ఇదేనా సెక్యులరిజం
ఆంధ్రజ్యోతి 15-10-1988
సల్మాన్ రష్దీ రచించిన "ది
సాతానిక్ వర్సెస్" అనే గ్రంధాన్ని కేంద్ర ప్రభుత్వం
నిషేదించింది. జమాతె ఇస్లామీ, తబ్లిక్ జమాతి మొదలైన సంస్థల కోర్కె మేరకు ప్రభుత్వం ఈ పని చేసింది. ఇంతకీ
మన దేశంలో నిజమైన సెక్యులర్ పాలన ఉందా లేదా
అనేది అనుమానాస్పందంగా తయారయ్యింది. ప్రొద్దున
లేచింది మొదలు రాత్రి నిద్రపోబోయే వరకు మన రేడియో, టి.వి.లు ప్రసారం చేసే భక్తి గీతాలు, పౌరాణిక
కార్యక్రమాలపై సెక్యూలర్ కేంద్రం ఎలాంటి
నిషేధం విధించలేదు. విధించబోదుకూడా. బైబిలు బండారం, రిడిల్స్ ఆఫ్ రామా అండ్ కృష్ణా మొదలైన ఎన్నో గ్రంథాలు
ప్రభుత్వ నిషేదపు చర్యలను
ఎదుర్కొన్నాయి. మత చాందసుల పిడివాదమే ఈ దేశంలో నెగ్గుతున్నది
గాని మత విమర్శకుల సమంజసవాదం సైతం వెలుగులోకి రావడం
లేదు. మతాలన్నీ కలహాలకు కారణమై అభివృద్ధి నిరోధకాలుగా నిలిచి ప్రపంచానికి పట్టిన చీడలైయున్న ఈనాడు వాటి బండారాన్ని బట్టబయలు చేసే గ్రంథాలు తప్పక రావాలి.
అలాంటి వాటిని నిషేదించడం అంటే మత
మౌఢ్యానికి పట్టంగట్టి, హేతుబద్ధమైన ఆలోచనను హరించటమే అవుతుంది. ప్రజలను తమ జైళ్ళ మధ్య మ్రగ్గింపజేయడమే అవుతుంది. స్వేచ్ఛకు హామీ ఇచ్చిన సెక్యులర్
ప్రభుత్వం 'మత నియంత' లాగా ప్రవర్తించకూడదు.
ఆగి, ఆలోచించాలి
ఆంధ్రప్రభ 23-2-1989 నూర్ బాషా రహంతుల్లా
హైదరాబాద్
భౌతిక ప్రపంచంలో ఉన్నట్లుగానే
ఆధ్యాత్మిక లోకంలో కూడా రెండు సూపర్
పవర్లు ఉన్నాయి. అవి ఏవంటే ఒకటి దేవుడు, రెండోది దెయ్యం. ఒకరు అల్లా, రెండో వారు సైతాను. వీళ్ళిద్దరూ మొదటి నుండీ ఈ
సృష్టి మీద ఆధిపత్యం కోసం మన అదికార-ప్రతిపక్ష నాయకుల్లాగా పోరాడుకుంటున్నారు. ఆ పోరాటంలో మనుషుల్ని
బలిపశువుల్ని చేస్తున్నారు. వాళ్ళను
గురించి ఈ మనుషులు ఏమనుకుంటారంటే దేవుడు మంచికోసం
ఉంటే, సైతాను చెడుకోసం ఉన్నాడని, మంచిని ప్రచారం చేసే దేవునికి విరుద్ధంగా సైతాను కూడా చెడును ప్రచారం చేస్తాడు. ఇద్దరు
కూడా మనుషుల ద్వారానే మనుషులకు
బోధింపజేస్తారు. ఉదాహరణకు సాల్మన్ రష్దీ
అనే ఒక మనిషిని ఆవహించి సైతాను తన వచనాలను ఒక గ్రంథంగా వ్రాయించాడు. ఎందుకంటే దేవుడు కూడా గతంలో అనేక మంది ప్రవక్తలను ఆవేశించి తన గ్రంథాలను మనుషులకు సరఫరా చేశాడు.
వాటిలో పవిత్ర ఖురాను ఒకటి. అందులో
ఏమి ఉందంటే "భక్తులు కోపాన్ని దిగమింగేవారు. ఇతరుల తప్పల్ని క్షమించేవారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో
ఇష్టం (3:1:34). చెడును,
మంచితో, మేలుతో ఎదుర్కొనండి. అలా చేస్తే మీ విరోధులు
మీకు మిత్రులైపోతారు".
ఈ మాటల్ని దృష్టిలో ఉంచుకునే హజ్రత్
అలీ తనను పరాభవించిన వాడిని కూడా ఏమీ
అనకుండా విడిచిపెట్టాడు. హజరత్ అలీ బిన్ హుసైన్ తనపై
నీళ్ళ చెంబు దొర్లించిన పనిపిల్లకు విడుదల ప్రసాదిస్తాడు. హజరత్ అబూ హనీఫా అయితే తనను నడిరోడ్డులో పట్టుకుని
నానా తిట్లూ తిట్టిన వాడికి డబ్బులిచ్చి
సత్కరిస్తాడు. ఇలాంటి నీతుల్ని, ఆదర్శాలను చాటి చెప్పిన
మతం ఇస్లాం అనీ, అసలు ఇస్లాం అంటేనే 'శాంతి' అని అర్థమనీ, ఇది దేవుడు చూపిన జీవన విధానమనీ ముస్లింలు
భావిస్తారు.
అయితే ఆయతుల్లా ఖొమేనీ అనే ఇరాన్
నాయకుడు సాల్మాన్ రష్దీని చంపండి అంటూ
ప్రపంచ ముస్లింలకు చేసిన విజ్ఞప్తి అల్లాహ్ ప్రేరణతో జరిగి ఉంటుందా లేక సాల్మాన్ రష్దీని ఆవహించిన సైతానే
ఖొమేనీని కూడా పట్టి ఇలా పంకించిందా అనేది
ముస్లం మేధావులు కొంచెం ఆగి ఆలోచించాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి