ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, డిసెంబర్ 2013, గురువారం

స్వలింగ వివాహాలు


స్వలింగ వివాహాలు - పర్యవసానాలు
నూర్ బాషా రహంతుల్లా 9948878833

స్వలింగం సంపర్కం నేరమంటూ భారత సుప్రీంకోర్టు 11.12.2013 న ఇచ్చిన తీర్పు నేపథ్యంలో లెస్బియన్,గే,బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (LGBT) వర్గానికి సమాన హక్కులు కల్పించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ పిలుపునిచ్చారు. ఈ తరహా లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు. ప్రపంచంలోని మానవలందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, సమాన హక్కులు, గౌరవం ఉన్నాయని అన్నారు. స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. యుక్తవయస్కులు పరస్పర సమ్మతితో చేసుకునే స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఏ చర్యనైనా తాము వ్యతిరేకిస్తామని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. మరోవైపు ప్రముఖ ఇస్లామిక్ సంస్థ దారుల్ ఉలూం దియోబంద్ సంస్థ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది.స్వలింగ సంపర్కం అసహజమని, దానిని  తాము ఏమాత్రం సమర్ధించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్ స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ 377 సరైనదే. స్వలింగ సంపర్కం అసహజమని మేం నమ్ముతున్నాం. ఎట్టి పరిస్థితిలోనూ అలాంటి విషయాలను మేం సమర్థించబోముఅని ఆయన వ్యాఖ్యానించారు.గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ స్వలింగ సంపర్కం విషయంలో సుప్రీం కోర్టు తీర్పును నేను స్వాగతిస్తున్నా. ఇందుకు విరుద్ధంగా పార్లమెంటుకు  బిల్లు వస్తే నేను వ్యతిరేకిస్తాఅని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పును తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనే తాను ఎక్కువగా ఏకీభవిస్తానన్నారు. ఇవి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు. ఇలాంటి అంశాలను వ్యక్తులకే వదిలేయాలి. ఇవి వ్యక్తిగత అభీష్టాలు. మన దేశం స్వేచ్ఛకు, భావ వ్యక్తీకరణకు పేరొందినది. అలాగే ఉండనివ్వండిఅని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని పార్లమెంటు పరిష్కరిస్తుందని నేను ఆశిస్తున్నా. తీర్పుతో ప్రభావితమయ్యే వారితోపాటు దేశ ప్రజలందరికీ రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా, జీవన హక్కులను పార్లమెంటు నిలబెడుతుందని భావిస్తున్నా.రాజ్యాంగం ప్రసాదించిన మానవ ప్రాథమిక హక్కులకు భంగం కలించేవిధంగా ఉన్న అన్యాయమైన చట్టాన్ని ఢిల్లీ హైకోర్టు తొలగించిందని సోనియాగాంధీ పేర్కొన్నారు.స్వలింగ సంపర్కం నేరమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చడానికి చట్టాన్ని సవరించటానికి అత్యవసరంగా చర్యలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వం హామీనిచ్చింది. యుక్త వయస్కులు పరస్పర సమ్మతితో చేసుకునే సంబంధాలను నేరరహితం చేయాల్సిన అవసరముంది అని కపిల్ సిబాల్ సెలవిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని, దానిని సరిచేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం పేర్కొన్నారు. 

చట్ట సవరణ జరిగేదాకా నేరమే

 అయితే సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పుతో స్వలింగసంపర్కం చట్టదృష్టిలో నేరంగా మారింది. స్వలింగ సంపర్కం ఏ రూపంలో వున్నా అది అక్రమమూ, అసహజమైనదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. యుక్త వయస్కులు పరస్పర సమ్మతితో గే సెక్స్‌కు పాల్పడితే అది నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు 2009లో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.కాబట్టి ఇకమీదట ఐపిసి 377వ సెక్షన్‌ ప్రకారం ఇరువురు వ్యక్తులు పరస్పర అంగీకారంతోనైనాసరే  జరిపే స్వలింగ సంపర్కం నేరమే. ఈ నిబంధనను రద్దుచేయటమో సవరించటమో కేంద్రప్రభుత్వమే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై తుది నిర్ణయాన్ని పార్లమెంట్‌కే వదిలిపెట్టింది. సంబంధిత సెక్షన్‌పై చట్టసభలే చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఆ సెక్షన్‌ను తొలగించే అధికారం పార్లమెంటుకు ఉందని, అప్పటిదాకా ఈ రకమైన శృంగార సంబంధాన్ని నేరంగానే పరిగణించాలని వివరించింది. ఇంత ముఖ్యమైన అంశంపై కేంద్రం నిర్లక్ష్యం చూపిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

హైకోర్టు తీర్పును వ్యతిరేకించటంలో తొలుత కేంద్రం పిల్లిమొగ్గలు వేసినప్పటికీ తరువాత తన వైఖరి మార్చుకుని దృఢంగా తన వాదనను వినిపించింది. ప్రైవేటుగా ఇరువురు వ్యక్తులు పరస్పర అంగీకారంతో జరిపే స్వలింగ సంపర్కం నేరం అనటం వారి ప్రాథమిక హక్కులను భంగపర్చటమేనని ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఎటువంటి అప్పీలు చేయరాదని కేంద్రం నిర్ణయించుకుంది. ఐపిసిలో 377వ సెక్షన్‌ను పొందుపర్చటం భారతీయ సంప్రదాయాలు, విలువలను ప్రతింబింబించటం లేదని,నాటి బ్రిటిష్‌ వలసపాలకులు తమ సమాజంలోని నైతిక విలువల ఆధారంగానే దీనిని భారతీయ సమాజంలో ప్రవేశపెట్టారన్నారు. రాజ్యాంగ విలువలను విస్తరించే అవకాశాన్ని కోల్పోయాం స్వలింగ సంపర్కం అక్రమమేనంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఇందిరా జైసింగ్‌ స్పందిస్తూ మన రాజ్యాంగ విలువలను విస్తరించుకునే చారిత్రక అవకాశాన్ని కోల్పోయామని స్వలింగసంపర్కులను శిక్షించాలనుకోవటం 'మధ్యయుగం నాటి మనస్తత్వం' అని వ్యాఖ్యానించారు. విషాదంలో మునిగిపోయిన స్వలింగ సంపర్కులు కంటతడి పెట్టారు.మేమేమన్నా హత్యలు చేస్తున్నామా?మావలన ఎవరికి నష్టం?,ఎవరికి కష్టం? మాబతుకులు మమ్మల్ని బ్రతకనివ్వరా?అంటూ శోకాలు పెట్టారు.

ఢిల్లీ హైకోర్టు తీర్పు

  • స్వలింగ సంపర్కం మానసిక రుగ్మత కాదు. మనిషి లైంగిక ప్రక్రియలో అది మరో కోణం. పరస్పరం అంగీకారంతో వయోజనులు పాల్గొనే స్వలింగ సంపర్కం చట్టబద్ధమే
  • పరస్పరాంగీకారంతో వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం పీనల్‌ కోడ్‌ పరిధిలోకి రాదు. స్వలింగ సంపర్క చర్యల్ని నేరపూరితమైనవిగా పేర్కొనరాదు. స్వలింగ సంపర్కులైన పురుషులు వివక్షకు గురవుతున్నారు. వారిని కళంకితులుగా, నేరం చేసిన వారిగా చూస్తూ వివక్షకు గురి చేస్తున్నారు. ఇలా చూడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవిని నివారించి, చికిత్స చేసేందుకు అవరోధం కలుగుతోంది
  • పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య సాగే స్వలింగ సంపర్కాన్ని నేరమని భారతీయ శిక్షా స్మృతిలోని (ఐపిసి) 377వ సెక్షన్‌ పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది.
  • మైనర్లతో వారి కిష్టం లేకుండా స్వలింగ సంపర్కానికి పాల్పడడంపై పీనల్‌ కోడ్‌ నిషేధం కొనసాగుతుంది.
  • పరిపూర్ణ వ్యక్తిగా స్వలింగ సంపర్కునికి ఉన్న హక్కును సెక్షన్‌ 377 నిరాకరిస్తోంది.
  • 18 ఏళ్లు, ఆపై వయస్కులెవరైనా వయోజనుల కిందికే వస్తారు.
  • ఒకరికొకరు ఇష్టపడితే వారి మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదు.
  • లైంగికపరంగా వివక్ష చూపడం వ్యక్తిగత గౌరవానికి, మనుషులంతా సమానమే అన్న భావనకు వ్యతిరేకం.
  • స్వలింగ సంపర్కం నైతిక విరుద్ధమని పేర్కొంటూ సమాజంలో ఒక వర్గాన్ని చట్టంలోని ఒక సెక్షన్‌ నేరస్థులుగా చిత్రీకరించడం రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుకు విరుద్ధం.
  • ఐపిసిలోని సెక్షన్‌ 377 రాజ్యాంగ విలువలకు, మనిషి గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఉంది.

సుప్రీం కోర్టు కోరిన వివరాలు   

1.లైంగిక మైనారిటీల విషయంలో ప్రభుత్వ సంస్థలు వివక్ష కనబరుస్తున్నాయని, కనీస మానవహక్కులను నిరాకరిస్తున్నారని రుజువులు
2.ప్రజల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలు

3.స్వలింగసంపర్కులు, బైసెక్సువల్స్‌, ట్రాన్స్‌జెండర్ల నేరాల విచారణ రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణలను ఈ సెక్షన్‌ ఉల్లంఘిస్తోందని చెప్పడానికి ప్రాతిపదికలు.
4. 1950 నుండి ఐపీసీకి 30 సవరణలు జరిగాయి. 2013లో జరిగిన ఒక సవరణ ప్రత్యేకించి లైంగిక నేరాలకు సంబంధించినదే. ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని 172వ లా కమిషన్‌ నివేదిక ప్రత్యేకంగా సిఫార్సు చేసింది. ఈ అంశం పలుమార్లు చర్చకు వచ్చింది. అయినా ఈ చట్టాన్ని సవరించాలని శాసనవ్యవస్థ అనుకోలేదు. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదే. ఐపీసీ సెక్షన్ 377ను తొలగించే అధికారం పార్లమెంటుదేనని, అప్పటివరకు దానికి చట్టబద్ధత ఉంటుంది.

స్వలింగ వివాహాలపై అనుకూల వాదనలు:
(అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఇందిరా జైసింగ్‌ , నాజ్ ఫౌండేషన్, ఇండియన్ ఆమ్నెస్టీ ,జెడి(యు) ఎంపి శివానంద్‌ తివారీ, టిఎంసి ఎంపి డిరెక్‌ ఒబ్రీన్‌, సిపిఎం ఎంపి సీతారాం ఏచూరి, సినీ నటి మియా ఫారో, హీరోలు అమీర్‌ఖాన్, జాన్ అబ్రహం, రచయిత ఫర్హాన్అక్తర్ , కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్,కేంద్రమంత్రులుసల్మాన్‌ఖుర్షీద్‌,జైరాంరమేశ్,సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌,సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,చిదంబరం వగైరా ....)  
మేమూ మనుషులమే. మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తక్కువగాఎందుకు చూస్తారు' అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అశోక్ రావు కవి, విక్రమ్ సేఠ్ లాంటి వాళ్లు తాము 'గే' అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2006లో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కూడా ఈ విషయాన్ని బయటకు ప్రకటించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధంలో ఉంటే దాన్ని నేరం అనకూడదని 2008లో నాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ వాదించారు.వాస్తవానికి స్వలింగ సంపర్కం అనేది మానసిక పరమైన వైరుధ్యమే తప్ప అదో వ్యాధి గానీ, నేరం గానీ కాదని మానసిక వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా పలు ప్రాంతాల్లో వీరికి పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తెలుగు సినిమాల్లో కూడా స్వలింగ సంపర్కాన్ని ఎప్పుడూ తప్పు లాగా  చూపించారే గానీ దాన్ని సహజ లక్షణంగా చెప్పలేదు. మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ ఒక యువకునిపై ఆయనకున్న ప్రేమను అద్భుతమైన వర్ణనలతో డైరీలో రాసి పెట్టాడట. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1935లోనే స్వలింగ సంపర్కం ఒక దుర్వ్యసనం కాదు.అదేదో తప్పుడుపని అయినట్లు దాని గురించి సిగ్గుపడాల్సింది ఏమీలేదు. స్వలింగ సంపర్కాన్ని శిక్షించడం మహా అన్యాయం, క్రూరత్వంఅన్నాడు. స్వలింగ సంపర్కం మానవ  హక్కులకు భంగం కలిగించేదేమీ కాదు. అలాంటప్పుడు అది చట్టవిరుద్ధం ఎందుకవుతుంది? భారత శిక్షాస్మృతిలోని ఆ సెక్షన్ కింద నమోదైన కేసులు చాలా అరుదనే వాదన కూడా సరైనది కాదు. ఒక్క వ్యక్తే అయినాసరే   నేరారోపణకు ఎందుకు గురికావాలి? మానవ హక్కులకు పాశ్చాత్యంలేదా ప్రాచ్యం’ 'అప్రాచ్యం' అంటూ తేడా ఏమీ ఉండదు. శివ, కేశవులకు పుట్టిన శబరిమల అయ్యప్ప స్వామి అట్లాంటిక్ తీరంలో పుట్టలేదు. మానవ హక్కులకు విఘాతం కలిగించే ఏ చట్టమైనా అన్యాయమైనదే. వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో ఈ స్వలింగ సంపర్కం ఉంది.పూర్వం ఏనాడో దేవాలయాల గోడల మీద చెక్కిన అసంఖ్యాక స్త్రీ పురుష సంభోగ శిల్పాలు స్వలింగ సంపర్కం నేరంకాదని చెబుతున్నాయి.హిందూ దేశం చాలా స్వేచ్చాయుత దేశం. పుత్రకామేష్ఠి,పుండరీక లాంటి యజ్నాలూ యాగాలూ కూడా జరిగాయి. హిజ్రాల దేవత ముర్గీ మాత ఆలయం గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో ఉంది.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వలింగ సంపర్క హక్కులను కాలరాసింది. కోర్టు తీర్పు వారి  జీవిత హక్కులను లాగేసుకుంది.స్వలింగ సంపర్కాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తున్న 1861 నాటి చట్టాన్ని సమూలంగా మార్చాలి.ఈ తీర్పుపై పునఃసమీక్షను కోరుతాం.స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తున్న ఐపిసి 377వ సెక్షన్‌ను కొట్టివేయాలి. స్వలింగ వివాహాలు కేవలం సంపర్కం కోసమే కానక్కరలేదు.అంతకంటే ముఖ్యంగా జీవితంలో ఇష్టమైన వ్యక్తితో అవసరమైన తోడు కోసం కూడా స్వలింగ వివాహం అవసరం కావచ్చు.ఒక 'చారిత్రాత్మక అవకాశం' చేజారిపోయింది.స్వలింగసంపర్కం నేరమనే ఐపిసి 377 సెక్షన్‌ 'మధ్యయుగ మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తోంది. ఇది మధ్యయుగం నాటి మనస్తత్వాన్ని దేశ ప్రజలపై రుద్దడమే.అంతకుమునుపే మనుషులందరూ ఒకటేనని హైకోర్టు తేల్చి చెప్పింది కదా? . స్వలింగ సంపర్కుల నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న పోలీసులకు హైకోర్టు ఆనాడే బుద్డిచెప్పింది.హైకోర్టు తీర్పు తరువాత  స్వలింగసంపర్కులకు సమాజంలో హోదా స్థాయి పెరిగింది. మానవహక్కుల గురించి మాట్లాడే సుప్రీంకోర్టు ఎందుకోగానీ స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఎందుకు తప్పుబట్టాలి? ఈ వ్యవహారంలో పార్లమెంటు జోక్యాన్ని న్యాయవ్యవస్థ కోరింది కాబట్టి పార్లమెంటు చట్టాన్ని మార్చాలి.తీర్పు తిరోగమన దిశలో ఉంది. ఇద్దరు పురుషులు లేదా మహిళలు పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొంటే అది నేరం ఎందుకవుతుంది? ఈ తీర్పు వల్ల గేలు, లెస్బియన్‌లు, హిజ్రాలపై వివక్ష తొలగిపోదు.వాళ్ళు భయం భయంగా, సమాజానికి దూరంగా ఉండిపోతారు. పౌరసమాజంలో బహిరంగ భాగస్వాములు  కాలేరు.ఎన్నో ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా మార్చుకున్నాం. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో కొన్ని  ప్రాచీన మూర్ఖపు చట్టాలు అలాగే ఉండిపోయాయి. వాటిని సవరించాలి,సంస్కరించాలి.ఇద్దరు మగవాళ్ళుగానీ ,ఇద్దరు మహిళలు గానీ కలిసి కాపురం చేస్తే అది కేవలం శారీరక సంభోగం కోసమే కానక్కరలేదు.పెళ్ళి చేసుకునో, చేసుకోకుండానో  ఒక స్త్రీ పురుషుడు కలిసి కాపురం చేస్తే దానిని సక్రమ సహజీవనంఅన్నారు.పెళ్ళి కాకుండా చేసే సహజీవనం అసహజమైనది,నేరము,పాపము కానప్పుడు స్వలింగ వివాహం నేరమెలా అవుతుంది?ఇందులో తప్పేంటి? ”

 కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్
భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 377ను సమర్థిస్తూ వెలువరించిన తీర్పు వల్ల వేలాదిమంది స్వలింగ సంపర్కులు ప్రాసిక్యూషన్ రిస్క్‌తోపాటు వేధింపులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ తీర్పును పునఃపరిశీలించాలి.స్వలింగ సంపర్కులకు అన్యాయం జరగకూడదు.ప్రాథమిక హక్కులపై సుప్రీం ఇప్పటికే స్పష్టంగా జారీచేసిన పలు న్యాయసూత్రాలకు ఈ తీర్పు విరుద్ధంగా ఉంది. అందుకు సంబంధించిన 76 ఆధారాలను పొందుపరిచాము. స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చాలామంది స్వలింగ సంపర్కులు తమ అలవాటు గురించి కుటుంబాలు, పని ప్రదేశాలు, విద్యాసంస్థలు తదితర చోట్ల వెల్లడించారు.ఈ నేపథ్యంలో సుప్రీం తాజా తీర్పుతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారు.వారికి తక్షణమే ఉపశమన చర్యలు అవసరం. ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయడంపై పార్లమెంటుదే నిర్ణయాధికారం అని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవానికి సెక్షన్ 377తో సహా ఐపీసీని 1860లో ఆంగ్లేయులతో కూడిన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. అందువల్ల సెక్షన్ 377 భారత పార్లమెంటు ఆమోదంతోనే రూపొందిందని చెప్పలేం.అంతేకాకుండా ప్రపంచంలో చాలా దేశాలు స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేశాయి.


స్వలింగ వివాహాలపై వ్యతిరేక వాదనలు :  
 (బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్,బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్,బీపీ సింఘాల్, ఢిల్లీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌, అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌,దారుల్ ఉలూం దియోబంద్, ఉత్కల క్రిస్టియన్ కౌన్సిల్, అపొస్టలిక్‌ చర్చెస్‌ అలియన్స్‌,యోగాగురు బాబా రాందేవ్ వగైరా ....)

 “సుప్రీంకోర్టు వివిధ మతాల మనోభావాలను గౌరవించింది. స్వలింగ సంపర్కం కచ్చితంగా రోగమే. దాన్ని నయం చేయాల్సిందే.సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి మగాళ్ళతో  మగాళ్ళూ ,ఆడవాళ్ళతో ఆడవాళ్ళూ,అటూ ఇటూ కాని నపుంసకులూ కలిసి వాళ్ళలోవాళ్ళు సహజీవనం చెయ్యడం,పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏంటీ?కొన్నాళ్ళుపోతే పశువుల్ని కూడా పెళ్ళాడతామంటారు.పశువులతో కాపురం చెయ్యనిస్తారా?ఈ దేశ సాంస్కృతిక, మతపరమైన విలువలకు స్వలింగ సంపర్కం విరుద్ధం. గే సెక్స్‌ అనేది పాశ్చాత్య దేశాలలో చెల్లుతుందేమోకానీ, సాంప్రదాయ భారతావనిలో చెల్లదు. ఈ అపవిత్ర బంధానికి దేశంలో ఎంతో వ్యతిరేకత ఉంది. మన దేశంలోకి పాశ్చాత్య దేశాల వాళ్ళు బరితెగించి చేసే పాడుపనులు చాపకిందనీరులాగా  చేరిపోతున్నాయి. అందుకే ఒళ్ళుబలిసినవాళ్ళు గే సెక్స్‌ను చట్టబద్ధం చేయాలంటూ పోరాటం చేస్తున్నారు. గే సెక్స్‌ అనైతికమైనది. ఇది విపరీత బుద్ధి. దీనిని చట్టబద్ధం చేస్తే సమాజంలో నైతిక విలువలు పతనమవుతాయనే సంగతిని  పట్టించుకోకుండా స్వలింగసంపర్కుల మనోవాంఛలకు అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు గే సెక్స్‌ తప్పుకాదంటూ తీర్పునిచ్చేసింది. ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు చాలా తప్పుడు తీర్పు. స్వలింగ సంపర్క అనుకూల చట్టాలు సహజ విరుద్ధమైనవి. వాటిని అనుమతించకూడదు. అది లైంగికపరమైన అవినీతికి దారితీస్తుంది.ప్రకృతి విరుద్ధమైన చర్యలవల్ల కలిగే దుష్ఫలితాలు ఊహించలేనివి.స్వలింగ సంపర్కం ద్వారా ఎయిడ్స్ త్వరితగతిన వ్యాపిస్తుంది. హైకోర్టు తీర్పు తర్వాత ఎన్నో స్వలింగ సంపర్క వివాహాలు జరిగాయి. అసలు వివాహ వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారుతోంది.అన్ని మతాల పవిత్ర గ్రంధాలు సహజీవనాన్నీ స్వలింగ సంపర్కాన్నీ వ్యతిరేకిస్తున్నాయి.  కోట్లాదిమంది మతవిశ్వాసాలను గౌరవించిందికాబట్టే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని తెచ్చింది. భారతదేశంలోని అనేక మతాలు నెలకొల్పిన సంస్కార విలువలను కాలరాసేందుకు కొంతమంది పనిగట్టుకొని ప్రణాళిక ప్రకారం చేస్తున్న నేరపూరిత కుట్ర ఇది. మన సంప్రదాయాలను మంటగలిపే ప్రయత్నం ఇది.ఇటువంటి ప్రకృతి విరుద్ధ చర్యలకు అనుమతిస్తే భవిష్యత్తులో జంతువులతో సంభోగానికీ అనుమతివ్వాలని కోరే ప్రమాదముంది.స్వలింగ సంపర్కంపై మోజు ఉన్నవారు తప్పితే దీనికోసం ఎవరూ పోరాడరు”.

ఇంతకీ మతాలు ఏంటున్నాయి?

హిందూ మతం  

 *వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో స్వలింగ సంపర్కం ఉంది.అందుకే  దేవాలయాల గోడల మీద సైతం స్త్రీ పురుష స్వలింగ సంభోగ శిల్పాలు ఆనాడే చెక్కించారు.

*హరి హరులిద్దరూ కలిసి అయ్యప్పను పుట్టించారు.

*తెలుగు సంవత్సరాలు 60.నారదమహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు.వారే వీరు.
*పురాణాలు ఉపనిషత్తుల సారం తోటి మానవునిలో భగవంతుణ్ణి చూడటం.స్త్రీ పురుష లక్షణాలు రెండూ లేని తృతీయ ప్రకృతి జీవులు కూడా భగవత్ స్వరూపులే.
*కామసూత్రాలలో  స్వలింగసంపర్కులు, లింగమార్పిడిదారులకు , క్లైబ్య,నపుంసక,ఆడంగి,షండ,స్వైరిణి,నస్త్రీయ,హిజ్రా,అరవాణి ,జోగప్ప,సాఖీబేకీ,బృహన్నల,శిఖండి,పేడి,కొజ్జా,మాడా లాంటి పేర్లున్నాయి.వీరిని విటులు  లైంగికంగా హింసించి శిక్షించేవారు. ఆడ మగ కాని ఈ తృతీయపురుషుల్ని దేవుడి గుడుల్లో,ఉత్సవాలలో శుభసూచకంగా భావిస్తారు.వీళ్ళకు శపించే వరమిచ్చే మహిమ లున్నట్లు భావిస్తారు.
*అహం బ్రహ్మాస్మి ప్రకారం అందరూ పరబ్రహ్మలే గనుక వీళ్ళను వివక్షతో చూడకూడదు.తృతీయా ప్రకృతి జీవులను,స్వలింగసంపర్కులను కూడా మనతో సమానంగా గౌరవించాలి.
*ఆయుర్వేదం ప్రకారం గర్భధారణ జరిగిన మొదటి రెండు నెలల్లోనే పిండంలో తృతీయా ప్రకృతి లక్షణాలు జనిస్థాయి.
*కలియుగానికి సూచన స్వలింగ సంపర్కం కాదు.వాళ్ళను అవమానించటం హింసించటమే కలియుగానికి సూచన. వీళ్ళు కూడా దైవసేవకులే.ఆశ్రమాలలో ఉండవచ్చు. స్వలింగసంపర్కులు/వివాహులు కూడా ఆశ్రమవాసులై బ్రహ్మచర్యాన్ని పాటించి గొప్పవాళ్ళయ్యారు.
*జీవితాంతమూ బ్రహ్మచర్యాన్నీ పాటించటం కష్టమే.కానీ బ్రహ్మచర్యమూ, సర్వసంగపరిత్యాగమూ, భవబంధ విమోచనము,ముక్తి పొందటానికి మొదటి అవసరం.ఆధ్యాత్మికతలో ఏకపత్నీవ్రతానికి దక్కేది రెండవ స్థానమే.మొదటి స్థానం బ్రహ్మచర్యానిదే.
*అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీ కృష్ణుని వర్ణన చూడండి. '' కస్తూరీ తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవ మౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం..'' ఇలాంటి అలంకరణలేన్నో మన పురాతన పురాణాలలో కనుపిస్తాయి.
*దైవశక్తి తరతమ బేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా ,చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడ దేవుడున్నాడు.సర్వాంతర్యామి అయిన దేవుడే చేప, తాబేలు, పంది, సింహం,కుక్క ,పాము అవతారాల్లో  ఉన్నపుడు సాటి మనిషి అంటరాని వాడు ఎలా అవుతాడు?

క్రైస్తవం

* మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.(సంఖ్యా కాండము 31:17,18)
ఇంచుమించు స్వలింగ సంపర్క స్థాయిలోకి వెళ్ళినట్లు మూడు జంటలను ఉదారవాద క్రైస్తవ పండితులు అనుమానిస్తారు: 
1.రూతు నయోమి--- రూతు ఆమెను హత్తుకొనెను. (“Ruth clave onto her." Ruth 1:14)
2.దావీదు-యోనాతాను ----యోనాతాను హృదయము దావీదు హృదయముతోకలిసిపోయెను;యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.(1 సమూయేలు 18:1). యోనాతాను  దావీదు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత   బిగ్గరగా ఏడ్చెను.(The soul of Jonathan was knit with the soul of David,  and Jonathan loved him as his own soul (1 Samuel  18:1).they kissed one another and wept with one another, until  David exceeded (1 Samuel 20:41)
  • 3.దానియేలు అష్పెనాజు --- దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను ( God had brought Daniel into favor and tender love with Ashpenaz the prince of the eunuchs (Daniel 1:9)
  •  మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అనే ఏడుగురు నపుంసకులు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేసేవాళ్ళు.అందరిముందుకు వచ్చివిందులో తన అందాలను ఆరబోయటానికి నిరాకరించిన సౌందర్యవతి రాణి వష్తి .హేగే అనే నపుంసకుడు అంతఃపుర స్త్రీల కాపరి.బిగ్తాను తెరెషు అనే నపుంసకులు అహష్వేరోషును చంపటానికి ప్రయత్నిస్తారట(ఎస్తేరు1,2,6).వీళ్ళంతా పరిశుద్ధ గ్రంధాలలో ప్రసిద్ధిగాంచిన నపుంసకులు.వాళ్ళ సేవలను రాజులు బాగానే ఉపయోగించుకున్నారు.వ్యభిచారం చెయ్యని చెయ్యలేని నపుంసకుల్ని కూడా హీనంగా చూడటం,వారికి మానవహక్కులు లేకుండా చేయటం అన్యాయమనేదే వారి వాదన.
  •  నపుంసకులకు బైబిలు గానీ ఖురాను గానీ వ్యతిరేకం కాదు.స్వలింగ సంపర్కానికి మాత్రమే అవి వ్యతిరేకం.ఐతియొపీయుల రాణియైన కందాకే మంత్రి ధనాగార అధికారి అయిన నపుంసకుడు దైవారాధనకోసం యెరూషలేముకు వచ్చాడు.ఆరాధనకు,బాప్తిస్మానికి నపుంసకుడు అనర్హుడని వివక్ష చూపలేదు.పిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మమిచ్చాడు.(అపో.కా.5:27-39)
  •   *
తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసి కొనిన నపుంసకులును గలరు. ఈ మాటను అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని యేసు వారితో చెప్పెను.(మత్తయి 19:12)
     *  జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.(1 కోరింథీయులకు 6:9,10)
    * ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్యచోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును,హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెను ( 1 తిమోతి1:9,10)
    * అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్దమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను." (రోమా 1:26-28).

ఇస్లాం

 మీరెలాంటి అశ్లీలచేష్టలకు పాల్పడు తున్నారు! మీకు పూర్వం ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి సిగ్గుమాలిన పని చేస్తున్నారే!! మీరు కోర్కెల్ని తీర్చుకోవడానికి స్త్రీలను వదలి పురుషుల వెంటపడ్డారా? ఎంతసిగ్గుచేటు! మీరసలు హద్దుమీరిపోయారు " (ఖురాన్7:80-81)

"ఆ తరువాత మాఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేమా పట్టణాన్ని అమాంతం కుదిపేసి తల్లక్రిందులు చేశాం. ఆపై మండుతున్న మట్టిరాళ్ళు దాని మీద ఉధృతంగా కురిపించాము. అందులోని ప్రతి రాయీ నీ ప్రభువు దగ్గర గుర్తు వేయబడింది. ఇలాంటి శిక్ష దుర్మార్గ వైఖరి అవలంబించినవారికి ఎంతో దూరం లేదు". (ఖురాన్ 11:82-83)

  • మీరెంత అశ్లీలానికి పాల్పడుతున్నారు?స్త్రీలనువదిలి పురుషులవెంట పడతారే?సిగ్గువిడిచి పాడుపని చేస్తారే?(ఖురాన్ 29:28)
  • మీ ప్రభువు మీకోసం సృష్టించిన మీ భార్యలను వదిలి సిగ్గుమాలి పురుషులదగ్గరకు వెళ్ళటం హద్దుమీరటమే (ఖురాన్ 26:166)
  •  అతి ఘోరపాపాల్లో స్వలింగ సంపర్కం అనేది పదకొండవది.వ్యభిచారాన్నిబట్టి అల్లా ఎవరినీ నాశనం చేయలేదుగానీ స్వలింగసంపర్కుల్నిబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలనే కాల్చివేశాడు.స్వలింగసంపర్కుల పాపాలను కడగటానికి ప్రపంచంలోని నీళ్ళన్నీ కూడా సరిపోవు.వాళ్ళు నరకంలోని అడుగుభాగానికి పోయి బయటకు రాలేరు.
  • స్వలింగసంపర్కం,వ్యభిచారం ఈ రెండే జీవితంలోని 72 రకాల పాపాలకు కారణం( హజరత్ ఇమామ్ అలి అర్రదా).  
  • బలవంతంగా తన బానిసపై స్వలింగ సంపర్కానికి పాల్పడిన యజమాని లూతు కాలంనాటి పాపిష్టి ప్రజలలో చేరిపోయినట్లు ఉమర్ ప్రకటించారు.
  • పురుషులతో పురుషులు,స్త్రీలతో స్త్రీలు శృంగారానికి,సంభోగానికీ పాల్పడితే వ్యభిచారులతో సమానంగా శిక్షించాలి.స్వలింగసంపర్కులు రెండుసార్లు రాళ్ళతో కొట్టి చంపదగ్గ వారు. వారికి మరణశిక్ష విధించి శవాలను తగలబెట్టాలి.(అమీరుల్ మూమినీన్ అలి)
  • మంచిచెడ్డల ఊహతెలిసిన అన్నాచెల్లెలు కూడా ఒకే మంచంమీద ఒకే దుప్పటికింద పడుకోకూడదు.   
ఆరు రకాల స్వలింగ సంపర్కులు
1. కోతి (లెస్బియన్) : స్త్రీ తత్వాన్ని కలిగి స్త్రీలనే కోరుకుంటారు .
2. పంతి ( గే ): పురుష స్వభావాన్ని కలిగి ఉండి, మరో పురుషుడితో సంపర్కాన్ని కోరుకునే వారు.
3. డబుల్‌ డెక్కర్ (బైసెక్సువల్) : స్త్రీలానూ, పురుషుడిలానూ వ్యవహరించేవారు.
4. ట్రాన్స్‌జెండర్ (నిర్వాణ్): జననాంగాన్ని తీసివేయించుకున్న వ్యక్తులు.  
5. ట్రాన్స్‌జెండర్ (ఆక్వా): స్త్రీలను పోలి ఉంటారు.జననాంగాలను ఉంచుకుంటారు.
6. శివశక్తి/శివపార్వతి/జోగప్ప(ఇంటర్ సెక్సడ్) : నరనారులు.అర్ధనారీశ్వరులు.తమను తాము శివుడు, పార్వతి దేవుళ్ళు గా భావించుకుంటారు.

భారతీయ స్వలింగ సంపర్కుల సుదీర్ఘ పోరాట చరిత్ర

-2001లో స్వలింగసంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఎన్‌ఏజడ్‌(నాజ్‌) ఫౌండేషన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది.
-2004 సెప్టెంబర్‌ 2న ఢిల్లీ హై కోర్టు పిల్‌ను డిస్మిస్‌ చేసింది.
-2004 సెప్టెంబర్‌లోనే స్వలింగసంపర్కులు తిరిగి రివ్యూ పిటిషన్‌ దాఖలు
-2004 నవంబర్‌ 3న రివ్యూ పిటిషన్‌ కూడా హై కోర్టు తోసిపుచ్చింది.
-2004 డిసెంబర్‌లో స్వలింగసంపర్కులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
-2006 ఏప్రిల్‌ 3న కేసును తిరిగి పరిశీలించాల్సిందిగా ఢిల్లీ కోర్టుకు అత్యున్నత స్థానం సూచించింది.
-2008 సెప్టెంబర్‌ 18న కేంద్ర ఆరోగ్య శాఖ, హోంశాఖలు స్వలింగ సంపర్కం చట్టబద్ధతపై భిన్న స్వరాలు వినిపించాయి.
-2008 సెప్టెంబర్‌ 25న కేంద్ర ప్రభుత్వాన్ని స్వలింగసంపర్కులు సంప్రదించి తమ హక్కులకు భంగం వాటిల్లజేయవద్దని కోరారు.
-2008 సెప్టెంబర్‌ 26న స్వలింగసంపర్కం అనైతికమని, దాన్ని నేరంగా పరిగణించకపోతే సమాజంలో విపరీత ధోరణులకు దారితీస్తుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
-2008 అక్టోబర్‌ 15న స్వలింగసంపర్కాన్ని నిషేధించడంపై శాస్ర్తీయపరమై న ఆధారాలతో రావాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
-2008 నవంబర్‌ 7న స్వలింగసంపర్కం నేరం కాదంటూ సంబంధిత కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌పై హై కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.
-2009 జూలై 2న స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది. .
-2013 డిశంబర్ 11 న స్వలింగ సంపర్కం నేరమే అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

ఆదినుండీ వ్యతిరేకతే
స్వలింగ సంపర్కం అత్యంత హీనమైన , అసాంఘిక కార్యకలాపంగా ప్రపంచ మతాలన్నీ పరిగణిస్తున్నాయి. 1811లో మొట్ట మొదటసారిగా నెదర్లండ్స్ ప్రభుత్వం స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది.తర్వాత సోవియట్ రష్యా , ఆ తర్వాత అమెరికాతో అలా అలా ఇప్పటికీ 126 దేశాలు స్వలింగ సంపర్కం నేరంకాదని చట్టబద్ధతనిచ్చాయి.1992లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్వలింగ సంపర్కం ఒకానొక ప్రకృతి ధర్మమే కానీ, వ్యాధి కాదని , నేరం కాదనీ తేల్చి చెప్పింది. లైంగిక విషయాలను బహిరంగంగా చర్చించని మన దేశంలో 1999లో కోల్‌కతాలో మొట్టమొదటసారి స్వలింగ సంపర్కులు తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత ఈ నాలుగేళ్ళ కాలంలో స్వలింగ సంపర్క/వివాహ బృందాలు మన దేశంలో ధైర్యంగా తమ హక్కుల కోసం  బాహాటంగా ఉద్యమిస్తున్నారు. బాల కార్మికులు,ఖైదీల హక్కులను  సమర్ధించినట్లుగానే, స్వలింగ సంపర్క/వివాహాలను  కూడా సమర్ధించాలనీ,చట్టసవరణ చెయ్యాలనీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

శిక్ష ఏమిటి?
53 కామన్‌వెల్త్ దేశాలలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌వంటి 41 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. ఇరాక్, నైజీరియా, మాస్కో, కామెరూన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలలో స్వలింగ సంపర్కలు జైళ్ళకు నెట్టబడుతున్నారు. కొన్ని సందర్భాలలో శిరచ్ఛేదనకు కూడా గురవుతున్నారు.  మనదేశంలో ఐపిసిలోని 377 సెక్షన్ ప్రకారం గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది. సెక్షన్ 377ను సవాల్ చేస్తూ నాజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు 2009 జూలై 2న పరస్పర సమ్మతితో యుక్తవయస్కులు స్వలింగ సంపర్కానికి పాల్పడితే నేరం కాదని పేర్కొంది. లార్డ్ మెకాలే 1860లో రూపొందించిన భారతీయ శిక్షా స్మృతిలోని 377 సెక్షన్‌లో స్వలింగ సంపర్కాన్ని మళ్ళీ ఇప్పుడు చట్టవిరుద్ధంగా ప్రకటించారు. 1861 నుంచి ఇది అమలులోకి వచ్చింది. భారత శిక్షాస్మృతి సెక్షన్ 377 (అసహజ నేరాలు) ప్రకారం ప్రకృతి విరుద్ధమైన శృంగార కార్యకలాపానికి పాల్పడినవారికి పదేళ్ళ దాకా శిక్ష విధించేందుకు అవకాశముందని సుప్రీంకోర్టు తెలిపింది దీని ప్రకారం స్వలింగ సంపర్కులకు గరిష్టంగా జీవిత ఖైదు విధించవచ్చు. బ్రిటన్‌లో ఈ చట్టానికి 1967లో  సవరణ చేశారు. 21 ఏళ్లు దాటిన వారు పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కానికి పాల్పడితే చట్టవిరుద్ధం కాదని మార్పు చేశారు.

స్వలింగ వివాహాలు
స్వలింగ సంపర్కుల మధ్య పెళ్లిళ్లను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్. 2001లో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉరుగ్వే, న్యూజీలాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఐస్‌ల్యాండ్, అర్జెంటీనా వంటి దేశాలు స్వలింగ సంపర్కుల మధ్య పెళ్లిళ్లను చట్టబద్ధం చేశాయి. ఈ ఏడాదే బ్రిటన్ ఆమోదం తెలిపింది. అయితే చర్చి అధికారులను మాత్రం చట్టం నుంచి మినహాయించారు. న్యూజీలాండ్‌లో విదేశీయులు కూడా పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది. ఉరుగ్వేలో మామూలు పెళ్లికి, స్వలింగ సంపర్కుల పెళ్లికి ఒకే విధమైన నిబంధనలను రూపొందించారు.అయితే 12.12.2013 న ఆస్ట్రేలియాలో గే వివాహం చట్టం రద్దు చేస్తూ ఆస్టేలియా హైకోర్టు తీర్పు ఇచ్చింది.  ఫ్రాన్స్‌లో స్వలింగ సంపర్క దంపతులు పిల్లలను దత్తత తీసుకోడానికి అనుమతిస్తూ చట్టం ఉంది. 377 నిబంధన కేవలం స్వలింగ సంపర్కులకే కాదు దీని ప్రకారం గుద సంభోగం, అంగచూషణం, జంతువులతో సంభోగం.. అన్నీ నిషిద్ధాలే. పునరుత్పత్తికి దోహదం చెయ్యని ఏ రకమైన లైంగిక క్రియ అయినా ఈ నిబంధన ప్రకారం శిక్షార్హమే. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని సెక్స్‌ వర్కర్లనూ, స్వలింగ సంపర్కులనూ వేధించే పనీ దేశంలో నిరాఘాటంగా సాగిపోతోందని, కాబట్టి ఈ నిబంధనను తొలగించటం చాలా అవసరమని 'హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌' వంటి సంస్థలు ఉద్యమాలు ఆరంభించాయి. ముఖ్యంగా దేశంలో హిజ్రాలపై వేధింపులు ఎక్కువయ్యాయనీ, వారికి కనీస మానవ హక్కులు కూడా దక్కటం లేదనిహక్కుల సంస్థలు వాదించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ నిబంధనపై చర్చ వూపందుకుంది. దీన్ని తొలగించటం అవసరమని, అప్పుడే తమకు సామాజిక గుర్తింపు, సమర్థన లభిస్తుందని, తమపై వేధింపులు తగ్గుతాయని స్వలింగ, ద్విలింగ సంపర్కులూ, హిజ్రాలూ (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌-ఎల్‌జీబీటీ) బహిరంగంగా డిమాండు చేయటం ఆరంభించారు. 
 శాస్త్రవేత్తల అభిప్రాయం
           ఈస్ట్రోజన్‌ కొంచెం ఎక్కువగాఉండే  పురుషులు, స్త్రీల దుస్తులు ధరించాలని కోరుకుంటారు. కాని పురుషులుగానే  చలామణి అవుతుంటారు. వారు భార్యతో సజావుగానే సంసారం చేస్తారు. స్త్రీల లాగా ఉండాలన్న వారి ఆలోచన అంతరంగంలో రహస్యంగానే ఉంటుంది. అదే ఈస్ట్రోజన్‌ అధిక మోతాదులో ఉన్న పురుషుడు తాను స్త్రీగా ఉండాలన్న కోర్కెను బహిరంగంగానే వ్యక్తం చేస్తాడు. స్త్రీ దుస్తులు ధరిస్తాడు. స్త్రీల లాగా అలంకరించుకుంటాడు. కనుక మనిషి లైంగిక స్వభావాన్ని నిర్ణయించేవి హార్మోనులే. స్త్రీలాగా అలంకరించుకొని, ఆనందించేవారిని ఆది వారి స్వభావంగా చూడాలేతప్ప అదొక మానసిక రోగంగా, అతనినొక చెడ్డవాడుగా చూడరాదు.యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో అధ్యాపకుడిగా పనిచేసిన బ్రూస్ బాగ్‌మిల్ బయోలాజికల్ ఎగ్జూబరెన్స్: యానిమల్ హోమోసెక్సువాలిటీ అండ్ నేచురల్ డైవర్సిటీ అనే పుస్తకంలో 450 రకాల పాలిచ్చే జీవులపైన, పక్షులపైన, కీటకాలపైన, జంతువులపైన శాస్త్రీయంగా పరిశోధనచేసి వాటిలోని స్వలింగ సంపర్క ధోరణులను, పుంసక మార్పిడి ధోరణులను (ట్రాన్స్‌జెండర్ బిహేవియర్) సవివరంగా చర్చించారు. పురుష స్వలింగ సంపర్కులందర్నీ కలిపి గతంలో 'గేస్' (Gays) అనే పదం వాడేవారు కాని ఇప్పుడు మాత్రం వారిని ఎం.ఎస్.ఎం.లు అంటున్నారు. ఎంఎస్ఎం అంటే (Man to Man Sex )అని.
సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం
బలాత్కారములేని స్వచ్ఛంద స్వలింగసంపర్కం కూడా సహజీవనం లాగానే  నేరము కాదు,పాపము కాదు . 377 వ నిబంధనకు సవరణ కోర్టులు తేల్చాల్సిన అంశం కాదు. ఇది కీలకమైన సామాజికాంశం. దీనిపై పార్లమెంట్‌ చర్చించి, నిర్ణయంతీసుకోవాలి. నిబంధనను మార్చే అధికారం పార్లమెంట్‌కే ఉంది. కాబట్టి  కేంద్రం ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావాలి. పార్లమెంట్‌లో చర్చించాలి. మనుషులు జంతువులకు భిన్నంగా ఇలా వుండాలి అనే కట్టుబాటు ఉంది.స్వలింగ సంపర్కాన్నే నేరంగా భావించాలా?లేక స్వలింగ వివాహాన్ని కూడానా? బహుభార్యత్వం,సహజీవనం, వ్యభిచారం, ఐచ్చిక శృంగారం పేరేదైతేనేం జరిగేది సంభోగమే. అయితే ఆ సంభోగమైనా సహజీవనమైనా పరపీడనలేని పద్ధతిలో మాత్రమే జరగాలి.నవీన కాలపు వైద్యులు వ్యభిచారం,అత్యాచారాలకు పాల్పడేదానికంటే కంటే హస్తప్రయోగమే మంచిదని సలహాలిస్తున్నారు.అత్యాచారాను ఆపటం కోసం హస్తప్రయోగాలను ప్రోత్సహిస్తున్నారు. అలాగే సమాజంలో చోటుచేసుకున్న  వికృత పోకడలలో బహుభార్యత్వం, వ్యభిచారం, అత్యాచారం లాంటి కుళ్ళు కన్నా స్వలింగ సంపర్కం,సహజీవనం లాంటి పుచ్చు మెరుగు అనిపిస్తోంది. వాత్సాయన కాలం నుండి నేటి వరకు ఏ సమాజము కాని చట్టాలు కాని శృంగారం దంపతుల మధ్యనే వుండాలని పరిమితులు విధించలేదు.పరపరాగ సంపర్కాన్ని అరికట్టనూ లేదు.అది అరికట్టలేనిది.అయితే స్వేచ్చా సంభోగాలను  అరికట్టాలనే ఉద్దేశంతో లౌకిక నాగరిక సమాజం నైతికత ముసుగును కప్పుకుంది అంతే. శృంగారం ఇరువురు వ్యక్తుల మధ్య అభీష్టానుసారం జరిగితే అభ్యంతరకరం కానవసరం లేదు. సామాజిక కట్టుబాట్లు ఎన్నో పెట్టినా వ్యభిచారం ఆగలేదు.వ్యభిచారం వేరు, అత్యాచారం వేరు .ఐచ్చిక శృంగారం వేరు . పురాణ ఇతిహాస కాలం నుండి నేటి చట్టాల వరకు వాటిలో ఐచ్ఛిక శృంగారానికి అభ్యంతరాలు లేవు. నాగరిక సమాజంలో నాటి జంతుసామ్య వ్యవస్థలో జీవించినట్లుగానే జీవిస్తామంటే కుదరదు.బయట పడాలి.చెప్పేదొకటి చేసేదోకటి ఉండకూడదు.సామాజిక జీవన వ్యవస్తలో మార్పులకు అనుగుణంగానే చట్టాలలో కూడా నైతికతను పటిష్టపరుచుకోవాలి. లైంగిక సంపర్కం కోసం పశువులా బలత్కరించడాన్ని నేరంగా పరిగణించాలి. లైంగిక సంపర్కం కోసం బలత్కరించడమంటే వ్యక్తి స్వేఛ్చకు భంగం కలిగించడమే. లైంగిక సంపర్కం కోసం బలత్కరించేవారిని శిక్షించాలి. అదే సందర్భంలో పరస్పర ఇష్టపూర్వకంగా జరిగే లైంగిక సంపర్కాలను నేరంగా, తప్పుగా పరిగణించకూడదు.స్వలింగ సంపర్కం రోగమైతే వైద్యము చేసి నయం చేయాలి. నేరమైతే కోర్టుద్వారా శిక్షించాలి.రోగికైనా ,ఖైదీకైనా  ప్రాధమిక హక్కుల్నిమాత్రం ప్రసాదించాలి.వాటిని కాలరాయకూడదు.

కేంద్రం  రెండు నాలుకల ధోరణి
 ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగినప్పుడు హోంశాఖ, ఆరోగ్యశాఖలు సెక్షన్ 377పై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తంచేశాయి. సెక్షన్ 377 కొనసాగించాలని హోంశాఖ పేర్కొనగా, దానిని తొలగించాలని ఆరోగ్యశాఖ కోరింది. రెండు రకాలుగా మాట్లాడినందుకు కేంద్రంపై డిల్లీ హైకోర్టు మండిపడింది. ఫలితంగా సుప్రీం విచారణలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించనక్కర్లేదని కేంద్రం ఏకాభిప్రాయం వెలిబుచ్చింది. గే సెక్స్‌ అనేది అనైతికమైనది. ఇది విపరీత బుద్ధిని ప్రతిబింబిస్తుంది. దీనిని చట్టబద్ధం చేస్తే సమాజంలో నైతిక విలువలు పతనమవుతాయి. దేశంలో 25లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉండగా, అందులో ఏడుశాతం (1.75 లక్షల మంది) హెచ్‌ఐవీ బారిన పడ్డారని, పురుషులు పాల్పడే స్వలింగ సంపర్కం వల్ల ఈ ముప్పు ఎక్కువగా ఉందని సుప్రీంకు కేంద్రం నివేదించింది.కేంద్రప్రభుత్వం పట్టీపట్టని ధోరణి అవలంబించడంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత కీలకమైన అంశంపై పార్లమెంటులో చర్చించకుండా.. కేవలం న్యాయవ్యవస్థను మాత్రమే తప్పుబడుతున్నారని అసంతృప్తి వ్యక్తంచేసింది. భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్యవాదం నాటి గే వ్యతిరేక చట్టాలను అమలుచేస్తున్నప్పటికీ స్వలింగ సంపర్కుల పట్ల భారత సమాజం సహనంతో వ్యవహరిస్తోందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పు తరువాత 12.12.2013 న ఈ అంశంపై పార్లమెంటు ద్వారానే తగిన చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలిచ్చింది. 'చట్టానికున్న రాజ్యాంగ నిబద్ధతను పరీక్షించడం సుప్రీంకోర్టు విధి. దాని పని అది చేస్తుంది. చట్టాన్ని చేయడం మా పని. మా విధి మేం నిర్వర్తిస్తాం. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. పార్లమెంటు సజావుగా సాగితే ఈ అంశాన్ని చర్చకు చేపడతాం' అని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు.అయితే కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే రాజకీయ ఏకాభిప్రాయం లేనందున భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 377సవరణకు పార్లమెంట్‌లో వ్యతిరేకత ఎదురు కావచ్చు,ఏకాభిప్రాయం లేనందున చట్ట సవరణకు సమయం పడుతుంది అన్నారు.
ఇప్పుడేంచెయ్యాలి?
న్యాయవ్యవస్థ బంతిని చట్టసభలోకి నెట్టి చేతులు దులుపుకుంది. స్వలింగ సంపర్క హక్కుల సంఘాలు ఇదేం న్యాయమని ఆక్షేపిస్తున్నాయి.ఇన్నాళ్ళూ తమపట్ల పార్లమెంటు నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా నిశ్శబ్దంగా ఉన్నందుకు తిట్టిపోస్తున్నారు.1950 నాటి శిక్షాస్మృతిలో ఇప్పటివరకూ 30 సవరణలు చేశారు.చివరికి 377 సెక్షన్‌ లో కూడా సవరణ చేసిన ప్రభుత్వం - స్వలింగ సంపర్కాన్ని నేరంగా ప్రకటించే ఆ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయటంలేదో చెప్పాలని పట్టుబడుతున్నారు.ఆ సెక్షన్ ను రద్దు చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు కూడా ఎత్తిచూపుతోంది.అలాగే దానిని రద్దు చేయాలన్న లా కమిషన్‌ సిఫార్సును ఎందుకు పట్టించుకోలేదో చెప్పమంటోంది.మత సంస్థలు ఎలాగూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశాయి కాబట్టి కాగల కార్యం సుప్రీం కోర్టే తీరుస్తుందిలెమ్మనే దృష్టితో  ప్రభుత్వం ఇన్నాళ్ళూ ఊరుకున్నట్లుంది.వాస్తవానికి  ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత నిర్బంధ వివాహాల సంఖ్య నిజంగానే తగ్గింది.ఆత్మహత్యలు కూడా తగ్గిపోయాయి.స్వలింగ సంపర్కపరులు తమ మనసులో మాట తల్లిదండ్రులకు సైతం చెప్పుకోగలిగారు.ఈ మార్పు మనం మన కళ్ళతో చూడగలిగాము.ప్రభుత్వం ఇలాంటి సందర్భాలలో గణాంకాలను కూడా సేకరించి బయటపెట్టాలి.మద్యనిషేధం అమలైన రోజుల్లో వీధుల్లో తాగుబోతుల కేకలు,తన్నులాటలు తగ్గాయి.రోడ్డు ప్రమాదాలు,ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య,పోలిసుస్టేషన్లలో కేసులు తగ్గాయి. ఈ సమస్యను లైంగిక కోణంనుంచే కాకుండా దానిని మించిన మానవీయ కోణంతో ఎక్కువగా చూడాలి. స్వలింగ సంపర్కానికి  శిక్షలు వేస్తూపోతే ఎయిడ్స్‌ వంటి లైంగిక వ్యాధులు ఖచ్చితంగా తగ్గుతాయనే గ్యారంటీ ఏమీలేదనీ,పైగా శిక్షల భయంతో బయటికి పొక్కకుండా మరింత ప్రబలే ప్రమాదం కూడా ఉండొచ్చనీ స్వలింగ సంపర్క హక్కుల సంఘాలు అంటున్నాయి.పోలీసుల వేధింపులూ ఉంటాయి.దేశంలో ఎల్‌జిబిటిగా పేర్కొనే నాలుగు రకాల స్వలింగ సంపర్కులు పది కోట్ల మంది ఉన్నారని అంచనా.మానవీయత, మానవ హక్కులు, ఆరోగ్యం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని స్వలింగ సంపర్కుల మెడ మీదకత్తిలా వేలాడుతున్న377 వనిబంధనను సమాజానికి హాని కలగని సరైన పద్ధతిలో సవరించనన్నా సవరించాలి లేదా రద్దుచేయాలి.మెజారిటీ జనం అంగీకరించేదే చట్టంగా మారాలి.కాలంతోపాటు చట్టమూ మారక తప్పదు.

 సూర్య 22.12.2013


https://www.facebook.com/photo.php?fbid=683344445030882&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater
 https://www.facebook.com/photo.php?fbid=723866944311965&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like

ఆంధ్రజ్యోతి 9.3.2014

 ఈనాడు 29.1.2014

 సాక్షి1.4.2014)


(ఆంధ్రజ్యోతి 17.5.2015)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి