దగ్గర వేలాదిమంది వలస కార్మికులు గుమిగూదారు.మోడీ సప్తసూత్రాలలో వృద్ధుల సంరక్షణ, పేదలకు చేతనైనంత సాయం, వైద్య సిబ్బందిని గౌరవించడం, యాజమాన్యాలు ఉద్యోగులకు అండగా ఉండటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వంటి సూత్రాలు మంచివే.ఆదాయం లేకపోయినా ఆకలి నివారణ సూత్రాలు కూడా ఉంటే బాగుండేది.మనదేశంలో లాక్డౌన్ ను 3.5.2020 వరకు పొడిగించారు. నగరాల్లోనే వుండిపోతే తమకు ఆకలి చావులు తప్పవన్న భయాందోళనలతో లక్షలమందికార్మికులు,కూలీలు స్వస్థలాలకు నడుచు కుంటూ వెళుతున్నారు. మనిషికి బ్రతకడం ముఖ్యం. నిరుపేద వర్గాలకు ఆహార పదార్థాల సరఫరా నగదు బదిలీ జరగాలి. మందులు ఉత్పత్తి చెయ్యాలంటే లాక్‌డౌన్‌ సడలించాలి కర్మాగారాలు పనిచేయాలి , పండించిన పంటను రైతులు అమ్ముకొనేలా రవాణా మార్గాలు తెరవాలి. పెట్రోలు, గ్యాస్‌ రేట్లు తగ్గించాలి.
దాతలు కోటీశ్వరులు ఇచ్చిన విరాళాలు కలుపుకొని ప్రభుత్వ నిధులతో ప్రజా ఆహారానికి ఎక్కువగా ఖర్చు పెట్టాలి. కరోనాకు మందు లేదు. వ్యాక్సినూ లేదు. జబ్బు నివారణే మార్గం. కార్పొరేట్‌ వ్యాపారులు సెలబ్రెటీలు లాభాపేక్షతో దేశాదేశాన విహరిస్తు వ్యాధులు వ్యాప్తి చేయటం తగ్గాలి.తబ్లిక్ భక్తుల కల్లోలం మరువకముందే మధ్య్రపదేశ్‌ లో పల్లవి జైన్ అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ కుటుంబ సభ్యులకు అంటించి కూడా వైద్యశాలకు పోవడానికి కూడా నిరాకరించారు. నెల్లూరు డాక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి విదేశాల నుంచి వచ్చి కరోనాతో మద్రాస్‌ అపోలోలో చనిపోయారు. ముంబయిలో గాయని కనికా కరోనాతోనే విందు ఇచ్చారు. క్యూబా లాంటి చిన్న దేశంలో ఎంతోమంది డాక్టర్లు తయారై ఆరోగ్య అవగాహన పెంచారు.మలేరియా భయంతో మనం ఈనాడు వాడుతున్న దోమల బ్యాట్లు చైనావే. ఆ బ్యాట్లను మనం మానలేము.ఏదేశంలోనైనా మెరుగైన మంచి వైద్యవిధానం వస్తే దాన్ని మనమూ ఆహ్వానించాలి. క్యూబా, చైనాల లాగా మనంకూడా కరోనా రోగులకు ప్లాస్మా వైద్యం చేయించాలి. కరోనా నుంచి కోలుకున్న రోగి రక్తములోని ప్లాస్మాను కరోనా రోగికి ఎక్కిస్తే, ఆ రోగిలో వ్యాధి నిరోధకత ,రోగ విరుగుడు పెరుగుతుందట.ఈ ప్లాస్మా అంటువ్యాధి కారకాలను నిర్వీ ర్యం చేసి రోగిలోని మంచి జన్యువుల్ని కాపాడి, హానికారకమైన జన్యువుల్ని నాశనం చేస్తాయట .
లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లకు సాయం అందించాలి . ఈ కార్మికులందరికీ కేరళలో 5 వేల రూపాయలుఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం రూ.500 ఇస్తానంటుంది. ఎవరినీ పని నుంచి తొలగించ వద్దని మోడీ కోరారు. వారి వేతనాల్లో కొంత భాగం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటిస్తే యాజమాన్యాలకు బాగుండేది. వలస కార్మికుల ఖర్చు బాధ్యత కేంద్రం కూడా భరించాలి. సాయం జరుగుతుందంటే చప్పట్లు కొడతారు, లైట్లు ఆర్పి దీపాలు వెలిగిస్తారు ఇలాంటి ఖర్చు లేని పనులు ప్రజలు ఎన్నయినా చేస్తారు. కరోనాలో కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచారు.ఎక్కువ సేపు పనిచెయ్యాలన్నా , రోగనిరోధక శక్తి కావాలన్నా మళ్ళీ మంచి తిండే కావాలి.అయితే లాక్‌డౌన్‌ తో మనుషులు తినే ఆహారం తగ్గిపోతుంది. ఆహార గిడ్డంగుల్లోని 7.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను బయటకు తీసి ప్రజలకు పంచిపెట్టాలి. మళ్లీ రైతుల నుంచి కొత్త పంటను కొనుగోలు చేయాలి. ప్రలందరికీ ఆహారం పెరగాలంటే వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన పంటల మార్కెటింగ్, పారిశ్రామిక రంగాలకు లాక్ డౌన్ సడలించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధానికి మంచి సూచన చేశారు. ఏప్రిల్ 20 తరువాతన్నా ఈ వ్యవసాయ సడలింపులు ఇస్తే మంచిది.
---నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్ల్టర్ ,6301493266


9, ఏప్రిల్ 2020, గురువారం

క్రికెట్ ను ఆపండి ! వ్యవసాయాన్ని ఆపకండి !


క్రికెట్ ను ఆపండి ! వ్యవసాయాన్ని ఆపకండి ! 
వ్యవసాయంలో సాయం ఉంది.రైతులు కష్టపడితేనే మనకు అన్నం దొరుకుతుంది.మన దేశంలో అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. ఆర్థిక మాంద్యానికి కరోనా లాక్ డౌన్ తోడయ్యింది. లాక్ డౌన్ పొడిగించమని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.అఖిల పక్ష రాజకీయనేతలు ప్రధానిని కోరినా కేరళ, పంజాబ్‌ మాత్రం దశలవారీ ఉపసంహరించాలనీ, పంటల కోత, దిగుబడుల తరలింపు, మార్కెటింగ్‌ కోసం రవాణా మినహాయింపులివాలని కోరాయి. కేంద్రం మొదట్లో 170 లక్షల కోట్ల రూపాయల కరోనా ప్యాకేజీని పారిశ్రామికవేత్తలకిచ్చింది. తరువాత మధ్య చిన్న తరహా పారిశ్రామిక వేత్తల ఉద్దీపన కోసం 15 వేల
కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. రైతులకు కిసాన్‌ పథకం కింద 2000 అడ్వాన్స్‌ దొరుకుతుంది.కౌలు రైతులకు అసలేమీ దొరకదు. లాక్‌డౌన్‌ వల్ల రవాణా, మార్కెట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.పంటలను అమ్ముకోలేని దుస్థితి రైతులకు దాపురించింది.పంట కోయలేక కోసినా అమ్మలేక రైతులు అల్లాడిపోతున్నారు.ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు .కనీస మద్దతు ధర లేదు. ధరలు తగ్గి రైతుల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి.కరోనాకు తోడు అకాల వర్షాలు, పిడుగులు, వడగళ్ళ బీభత్సం వల్ల పంటలు పొలాల్లోనే పాడైపోయాయి. దళారులు, వ్యాపారులు రైతులకు ధరలు దిగ్గోసి దోపిడీ చేస్తున్నారు. ఆహార ధాన్యాలను రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి, అక్రమంగా దాచిపెట్టి, బహిరంగ మార్కెట్‌లో రేట్లు పెంచి ఇష్టారీతిన దోచుకుంటున్నారు. దేశంలో వ్యవసాయం వదిలేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. సొంతభూమి ఉన్న రైతులు కూడా సేద్యంకన్నా కూలిపని నయం అనుకోని సాగుకు స్వస్తి చెబుతున్నారు. దేశంలో ఏటా సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పంట రుణాలిస్తున్నా 42 శాతం కౌలురైతులకు బ్యాంకులేవీ అప్పులివ్వడం లేదు. ఎకరా కౌలుకు కోస్తాలో సగటున రూ.30 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో కౌలురైతుకు మిగిలేదేమీ ఉండటం లేదు.రెండో హరిత విప్లవం సాధించాలని డాక్టర్‌ స్వామినాథన్‌ వంటి శాస్త్రవేత్తలు పిలుపు ఇచ్చారు. అన్నదాతలకు ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి కాబట్టి పరిష్కారాలను కూడా సత్వరమే చూపాలి. పంటలను ఎక్కువకాలం నిల్వ చేయలేరు.గిట్టుబాటుధారలిచ్చి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పంటలు కొనాలి. ఎఫ్‌సిఐ గోదాముల్లో నిల్వ చేసిన నిత్యావసరాలు ఆహార ధాన్యాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలి. ఖాళీ అయిన గోదాముల్లో కొత్తగా సేకరించిన పంటలను నిల్వ చేయాలి. ప్రైవేట్‌, కార్పొరేట్ల మార్కెట్‌ వల్ల ధరలు పెరుగుతాయి.చివరికి ఆహార కొరత కూడా రావచ్చు.ఆహార పంటలే కాకుండా కమర్షియల్‌, ఉద్యానవన, డెయిరీ, ఆక్వా ఉత్పత్తులకు ధరలను పెంచాలి. పంటపొలాలకు దగ్గరలో నూర్పిడి కల్లాలు,కోల్డ్ స్టోరేజీలు కల్పించాలి. రైతులు,కౌలురైతులు, వ్యవసాయ కూలీలు అప్పులపాలై ఆత్మహత్యలబాట పడుతున్నారు. రుణమాఫీ అక్కరలేదు.వడ్డీ మాఫీ కావాలి .రైతుకు వ్యవసాయ పెట్టుబడి కావాలి.అవి దొరక్కనే రైతులు చచ్చిపోతున్నారు. అన్నదాతపై అభాండాలువేయటం తగదు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయిందని గతంలో ఎంపీ గోపాల్ శెట్టి వ్యాఖ్యానించారు.రైతులు దయ్యాలవల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి భూపేంద్ర అనుభవపూర్వకంగా చెప్పారు.రైతు ప్రసాదించే తిండి లేకపోతే మనం బ్రతకటం ఎలా? ఆహారం కావాలంటే పంటల ఉత్పత్తి, రవాణా ఏర్పాట్లు చెయ్యాలి. ఆహార కొరత రాకూదదంటే వ్యవసాయం మానకూడదు. సౌకర్యాలనిచ్చి కొనసాగించాలి.
కరోనా దెబ్బకు ప్రపంచం ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయింది.అన్నిరంగాలలో ఉద్యోగాలు పోతున్నాయి.చైనాది పైచేయి అవుతుందేమోనని భయపడి ట్రంప్ న్యూయార్క్ ను షట్ డౌన్ చేయ లేదు.ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లమంది శ్రామికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది.అసంఘటితరంగంలోని 20 కోట్ల ఉద్యోగాలు పోతాయని 40 కోట్లమంది కార్మికులు దుర్భర దారిద్యంలో కూరుకుపోతారని వాపోయింది.ఇండియా వచ్చిన ట్రంప్ సభకు 100 కోట్లు ఖర్చు అయ్యింది. మీ లిబర్టీ విగ్రహం బాగుందని మెూడీ అంటే , మీ పటేల్ విగ్రహం బాగుందని ట్రంప్ పరస్పరం పొగుడు కున్నారు. మోడీ తో 3 వేల కోట్ల రక్షణ పరికరాల కాంట్రాక్టు గురించి మాట్లాడుకున్నాడు గానీ ట్రంప్ మన విద్యార్ధుల ఉపాధి ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. పైగా అమెరికాలో స్థిర పడ్డ మనదేశ వీసాదారుల్ని కూడా వెళ్లిపొమ్మంటున్నాడట. వాళ్ళంతా ఉద్యోగాలుపోగొట్టుకొని తిరిగొస్తే మన దేశంలో ఉపాధి కల్పించగలమా? తమకు కావలసిన ఆయిల్ ను ఆరబ్ దేశాలను భయపెట్టి తీసుకున్నట్లే అమెరికా ఇండియానుండి క్లోరోక్వీన్ మందు కావాలంది. అమెరికాకు ఇవ్వకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ మొదట నోరు జారాడు.మందు అందాక శుభాకాంక్షలు చెప్పాడు. ట్రంప్ తన వైద్య సిబ్బందిపై కూడా రంకెలు వేస్తాడు. కరోనా వినాశంలో కూడా మోడీ లాంటి మిత్రులనూ ప్రతీకారధోరణితో బెదిరిస్తాడు. స్నేహంలో ప్రతీకారాలు ఉండవని రాహుల్ గాంధీ లాంటివాళ్లు అంటున్నా వినడు. ఈమధ్యే వేరే దేశం కోసం చైనా సిద్ధం చేసిన మాస్క్‌లను అమెరికా తన్నుకుపోయిందట.ఈ ఔషధాన్నే ఇంకా 30 దేశాలూ కోరుతున్నాయి. ఇంకెవరికీ ఇవ్వకూడదట.అమెరికాకు కావలసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అవసరాల్లో 47శాతం మన ఫార్మా కంపెనీలే తీర్చాయి. ఆకాశమూ మాదే , అంతరిక్ష వనరులన్నీ అమెరికావే నంటాడు ట్రంప్. తనకు మాలిన ధర్మాన్ని ఏ దేశమూ చేయలేదు.మోడీ మందుల దౌత్యంతో అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు తెగ సంతోషించారట. ట్రంప్ వచ్చినప్పుడు జరిగిన అల్లర్లలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రాణాల మీద ఆశ వుంటే ఆందోళనలకు పాల్గొనవద్దని బెదిరించాడు. కానీమోడీ కరోనా అన్నార్తులను ఆదుకొని సాయం చెయ్యమన్నాడు.ఆనాడు కరోనాఅని తెలియకపోయినా పరోపకార బుద్ధితో ఢిల్లీ ప్రజలు, లౌకిక శక్తులు మసీదుల్లో హిందూ కుటుంబాలకు, దేవాలయాల్లో ముస్లిం కుటుంబాలకు రక్షణ కల్పించారు.భారతీయుల జీవితం అల్లర్లు ,బెదిరింపుల మధ్యలోనే బ్రతకడమెలాగో నేర్పింది.కరోనాకు మతం రంగు పులమ వద్దని కొందరు తబ్లిగీలు చేసిన తెలివితక్కువ పనికి అందరు ముస్లింలను నిందించ వద్దని చాలామంది పెద్దలు విజ్నప్తి చేశారు. నిజాముద్దీన్ వెళ్ళి వచ్చిన తబ్లీక్ యాత్రికులను పట్టుకొని నిర్బంధ వైద్యం చెయ్యాలని తోటి ముస్లిం లే కోరారు.వారిని మానవ బాంబులతో పోల్చారు దేవేంద్ర ఫద్నవీస్.మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పల్లవి జైన్ ఈ రోగాన్ని దాచిందట.ఏ మత భక్తులైనా కరోనా బారిన పడక తప్పదు.షబే బరాత్ ,గుడ్ ఫ్రైడే లన్నీ ఇళ్లలోనే.దేవుడి గుడులన్నీ మూశేసారు.అమెరికా ఈనాడు 16 వేల కరోనా మరణాలతో ప్రపంచదేశాలన్నిటికన్నా ముందుంది కాబట్టి ఏ మతాన్నీ నిందించవద్దు. తనతల్లి చైనా దేశస్తురాలు కావటం వల్ల తనను హాఫ్ కరోనా అని కొందరు జాత్యహంకారపు కారుకూతలు కూస్తున్నారని గుత్తా జ్వాల బాధపడింది. సేవ చేసే వైద్యులపై దాడి చేసే వాళ్ళు,మద్యం అమ్ముతున్న దుర్మార్గుల కంటే బుద్ధిలేని హీనులు.కరోనాపై పోరులో కుల, మత భేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకు పోవాలి.
మామూలుగా ఒక కరోనా రోగి నెలకు 406మందికి అంటిస్తే ,లాక్‌డౌన్‌ కాలంలో ముగ్గురికి మాత్రమే పరిమితమవుతాడట. లాక్ డౌన్ వల్ల వాహనాల రాకపోకలు ఆగిపోయి, కాలుష్య కారక పరిశ్రమలు మూతబడి వాతావరణ కాలుష్యం, నదుల కాలుష్యం తగ్గింది. నగరాలప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు.పెంపుడు జంతువులకూ మాస్కులు వేశారు.పంటలకు కాయలకు కరోనాలాంటి తెగుళ్లు సోకకుండా కాపాడాలి.
గాడిదలాగా పరుగెత్తావెందుకురా అంటే గుంపులో చేరబట్టి నాబెదురు తీరింది అన్నాడట ఒకడు, నాకడుపు కక్కుర్తి నీకేమితెలుసు అన్నాడట మరొకడు.కాసుల కక్కుర్తితో వాయిదా పడిన ఐపిఎల్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తారట. ఒక్క సిరీస్‌ తో ఆ క్రికెట్ సంస్థకు రూ.3,269 కోట్లు వస్తాయట . ఆటలపోటీలకు కరోనా సమయమే దొరికిందా? ఒలింపిక్స్ ను జపాన్ మానుకోండి. రగ్బీ పోటీలను రగ్బీ యూనియన్‌ వాయిదా వేసింది. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ క్రీడాకారులకు సెలవు ఇచ్చింది. ప్రపంచమంతా కరోనా రక్కసి ధాటికి విలవిలలాడుతున్న వేళ ఆటలాడి సంబరాలు జరుపుకోవాలా? క్రికెట్ ఆట ప్లాణాలను కాపాడలేదని,ఇలాంటి ఆటలపోటీల డబ్బు దేశానికి అక్కరలేదని కపిల్ దేవ్ అన్నాడు.పాకిస్తాన్ కు పదివేల వెంటిలేటర్లు ఇప్పించాలని భారత్ ను అభ్యర్థించాడు అఖ్తర్. విదేశాల నుండి వచ్చే క్రీడాకారుల ద్వారా కూడా కరోనా వ్యాపించ వచ్చు కాబట్టి కరోనా తగ్గేవరకు క్రికెట్ మానుకుందాం. తిండి మానలేముకదా ? ప్రజలకు ఎప్పుడూ కావలసింది తిండి.అందువలన వ్యవసాయానికి లాక్ డౌన్ సడలించి ప్రజలకు ఆహార సరుకుల రవాణా పెంచాలి!
--- నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ , 6301493266

1, ఏప్రిల్ 2020, బుధవారం

అందరికీ కావలసింది అన్నమే! కరోనా దీపాలు తప్పక వెలిగిస్తారు !


అందరికీ కావలసింది అన్నమే! కరోనా దీపాలు తప్పక వెలిగిస్తారు ! (సూర్య 5.4.2020)
లాక్‌డౌన్‌ కోట్లాది వలస కార్మికులకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది. పొట్ట పోసుకునేందుకు సొంత ఊళ్లు విడిచి రాష్ట్రాలు దాటుకొని వలస వచ్చిన కార్మికులు లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ చిక్కుపడ్డారు. ఉన్న చోట ఉపాధి లేక, తిరిగి ఇళ్లకు వెళ్లే దారి లేక నానా అవస్థలూ పడుతున్నారు. రైళ్లు, బస్సుల వంటి ప్రజా రవాణ స్తంభించాయి. నీతి ఆయోగ్‌ సైతం వలస కార్మికులను విస్మరించింది. తిండి తిప్పలు లేవు. సొంత గ్రామాలకు వెళదామంటే రవాణ సౌకర్యాల్లేవు. నగరాల నుంచి వందల కిలోమీటర్లు రహదారుల వెంట కాలి నడకన సాగుతున్న అభాగ్యుల బాధ వర్ణనాతీతం. వలస కూలీల పైనే మహానగరాల మనుగడ. లాక్‌డౌన్‌ వల్ల వారి గూడు చెదిరి, ఎక్కడా పని దొరక్క, ఎటూ కదల్లేక, ఆకలి తీరే దోవ కనబడక, కూడబెట్టుకున్న కొద్దిపాటి సంపాదన హరించుకు పోయి మహానగరాల్లోని వలసజీవులంతా తమ తమ కుటుంబాలతో వేలాదిగా స్వస్థలాలకు కాలి నడకన పయనమవుతున్నారు. కంటైనర్లలో కూర్చుని వేలాది కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. పోలీసులు రాష్ట్రాల సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు.కొన్ని చోట్ల ప్రయాణికుల్ని నేరస్థుల్లాగా కొడుతున్నారు,వాళ్ళను కూర్చోబెట్టి అంటురోగులపైలాగా బ్లీచింగ్ చల్లుతున్నారు.కూలీల చేరవేతకు డిల్లీ ,ఉత్తరప్రదేశ్, బీహార్,రాజస్తాన్,గుజరాత్ కిక్కిరిసిన బస్సులు నడిపాయి.కరోనాకంటే ముందు ఆకలితో చచ్చేలాఉన్నామంటూ వలసకూలీలు కన్నీటిపర్యంతమౌతున్నారు. ఢిల్లీలో ఉపాధి కోల్పోయిన 20,000 మంది బస్టాండ్‌లో పడ్డ దురవస్థలు పడుతుంటే వీరిని తీసుకుపోవటానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతించలేదు.ఢిల్లీ నుండి యూపీకి కాలినడకన బయలుదేరిన ఒక కార్మికుడు 200 కి.మీ. నడిచాక ఆ గ్రామ సమీపంలో ప్రాణాలు వదిలాడు. రాజస్థాన్‌ ప్రభుత్వం తమ కార్మికులను ఉచితంగా బస్సుల్లో తీసుకెళ్తే , ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఛార్జీలు వసూలు చేసింది. కూలీల మీద బరేలీలో పురుగుల మందు స్ప్రే చేసింది. కేరళ ప్రభుత్వం ''అతిథి'' పేరుతో లక్షన్నర మంది వలస కూలీల కోసం ప్రత్యేక పథకం పెట్టి నిధులు కేటాయించింది. వారికి నివాసం, భోజనం, ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి వేలాది రిలీఫ్‌ క్యాంపులు పెట్టింది. 21వేల రైల్వే బోగీలను కేంద్రం కరోనా కూలీల ఆశ్రయాలుగా మార్చింది. గ్రామంలో సరైన ఇళ్ళు లేకపోయినా సొంత ఊరిమీద మమకారం. మావూరికి రావోద్దు అని గ్రామాలలో వేసిన ముళ్ళకంచెలే అడ్డుగా మారాయి.వాటిని అధికారులు తీయించాల్సి వచ్చ్చింది. కూలీలను ప్రధాని క్షమించమంటూ కోరారు. విదేశాల నుండి తీసుకు రావటానికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇక్కడ వలస కూలీల పట్ల, కనీస శ్రద్ధ కూడా పెట్టలేదు.సుప్రీంకోర్టు వాస్తవ పరిస్థితిపై తనకు నివేదిక అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కరోనాపై చాలా మందిలో వున్న భయాందోళనలే పెద్ద సమస్యని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వీళ్ళంతా సొంత ఊళ్ళకు పోయేది అయినవారితో కలిసి పండగ చేసు కుందామన్న యావతో కాదు. సొంత వూళ్లకు కాలినడకన పోతున్నవారికి కరోనా రాదా? కానీ అంతకన్నా వారికి గత్యంతరం ఏముంది? విదేశీ ప్రయాణాలు చేసిన విద్యావంతులే విమానం దిగి ఇంట్లో దాక్కుంటే పట్టుకోటానికి రెండు వారాలు పట్టింది. మళ్ళీ డిల్లీ నిజాముద్దీన్ తబ్లిక్ జమాత్ కు వెళ్ళివచ్చిన ముస్లిం భక్తుల్ని వెతికి పట్టుకోవాల్సి వచ్చింది.కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప 3 వేల మందితో బిజెపి ఎమ్మెల్సీ కుమార్తె పెళ్లికి హాజరవటం,కదిరి ఖాద్రీ నరసింహుని రధయాత్రలో కరోనాను లెక్కచేయకుండా వేలాదిమంది భక్తులు పాల్గొనటం, పూనకం వచ్చినవాళ్లలాగా నమాజులో గుమికూడి ఎగరటం, మదరసాలో భోజనానంతరం పళ్ళాలు స్పూనులు నాకటం అనారోగ్యహేతువులే. ఎడమెడంగా ఉండమనీ ఒకేచోట గుమిగూడవద్దనీ అంటువ్యాధిలో మీటింగ్ అందరికీ హానేఅని డాక్టర్లు చెబుతున్నారు . కరోనాకు కనికా అయినా కరీం అయినా ఒకటే.అది సమవర్తి.అందుకే దేవుళ్ళ ఆలయాలు కూడా మూసేశారు.మనకు హానిచేసే క్రిములు చెడ్డగ్రహాలు,వైరస్ లన్నీ భూతాలు.అవి మన జోలికి రాకుండా దేవుని ప్రార్ధించాలి. క్షమాగుణం కలిగి ఉండాలి. ప్రతి మంచి పనికీ మనకు పుణ్యం వస్తుంది అని ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.
ఫేడల్‌ కాస్ట్రో, చేగువేరాలు చూపిన పరోపకార బాటలో క్యూబా కరోనాను ఎదుర్కొంటూనే మిగతా దేశాలకు వైద్య సాయం చేస్తోంది. తమపై ఆంక్షలు పెట్టిన ఇటలీకి సైతం సాయం చేస్తున్న దాతృత్వం క్యూబాది. కరోనా వ్యాధిపీడితులతో ఉన్న ఒక బ్రిటిష్‌ నౌకను తన రేవుకు పిలిచి, వైద్యం అందించింది. కరోనా వ్యాపించిన దేశాలన్నింటికీ క్యూబా తమ వైద్య బృందాన్ని పంపుతూ మానవత్వాన్ని చాటుతుంటే, క్యూబా సేవలు వినియోగించుకోవద్దంటూ అమెరికా హూంకరిస్తోంది. అమెరికాతో పాటు, ప్రపంచంలో ఏ దేశం కోరినా తమ శక్తిమేరకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని క్యూబా ప్రకటించడం ఆ దేశ ఔదార్యానికి నిదర్శనం. జర్మనీలో కరోనాకు వ్యాక్సిన్‌ తయారవుతోందన్న విషయం తెలియగానే, దానిని ఇతర దేశాలకు అందుబాటులోకి రాకుండా చేయడానికి అమెరికా ప్రయత్నించింది. 1960లో క్యూబా డాక్టర్లు చిలీ భూకంప బాధితుల కోసం పనిచేశారు. 1980 లో డెంగూ కు వ్యాక్సిన్‌ తయారు చేసి ప్రపంచానికి అందించిందిక్యూబా . ఉద్యోగాలు పోయినా మమ్మల్ని అమెరికాలోనే ఉండనివ్వండి అనికోరుకుంటున్న వేలమంది హెచ్ 1 బి వీసాదారులను వెళ్లిపొమ్మంటోంది అమెరికా. ఇరాక్‌, ఇరాన్‌ లమీద కరోనా సమయంలో కూడా ఆంక్షలను సడలించకుండా అమెరికా బాంబులు వేస్తూనే ఉంది.ఒబామా కేర్ లాంటి ఆరోగ్య సేవలను రద్దు చేసిన ట్రంప్ తనదేశంలో కరోనా రాకుండా కట్టడి చేయలేదు. చైనా వైరస్ , వూహాన్ వైరస్ అంటూ ఎగతాళి చేశాడు.ఇక్కడ మనదేశంలో తబ్లిక్ జమాత్ సమావేశానికి వెల్లివచ్చిన వాళ్ళమీదకు కరోనా వాహకులనే పేరు వెళ్లిపోయింది.ఈ కరోనారోజుల్లో ఏ కష్టమొచ్చినా ఆ కష్టానికి నువ్వే కారణం అని అవతలి మతం వాళ్ళను ఈజీగా అనేస్తారు. కాబట్టి మతస్తులు జాగ్రత్తగా హద్దుల్లో ఉండాలి. సన్నెకల్లు కడగరా సయ్యదాలీ అంటే కడిగినట్టే నాకినా ఖుదా తోడు అన్నాడని ఒక పాత తెలుగు సామెత ఉంది . ఆహారం వృధా చేయకుండా మిగిలిన మెతుకులతో సహా పళ్ళెం శుభ్రంగా నాకటం మంచిదే కానీ అంటువ్యాధుల సమయంలో ఇలాంటి అలవాట్లు ఆపేయాలి. ఎక్కడో కొందరు బోహ్రా సాయిబులు పళ్ళాలు నాకే వీడియో పట్టుకొచ్చి కరోనాను వ్యాప్తి చేయటానికి నాకుతున్నారని పుకారులేపారు.కాబట్టి ఎవరూ ఏ మీటింగులకూ వెళ్లవద్దు. ఎడంగా ఉండాలనే వైద్యుల సలహాతో సామాజిక దూరం పాటించాలి. కరోనా అంటే పని మానేసి ఇంట్లోనే ఖాళీగా కూర్చో అని అర్ధమట. పాపం వలస కూలీలు మాత్రం అన్నమో అని అల్లాడుతున్నారు. ఈ కట్టుబాట్లన్నీ పాటించలేక పోతున్నారు.విప్రో అజీమ్ ప్రేమ్ జీ, లక్ష్మీ మిట్టల్ ,రాహుల్ బజాజ్,రతన్ టాటా లాంటి ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు.వలస కూలీలకు ముందు అన్నదానం చెయ్యాలి.
---- నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 630149326