ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, జనవరి 2020, గురువారం

నదుల్ని మురికి చేయకండి! బాగుచేసుకోండి !

నదుల్ని మురికి చేయకండి! బాగుచేసుకోండి ! (సూర్య 2.2.2020)
 ఎక్కడికక్కడే మురుగు నీళ్ళు,మురికి నదులు దర్శనమిస్తున్నాయి.తల్లీ గోదారికే వెల్లువస్తే అందం,బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయని మురిసిపోయిన జాతి మనది. ఇప్పుడు నదుల్లో  మురికి, చెత్త భయంకరమైన యాసిడ్లు, పారిశ్రామిక వ్యర్థాలు చివరికి మలమూత్రాలు కూడా కలిపేసి చేతులు కడిగేసుకుంటున్నారు. గోదావరి నీళ్ళలో ప్రమాదకర ఈ-కొలి బ్యాక్టీరియా మిల్లీ మీటరుకు 480 ఉన్నట్టు తేలింది. ఇక నదిలో కలిసిన మానవ వ్యర్థాలు పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా సాగు,మురుగు, మాల మూత్రాలకు లెక్కేలేదు. నదుల పొడవూనా ఇదే తంతు.సాక్షాత్తూ పభుత్వ యంత్రాంగమే ఈ పాపానికి ఒడిగడుతుంటే ఇక ప్రైవేటు సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? దీన్ని తక్షణం ఆపకపోతే.సాగు నీటి నుంచి తాగు నీటి వరకూ వరకూ అన్నింటికీ నదుల మీదే ఆధారపడిన ప్రజల భవిష్యత్తు ఏం కానుంది?
స్వచ్ఛ భారత్ , చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్తున్నారు కానీ నేరుగా గొంతులోకే గరళం పంపేస్తున్నారు.
జనం దాన్నే జీవజలంగా తాగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. చరిత్రలో నాగరకతలన్నీ నదుల ఒడ్డున వెలిశాయి. నగరాలకు నదులు నీటి ఆధారాలయ్యాయి. మన నదుల్లో ఆక్సిజన్‌ స్థాయి తగ్గింది.నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం ప్రజల్లో ఉంది. నదిలో స్నానమాడితే పాపాలు హరించు కుపోతాయన్న విశ్వాసాలున్నాయి. మహాకవి నన్నయ,తిక్కన నదుల ఒడ్డునే కావ్యాలు రాశారట. కానీ ఇప్పుడు నది ఒడ్డున నగరం ఉండటమే పెద్ద ప్రమాదంగా తయారైంది.నగరం నది ఒడ్డున ఉన్నదంటే ఆ వూళ్ళోని వ్యర్ధాలు, కాలుష్యాలన్నీ నది ఒడిలోకి చేరతాయి. నదీ స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తాం.భక్తులే కొన్ని నదుల్లోని ఘాట్లలో తమ ధీక్షా దుస్తులు ,పూజా సామాగ్రి లాంటివి వదిలి వాటిని మురికి కాసారాలుగా చేస్తున్నారు.
పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు భారీఎత్తున నదిలో కలిసిపోయి నీళ్లు రంగు మారిపోయి కనబడుతున్నాయి. దుర్వాసన,విషాలతో కూడిన ఈ నీటినే తాగి ప్రజలు రోగాలకు గురవుతున్నారు. థర్మల్‌ విద్యుత్కేంద్రాలు, బీరు ఫ్యాక్టరీల  నుంచి విడుదలయ్యే నీటిని శుద్ధి చేశాకే వదులుతున్నట్టు నిర్వాహకులు పగలు చెబుతూ,రాత్రికి వ్యర్థాలను నేరుగా నదిలో  కలిపేస్తున్నారు.ఇక ప్రజలు బట్టలుతకటం,పాత్రలు తోమటం వల్ల ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరంతా ఓపెన్‌ డ్రెయిన్‌లో కలిపి, అక్కడ్నించి నదిలోకి వదిలేస్తున్నారు. ప్రభుత్వమే ఇలాంటి మురికి పనులు చేస్తోంది. కొన్ని వేల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. మల మూత్రాలు, మరుగు దొడ్లలోని నీటిని కూడా నదిలోకే చేరుస్తున్నారు.ఆ చుట్టుపక్కల ఇప్పుడు బోర్లు వేస్తే మంచినీళ్లు పడని దుస్థితి నెలకొంది.లక్షల మందికి అదే విషం!వీరందరికీ అందుతున్నది నదీజలం కాదు- మానవ వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా పురుగు మందులతో కశ్మలమైపోయిన గరళం!ఈ త్రాగునీటివల్ల నీళ్ల విరేచనాల నుంచి క్యాన్సర్‌ వరకూ నానా జబ్బులు ప్రజలను పీడిస్తున్నాయి.
కాలుష్యం ఒక నది నుంచి మరో నదికి చేరిపోతోంది. నదిలోకి కలుషితాలను వదిలేందుకు ఏ పరిశ్రమకూ అనుమతులు ఉండవు.కొన్ని పరిశ్రమలు రాత్రిపూట, నదీ ప్రవాహం అధికంగా ఉన్న సమయాల్లో నదిలోకి వదిలేస్తున్నాయి. జీవధారలు, వరప్రదాయినిలు అయిన నదుల్ని కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నదుల్ని పరిరక్షించడానికి రూ. 33,000 కోట్లు అవసరమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పుడది రెట్టింపు దాటిపోతుంది.ఇంత పెద్దస్థాయిలో సొమ్ము వెచ్చించడం పెదదేశానికి సాధ్యమవుతుందా?
నదులు ప్రజలకు జీవన దాతలు. కాబట్టి దేశంలో అటువంటి జీవజల నదుల్లోని నీరు విషకలుషితం కాకుండా కాపాడుకోవాలి.వందలాది నదులలో తగినంత నీరు లేదు. జలప్రవాహాల్ని చేజార్చుకుంటే మున్ముందు మిగిలేది కన్నీరే.దేశవ్యాప్తంగా అనుదినం మూడున్నర వేలకోట్ల లీటర్లకు పైగా కలుషిత వ్యర్థాలు నదుల్ని మురికి కూపాలుగా మార్చేస్తున్నాయి. వందలాది మురికి పరిశ్రమల్ని కట్టడి చేసినా నమామి గంగేప్రాజెక్టు విఫలమయ్యింది. జరగాల్సింది మరెంతో ఉంది. నదులు కూడా మనుషుల్లాగా జీవనహక్కు కలిగిన వ్యవస్థలంటూ ఉత్తరాఖండ్‌ ఉన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దేశంలోని నదులన్నిటినీ మనుషుల్లాగా  చట్టబద్ధంగా రక్షించుకోవాలి. దేశం లోని 275 అంతర్రాష్ట్ర నదులు కలుషితమై ఎవరికీ పనికిరాకుండా పోయాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది.
పందొమ్మిది ఐరోపా దేశాల్లో ప్రవహించే డాన్యూబ్‌, ఆరు దేశాలగుండా వెళ్లే రైన్‌ నదులను ఒక మంచి వ్యూహంతో బాగుచేసుకున్నారు.1958లో ఒక్క చేపపిల్లా బతకలేని దుస్థితిలో మగ్గిన ఇంగ్లాండ్‌ లోని థేమ్స్‌ నది నేడు నూట పాతిక రకాల మత్స్య జాతులకు నెలవయ్యింది. అలాగే దక్షిణ కొరియా సియోల్‌ లోని చంగెచాన్‌, మెక్సికోలోని  లా పియెదాద్‌,బ్రిటన్ లోని  క్వాగీ లాంటి నదులన్నీ బాగుచేసుకున్నారు.అలా మన నదులకు కూడా ప్రాణప్రతిష్ఠ జరపాలి. యమున మృతనదిగా మారిపోయిందట . సరస్వతీ నది కనుమరుగైపోయిందట.ఇసుక మాఫియా, దురాక్రమణలు, వ్యర్థాల బారిన పడి మృతనదిగా మారిన కుట్టెంపెరూర్‌ను కేరళలోని అలప్పుజ ప్రజలు రెండు నెలలు శ్రమించి బాగు చేసుకున్నారు. ఇలాంటి ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎన్నో నదులు జవజీవాలు పొంది ప్రాణప్రదాతలుగా నిలబడతాయి. ఇప్పటికైనా జలసంరక్షణ ప్రజాఉద్యమంగామారాలి. నదీనదాలు,కాలువలు,వాగులు,చెరువులు,దొరువులు మంచినీళ్ళతో నిండాలి.రాబోయే వేసవిలో నీటి కటకటను పారదోలాలి.
--  నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266  




1 కామెంట్‌: