ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, జూన్ 2019, శనివారం

సూర్యుడు ఇలా నిప్పులు కక్కుతున్నాడేమీటీ?


సూర్యుడు ఇలా నిప్పులు కక్కుతున్నాడేమీటీ?
8.6.2019 తేదీన కువైట్ సిటీ లో 63 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఒక వార్త వచ్చింది. కాలిఫోర్నియా లో 1913 లో నమోదైన 56.7 డిగ్రీలే ఇప్పటివరకు రికార్డట.దేశవ్యాప్తంగా ఎండలకు వందలాదిమంది చనిపోయారు. గయలో ఎండ మండిపోతోంది  బయటకురావద్దు అంటూ 144 వ సెక్షన్ విధించారు. అసలు ఇంతగా ఉష్ణం ఉగ్రత దాల్చడమేమిటి?సూర్యుడు ఇలా నిప్పులు కక్కుతున్నాడేమీటీ? ఇలాగైతే కార్చిచ్చు చెలరేగి అడవులు తగలబడిపోతాయి.వన్యప్రాణులు సజీవదహనమవుతాయి.అడవుల్లో దావానలం చెలరేగకముందే ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవాలని రితుపర్డ్ ఉన్యాల్ అనే ఉత్తరాఖండ్ వ్యక్తి  సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు.తీర్పువచ్చేదాకా కార్చిచ్చు తగ్గేందుకు వరుణజపం చేస్తూ ఉండమని సుప్రీం కోర్టు అతనికి సలహా ఇచ్చింది.
చెట్లు కొట్టేస్తున్నారు
భూమిమీద మూడు లక్లల కోట్ల చెట్లు ఉన్నాయని 2015 లో యేల్ యూనివర్శిటీ లెక్కలు తేల్చి చెప్పింది. మనిషికి సగటున 422 చెట్లు మాత్రమే ఉన్నాయట.ఏటా 15 వందల కోట్ల చెట్లు అంతం అవుతున్నాయట. మూడువందలఏళ్ళలో చెట్లన్నీ అంతరించిపోతాయట. 2016 లో పారిశ్రమిక అభివృద్ధి వేగంగా జరగటం కోసం నివాస ప్రాంతాలలోని చెట్లు నరికే  నిబంధనలను సరళతరం చేశారు.ఎర్రచందనం,చందనం,రోజ్ ఉడ్ చెట్లు నరకకూడదు.టేకు,ఎగిస,నల్లమద్ది,బండారు,చెట్లు నరకటానికి రిస్కుగా భావిస్తారు. కరెంటు డిపార్ట్ మెంట్ వాళ్ళు చెట్లకొమ్మలను కొట్టినా ప్రజలు బాధపడుతుంటారంటే చెట్లు ఇస్తున్న నీడతో ,ఆ చెట్లతో మనిషి అనుబంధం తెంచుకోలేనిదన్నమాట. నారింజ,నిమ్మ,తాటి,జామ,సీమచింత,తుమ్మ,రేగు,మామిడి,పనస,కొబ్బరి,జీడిమామిడి లాంటి చెట్లు కొట్టుకోవచ్చు.చెట్లు నరకటానికి అనుమతి తీసుకోవాలి.చెట్లు నరికినవారు దగ్గరలో దానికి రెట్టింపు మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి ఎక్కడికో వెళ్లి నాటనక్కరలేదు మన కున్న కొద్ది స్తలంలో  చాలు. నాటలని మనసు ఊండాలి. ఎంతమంది ఎన్నివిధాలుగా చెట్లు నాటవచ్చో?ఒక అమ్మాయి తన గుడిసె చుట్టూ పది రకాల చెట్లను పోషిస్తే ఇంకోకాయన తన కూతురుకోసం రోడ్డమ్మట వెయ్యిచెట్లను కాపాడాడు.ఎవరికి ఎలా చేతనైతే అలా పచ్చదనాన్ని పెంచండి.
చెట్లు నరకడం వల్ల భూగోళం వేడెక్కుతుంది తద్వారా మంచు ఖండాలు కరిగి  సముద్ర మట్టం పెరుగుతుంది. భూభాగం  సముద్రాలలో కలసిపోయి  మన భవిష్య తరాలకు ఊండటానికి చోటు ఉండదు.ఒక బోన్సాయ్ మొక్క  అణుబాంబుకాలుశ్యాన్నీ తట్టుకొని నిలబడిందట. ఇంట్లో  టీవీ,ఫ్రిజ్,ఎసి,కంప్యూటర్ ఇంకా ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదలచేసే వేడి వాయువుల్ని తగ్గించుకోవాలంటే  ఇంటిలో కూడా మొక్కలు పెంచు కోవాలని చెబుతున్నారు. ఇప్పటిదాకా  చెట్లు నరికివేసిన జనం ఇప్పుడు భూమివేడెక్కేటప్పటికి  చల్లదనం, పచ్చదనం కోసం భవనాలపై కూడా  మొక్కలు పెంచుతున్నారు.
మూఢనమ్మకాలు
కొన్ని మూఢనమ్మకాలతో మంచి మొక్కలనుకూడా ఇళ్ళల్లో పెంచటం లేదు.ఉదాహరణకు కరివేపాకు  చెట్లను ఇళ్ళల్లో కూడా పెంచితే పచ్చదనం,సువాసన,నీడ, వంట దినుసు...ఇలా ఎన్నో లాభాలున్నాయి.మన పరిసరాలు బాగుంటాయి.కానీ ఇళ్ళలో పెంచకూడదనే మూఢనమ్మకం ప్రజల్లో ఉంది.నేను ఉచితంగా మొక్కలు ఇచ్చినా కొంతమంది తీసుకోలేదు..'కరివేపాకు కాసులు కురిపించే లక్ష్మీదేవి'అని బాగా ప్రచారం జరగాలి.కరివేపాకు పెరట్లో పెంచితే మంచి జరుగుతుందని స్వాములవార్లు,సిద్ధాంతులు చెప్పాలి.ముళ్ళుకూడా లేని సుగంధ మొక్క కాబట్టి ప్రతి పెరడూ కరేపాకుతో కళకళ లాడాలి.మన పర్యావరణం బాగుపడాలి.
నదిలో ఇసుక తోడేస్తున్నారు
ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియాలు తయారై నదిని నాశనం చేస్తున్నారు.నదీతీరంలో ఉండే పెద్ద వృక్షాలను నరికేస్తున్నారు. రోడ్లవెడల్పుకోసం నగరాలలో కొత్త కార్యాలయాల భవనాలకోసం  చెట్లు తొలగించారు.అత్యాధునిక సాంకేతిక యంత్రాలువాడి చెట్లను వేళ్ళతో సహా పెకలించి మరో చోట నాటుతామని చెప్పారుగానీ చెట్ల పునస్థాపన గానీ పునరుద్ధరణగానీ జరగలేదు.పచ్చదనలేమికి తోడు  ఏసీలు ఫ్రిజ్ లు విడుదల చేసే వేడి గాలులు పెరిగాయి. ఎండాకాలం అవస్థలు పెంచుతున్నారు భవిష్యత్తు ఇంకా ఘోరంగా ఉంటుంది.
 చెట్లు  ప్రాణవాయువును ఇస్తాయి  
చెట్టు కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది.30-40 చదరపు మీటర్ల పచ్చని ప్రాంతం నుంచి ఒక్క రోజులో తయారయ్యే ఆక్సిజన్‌ ఒక మనిషికి ఒక రోజుకు సరిపోతుంది.ఒక కారు వంద లీటర్ల పెట్రోలును వినియోగించుకొనేందుకు 350 కిలోల ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. దానికి తోడు కాలుష్యాలను భారీ మొత్తాల్లో గాలి లోకి విడుదల చేస్తుంది. 25,000 కిలో మీటర్ల దూరం పాటు ప్రయాణించటం ద్వారా ఒక కారు విడుదల చేసిన కాలుష్యాన్ని ఒక చెట్టు పూర్తిగా పీల్చుకోగలుగుతుంది. ఒక చెట్టు సంవత్సర కాలంలో 330 కిలోల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఆడవులు తగ్గే కొద్ది మన ఆయుప్రమాణం కూడా కాలుష్యం వలన తగ్గిపోతుంది. చెట్లు మన నేస్తాలు. పెరట్లో రెండు  చెట్లుఉంటే  రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .పెద్ద చెట్టుకు రెండు నుండి నాలుగు లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ గాలిని వడపోసి శుభ్ర పరుస్తాయి..ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా ఉండే చెట్లు ఏటా 13 టన్నుల దుమ్ము,ధూళిని  తొలగిస్తాయి..చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటే చెట్లున్న  రోడ్ల దగ్గర కేవలం 3 వేలే ఉంటాయి. చెట్టు సహజ మయిన ఎయిర్ కండిషనర్  లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు 100 గ్యాలన్ల  నీటిని గాలి లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు  ఎయిర్ కండీషనర్లు  రోజుకు ఇరవై గంటల వంతున పని చేస్తేనే గాని ఇవ్వలేవు.ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి. 400 చెట్లు ఒక  వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగిస్తాయి.
చెట్లు వాతావరణ కాలుష్యాన్ని  అరికడతాయి
 వాతావరణంలో 78 శాతం నత్రజని, 21 శాతం ఆక్సిజన్,  అర్గాన్, కార్బన్ డై అక్సైడ్, హీలియం, నైట్రస్ అక్సైడ్, మీథైన్ ,కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై అక్సైడ్, ఓజొన్, అమ్మోనియా  ఉంటాయి. పెట్రోలియమ్,డీజిలు, కిరోసిన్ మండించడం , అడవులను నరకటం,పరిశ్రమలనుండి  రసాయన కాలుష్యాలు వెదజల్లటం  వల్ల వచ్చే కార్బన్ డై అక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ లాంటి  విష వాయువులతో వాతావరణం కలుషితమవుతుంది.ఈ విషవాతావరణాన్ని  పచ్చని  చెట్లు బాగుచేస్తాయి.చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటాయి.  కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఎండ,నీరు,కార్బన్ డై అక్సైడ్ లను వాడుకొని  పిండి పదార్థాన్ని తయారుచేసుకొని  అక్సిజన్ ని విడుదల చేస్తాయి. నీటిని ఆవిరి రూపంలో వెలువరించి వాతావరణాన్ని చల్లబరుస్తాయి.  పొగ, దుమ్ము, దూళి,మనఇళ్ళల్లోకి రాకుండా అడ్దుకుంటాయి.భగభగ మండే సూర్యుడికి మనకు అడ్డుగా ఉండి నీడగానిలిచే చెట్లను మన కోసమే మనం కాపాడుకోవాలి.
చెట్లు నరికేవాళ్ళను,నరికించే వాళ్ళను శిక్షించాలి
చెట్లు తగలబెట్టే వాళ్ళకు శిక్షలేవీ? చెట్లు లేకుంటే జీవజాతులు,మనం కూడా మనుగడ సాగించలేము.మీకు వీలైనప్పుడల్లా మొక్కలు నాటండి. మొక్కలు పాతే వారికీ సహాయం చేయండి.మొక్కల్ని రక్షించండి.పచ్చదనాన్నీ,చల్లని నీడను పెంచండి. చెట్టు నీడన అన్నీ కులాలవాళ్ళు,మతాలవాళ్ళు చేరతారు.బండరాళ్ళమధ్య కొద్దిగా మట్టి ఉన్నా మొక్కలు మొలుస్తాయి.మనిషికి సాధ్యంకానిడి మొక్కకు సాధ్యమౌతుంది. చెట్లను నిలువునా తగలబెడుతున్నారు.కొన్నిచోట్ల యాసిడ్ పోసి చెట్లను మాడుస్తున్నారు.కొన్నిచోట్ల చెట్టుకు చేతబడి చేసి చంపారని అబద్దాలు అల్లుతున్నారు. నీడనిచ్చే చెట్టుపై ఇన్నిరకాలమోసం ఎందుకు?  ఒక మొక్క నాటలేని వాడికి దాన్ని నరికే యోగ్యత ఉందా?
---నూర్ బాషా రహంతుల్లా 6301493266 (సూర్య23.6.2019)

1 కామెంట్‌: