ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, నవంబర్ 2019, గురువారం

లంచం అడిగితే కొట్టండి, లంచగొండులు ప్రజాద్రోహులు


                                  లంచగొండులు ప్రజాద్రోహులు 

లంచం అడిగితే కొట్టండి. వాళ్ళు ప్రజాసేవకులు. పనిచెయ్యని అధికారుల చేతిలో వేధింపులకు గురికావద్దు అని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18.9.2019                     న దేశప్రజలకు సెలవిచ్చారు.ఇప్పుడు అది కొట్టే స్థాయి దాటి చంపే స్థాయికి వెళ్ళింది . సజీవదహనం అయిన తహసీల్దారు విజయారెడ్డి పై ఎంతమంది సానుబూతి వ్యక్తం చేశారో సజీవదహనం చేసి చనిపోయిన సురేష్ అనేరైతుఎంత బాధ పడి ఉంటాడో కదా అని రెవిన్యూ వాళ్ళ అవినీతి గురించి రైతులు పుంఖానుపుంకంగా తమ అసంతృప్తి గళాలు విప్పారు.  ఒక్క రెవిన్యూనే కాదు ప్రతి శాఖా అవినీతి మయం అయ్యిందని అందుకే కడుపుమండి భారతీయులు తయారవుతున్నారని అంటున్నారు. రెవిన్యూ సిబ్బంది లో భయం మొదలయ్యింది. కుటుంబంతో సహావచ్చి ఆత్మహత్యలు చేసుకుంటామని , విజయారెడ్డి గతే నీకూపడుతుందని కొంతమంది తహసీల్దార్లకు బెదరింపులు వచ్చాయి.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటమే కారణం అని చెబుతున్నారు.అడ్డంగా తాడు కడితే ఏమిటి ప్రయోజనం ? మీ అవినీతిని ఆపి ప్రజలకు పనులు చెయ్యండి అదే చాలు అంటున్నారు. సజీవదహనం తరువాత కూడా లంచాలు తీసుకోవటం ఆగలేదు.మధ్యవర్తిని పెట్టుకొని తీసుకున్నారు.అనిశావాళ్ళకు చిక్కారు.ఈ అవినీతి ఆగదు.తిరిగి తిరిగి పనికాక వేసారినవాళ్లు రాజకీయులు,అధికారుల హాహాకారాలు వినాలని ఉవ్వీళ్ళూరుతున్నారు.
ఉద్యోగస్థుడైనా సాధారణ పౌరుడైనా తనకు న్యాయబద్ధంగా రావలసిన  ప్రయోజనం రాకపోతే చాలా బాధపడతాడు.మోసానికిగురైతే మానసికంగా కుంగిపోతాడు.చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా జాప్యం చేసేవారిపట్ల కోపం పెంచు కుంటాడు.కాపు కరణం నాపక్కనుంటే కొట్టరా మగడా ఎలా కొడతావో చూస్తాను?అని పూర్వం ఒక సామెత ఉండేది.ఇప్పుడు రాష్ట్రం యావత్తూ రెవిన్యూ సంఘాలు తహసీల్దార్లకు రక్షణ కల్పించాలని ఉద్యమాలకు దిగారు.డిల్లీలో రక్షకులకు రక్షణ కల్పించాలని పోలీసులు ఉద్యమించారు.ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని చంద్రబాబునాయుడు వాపోయారు. రోగికి సరైన వైద్యం చెయ్యలేదని డాక్టరుని, క్లయింట్ కు సరైన న్యాయం జరుగలేదని లాయర్ల ను,తగలబెట్టుకుంటూ పోతే ఎలా?  
ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. కోట్ల రూపాయల ఖర్చుతో మొదలు పెట్టిన 'రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పథకం' ఎన్నో లొసుగులతో నీరుగారిపోయింది. ఏదో ఒక రీతిలో పట్టా పుస్తకాలు ప్రదానం చేసి చేతులు దులుపుకోవాలన్న ఆరాటమే తప్ప ఆ పుస్తకాలు వాస్తవ స్థితిని ప్రతిబింబించాలి.ముందుగా భూముల సర్వే జరిపించాలి.భూముల సర్వే జరుపకుండా ఎప్పుడో  బ్రిటిష్ వాడు తయారుచేసిన సర్వే రిపోర్టుల ఆధారంగా పాస్ పుస్తకాల పంపిణీకి పూనుకోవటం వల్ల 'రికార్డ్ ఆఫ్ రైట్స్' అనేది ఒక ప్రహసనంగా మారింది. అప్పటి భూయజమానిగా మన తాతల పేర్లు ఉంటాయి.ప్రతి సంవత్సరం ఆడంగల్ ను తాజాపరచటం గ్రామపాలనాధికారి బాధ్యత.అది జరగటంలేదు.రెవిన్యూ వాళ్ళను భూరికార్డుల నిర్వహణకే పరిమితంచేస్తే బాగుంటుంది. రిజిస్ట్రేషన్ రుసుము  10 శాతం దాకా ఉంది. భూముల మార్కెట్ రేటు పెరుగుతూనే ఉంది.ఈ ఆర్ధిక భారాన్ని భరించలేక రైతులు క్రయవిక్రయాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. దస్తావేజులు రాసే వాళ్ళ దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ ల వరకు అంతా రైతుల నుండి డబ్బు గుంజుతున్నారు.ఎవరికివారే దస్తావేజులు రాసుకొనే పద్దతి అందుకే ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయాలి.  రెవెన్యూ శాఖ వద్దకు వచ్చే వాళ్లలో ఎక్కువమంది పేద రైతులు ఉంటారు.స్టాంపు డ్యూటీ కట్టలేక చాలామంది కొన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసుకోరు. రిజిస్ట్రేషన్ లేకుండా రికార్డులలో పేర్లు మార్చడం కుదరదు. అది నేరం. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనికాదు.  
రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నెరవేర లేదు. “కుక్క దొరికితే రాయి దొరకదు. రాయి దొరికితే కుక్క దొరకదు. రెండూ దొరికితే రాజు గారి కుక్క” అన్నట్లుగా సాగుతోంది. రేషన్ కార్డుల కోసం విరగబడి వచ్చి క్యూలుగట్టే రైతులు పాసుపుస్తకాలిస్తామంటే మొఖం చాటేశారు.కాని “అవ్వను పట్టుకుని వసంతమాడినట్లు” ప్రభుత్వం రెవిన్యూ అధికార్లను పట్టుకుని ప్రగతి ఏదీ, పురోగతి ఏదీ అని నిలదీస్తున్నది. పాసు పుస్తకాలిచ్చే బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖకు కూడా అప్పగిస్తే పని చాలా వేగంగా జరుగుతుంది. సవాలక్ష బాధ్యతలు తలపై వేసుకున్న రెవిన్యూ శాఖకు కొన్ని  భారాలు  తొలగించాలి. ఎన్నెన్నో ఒత్తిడుల మధ్య రెవిన్యూ అధికార్లు తమ బహుముఖ విధులను నిర్వర్తిస్తున్నారు.మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర వి.వి.ఐ.పి.లు పర్యటనకొస్తున్నారంటే చాలు వారి గుండె గుభేలుమంటుంది. ప్రజా సదస్సులు, అధికార సభల నిర్వహణ భారం కూడా వారి మీదే పడుతుంది. రాత్రింబవళ్ళు శ్రమించడమే కాకుండా కొన్ని ఖర్చులు జేబు నుండే పెట్టుకోవాలి. వి.ఐ.పి.ల అతిధి సత్కార్యాల ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చేది నామమాత్రం. వారికి మర్యాదలో ఏ మాత్రం లోటు వచ్చినా చీవాట్లు తప్పవు. అందువల్ల ఖర్చులన్నీ స్వయంగా భరించుకుని తంటాలు పడుతున్నారు. అయినా వీరిపై ఎవరికీ సానుభూతి ఉండదు.వి.ఐ.పి.ల ఖర్చులు ఎవరు భరిస్తున్నారో దర్యాప్తు చేయాలి. పౌరసరఫరాల కోసం ప్రత్యేక శాఖ లేదు. పని అంతా రెవెన్యూ శాఖ వారే చేస్తున్నారు. ఇందువల్ల రెవెన్యూ శాఖకు పనిభారం అధికమవుతోంది. ఈ సమస్య తీరాలంటే పౌరసరఫరాల పని భారాన్ని రెవెన్యూ శాఖ నుంచి తప్పించి పౌరసరఫరాల శాఖే స్వయంగా నిర్వహించాలి. తహసీల్దారు అడిగిన లంచం కోసం కొందరు రైతులు బిక్షమెత్తిన సందర్భాలు,కిడ్నీలు అమ్ముకున్న సందర్భాలు  ఉన్నాయి. లంచం ఇస్తేనే పట్టాదారు పాస్ పుస్తకం తయారీని వీయార్వోలు మొదలుపేడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి లంచగొండులను ఎరివేయకపోతే బలహీనులకు పనులు జరగవు. కొంతమంది ఉద్యోగులు   విపరీతమైన కాలయాపన చేస్తున్నారు.కొందరు తప్పులతడకలుగా పనులు చేస్తున్నారు.ఇవన్నీ కలిసి కొండల్లా పేరుకుపోతున్నాయి. రాష్ట్రస్తాయి ఆఫీసుల్లో జిల్లాలోని పెండింగ్ సంస్యలపట్ల సమీక్షలు క్రమగా జరగాలి. .ప్రజలకు తమశాఖ ద్వారా జరగవలసిన పనులను ఏవి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి,ఎందుకు పెండింగ్ పెట్టారు ,ఎలా వాటిని పరిష్కరించాలి అని నెల నెలా శాఖాధిపతులు,మంత్రులు సమీక్షలు జరపాలి.ప్రతి అర్జీకి రశీదుఇచ్చి దానిమీద ముద్రించిన తేదీ లోపల పని చేస్తే చాలు.అదే మహాభాగ్యం.ఎంక్వయిరీ అధికారికి ఫలానా తేదీ లోపల విచారణ పూర్తి చేయాలని ఆదేశాలలో ఉన్నా అతను ఎంక్వయిరీ సకాలంలో మొదలుపెట్టకపోతే ఎప్పటికీ పనిపూర్తవుతుంది?స్పందన కార్యక్రమం రాష్ట్రప్రధాన కార్యాలయాల్లో,సచివాలయంలో  కూడా జరపాలి.జిల్లాకార్యాలయాలలో పనులు జరగని ప్రజలు రాజధానిలో మాత్రమే  పనులు కావలసినవాళ్ళు అర్జీలు  పెట్టుకుంటారు.ఎందుకంటే కొన్ని అర్జీల పరిష్కారానికి డైరెక్టర్లు,కమీషనర్లు,శాఖాధిపతులు ఆయా దీర్ఘకాలిక పెండింగ్ కేసులపై  దృష్టి పెట్టి  మార్గదర్శనం చెయ్యాలి.పెండింగ్ సమస్యల పరిపూర్తి పై శాఖాధిపతులు నిరంతర సమీక్షలు జరపాలి. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి.నీతిగా పనిచేసే అధికారులను ప్రజలు మర్యాదగా కాపాడుకుంటారు.లంచం అడిగితే అధికారికి విలువ ఉండదు.అందుకే కొంతమంది అధికారులు మాకు లంచం ఇవ్వొద్దు ప్లీజ్ అని ఫ్లెక్సీలు తగిలించుకున్నారు.
నూర్ బాషా రహంతుల్లా 
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

2 కామెంట్‌లు: