ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, డిసెంబర్ 2019, సోమవారం

నాలుగు జోనల్ కార్యాలయాలు కావాలి


నాలుగు జోనల్ కార్యాలయాలు అవసరం (సూర్య 27.12.2019)

1952 లో చెన్నపట్నం,బళ్ళారి,బరంపురం,హోస్పేట మొదలైన తెలుగు ప్రాంతాలు కొన్ని  వదులుకొనిమరీ  తెలుగు రాష్ట్రాన్ని సాధించుకొన్నారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రోదయం నాడు కర్నూలులో తాత్కాలిక రాజధానిని పెట్టారు.కర్నూలులో అసెంబ్లీ,సచివాలయం, గుంటూరులో హైకోర్టు పెట్టి రెండు ప్రాంతాలవారిని తృప్తి పరిచారట.రైలు.బస్సు,విమానం దిగగానే సుఖంగా ఆఫీసుకు చేరే హైదరాబాదు నగరంలాగా అమరావతిలేదే అని కొందరు బాధపడుతున్నారు.విజయవాడనుంచి అమరావతికి పోయేదాకా శ్మశానంలాగా,ఎడారి లాగా ఉంది అని కొందరు పెదవి విరిచారు. కర్నూలులో దూరం భారం, సౌకర్యాల లేమి మొదలైన కష్టాలపై ఆనాటి ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా పద్యం చెప్పారు:

“తుంగానదీ గర్భ శ్రుంగార భవనంబు

ప్రభుతా నిలయంబుగా పాదుకొలిపి

జిల్లాకలక్టరు ఇల్లు ఊడలాగి

వానిని మరియొక ఊర నిలువజేసి 

మూలమూలలనున్న మురికి కొంపలలోన 

దత్తతుద్యోగుల దాగజేసి

మరికొందరు ఊరి దరిని కాపురముండ

గుడ్డ గుడారముల్ కొన్ని వైచి

మరియు కొన్ని రికార్డులు మనుప కోయిల

కుంట జూపించి , అట గవర్నరుంట కనువు

పడమిని ,అనంతపురమున నిడగదలిచి

రాంధ్ర రాష్ట్రము కర్నూలునందు నిలిపి” 

రాజధాని నగరాలనే ప్రజలు ఎందుకు కోరుకుంటారు?అనేకరంగాలలోని ప్రముఖులంతా రాజధాని నగరాలకు వలసలతో చేరుకుంటారు.ఒకనాడు సినిమాలకు ,సాహిత్యానికి,కర్ణాటక సంగీతానికి మద్రాసు కేంద్రబింధువై నిలిచింది.దక్షిణాది రాష్ట్రాల విద్వాంసులెందరో తమిళనాడు చేరారు.తెలంగాణా తో విలీనం తరువాత ఎంతోమంది ప్రముఖులు హైదరాబాదు చేరారు.మళ్ళీ ఇప్పుడు మన రాజధాని నగరాలు ఎక్కడ ఏర్పడితే అక్కడికి వెళతారు.రాజధానినగరాలకు ప్రయాణం చేసి చేరుకునే దారులు ఏర్పడతాయి.రవాణా తో పాటు విద్య వైద్యం లాంటి ప్రాధమికసదుపాయాలన్నీ ఏర్పడతాయి.ఉద్యోగాల కల్పన,వ్యాపార విస్తరణ జరుగుతుంది.అందుకే పల్లెటూర్ల ప్రజలు పట్టణబాట పడతారు.తనకృషి వల్లనే హైటెక్సిటీ,సైబరాబాద్ ఏర్పడ్డాయని చంద్రబాబు నాయుడు గర్వపడతాడు.ఆయననివాసం కూడా ఆక్కడే కట్టుకున్నాడు.హైదరాబాదు.బెంగుళూరుల్లో నివాసాలు ఉన్న జగన్మోహనరెడ్డి తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నాడు.పవన్ కళ్యాణ్ కాజలో ఇల్లుకట్టుకున్నాడు.విజయవాడ,రాజమండ్రి,తిరుపతి పట్టణాలు జిల్లా కేంద్రాలు కాకపోయినా ప్రజల వలసలతో గొప్పనాగరాలు అయ్యాయి.ప్రముఖులు తమనివాసాలను ఎక్కడ కట్టుకుంటే అక్కడ నగరం అభివృద్ధి చెందుతుంది.నగరాలు ఏవీ ఒక్కసారి ఏర్పడవు.ఏళ్ల తరబడి పొగుబడిన అభివృద్ధే మహా నగరం.కష్టాలకొర్చుకున్ననే సుఖాలు దక్కును,ఈలోకమందు సోమరులై  ఉండకూడదు అని కవి కొసరాజు జాగ్రత్తలు చెప్పాడు.ఎవరు ఎన్ని చెప్పినా  ఎక్కడికక్కడే మాప్రాంతం రాజధానికావాలి ,ప్రాంతీయ కేంద్రం కావాలి అని పోటీ పడుతున్నారు.తమప్రాంతం అనుకూలతలు అవతలిప్రాంత అననుకూలతలు రాసుకొచ్చి మరీ చెబుతున్నారు. రాజధానిని గతంలో పోగొట్టుకున్నాం , శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు మా ప్రాంతంలో పెట్టాలి అని రాయలసీమవాసులు కోరుతున్నారు.

మూడు రాజధానులతోపాటు 4 ప్రాంతీయ మండళ్ళు (జోన్లు,కమీషనరేట్లు) ఉండాలని జి.ఎన్.రావు కమిటీ నివేదించింది.1972 ప్రాంతంలో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా మనరాష్ట్రంలో 6 జోన్లు ఏర్పాటు చేశారు.2014 లో తెలంగాణా విడిపోయి మనకు ఆంధ్రలో 3 రాయలసీమలో 1 మొత్తం నాలుగు జోనుల నేల మాత్రమే మిగిలింది. ఏ జోనులోని ఉద్యోగాలు ఆ జోను వారికే ఇచ్చేవారు.అంటే సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలవరకు జిల్లా,డిప్యూటీ తహసీల్దారు స్థాయి వరకు జోను పరిధిగా ఉండేది.స్థానికుల్ని సంతృప్తి పరచడమే జిల్లాలు,జోనుల ఏర్పాటు లక్ష్యం.నాలుగు కమీషనరేట్ల పంపకం కూడా నాలుగు ప్రాంతాలవారినీ సంతృప్తి పరుస్తుంది.1. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలు 2.మధ్యకోస్తా : తూర్పుగోదావరి ,పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాలు 3.దక్షిణకోస్తా: గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాలు 4.రాయలసీమ:కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు జిల్లాలు.పార్లమెంటు నియోజకవర్గాల ప్రకారం జిల్లాల సంఖ్య 25 అవుతుంది.పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన తరువాత వాటి సంఖ్య మళ్ళీ పెరగవచ్చు.అయితే ప్రజలకు ఒరిగేది ఏమిటంటే ఇప్పుడున్నట్లు అందరూ విశాఖకో,కర్నూలుకో, అమరావతికో ప్రయాణం కట్టనక్కరలేదు.ఎవరి రాజధాని నగరం వారికి చాలా దగ్గర అవుతుంది. ప్రజలకు దగ్గరలో పనులు జరుగుతాయి.అన్ని డిపార్టుమెంట్లూ జోనల్ వ్యవస్థను అమలుచేస్తుంటే రెవిన్యూ డిపార్టుమెంట్ లో జోనల్ కార్యాలయాలు ఇప్పటికీ లేవు.జోనల్ కమీషనర్ జిల్లా కలక్టర్ కంటే పై స్థాయి అధికారి.కలక్టర్ల స్థాయిలో పనులు కాకపోతే ఇదివరకు రాజధాని హైదరాబాదుకు వెళ్లాల్సివచ్చేది. జోనల్ కార్యాలయాలు ఉంటే కొన్ని పనులు మధ్యలోనే జరుగుతాయి.నాలుగు ప్రాంతాలకు మధ్యలో ఉన్న కేంద్రాలుగా విజయనగరం,ఏలూరు,ఒంగోలు,కడప నగరాలను చేయవచ్చు.ప్రాంతాలకు భౌగోళికంగా మధ్యలో ఉండటం కూడా ప్రాంతీయ కేంద్రానికి మంచి అర్హతే.తుఫానులు,భూకంపాలు ,వరదలు తగలని ప్రాంతాలూ మంచివే. జిల్లా కేంద్రాలు జిల్లా మధ్యలో కాకుండా అంచులో ఉన్న జిల్లాల్లో ప్రజలు జిల్లా కేంద్రాలకు ప్రయాణించేటప్పుడు మాట్లాడే అసంతృప్తి మాటలను కూడా పాలకులు పట్టించుకోవాలి.
ఎన్టీ రామారావుగారు తాలూకాలను చీల్చి మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు హర్షామోదాలు తెలియజేశారు.మళ్ళీ మండలాలను రద్దుచేసి తాలూకాలే పెట్టమని ఇంతవరకు ఎవరూ అడగలేదు.కొత్త జిల్లాల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.కొత్తజిల్లాలు వద్దని ఎవరైనా వారిస్తున్నారా?అలాగే ఇదీ.వాస్తవానికి రాజధాని నగరాన్ని మరోచోటికి మార్చటం కంటే నాలుగు చోట్ల ప్రాంతీయ నగరాలు పెట్టటం మరింత ప్రయోజనకరం.పూర్వం జోన్లు ఏర్పాటు చేశారు కానీ జోనల్ కార్యాలయాలను పెట్టలేదు.అక్కడ కలక్టర్లకంటే పై స్థాయి అధికారి ఉంటాడు.ఆ కొరత కూడా ఇప్పుడు నాలుగు ప్రాంతీయ కమీషనర్ల కార్యాలయాలతో తీరుతుంది.సచివాలయాన్ని కూడా నాలుగు ప్రాంతాలకు నాలుగు విభాగాలుగా విడదీస్తే నాలుగు ప్రాంతాలకు పరిపాలన సమంగా అందుతుంది.అమరావతిలో అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టు కట్టేశారు కాబట్టి కర్నూలు విశాఖల్లో  హైకోర్టు బెంచీలు మినీ సచివాలయాలు ఏర్పాటు చేస్తే రాజధాని స్థాయి పాలన మూడు ప్రాంతాలకు విస్తరిస్తుంది.

---నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి