ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, నవంబర్ 2013, గురువారం

నిర్వాసితులు



భూసేకరణ నిర్వాసితులు

నూర్ బాషా రహంతుల్లా 9948878833

"సంపదపై , భూమిపై అంతిమంగా అధికారం ప్రభుత్వానిదే (ఏమినేంట్ డొమైన్ ) " అనే సూత్రంతో 1894 భూసేకరణ చట్టం ఏర్పడింది. దాని ప్రకారం ప్రజోపయోగపనులకు అంటే రోడ్లు, రైలు మార్గాలు,కాలువలు, కార్యాలయభావనాలు లాంటి వాటి కోసం అవసరమైన భూమిని సేక రించవచ్చు. ప్రజల ఉపయోగం కోసం భూములను తీసుకోవచ్చుగానీ ప్రైవేటు కంపెనీలకోసం ప్రభుత్వం భూమి కొనివ్వటం తగదని , భూములను కార్పోరేట్, మల్టీనేషనల్ కంపనీలకు ధారాదత్తం చేయకూడదనీ  ప్రజలను అమానవీయంగా నిర్వాసితుల్ని చేయకూడదనీ ఉద్యమాలు చెలరేగాయి. ఉండటానికి ఇల్లు,ఇంటిస్థలం కూడా లేక ఒకటో రెండో  సెంట్లు భూమి ఇప్పించమనికోరే నిర్భాగ్యులు  ఒకపక్క , పరిశ్రమలు  పెట్టుకుంటానికి వందలాది ఎకరాలు ఇప్పించమని కోరే భాగ్యవంతులు మరోపక్క ఏకకాలంలో దర్శనమిచ్చే విచిత్రదేశం మనది.

అందరికీ భూమే కావాలి

ఏదీ ధ్వంసం కాకుండా ఏదీ నిర్మించడం కుదరదట. రైతులు వేలకు అమ్ముకుంటే పరిశ్రమలవాళ్ళు  కోట్లకు అమ్ముకుని కొల్లగొట్టిన దానిపేరే కదా అభివృద్ధి? రియల్‌ మాయ.ఇది  రైతు భూముల్ని మింగేసిన కొండచిలువ. భూమిపుత్రులకు నేలతో బంధాన్ని తెంపేసిన రాక్షసి అంటూ  భూసేకరణ చట్టాన్ని కవులు వర్ణించారు.ఇది  నిర్వాసితుల  బతుకుల్ని ఆగం చేసిన అభివృద్ధి  అంటూ ప్రాజెక్టుల్ని తిట్టిపోశారు. పెద్ద నగరాల చుట్టూ ఉన్న లక్షలాది ఎకరాల భూమి  సెజ్ లకు, హై టెక్ సిటి, రింగ్ రోడ్, గ్రేటర్, ఎయిర్ పోర్ట్, లాంటివాటికి ఖర్చయిపోయింది. ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్స,ఆదివాసీ ప్రాంతాలలోని భూముల కోసం  టాటా, జిందాల్, మిట్టల్, ఆర్సెలర్, సలీం, వేదాంత, పోస్కో లాంటి బహుళజాతి కంపనీలు భూమి కోసం నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

గోవా, సింగూరు,నందిగ్రామ్, నారాయణ పాట్నా, పోస్కో, నియమగిరి, కళింగనగర్, సోంపేట, గంగవరం పోర్ట్, కాకరాపల్లి, కొవ్వాడ, పోలవరం,లాంటి ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయి. ఇటీవల జరిగిన జన సత్యాగ్రహంలో  దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన లక్ష మంది రైతులు గ్వాలియర్‌ నుంచి ఢిల్లీ దాకా ఊరేగింపుగా వెళ్లి తమదని చెప్పుకోగలిగేలా తమకు తలో పది సెంట్ల భూమి అయినా ఇప్పించాలని ఆందోళన జరిపారు.

 

నిర్వాసితుల వాదన,ఆవేదన
పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమి రాదు. తిండికీ, ఉపాధికీ.. రెంటికీ భూమి కీలకం. భూమి లేకపోతే ఎందుకూ కొరగాము.పని పోయి, విద్య లేక, మరో పని రాక..మరింత పేదలవుతున్నాము. పరిహారంలో కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకుంటున్నాము. అప్పులు తీరుస్తున్నాము. ఇంటి ఖర్చుల కోసం, పెళ్లిళ్ల కోసం, ఖర్చు పెత్టేస్తున్నాం. పరిహారంలో ఎక్కువ భాగం నిరుపయోగమైన రీతిలో ఖర్చైపోతోంది. పునరావాస కేంద్రాలు కనీస వసతులు లేక అధ్వానంగా ఉన్నాయి. ఎలాగూ మీ  గ్రామం ప్రోజెక్టు  కింద పోతుందంటూ కొన్ని ఏళ్ళ పాటు అభివృద్ధి పనులు చేపట్టలేదు. పునరావాసం త్వరగా కల్పించరు . పరిహారం పెండింగ్‌లో పెడతారు. ఇండ్ల సర్వేలు కొనసాగుతూనే ఉంటాయి. వ్యవసాయమన్నా చేసుకోనియ్యకుండా పొలాలు  బీళ్ళుబారతాయి.తినే మా చేతిలో కంచం గుంజుకుని వట్టి మెతుకులు చేతుల్లో చల్లినట్లు ఉంది మా నిర్వాసితుల పరిస్థితి. నిర్వాసితులకు కనీస ఉపాధి కానీ  కాంట్రాక్ట్ పనులు కానీ లభించటంలేదు. ఎక్కడి నుంచో  వచ్చే  కాంట్రాక్టర్లు లేబర్‌ను కూడా వాళ్ళ ప్రాంతం నుంచే తెచ్చుకుంటారు. చివరికి మట్టి లెవలింగ్ చేసే పనులు, టార్పాలిన్ కట్టే పనులు లాంటివి కూడా మాకు ఇవ్వడం లేదు.సరిపడా పరిహారం చెల్లించాలి , పునరావాసం వెంటనే కల్పించాలి. లేకపోతే మా భూమిని మాకు వదిలిపెట్టాలి. మీరిచ్చిన ఆ డబ్బులు ఎటు పోయాయో తెలియదు. మొత్తం మోసమే. నిరుద్యోగులకు 350 రోజుల కూలీ ఇవ్వలేదు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పునరావాసంతోపాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు. అదీ లేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకపోవడంతో గుడిసెల్లో నివసిస్తున్నాము . మరుగుదొడ్లు, దీపం గ్యాస్ కనెక్షన్లు లేవు.  గ్రామంలో గుడి నిర్మించలేదు. భూములిచ్చి ఇతర మండలాలకు, ఇతర జిల్లాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యంత దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాం. సర్వం కోల్పోయి పరిహారం కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. మా  త్యాగానికి విలువ లేకుండా పోతోంది. పరిహారం త్వరగా అందించకుండా  నలిపేస్తున్నారు . భూములను కోల్పోయిన రైతులు పొట్టకూటి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇంతకాలం ఉన్న ఊళ్లో నలుగురికి ఉపాధి చూపించిన రైతులు ఇప్పుడు బతకడం కోసం కూలీలుగా మారుతున్నారు.
పోరాటాల ఫలితం
సుప్రీం ధర్మాసనం- భూసేకరణ చట్టాన్ని సంస్కరించాలని , పరిశ్రమలు, సెజ్‌ల ఏర్పాటుకోసం ప్రభుత్వం భూ సేకరణదారుగానే కాదు, పేదల పక్షాన వారి ప్రయోజనాల పరిరక్షకురాలిగానూ వ్యవహరించాలని సూచించింది. భూసేకరణ జరగకముందున్న జీవన స్థితిగతులే ఆ తరువాతా కొనసాగేలా నిర్వాసితులకు పరిహారం ఉండాలని లా కమిషన్‌ 1958లో సూచించింది. సాగుకు పనికిరాని పడావు భూముల్లోనే ప్రత్యేక ఆర్థికమండళ్లను అనుమతించాలంటూ 2006నాటి నైనిటాల్‌ సదస్సులో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు సోనియా చెప్పారు. ప్రైవేటు పరిశ్రమల కోసం ప్రభుత్వం రైతుల భూమి ఎందుకు సేకరించాలి? బలవంతపు భూసేకరణ  రైతు జీవితాలను ఛిద్రం చేస్తుంది. రైతులకు భూమి తప్ప ఇంకేముంది? అత్యవసరమైతేనే భూ సేకరణ జరపాలి. అదీ పనికిరాని భూములనే సేకరించాలి అని అజిత్‌ సింగ్‌, మేధా పాట్కర్ ,మమతా బెనర్జీ ,ములాయంసింగ్‌ యాదవ్‌ లాంటివారు ప్రశ్నించారు.
నేపద్యం లో "జాతీయ భూసేకరణ -నష్ట పరిహారం, పునరావాస చట్టం-2011 వచ్చింది. 29.7.2013 న చరిత్రాత్మక భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది.ప్రాజెక్టుల నిర్వాసితులకు సహాయ పునరావాస  ప్యాకేజీల ద్వారా  మానవీయ కోణంలో న్యాయం చేయటం. రైతులకు న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా పరిహారం అందించడం, బలవంతపు భూ సేకరణను నివారించడం , సేకరణ వల్ల భూమి కోల్పోయిన వారిని సేకరణ అనంతరం జరిగే అభివృద్ధిలో భాగస్వాములను చేయడం, వారి సామాజిక, ఆర్థిక స్థాయిని మెరుగుపర్చడం బిల్లు ప్రధాన లక్ష్యాలు.
2013 భూసేకరణ బిల్లులోని ముఖ్యాంశాలు
 గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్‌ విలువకు నాలుగు రెట్ల దాకా, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్ల దాకా పరిహారం అందివ్వాలి.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలంటే 70 శాతం దాకా, ప్రైవేటు కంపెనీలకు భూసేకరణ చేయాలంటే 80 శాతం దాకా తప్పనిసరి సమ్మతి ఉండాలి.
 భూమికి భూమి, ఇళ్ల మంజూరు, ఉపాధి, సేకరించిన భూమికి ఏకమొత్తంలో చెల్లించిన నగదుకు అదనంగా జీవితాంతం వడ్డీ లాంటి ప్రతిఫలం తదితర ప్రయోజనాలు.
గతంలో భూసేకరణ జరిగీ, పరిహారం ఇవ్వని కేసులకూ ఈ చట్టం వర్తింపు.
షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గ్రామసభల ఆమోదం లేకుండా భూసేకరణకు వీల్లేదు. పరిహారం పూర్తిగా చెల్లించేంతవరకు, పునరావాసానికి ప్రత్యామ్నాయ స్థలాలు సిద్ధం చేసేంతవరకు ఎవరి దగ్గర నుంచీ భూమిని తీసుకోవడానికి వీల్లేదు.
ఆహారభద్రతకు భంగం కలగకుండా, ఏకపక్షంగా భూసేకరణ జరగకుండా ఉండేందుకు వ్యవసాయ భూముల సేకరణపై పరిమితులు విధించాలని రాష్ట్రాలకు సూచన.
సేకరణ జరిగిన తర్వాత భూమిని ఉపయోగించుకుండా ఖాళీగా అట్టిపెడితే... ఆ భూమిని తిరిగి సొంతదారుకు అప్పగించడం లేదా రాష్ట్ర భూ బ్యాంకుకు జమ చేసే అధికారం రాష్ట్రాలకు.
భూమిని అప్పగించిన వ్యక్తికి అందే మొత్తంపై ఆదాయపు పన్ను విధించరాదు. స్టాంపు రుసుం వసూలు చేయరాదు.
సేకరించిన భూమిని మూడో పార్టీకి అధిక ధరకు విక్రయించిన పక్షంలో లాభంలో 40శాతాన్ని అసలు సొంతదారుకు ఇవ్వాలి.
ప్రాజెక్టుల్లో భూమిని కోల్పోయే ఎస్సీ/ఎస్టీ వర్గాల వారికి భూమికి భూమి ఇవ్వాలి .వారిని మరో జిల్లాకు తరలించాల్సి వస్తే అదనంగా 25శాతం పునరావాస పరిహారం చెల్లించాలి.
*చైనాలో 'త్రీ గోర్జెస్' డ్యామ్ నిర్మాణ వ్యయంలో ఇంచుమించు సగాన్ని పదమూడు లక్షలమంది నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలకే ప్రత్యేకించారు.వారికి జీవితకాల పింఛను, శాశ్వత వసతి కల్పించారు"

*జపాన్‌లో  

స్వాధీనం చేసుకున్న భూమికి బదులుగా అటువంటి భూమినే అంతే పరిమాణంలో మరో చోట కొనుగోలు చేసుకోవడానికి అవసరమైన ధనం సమకూరుస్తారు.కొత్త ప్రాంతానికి తరలివెళ్ళి,అక్కడ పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే వ్యయాన్ని భరిస్తారు.కొత్త ప్రదేశానికి తరలివెళ్ళడంలో కోల్పోయే లాభాన్ని కూడా చెల్లిస్తారు.స్వాధీనం చేసుకున్న భూమికి భవిష్యత్తులో లభించే ధరలో వాటా ఇస్తారుప్రాజెక్ట్‌ను నిర్మించడం వల్ల స్వాధీనం చేసుకొనే భూమి ధరను పెంచుతారు.పునరావాసం ఏర్పాటు చేసుకోవడానికై కొత్త ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడంలో అయ్యే వ్యయాన్ని భరిస్తారు.భూమిని పరస్పర సంప్రతింపుల ద్వారానే కొనుగోలు చేస్తారు.భూమి అవసరం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా ప్రాజెక్ట్‌కు పునఃరూపకల్పన చేస్తారు.
మిగులు మనుషులు-క్కరలేని మనుషులు
నిర్వాసితులు కొత్త స్థలంలో  కొత్త జీవితాన్ని మొదలుపెట్టేలా మంచి వసతులతో కూడిన పున:స్థిరీకరణ, పునరావాసం ఉంటే వాళ్ళను వాళ్ళే త్వరగా ఉద్ధరించుకుంటారు. కాని నిర్వాసితులు ప్రభుత్వం ఇచ్చే తాయిలాల మీద మాత్రమే ఆధారపడి, దీర్ఘకాలం పరాన్నభుక్కు జీవితాలు  డిపేలాగా పునరావాస కార్యక్రమం నడుస్తుంది.  ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించే రక్షకురాలిగా కనబడకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకొని  వారు సంఘవ్యతిరేక శక్తులుగా మారి, అసాంఘిక కార్యకలాపాలకు దిగుతున్నారు. మరికొందరు భవిష్యత్తు మీద ఏ ఆశాలేవిరక్తి చెంది ఆత్మహత్యలతో తనువులు చాలిస్తున్నారు.
నిర్వాసితులను శాంతింపజేయడానికి పాలకులుకూడా ఎప్పటికప్పుడు  ఎక్కువ తాయిలాల ఆశ చూపిస్తూ , కొత్త పథకాలను ప్రకటిస్తూ పోతారు తప్ప శాశ్వత పరిష్కారం చూపరు. నిర్వాసిత ప్రజలు తమదని చెప్పుకునే చిన్న మడిచెక్క కావాలని కోరుతారు. నిర్వాసితులకు ప్రధాన పాత్ర ఇవ్వకుండా, నిర్వాసితుల్ని  అభివృద్ధి కార్య క్రమాలలో కలుపుకోకుండా సమాజ పరివర్తన జరగదు.

నిర్వాసితులు ఆర్ధికశాస్త్ర పరిభాషలో మిగులు మనుషులుమన సమాజ భాషలో క్కరలేని మనుషులు అవుతారు.
సొంత స్థలం  ఆర్థిక స్తోమత లేనందువల్ల,మరేపనీ చేయలేక నిర్వాసితుల్లో ఇతరులపై ఆధారపడే   మానసికస్థితి తలెత్తుతుంది.మానసిక స్థితి వల్ల వాళ్లలో  చైతన్యం నశించి, చేష్టలుడిగిన ప్రేక్షకుల్లా మారి తమ తలరాతకు దేవుణ్ణి తిట్టుకుంటారు.వ్యవస్థనుంచి పరాయి అయిపో తారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఇంకా ఎక్కువ తాయిలాలు వస్తాయని ఆశిస్తారు, రావాలని కోరుతారు. పాలకులు కూడా తమ పదవులు కాపాడుకోవాలి కాబట్టి  తాయిలాలు ప్రకటిస్తూనే ఉంటారు. నిర్వాసిత ప్రజలు తమకు వీలయినంత ఎక్కువ కావాలని కోరడం, సాధించడానికి ప్రయత్నించడం వల్ల దేశం మీద భరించరాని భారం పడుతుంది.భూమిని పొందిన ప్రైవేటు పారిశ్రామికవేత్తలెవరూ ఈ అదనపు భారాన్ని మోయరు.వాళ్ళు కూడా అనేక రకాల రాయితీలు అడుగుతారు.సాధించుకుంటారు.నిర్వాసితుడూ పెట్టుబడిదారుడూ ఇద్దరూ తృప్తిగా ఉండరు. నిర్వాసితుల్లో వంటరితనం, కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని కోల్పోవడం కుంగుబాటు, దిగులు, ఆందోళన, భయం, సామాజిక సంబంధాలు తెగిపోవడం, మారిపోవడం హింస, నేరం పెరిగిపోవడం ఆడపిల్లలను స్త్రీలను అమ్మివేయడం లేదా కాంట్రాక్ట్పనుల్లో కుదర్చడం, పనికొరకు విదేశాలకు  పంపడం నిత్యకృత్యం అవుతాయి . 



భూమితో అనుబందం
నిర్వాసితులు ఎవరైనా పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి మరొక కొత్త ప్రదేశానికి తరలి వెళ్ళడానికి ఎంతో ఘర్షణ మనోవేదన పడతారు. పుట్టిన నేలను విడిచి కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొత్త జీవన మార్గాలను ఆవిష్కరించుకోవడం నిర్వాసితులకు పెద్ద క్షోభ కలిగిస్తుంది. ప్రవాస జీవితం లోని ప్రయాస అనుభవించినవారికే తెలుస్తుంది.
కులం, మతం,వివక్ష మూర్తీభవించిన మన దేశ వ్యవస్థలోనైతే ఆ కష్టాలు ఇంకా  ఎక్కువ .
కొత్త ప్రాంతానికి తరలి వెళ్తున్నపుడు కొత్త ఇల్లు నిర్మించుకోవడం , జీవితాన్ని పునర్మించుకోవడం చాలా కష్టం,కఠినం. ముంపుకు గురైన నిర్వాసితులు సంక్షోభాన్ని నిబ్బరంగా నిలకడగా ఎదుర్కొంటానికి  ఎంత గుండే ధైర్యం కావాలి? ఎన్ని వాగ్దానాలు కావాలి? కుటుంబ సభ్యులు ఇంటి యజమానులకు చేదోడు వాదోడుగా ఉండి ఓదార్చాలి. కష్టపడేవాళ్ళకు కంచంలో వెలితి ఉండదు. ఆ కట్టమీదకు పోయి తట్ట ఎత్తినా కడుపు నిండుతుంది. ఏడవద్దు అని కన్నీరు తుడవాలి.
మాతృభూమి, పురిటిగడ్డ, జన్మభూమి, పశువులు పరిసరాల చుట్టూ ఉన్న ప్రకృతితో కలిగే సంబంధాలన్నీ  అనిర్వచనీయ బంధాలు. 
బహుళ జాతి కంపని మాయల్లోనలిగి పోయి కుమిలిపోయిన భారత పల్లెల దుస్థితి గురించి  గోరటి వెంకన్నగారు రాసిన పాటను వందేమాతరం శ్రీనివాస్ గారు పాడారు.ఈ పాట అర్ధంచేసుకుంటూ వింటే కన్నీళ్ళు పెట్టనివాడుండడు.

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.
చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోనా

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్నివట్టిమొద్దులయ్యినవి
ఈతకల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును దాగిన
మంది కండ్లనెండూసులయ్యినవి
చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పరకచేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు
ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో

అరకల పనికి ఆకలిదీరక గడమనగలకుగాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

మేరోళ్ళ చేతులకత్తెర మూలపోయి సిలువెక్కిపోయినది
చుట్టుడురెక్కల బనీన్లు బోయినవి కోడెలాగులు జాడకేలేదు
రెదీమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు
ఆ కుట్టు మిషన్ల చప్పుడాగినాదా నా పల్లెల్లోనా

నానా కెంపుతెల్లలు జెల్లలు
పరులకు తెలియని మరుగు భాషతోబేరం జేసే
కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుంచీ.

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

కుంకుమ దాసరి బుక్కమీదగూడ కంపెనీ రక్కసి కన్నుబడ్డది
పూసలోల్ల తాలాము కప్పలు, కాశీల కలసి ఖతమౌతున్నవి
బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చెగదరా నా పల్లెలజూడా
మన గుడ్డి దాసరీ బతుకులాగమాయే ఈపల్లెల్లోనా

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా.

తొలకరి జల్లుకు తడిసిన నేల
మట్టిపరిమళాలేమైపాయెరా
వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ
పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల
ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిడిచీ
దేవా హరిహరా ఓ
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై

పిండోలెన్నల రాలుచుండగ రచ్చబండపై కూసొని ఊరే
ఎనకటి సుద్దులు ఎదలూ కదలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి
బుక్కనోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా
అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో

బతుకమ్మాకోలాటపాటలు భజన కీర్తనలమద్దెల మోతలు
బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నాపల్లెల్లో
అరె స్టార్ టీవీ సకిలిస్తాఉన్నదమ్మో నా పల్లెల్లోనా
సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
అరె బహుళ జాతి కంపని మాయల్లోనా మా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె ఓ అయ్యల్లారా.
 

సూర్య 7.12.2013
http://www.suryaa.com/opinion/edit-page/article-161837

https://www.facebook.com/photo.php?fbid=675715882460405&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

2 కామెంట్‌లు:

  1. నాటి నర్మదా బాచాఓ ఆందోళన మొదలుకొని నేటి స్పెషల్ ఏకనామికల్ జోన్స్ వ్యతిరేక ప్రజా ఉద్యమాల దాకా , నిర్వాసితులైన ఆభూమిపుత్రులకు న్యాయం చేసే పాలకులు కరవైనా ఈ దేశంలో మరేం చేస్తే గాని
    మేలు జరుగుతుందో అర్ధం గాని పరిస్థితుల్లో ఆ ప్రజలే ఏంచేయాలో నిర్ణయించు కుంటే మంచిది . ఆనిర్ణయానికి మనలాంటి ఆలోచనాపరులు కార్యరూపం ఇవ్వడానికి వెనుకాడబోమని ప్రతిజ్ణ పూనుదామా మిత్రమా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిర్వాసితులైన భూమిపుత్రులు ఏంచేయాలో నిర్ణయించుకొని పదేపదే జరిపిన పోరాటాల ఫలితమే కొత్త బిల్లు.ఇది ఏమాత్రం ఫలితమిస్తుందో ఆచరణలో చూడాలి.

      తొలగించండి