ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, ఫిబ్రవరి 2020, గురువారం

సారె జహాసే అచ్చా హిందూ సితా హమారా!


సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా! (సూర్య 1.3.2020)


ఢిల్లీలో ట్రంప్ యాత్ర కొనసాగుతుండగానే మరోపక్క మత కలహాలు జరిగి కొంతమంది చనిపోయారు.శాంతి వహించాలని నేతలందరూ ప్రజలకు మనవిచేశారు. గతంలో నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళిన మోడీ ఆదేశానికి వస్తూపోతూ ఉంటానని చెప్పినప్పుడు, అంబానీసోదరులు విడిపోయి,తమ్ముడు దివాలాతీస్తే అన్న సహాయంచేసినప్పుడు ప్రజలలో సంతోషం వెల్లివీరిసింది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు!ఎంత మనోహరము! అని బైబిల్ వాక్యం. పైడిమర్రి వెంకట సుబ్బారావు  రాసిన ఈ ప్రతిజ్న మన పాఠ్య పుస్తకాలలో ఉండేది.దానిని పిల్లలతో కంఠతా పట్టించేవారు:
“భారత దేశము నా మాతృభూమి.భారతీయులందరూ నా సహోదరులు,
అన్నదమ్ములు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను.సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.”
క్షీరసాగరమదనం నాటినుంచీ ఈ అన్నదమ్ముల పోరాటం జరుగుతూనే ఉంది.భూమిమీద మొదటి అన్నదమ్ములు కయీను హేబేలు.అన్న తమ్ముడిని చంపి మొదటి హంతకుడయ్యాడట.అప్పుడు అంత అవసరం ఏమివచ్చింది?జనాభా ఎక్కువయ్యిందా అంటే వాళ్ళిద్దరే సంతానమట.ఆస్తులు ఏమన్నా దోచుకోటానికా అంటే విస్తారమైన భూభాగం పంచుకోగలిగినంత ఉంది.మరెందుకు ఈ కక్ష? ఇటు క్రైస్తవులు అటు ముస్లిములు కూడా తమలేఖనాలనుబట్టి సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు.కేవలం దేవుడే కారణమట.ఆయన హెబేలు తనకు బలి ఇచ్చిన గొర్రెను అంగీకరించి,కయీను అర్పించిన పంటకు ప్రాధాన్యత ఇవ్వలేదట.దానితో కయీనుకు అసూయరేగి తమ్ముడు హెబేలును చంపేశాడట.
 తోబుట్టువుల డిష్యూం..డిష్యూం జీవితాంతం ఉంటుందిఅంటున్నారు మానసిక నిపుణులు. చిన్నప్పటినుంచి  తోబుట్టువుల మధ్య గొడవలూ, కొట్లాటల మూలాలు మనసు లోలోతుల్లో రహస్యంగా ఎదుగుతాయి. పెద్దయ్యాక విషం కక్కే కొమ్మలవుతాయి. మరి వాటిని మొగ్గలోనే తుంచటం దేవుడి వల్లా కాలేదు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరిపై చూపే ఎక్కువ ప్రేమ ఈ అసూయకు కారణం. దేవుడు కూడా ఒకరి వైపు నిలవటం భక్తులు పక్షపాతంగా భావిస్తారు.దేవుడిని ఏమీ చేయలేక సోదర భక్తుడిని హతమారుస్తారు.తమకు పోటీ లేకుండా అవతలి మతం సోదర భక్తులను తుడిచేసి ఆ హత్యాకాండకూడా  గొప్పభక్తి అనుకుంటాడు.
పిల్లల్లో కామం, క్రోధం, ఈర్షా, అసూయ వంటివన్నీ ఉంటాయి. ఇంటికి తనే మహారాజునని అనుకునేవాడికి రెండోవాడు పోటీగా పుడితే కంటగింపు, కొత్తగా వచ్చిన  పాపాయిపై తల్లిదండ్రులు అకస్మాత్తుగా ప్రేమ కురిపించడాన్ని తట్టుకోలేడు. కోపం, దిగులూ పెంచుకుంటాడు. అతని పనులు తనకు అప్పగిస్తే అలుగుతాడు. అమ్మానాన్నా ఇదివరకటిలా తనని ముద్దుచేయడం లేదని బాధపడి అంతర్లీనంగా కొత్త పాపాయిమీద కోపం పెంచుకుంటాడు. బిడ్డల్లో ఎవరిమీదనానా కాస్త ఎక్కువ ప్రేమ ఉంటే తట్టుకోలేరు. బయటికి చెప్పుకోలేరు. లోలోన ద్వేషం పెంచుకుంటారు.ఒకరు వికలాంగులైతే రెండోవారిలో ద్వేషాన్ని పెంచుతుంది. చంపాలనేంత కసి పెరుగుతుంది.కొందరు పిల్లలకు జన్యుపరంగానే అసూయా, ద్వేషం, కోపం ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్లు సహజంగానే తోబుట్టువులతో గొడవ పడతారు. ఆ అయిష్టతే పెద్దయ్యే కొద్దీ తీవ్ర ద్వేషంగా మారుతుంది. అన్నాచెల్లీ, అక్కా తమ్ముడి మధ్య తగవులు రావటం తప్పనిసరి . పిల్లలు తోబుట్టువుపై ద్వేషం పెంచుకొని  కొడతారు.పై నుంచి కిందకి తోసేస్తారు. చాడీలు చెబుతారు.నోటు పుస్తకాలని చించేస్తారు. సూటిపోటి మాటలతో వెక్కిరిస్తారు. ఈ గొడవలు చూసే ఎక్కువమంది పిల్లలు వద్దు,ఒక్క బిడ్డ చాలని తల్లిదండ్రులు  అనుకుంటున్నారు.
            “ బాబ్రీ మసీదు నేలమట్టం తరువాత దేశంలో హిందూ ముస్లింల మధ్యగల సామరస్య వాతావరణానికి తీవ్ర విఘాతం కలిగింది. ముస్లింలు మనుషులు కారా ? వారికి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉండవా ? ఎందుకు సోదర భావంతో మెలగుతున్న వారిని విడగొట్టడం ? దేశానికి హిందువులు అజంతా, ఎల్లోరాలనిస్తే, ముస్లింలు తాజ్ మహల్, కుతుబ్ మీనార్ లను ఇచ్చారు. హిందువులు కె.ఎల్. సైగల్, మన్నాడే లాంటి అద్భుత గాయకులనిస్తే, ముస్లింలు రఫీ, నౌషాద్ లనిచ్చారు. హిందువులు లతామంగేష్కర్ నిస్తే, ముస్లింలు నూర్జహాన్ నిచ్చారు. ఒకరు గవాస్కర్ నిస్తే మరొకరు అజహరుద్దీన్ నిచ్చారు. ఇలా ఏ రంగంలో చూసుకున్నా ముస్లింల ప్రతిభ కనబడుతుంది. వారిపై కక్ష గట్టడం భావ్యమా ?” అని వి.పి.సింగ్ అన్నారు.  అమెరికాలో మన రాయభారిగా పనిచేసిన ఆబిద్ హుస్సేన్ వాషింగ్టన్ ప్రముఖ వర్గాల్లో తలలో నాలుకగా మెలగి భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారు.ఆబిద్ హుస్సేన్ భారత్ – అమెరికాల మధ్య అవగాహన వారధిని పటిష్టం చేశారు.
            ఎవరు ఎన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ మత సామరస్యం అనేది నాయకుల ప్రసంగాలలోను, కవుల కల్పనల్లోను కనిపిస్తున్నదే గాని, వర్తమాన సమాజంలో కలికానిక్కూడా కానరావడం లేదు. సామరస్య సాధనకోసం త్యాగధనులు కొందరు శ్రమించి బలై పోతున్నారు. మరోవైపు మతపిచ్చి పట్టిన నరరూప రాక్షసుల హింసాబోధనలకు ప్రేరితులైన యువతరం భ్రష్టుపట్టిపోతున్నది. “ఉంటే హిందువులుగా ఉండండి లేదా పాకిస్తాన్ కి వెళ్ళిపోండి”,“మా దగ్గర మూడువేల మసీదుల జాబితా ఉంది, వాటిని మేము కూలగొట్టాలి” లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేవాళ్లు కాస్త తగ్గాలి. మత సామరస్యం వెల్లివిరియాలి. అంటే దేశం కోసం సేవలందించినవారిని సమాదరించాలి. “మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా నరజాతికి నీతి యున్నదా” అని నోరులేని పువ్వులుకూడా విలపించాయట. హత్యాకాండలు చూసిన భారతీయ సమాజం “పోతే పోనీ పోరా, ఈ పాపపు జగతిన శాశ్వతమెవడురా” అనే నిర్వేదంలో పడిపోయినా సరే , “సారే జహాసే అచ్చా, హిందూసితా హమారా” అనే ఇక్బాల్ గీతం భారతీయుల మనోభిప్రాయాన్ని ఆశా గీతంలా సదా వినిపిస్తూనే ఉంది.

--  నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి